ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
29 JUL 2023 2:11PM by PIB Hyderabad
మంత్రిమండలిలో నా సహచరులైన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, అన్నపూర్ణా దేవి గారు, రాజ్కుమార్ రంజన్ సింగ్ గారు, సుభాష్ శంకర్ గారు, దేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, గౌరవనీయులైన మేధావులతో పాటు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రియమైన నా విద్యార్థి మిత్రులారా.
దేశాన్ని విజయపథంలో నడపాలన్నా, దేశ భాగ్యాన్ని మార్చాలన్నా అత్యంత శక్తిమంతమైన సాధనం విద్య. ఇరవై ఒకటో శతాబ్ది భారత్.. తన లక్ష్యాల సాధన దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వ్యవస్థకు మీరంతా ప్రతినిధులు, మార్గదర్శకులు. ఈ కారణంగా, అఖిల భారతీయ శిక్షా సమాగంలో పాలుపంచుకోవడం నాకు కూడా చాలా ముఖ్యమైన అవకాశం.
జ్ఞానానికి చర్చ అత్యవసరం, విద్యార్జనకు కూడా చర్చ అవసరమని నేను నమ్ముతాను. మనం అఖిల భారతీయ శిక్షా సమాగమ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా సంప్రతింపులూ, ఆలోచనలు చేయడమనే మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇదివరకు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని కాశీలో కొత్తగా కట్టిన రుద్రాక్ష్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సారి, ఈ సమాగమాన్ని ఢిల్లీలో కొత్తగా కట్టిన భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. భారత్ మండపాన్ని లాంఛనంగా ప్రారంభించిన తరువాత ఇదే తొలి కార్యక్రమం కావడం మరింత ఆనందాన్నిచ్చే విషయం. మొదటి కార్యక్రమమే విద్యకు సంబంధించింది అయినందువల్ల కలుగుతున్న ఆనందానికి ఒక హద్దంటూ లేదు.
మిత్రులారా,
కాశీలోని రుద్రాక్ష్ మొదలు ఈ ఆధునిక ‘భారత్ మండపం’ వరకు చూస్తే, అఖిల భారతీయ శిక్షా సమాగమ్ ప్రస్థానం ఒక సందేశాన్ని అందిస్తోంది. ఈ సందేశం ప్రాచీనత, ఆధునికతల సంగమానికి సంబంధించింది. ఒక వైపు, మన విద్యావ్యవస్థ భారత్లో ప్రాచీన సంప్రదాయాల్ని పరిరక్షిస్తోంది. మరో వైపు, మనం ఆధునిక విజ్ఞానశాస్త్ర రంగంలోనూ, ఉన్నత సాంకేతికతలోనూ శరవేగంగా ముందుకు పోతున్నాం. ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకూ, విద్యావ్యవస్థకు మీరు అందిస్తున్న సేవలకూ మీకు నేను శుభాకాంక్షలతో పాటు మనస్ఫూర్తిగా అభినందనలను కూడా తెలియజేస్తున్నాను.
ఈ రోజు మన జాతీయ విద్యావిధానానికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన రోజు కూడా కావడం యాదృచ్ఛికం. దేశవ్యాప్తంగా పండితులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు దీనిని ఒక ఉద్యమంగా అక్కున చేర్చుకుని, దీని లక్ష్యాలను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు ఈ సందర్బంగా నేను కూడా వారందరికీ నా కృతజ్ఞతలను, హృదయపూర్వక ధన్యవాదాలనూ తెలియజేస్తున్నాను.
ఇక్కడికి వచ్చే ముందు, దగ్గర్లోనే ఉన్న ఒక పెవిలియన్లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనకు నేను వెళ్లి ఆ ప్రదర్శనను చూశాను. మన విద్యారంగానికీ, మన నైపుణ్యాలకున్న శక్తినీ, ఈ రంగం సాధించిన విజయాల్నీ ఆ ప్రదర్శన కళ్లకు కడుతోంది. కొత్త పద్ధతుల్నీ, కొత్త ఆలోచనల్నీ పరిచయం చేస్తోంది. ‘బాల వాటిక’లో పిల్లలతో నేను భేటీ అయ్యాను.. వారితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఆటలాడుకుంటూనే బాలలు అన్ని విషయాల్నీ ఎలా నేర్చుకొంటోందీ, విద్యార్జనకీ బడికి వెళ్లడానికీ అర్థాలు ఎలా మారిపోతోందీ గమనించినప్పుడు, నాకు నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించింది. మీరంతా ఈ కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడికి వెళ్లి, అక్కడి కార్యకలాపాల్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను.
