ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అమృత్ ఫార్మసీ 10వ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా: దేశవ్యాప్తంగా సేవలు విస్తరిస్తామని ప్రకటన
దేశంలోని ప్రతి వైద్య కళాశాల, ప్రతి జిల్లా ఆసుపత్రిలో అమృత్ ఫార్మసి ఉండాలి: శ్రీ నడ్డా
సమీప భవిష్యత్తులో అమృత్ ఫార్మసీల సంఖ్యను రెట్టింపు చేసి 500కు పెంచుతామని హెచ్ఎల్ఎల్ హామీ
అమృత్ ఫార్మసీకి పదేళ్లు: దశాబ్ద కాలంలో 255కు పైగా అవుట్లెట్ల ద్వారా అందుబాటులో ఆరోగ్యసేవలు
అమృత్ ఫార్మసీల ద్వారా 6.85 కోట్లకు పైగా రోగులకు లబ్ధి: ఔషధాలు, ఇంప్లాట్లపై 50 నుంచి 90 శాతం వరకు రాయితీ
రూ.17,000 కోట్లకు పైగా ఎంఆర్పీ విలువ ఉన్న ఔషధాలను రాయితీ ధరలకే అందించడం ద్వారా రోగులకు రూ.8,500 కోట్లకు పైగా ఆదా
శక్తి, ఉత్సాహం, స్ఫూర్తితో వ్యవస్థను విస్తరించడం, విధానాలను మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడాన్ని అమృత్ ఫార్మసీ కొనసాగిస్తుంది: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
Posted On:
15 NOV 2025 3:32PM by PIB Hyderabad
అమృత్ (అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాట్స్ ఫర్ ట్రీట్మెంట్) ఫార్మసీల 10వ వార్షికోత్సవాలను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ఈ రోజు ప్రారంభించారు. చౌక ధరలకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కార్యక్రమం గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. అలాగే సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దిశగా ప్రభుత్వ రంగానికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.
అమృత్ ఫార్మసీలు 2015లో ప్రారంభమైన నాటి నుంచి ప్రాణాలను రక్షించే, ముఖ్యమైన ఔషధాలను 50 నుంచి 90 శాతం రాయితీతో అందిస్తున్నాయి. తద్వారా రోగులకు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు చెందిన వారికి చికిత్సకయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించాయి.
అమృత్ను అమలు చేయడంలో స్థిరంగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రయత్నాలను కొనసాగిస్తున్న హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ సంస్థ ను ఈ సందర్భంగా శ్రీ నడ్డా ప్రశంసించారు. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు సులభతరంగా, చౌకగా, సమానంగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం 2014లో సంకల్పించుకుందని గుర్తు చేసుకున్నారు. దాని ఫలితంగానే సరసమైన ధరలకే ఔషధాలు, వైద్య పరికరాలు అందించేలా జన ఔషధి, అమృత్ రూపుదిద్దుకున్నాయని తెలియజేశారు.
ప్రస్తుతం 255కి పైగా ఫార్మసీలతో అమృత్ వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ సంఖ్యను 500కు పెంచాలనే ధ్యేయంతో ఉన్నట్లు శ్రీ నడ్డా వెల్లడించారు. ప్రతి ఎయిమ్స్ ఆసుపత్రిలోనూ ఒక అమృత్ ఫార్మసీ ఉందని, అయితే దేశంలోని ప్రతి వైద్య కళాశాల, ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ వీటిని ఏర్పాటు చేయడమే తదుపరి లక్ష్యమని తెలిపారు. తద్వారా ఆరోగ్య సేవల వ్యవస్థలో ప్రతి దశలోనూ.. అందుబాటు ధరల్లో ప్రజలకు ఔషధాలు లభిస్తాయని వివరించారు.
అమృత్ ఫార్మసీ సాధించిన విజయాలను వివరిస్తూ.. బ్రాండెడ్ ఔషధాలకు 50 శాతం రాయితీ ఇస్తోందని, ఫలితంగా.. 6.85 కోట్ల మందికి పైగా రోగులకు ప్రయోజనం చేకూర్చిందన్నారు. ఇప్పటి వరకు రూ.17,000 కోట్లకు పైగా ఎంఆర్పీ విలువ కలిగిన మందులు అందించామని, తద్వారా రోగులు రూ.8,500 కోట్ల రూపాయల మేర ఆదా చేయగలిగారని వెల్లడించారు.
