రాష్ట్రపతి సచివాలయం
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ సందర్భంగా జాతీయ ఇంధన పరిరక్షణ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి ఇంధన సామర్థ్యాన్ని సాధించడంలో ప్రవర్తనాపరమైన మార్పు కీలకం: రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
14 DEC 2025 2:32PM by PIB Hyderabad
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ పురస్కారాలు-2025, జాతీయ ఇంధన పరిరక్షణ పోటీల బహుమతులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి... పర్యావరణహితమైన, నమ్మకమైన శక్తి వనరుగా ఇంధన పరిరక్షణను ఆమె అభివర్ణించారు. ఇంధన పరిరక్షణ కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదనీ, ప్రస్తుతం అత్యంత కీలక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంధన ఆదా అంటే ఇంధనాన్ని తక్కువ వాడటం మాత్రమే కాదు... తెలివిగా, బాధ్యతాయుతంగా, సమర్ధంగా ఉపయోగించడం అని ఆమె స్పష్టం చేశారు. విద్యుత్ ఉపకరణాల అనవసర వాడకాన్ని నివారించడం... ఇంధన-సమర్థత గల పరికరాలను స్వీకరించడం... మన ఇళ్ళు, కార్యాలయాల్లో సహజ వెలుతురు, వెంటిలేషన్ను ఉపయోగించడం... సౌరశక్తి, పునరుత్పాదక ఇంధనాలను స్వీకరించడం ద్వారా మనం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా కార్బన్ ఉద్గారాలనూ తగ్గించగలమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన గాలి, సురక్షిత జల వనరులను, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికీ ఇంధన పరిరక్షణ కీలకమని తెలిపారు. మనం ఆదా చేసే ప్రతి యూనిట్ ఇంధనం ప్రకృతి పట్ల, భవిష్యత్ తరాల పట్ల మన నైతిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
యువత, పిల్లలు ఇంధన పొదుపు గురించి తెలుసుకుని, ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పుడు ఈ రంగంలో లక్ష్యాలను సాధించవచ్చని, అప్పుడే దేశ సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు.
సరసమైన, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉన్న సమాజాలకు శక్తి లభిస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కొత్త వృద్ధి అవకాశాలను సృష్టిస్తుంది. అందువల్ల హరిత ఇంధనం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా సాధికారత, సమగ్ర అభివృద్ధికి శక్తిమంతమైన సాధనం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని రాష్ట్రపతి వివరించారు. పునరుత్పాదక వినియోగ బాధ్యత, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని, ఇంధన సామర్థ్యాన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 2023-24లో భారత ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనం ఆదా అయిందని ఆమె తెలిపారు. ఈ ప్రయత్నాలు ప్రతియేటా గణనీయ ఆర్థిక పొదుపుతో పాటుగా కార్బన్-డై-ఆక్సైడ్ ఉద్గారాల విడుదల గణనీయంగా తగ్గిందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
భారత ఇంధన పరివర్తన విజయవంతం కావడానికి ప్రతి రంగం, ప్రతి పౌరుడి భాగస్వామ్యం చాలా అవసరమని రాష్ట్రపతి అన్నారు. అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి ప్రవర్తనాపరమైన మార్పు చాలా కీలకం అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రకృతితో సామరస్యంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే స్పృహ భారత సాంస్కృతిక సంప్రదాయానికి మూలాధారమన్నారు. ఈ భావనే ప్రపంచానికి మనం అందిస్తున్న సందేశమైన "లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ - లైఫ్"కి ఆధారమని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇంధన పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న వారందరినీ ఆమె అభినందించారు. వారి సహకారం రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన, ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందన్నారు. సమష్టి బాధ్యత, భాగస్వామ్యం, ప్రజా భాగస్వామ్యాల స్ఫూర్తితో... భారత్ ఇంధన పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉంటుందనీ, హరిత భవిష్యత్తు దిశగా తన లక్ష్యాలను సాధిస్తోందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
Click here for President's Speech.
***
(रिलीज़ आईडी: 2204170)
आगंतुक पटल : 14