మిత్రులారా,
యుగాన్ని మార్చివేసే పరివర్తనలు చోటు చేసుకొనేటప్పుడు, అందుకు కొంత సమయం పడుతుంది. మూడు సంవత్సరాల కిందట మేం జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించినప్పుడు, చేయాల్సిన అనేక పనులు మా ముందుకు వచ్చి నిలిచాయి. అయితే జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో మీరంతా కర్తవ్య భావం, అంకిత భావం, నిబద్ధత, కొత్త ఆలోచనలను స్వీకరించడంలో అరమరికలు లేని తనాన్ని చాటుకొన్నారు. ఇది నిజంగా ఆకట్టుకొనేదిగా ఉంది.. ఇది ఒక కొత్త విశ్వాసాన్ని కూడా ఇస్తోంది.
దీనిని ఒక ఉద్యమంగా మీరు భావించారు. జాతీయ విద్యావిధానం సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలు మొదలు భావికాలపు సాంకేతికత వరకూ, సమాన ప్రాధాన్యాన్నిస్తోంది. ప్రాథమిక విద్యకు ఒక కొత్త పాఠ్యక్రమాన్ని సిద్ధం చేయడానికీ, పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తీసుకురావడానికీ, దేశంలో పరిశోధనకు సంబంధించిన వ్యవస్థను పటిష్ఠపరచడానికీ, ఉన్నత విద్య రంగంలో అన్ని ప్రయత్నాల్నీ చేయడానికీ ఈ రంగంలోని మహనీయులందరూ ఎంతో శ్రమించారు.
కొత్త వ్యవస్థ పట్ల దేశంలోని సామాన్య ప్రజానీకంతో పాటు మన విద్యార్థిలోకం కూడా మంచి పరిచయాన్ని పెంచుకున్నారు. ‘టెన్ ప్లస్ టూ’ విద్యావ్యవస్థ స్థానంలో ‘ఫైవ్ ప్లస్ త్రీ - ప్లస్ త్రీ ప్లస్ ఫోర్’ వ్యవస్థ వచ్చిన సంగతిని వారు గ్రహించారు. ఇప్పుడు చదువుకోవడమనేది మూడేళ్ల వయసు నుంచే ఆరంభం అవుతుంది. ఇది దేశమంతటా ఏకరూపతను తీసుకువస్తుంది.
జాతీయ పరిశోధన ఫౌండేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఇటీవలే ఆమోదం తెలిపింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేంవర్క్ను కూడా త్వరలో అమలు చేయనున్నారు. పునాది దశలో అంటే, 3 ఏళ్లు మొదలు 8 ఏళ్ల వయసు కల చిన్నారుల అవసరాలకు తగినట్లు ఉండే ఫ్రేంవర్క్ను ఇప్పటికే రూపొందించారు. ఇతర దశలకు పాఠ్యప్రణాళికను త్వరలో రూపొందిస్తారు. సహజంగానే, దేశంలో సీబీఎస్ఈ పాఠశాలలకు ఇక ఏకరూప పాఠ్య ప్రణాళికే ఉంటుంది. ఈ లక్ష్యంతో కొత్త పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. 3వ తరగతి మొదలు 12వ తరగతి వరకు సుమారు 130 విషయాలపై కొత్త పుస్తకాలు రాబోతున్నాయి. ప్రాంతీయ భాషల్లోనూ విద్యను ప్రోత్సహించడానికి ఈ పుస్తకాలు 22 భారతీయ భాషల్లో అందుబాటులోకి వస్తాయన్న సంగతి తెలిసి నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