అమృత్ ఫార్మసీలపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. అమృత్ అవుట్లెట్లు అందించే ప్రయోజనాలు, లభ్యత గురించి ఎక్కువ మందికి తెలియజేయాలని, అప్పుడే వారు అందుబాటు ధరల్లో లభించే ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో, కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో అమృత్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి పౌరునికీ నాణ్యమైన ఔషధాలు సరసమైన ధరల్లో, సమానంగా అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని తెలిపారు.
హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ సంస్థ, అమృత్ ఫార్మసీ నెట్వర్క్ల అంకితభావాన్ని ఆమె కొనియాడారు. ‘‘శక్తితో, ఉత్సాహంతో, స్ఫూర్తితో తమ వ్యవస్థను విస్తరించడం, విధానాలను మెరుగుపరచడం, కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తామనే భరోసాను హెచ్ఎల్ఎల్ సంస్థ, అమృత్ ఫార్మసీ ఇచ్చాయి’’ అని ఆమె చెప్పారు.
వందన సమర్పణ చేసిన అనితా థంపి... అమృత్ కార్యక్రమానికి దార్శనిక నాయకత్వం, స్థిరమైన తోడ్పాటు అందిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత దశాబ్దంగా అమృత్ వృద్ధిని నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఆరోగ్య కార్యదర్శులు అందిస్తున్న నిరంతర మార్గదర్శకత్వాన్ని ఆమె ప్రశంసించారు. ప్రజలందరికీ సరమైన ధరలకే ఔషధాలు అందించాలనే నిబద్ధతతో వ్యవహరిస్తున్న హెచ్ఎల్ఎల్, అమృత బృందాల నిరంతర కృషిని ఆమె కొనియాడారు.
కార్యక్రమంలో భాగంగా.. 10 కొత్త అమృత్ అవుట్లెట్లను శ్రీ జేపీ నడ్డా ప్రారంభించారు. ఇది దేశ వ్యాప్తంగా రోగులకు అవసరమైన ఔషధాలను, వైద్య పరికరాలను సరసమైన ధరలకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో కీలకమైన ముందడుగుగా నిలిచింది. అమృత్ వ్యవస్థ అంతటా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంపొందించడం, సామర్థ్యాన్ని విస్తరించేందుకు వీలుగా మెరుగుపరిచిన, పర్యావరణహితమైన డిజిటల్ వేదిక అమృత్ ఐటీఈఎస్-ఎకో గ్రీన్ 2.0ను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే.. ఈ కార్యక్రమంలో ఇండియా పోస్ట్ సహకారంతో కస్టమైజ్డ్ మై స్టాంప్ను విడుదల చేశారు.
దశాబ్దంగా కొనసాగుతున్న అమృత్ ప్రయతాణంలో సాధించిన ఘనతలు, విజయాలు, ఆరోగ్యసేవలను అందించడంలో చూపిన ప్రభావాన్ని తెలియజేసే పుస్తకాన్ని విడుదల చేశారు. ఎన్సీఆర్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిచేందుకు మొబైల్ ఫార్మసీ వ్యాన్ ప్రారంఢభించారు. ఇది వెనకబడిన, మారుమూల ప్రాంతాలకు చెందినవారికి ఔషధాలను ఇంటి వద్దే అందిస్తుంది. అలాగే పౌరులకు చేరువలో ఉన్న అమృత్ ఫార్మసీల్లో అందుబాటులో ఉన్న ఔషధాలను, వాటి ధరలను తెలియజేయడానికి 24x7 నేషనల్ కాంటాక్ట్ సెంటర్ను ప్రారంభించారు.
నేపథ్యం
అమృత్ కార్యక్రమాన్నికేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే మినీరత్న సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ సంస్థ అమలు చేస్తోంది. గర్భనిరోధకాలు, ఆసుపత్రుల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, హింద్ ల్యాబ్స్ బ్రాండ్ పేరుతో డయాగ్నొస్టిక్స్తో సహా ఇతర సేవలను, అమృత్ పరిధిలో రిటైల్ సేవలను, హెచ్ఎల్ఎల్ ఫార్మసీ, హెచ్ఎల్ ఆఫ్టికల్, మౌలిక వసతుల అభివృద్ధి, సేకరణ, కన్సల్టెన్సీ సేవలను అందిస్తూ సమగ్ర ఆరోగ్య సేవలకు పరిష్కారాలను అందించే సంస్థగా హెచ్ఎల్ఎల్ పనిచేస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 7 కర్మాగారాలను, 5 అనుబంధ సంస్థలను, ఒక కార్పొరేట్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని నిర్వహిస్తూ భారత ఆరోగ్యసేవల రంగంలో ఆవిష్కరణలను ముందుకు తీసుకెళుతోంది.
***
(Release ID: 2190433)
Visitor Counter : 4