యువతను వారి ప్రతిభ ఆధారంగా కాక వారి భాషను బట్టి జడ్జ్ చేయడం వారికి తీవ్ర అన్యాయం చేయడమే అవుతుంది. మాతృభాషలో విద్యాబోధన భారత్లో ప్రతిభావంతులైన యువతకు నిజమైన న్యాయాన్ని అందించడానికి నాందీ ప్రస్తావన. ఇది సామాజిక న్యాయం దిశగా కూడా వేసిన ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రపంచంలో వందల సంఖ్యలో వివిధ భాషలున్నాయి. ప్రతి ఒక్క భాషకీ దానిదైన ప్రాధాన్యం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు వాటి సొంత భాషలను ప్రొత్సహించి, పురోగతిని సాధించాయి. ఒక్క యూరోపునే చూస్తే, అక్కడి చాలా దేశాలు తమ సొంత భాషను మాత్రమే ఉపయోగిస్తున్నాయి. ఏమైనా, భాషల పరంగా ఇన్ని సమృద్ధ భాషలు ఉన్నప్పటికీ, మనం మన భాషలను వెనుకబడిన భాషలుగా ప్రస్తావించుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద దురదృష్టం ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఎంతో వినూత్నంగా ఆలోచించే ప్రజ్ఞను కలిగి ఉంటే ఉండవచ్చుగాక, వారికి ఇంగ్లిషులో మాట్లాడటం రాకపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రతిభను తొందరగా ఒప్పుకోకపోయేవారు. దీనివల్ల అతి భారీగా నష్టపోయింది మన పల్లె ప్రాంతాలకు చెందిన తెలివైన బాలలే. స్వాతంత్య్ర ‘అమృత కాలం’లో మన దేశం జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి, ఈ న్యూనతా భావాన్ని పక్కకు నెట్టడం మొదలుపెట్టింది. నేను ఐక్యరాజ్యసమితిలోనూ భారతీయ భాషలోనే సగర్వంగా మాట్లాడతాను. వినేవారు మెచ్చుకొని ప్రతిస్పందించడంలో కొంత సమయం పడితే పట్టనివ్వండి.
మిత్రులారా,
ఇక, సాంఘిక శాస్త్రాల మొదలు ఇంజినీరింగ్ వరకు విద్యాబోధనను భారతీయ భాషల్లో అందించనున్నారు. యువతకు వారి భాష పట్ల విశ్వాసం ఉందంటే, వారిలోని నైపుణ్యాలు, వారి ప్రతిభాపాటవాలు ధైర్యంగా ముందుకు వస్తాయి. పైగా, దీంతో దేశానికి మరో లాభం కూడా కలుగుతుంది. భాషను రాజకీయ ఉద్దేశాల కోసమూ, ద్వేషాన్ని వ్యాపింపచేయడానికీ ఉపయోగించుకొనే వారికి వారి దుకాణాన్ని మూసేసుకోవాల్సి వస్తుంది. జాతీయ విద్యావిధానం రాకతో, దేశంలో ప్రతి భాషకూ గౌరవం లభిస్తుంది.. ప్రోత్సాహం లభిస్తుంది.
మిత్రులారా,
రాబోయే 25 సంవత్సరాలకు స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ 25 ఏళ్లలోనూ, మనం ఉత్సాహం ఉప్పొంగే, స్వేచ్ఛతో ఉరకలు వేసే యువతరాన్ని తయారు చేసుకొని తీరాలి. ఈ యువత బానిసత్వ ఆలోచనావిధానం గుప్పిట్లో చిక్కుకొని ఉండకూడదు. ఈ తరం కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి తహతహలాడాలి. ఈ తరం.. విజ్ఞానశాస్త్రం మొదలు క్రీడల వరకు ప్రతి రంగంలో భారత్ పేరు మారుమోగేటట్లు చేయాలి. భారత్ను ముందుకు తీసుకు పోవాలి. ఈ తరం.. 21వ శతాబ్ది భారత్ అవసరాలను అర్థం చేసుకొంటూనే తన శక్తియుక్తులను పెంచుకొనే తరం కావాలి. కర్తవ్యం పట్ల, బాధ్యతల పట్ల చక్కని స్పృహను కలిగి ఉండే తరం అవ్వాలి. ఇలాంటి తరాన్ని తీర్చిదిద్దడంలో జాతీయ విద్యావిధానం ఒక కీలక పాత్రను పోషిస్తుంది.
మిత్రులారా,
నాణ్యమైన విద్యాజగతిలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అయితే, మనం భారత్ను గురించి మాట్లాడుకుంటే.. మన ప్రధాన లక్ష్యం సమానతే. భారత్లో ప్రతి యువ ప్రతినిధికీ సమాన విద్య, సమాన విద్యావకాశాలూ లభించేటట్లు చూడటమే జాతీయ విద్యావిధానం ప్రాథమ్యం. ఏమైనా, సమాన విద్య, సమాన విద్యావకాశాలు అంటే, అది స్కూళ్లను తెరవడంతోనే సరిపోదు. దీనికి అర్థం, విద్యతో పాటు వనరులను అందరికీ సమానంగా అందజేయాలి. సమాన విద్య అంటే ప్రతి చిన్నారికీ వారి వారి అవగాహన, ఎంపికలను లెక్కలోకి తీసుకొని తగిన ఐచ్ఛికాలను అందించే ఏర్పాట్లు చేయడం. సమాన విద్య అంటే.. బాలలు వారి స్థానం, కులం, లేదా మతం కారణంగా చదువుకు దూరం కాకూడదు అని అర్థం.
ఇందువల్లే పల్లెలూ- నగరాల యువతా, ధనిక- పేద యువతా, ప్రతి వర్గానికి చెందిన యువతా.. వీరందరికీ ఒకే విధమైన అవకాశాలు లభించాలనేదే జాతీయ విద్యావిధానం దార్శనికతా.. దేశం ప్రయత్నమూ. మీరు గమనించారు.. చాలా మంది పిల్లలు దూర ప్రాంతాల్లో నాణ్యమైన బళ్లు లేకపోవడం వల్ల మంచి విద్యకు నోచుకోని కాలమంటూ ఒకటి ఉండింది. కానీ ఈ రోజున, దేశంలో వేలాది పాఠశాలల స్థాయిని పీఎం-శ్రీ స్కూళ్ల స్థాయికి మెరుగుపరుస్తున్నారు. ఈ ‘5జీ’ కాలంలో, ఈ ఆధునిక హై-టెక్ స్కూళ్లు భారత విద్యార్థులకు ఆధునిక విద్యామాధ్యమంగా రూపొందనున్నాయి.
ప్రస్తుతం, మనం కూడా గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసుకొంటున్నాం. ఇవాళ గ్రామ గ్రామాన ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీక్ష, స్వయం, స్వయంప్రభ వంటి వేదికల సాయంతో సుదూర ప్రాంతాల బాలలు చదువుకుంటున్నారు. చక్కని పుస్తకాలు, విద్యను బోధించేందుకు సృజనాత్మకమైన పద్థతులను అనుసరిస్తుండడంతో పాటు డిజిటల్ సాంకేతికతను ఏకీకరించడంవల్ల భారత్లో ప్రతి గ్రామంలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యవస్థలు, నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, భారత్లో చదువుకోవడానికి అవసరమైన వనరుల అంతరం వేగంగా అంతమవుతోంది.
మిత్రులారా,
విద్యను పుస్తకాలకే పరిమితం చేయకూడదు, దానికి బదులు అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని అందించే ప్రక్రియను అందులో ఒక భాగంగా చేయాలనేది జాతీయ విద్యావిధానం కీలక ప్రాథమ్యాల్లో ఒకటని మీకు తెలుసా. ఈ పరమార్థాన్ని నెరవేర్చడానికి వృత్తి విద్యను సాధారణ విద్యతో ఏకీకరిస్తున్నారు. ఈ విధానంలో అణగారిన వర్గాలు, ఆదరణకు నోచుకోని వర్గాలు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అతి పెద్ద ప్రయోజనం కలుగుతుంది.
విషయపరిజ్ఞానాన్ని తెలుసుకోకుండా పాఠ్యపుస్తకాలనే వల్లె వేసే చదువు తీరు ఈ పిల్లకు అతి భారమై, వారు సతమతమైపోతుండే వారు. అయితే వారికి ఇప్పుడుకొత్త జాతీయ విద్యావిధానంలో కొత్త కొత్త పద్ధతుల్లో చదువు చెబుతారు. విద్య విద్యార్థుల్ని మమేకం చేసేదిగా ఉండడంతో పాటు వారిలో ఆసక్తిని పెంచేదిగా కూడా ఉంటుంది. ఇంతకు ముందు, చాలా తక్కువ బళ్లలో మాత్రమే ప్రయోగశాలలూ, అనుభవపూర్వకంగా విషయాలను తెలుసుకొనే పద్దతీ ఉండేవి. ఏమైనా, ఇప్పుడు 75 లక్షల కన్నా ఎక్కువ మంది బాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో విజ్ఞానశాస్త్రాన్నీ, కొత్త కొత్త అంశాల్నీ నేర్చుకుంటున్నారు. విజ్ఞానశాస్త్రం అందరి అందుబాటులోకీ వస్తోంది. ఈ యువ శాస్త్రవేత్తలు రాబోయే కాలంలో దేశంలోని ప్రధాన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడంతో పాటు భారత్ను ప్రపంచంలో పరిశోధనకు కూడలిగా రూపొందిస్తారు.
మిత్రులారా,
ఏ సంస్కరణకైనా ధైర్యం అవసరం, ధైర్యం ఉన్న చోటే కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే ప్రపంచం ప్రస్తుతం భారత్ను కొత్త అవకాశాలకు నిలయంగా భావిస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో రాబోయే కాలం భారత్దేనన్న సంగతి ప్రపంచానికి తెలుసు. అంతరిక్ష సాంకేతిక రంగం విషయానికి వస్తే, భారత్ సామర్థ్యాలు సాటిలేనివన్న సంగతీ ప్రపంచానికి తెలుసు. రక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ ‘తక్కువ ఖర్చు’లో అందిస్తున్న ‘అత్యుత్తమ నాణ్యత’ నమూనా విజయవంతం కానుందన్న సంగతి కూడా ప్రపంచానికి తెలుసు. మన పట్ల ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని మనం బలహీనం కానీయకూడదు.
గత కొన్నేళ్లలో, భారత్ పారిశ్రామిక రంగంలో సాధించిన సత్వర వృద్ధి, మన అంకుర సంస్థలకు ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతూ ఉండడం, మన విద్యాసంస్థలకు లభిస్తున్న ప్రపంచ ర్యాంకులు క్రమంగా అధికం అవుతూ ఉండడం మనకు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని అందించాయి. వివిధ గ్లోబల్ ర్యాంకింగుల్ని కైవసం చేసుకుంటున్న భారతీయ సంస్థల సంఖ్య పెరుగుతోంది. మన సొంత ర్యాంకింగులు కూడా మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం, మన ఐఐటీలు.. జాంజిబార్, అబూ ధాబీ వంటి దేశాల్లో క్యాంపసులను మొదలుపెడుతున్నాయి. అనేక ఇతర దేశాలు కూడా తమ తమ దేశాల్లో ఐఐటీ క్యాంపసులను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. మన విద్యావ్యవస్థలో ఇలాంటి సానుకూల మార్పుల వల్ల, ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు కూడా భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సాఫల్యాల నడుమ, మనం మన విద్యాసంస్థలను నిరంతరం పటిష్ఠపరుచుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని రాబోయే కాలం అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. మనం మన సంస్థలనూ, విశ్వవిద్యాలయాలనూ, పాఠశాలలనూ, కళాశాలలనూ ఈ క్రాంతికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
సమర్థులైన యువతను తీర్చిదిద్దడం ఒక బలమైన దేశాన్ని నిర్మించడంలో అతి పెద్ద పూచీకత్తుగా నిలుస్తుంది. యువతను తీర్చిదిద్దే పనిలో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులకు కూడా ప్రాథమిక బాధ్యత ఉంటుంది. అందువల్ల, పిల్లలకు వారు స్వేచ్ఛగా రెక్కలు తొడుక్కొనేందుకు అవకాశాలను అందించాల్సిందిగా ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మనం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు వారు ఎల్లప్పుడూ ఏదైనా కొత్త విషయం నేర్చుకొనేందుకు, ఏదైనా కొత్తగా చేసి చూపెట్టడానికీ ధైర్యాన్ని కనబరిచేందుకు ముందడుగు వేస్తారు. మనం రాబోయే కాలంపై దృష్టి పెట్టి, భావి కాలానికి తగ్గ ఆలోచనా విధానాన్ని అవలంబించాలి. మనం బాలలను పుస్తకాల ఒత్తిడి నుంచి విముక్తులను చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం, మనం కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్..ఏఐ) వంటి సాంకేతికతను చూస్తున్నాం. అది నిన్నటి వరకూ సైన్స్ ఫిక్షన్లోనే కనిపించేది. ఇప్పడు మన జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారింది. రోబోటిక్స్, డ్రోన్ సాంకేతికతలు ఇప్పటికే మన ఇంటి ముందుకు వచ్చి వాలాయి. ఈ కారణంగా, మనం పాత ఆలోచనా విధానం నుంచి బయటపడి తీరాలి. కొత్త ఆలోచనలు చేయాలి. ఇందుకోసం మనం మన పిల్లలను కూడా సిద్దం చేయాలి. భావి సాంకేతికతలకు సంబంధించిన ఇంటరాక్టివ్ కార్యక్రమాల్ని మన పాఠశాలలు ఏర్పాటు చేస్తే, చూడాలని ఉంది. అది విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పు, లేదా స్వచ్ఛ ఇంధనం గురించి కావచ్చు.. మనం ఈ అంశాలను మన నవ తరానికి పరిచయం చేసి తీరాలి. అందువల్ల, ఈ రంగాల్లో యువత అవగాహనను పెంచుకొని వాటి విషయంలో తమ జిజ్ఞాసను పెంపొందించుకొనేలా మనం మన విద్యావ్యవస్థను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
భారత్ బలోపేతం అవుతున్న కొద్దీ, భారత్ గుర్తింపు పట్ల, సంప్రదాయాల పట్ల ప్రపంచానికి ఆసక్తి కూడా పెరుగుతోంది. ఈ మార్పును ప్రపంచం మన మీద పెట్టుకున్న అంచనాగా మనం భావించాలి. యోగా, ఆయుర్వేద, కళలు, సంగీతం, సాహిత్యం, సంస్కృతి.. ఈ రంగాలతో భవిష్యత్తులో అపారమైన అవకాశాలు ముడిపడి ఉన్నాయి. ఈ రంగాలతో మన కొత్త తరానికి పరిచయాన్ని మనం తప్పక పెంచాలి. ఈ విషయాలకు అఖిల భారతీయ శిక్షా సమాగమ్ పెద్దపీట వేస్తుందని నేను నమ్ముతున్నాను.
ఒక నవ భారత్ నిర్మాణానికి పునాదిని వేసేదీ, మన దేశ భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దేదీ మీరు చేసే ప్రయత్నాలే. 2047లో దేశం స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలను జరుపుకొనేసరికల్లా, భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించాలన్న మన కల, మన సంకల్పం నెరవేరుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ కాలం.. ప్రస్తుతం మీ వద్ద శిక్షణను పొందుతున్న యువత చేతుల్లోనే ఉంది మరి. మీరు తీర్చిదిద్దుతున్న వాళ్లు, రేపటి దేశాన్ని మలిచే వాళ్లు. అందువల్ల, మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కలను పండించాలన్న దృఢనిశ్చయాన్నీ, ఈ సంకల్పాన్ని నెరవేర్చాలన్న అంకితభావాన్నీ, విజయాన్ని సాధించాలన్న భావననీ కలబోసుకొని యువతీయువకులందరూ ముందుకు సాగాలి.
మీ అందరికీ నేను నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. మీకు అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2203364)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam