రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన డీపీఎస్యూ భవన్ను ప్రారంభించిన రక్షణ మంత్రి: డీపీఎస్యూల పనితీరుపై న్యూఢిల్లీలో సమీక్ష
మినీరత్న హోదా పొందిన నాలుగు డీపీఎస్యూలకు రక్షణ మంత్రి ప్రశంస
రక్షణ రంగ తయారీలో స్వావలంబనను ప్రోత్సహించేలా పరిశోధనాభివృద్ధి, హరిత ఇంధన కార్యక్రమాల ప్రారంభం
71.6 శాతం డీపీఎస్యూల వాటాతో రూ.1.51 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తిని సాధించిన భారత్
భారత్ అభివృద్ధి చేసిన ఆయుధాలపై పెరుగుతున్న విశ్వాసం...
రూ.6,695 కోట్లను చేరుకున్న రక్షణ రంగ ఉత్పత్తులు
प्रविष्टि तिथि:
10 NOV 2025 2:35PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని నౌరోజీ నగర్ ప్రపంచ వాణిజ్య కేంద్రంలో కొత్తగా ప్రారంభించిన డీపీఎస్యూ భవన్లో 2025 నవంబర్ 10న జరిగిన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ (డీపీఎస్యూ)ల సమగ్ర సమీక్షా సమావేశానికి రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. మినీరత్న (కేటగిరీ-1) హోదా దక్కిన నాలుగు డీపీఎస్యూలు - మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐవోఎల్), హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)ను ఈ సమావేశంలో ప్రశంసించారు.
సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. రక్షణ తయారీ వ్యవస్థలో దేశాన్ని బలోపేతం చేయడానికి, స్వావలంబన భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి డీపీఎస్యూలు నిలకడగా కొనసాగిస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘దేశ స్వావలంబన దిశగా మన 16 డీపీఎస్యూలు పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తరహా కార్యకలాపాల్లో దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పనితీరు.. వాటి విశ్వసనీయతకు, సామర్థ్యానికి నిదర్శనం’’ అని ఆయన అన్నారు. అంకితభావం, అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న ఈ సంస్థలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
మినీరత్న హోదాను సాధించిన హెచ్ఎస్ఎల్, ఏవీఎన్ఎల్, ఐవోఎల్, ఎంఐల్ సంస్థలను శ్రీ రాజనాథ్ సింగ్ అభినందించారు. దీన్ని రక్షణ రంగంలో పెరుగుతున్న వాటి సామర్థ్యానికి, స్వతంత్ర ప్రతిపత్తికి, సహకారానికి సూచనగా వర్ణించారు. 2021లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు కొత్త డీపీఎస్యూలుగా విభజించడం వల్ల నిర్వాహక స్వాతంత్ర్యం, ఆవిష్కరణ, పోటీతత్వం బాగా పెరిగాయని ఆయన అన్నారు. ఈ మినీరత్న హోదా సామర్థ్య విస్తరణ, ఆధునికీకరణ, ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఉమ్మడి పరిశ్రమలు, విలీనాలతో సహా కొత్త సంస్థలు, సహకారాలను అన్వేషించడంలో ఈ నాలుగు డీపీఎస్యూలకు సాధికారత ఇస్తుందని వివరించారు.
ఈ రంగం కనబరుస్తున్న అద్భుతమైన పనితీరును వివరిస్తూ.. 2024-25లో రూ.1.51 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తిని సాధించిందని, దీనిలో డీపీఎస్యూల వాటా 71.6 శాతంగాఉందని శ్రీ రాజనాథ్ సింగ్ వెల్లడించారు. రక్షణ రంగ ఉత్పత్తులు రూ.6,695 కోట్లను చేరుకున్నాయని, ఇది భారత్ అభివృద్ధి చేసిన ఆయుధాలపై ప్రపంచ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ‘‘ఇది ‘మేడిన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులు అంతర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నాయని స్పష్టంగా తెలియజేస్తుంది’’ అని తెలిపారు.
ఈ వేగాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ.. కీలకమైన సాంకేతికతలను త్వరితగతిన దేశీయంగా అభివృద్ధి చేయడం, సమగ్ర పరిశోధనాభివృద్ధికి, ఉత్పత్తి నాణ్యతను మెరుగు పరచడం, సమయానికి సరఫరా చేయడం, ఎగుమతులను పెంచడానికి వ్యూహాత్మక విధానాన్ని అనుసరించడంపై దృష్టి సారించాలని డీపీఎస్యూలను రక్షణ మంత్రి కోరారు. తదుపరి సమీక్షలో స్వదేశీకరణను స్పషంగా నిర్వచించాలని, అంచనా వేయగల విజయాలతో ఆర్ అండ్ డీ ప్రణాళికలను సమర్పించాలని డీపీఎస్యూలను ఆదేశించారు. ‘‘అవసరమైన చోట ప్రత్యేక జోక్యం లేదా సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను’’ అని తెలిపారు.
సహకార, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. డీపీఎస్యూల మధ్య మూడు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) ఆధునికీకరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఉపయోగించే అల్యూమినియం మిశ్ర ధాతువుల దిగుమతులను తగ్గించడంలో కీలకంగా వ్యవహరించే 10,000 టన్నుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థతో హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వైఐఎల్కు రూ.435 కోట్ల వడ్డీ రహిత అడ్వాన్సులను అందించేందుకు హెచ్ఏఎల్ కట్టుబడి ఉంది. అలాగే పదేళ్ల పాటు 3,000 మెట్రిక్ టన్నుల వరకు పనిని బీడీఎల్ అందిస్తుంది. జాతీయ ప్రాధాన్యమున్న రక్షణ ప్రాజెక్టులకు అవసరమైన కీలక ముడి ఖనిజాలను ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉంచేలా.. మిధానిలో మెటల్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి మూడో ఒప్పందం కుదిరింది.
డిజిటైజేషన్, మేధో సంపత్తి రూపకల్పన, భారతీయ విద్యాసంస్థలతో సహకారం ద్వారా ఆర్ అండ్ డీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఆర్ అండ్ డీ మాన్యువల్తో సహా వివిధ పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలను రక్షణ మంత్రి ఆవిష్కరించారు. కొనసాగుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు వ్యూహాలను డీపీఎస్యూల ఆర్ అండ్ డీ రోడ్ మ్యాప్ ఏకీకృతం చేస్తుంది. ఇది లైసెన్స్ ఆధారిత ఉత్పత్తి నుంచి దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి వరకు రక్షణ సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేసిన నిర్ణయాత్మక అడుగును సూచిస్తుంది.
రక్షణ ఉత్పత్తుల తయారీలో సుస్థిరత దిశగా సాగిస్తున్న ప్రయాణంలో భాగంగా.. స్వయం - స్థిరమైన, పర్యావరణహిత రక్షణ ఉత్పత్తుల తయారీని శ్రీ రాజనాథ్ సింగ్ ప్రారంభించారు. ఇది డీపీఎస్యూల్లో హరిత విధానాలను తీసుకొచ్చే సమగ్ర కార్యక్రమం. సమగ్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళిక (సీఈఈఏపీ) 2023లో భాగమైన రక్షణ ఉత్పత్తుల రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పునరుత్పాదక ఇంధన స్వీకరణను విస్తరించడానికి, కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే ప్రయత్నాలను స్వయం వివరిస్తుంది. స్వర్ణ డ్యాష్ బోర్డు, డీపీఎస్యూ ఇంధన సామర్థ్య సూచీ లాంటి డిజిటల్ పరికరాల సాయంతో.. సుస్థిరత, స్వావలంబనను మిళితం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
100 శాతం హరిత ఇంధన వినియోగాన్ని సాధించిన ఐవోఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)ను రక్షణ మంత్రి అభినందించారు. 2025 సెప్టెంబర్ నుంచి పూర్తిగా పునరుత్పాదక ఇంధనాన్ని ఐవోఎల్ వినియోగిస్తోంది. తద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8,669 టన్నుల కర్భన ఉద్గారాలను తగ్గించి, రూ. 26.36 లక్షలను ఆదా చేసింది. 2025 జనవరిలో ఆర్ఈ 100 లక్ష్యాన్ని సాధించిన మొదటి సంస్థగా నవరత్న డీపీఎస్యూ అయిన బీఈఎల్ నిలిచింది. తన స్కోప్-2 ఉద్గారాలను 15,000 టన్నుల నుంచి శూన్యానికి తీసుకొచ్చి సున్నా కర్భన ఉద్గారాల లక్ష్యాల దిశగా గణనీయమైన విజయాన్ని సాధించింది.
భారత రక్షణ తయారీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో డీపీఎస్యూల నాయకత్వం, ఆవిష్కరణ, అంకితభావాన్ని శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. ‘‘రక్షణ ఉత్పత్తుల్లో భారత్ స్వావలంబన సాధించేలా చేయడమే కాకుండా.. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చే సంకల్పం తీసుకుందాం’’ అని ఆయన అన్నారు. జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న అన్ని డీపీఎస్యూలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ నాయకత్వంలో అత్యాధునిక వసతులతో నూతన డీపీఎస్యూ భవన్ రూపుదిద్దుకుంది. రక్షణ ఉత్పత్తుల విభాగం అభివృద్ధి చేసిన ఈ భవనం ‘సంగచ్ఛధ్వం సంవదధ్వం’ (కలసి నడుద్దాం.. కలసి చర్చిద్దాం) అనే నినాదంతో మొత్తం 16 డీపీఎస్యూల్లో సహకారాన్ని, ఆవిష్కరణను, సమష్టి కార్యకలాపాలను ప్రోత్సహించే ఉమ్మడి వేదికగా పనిచేస్తుంది. ఆధునిక కాన్ఫరెన్స్ రూములు, సిమ్యులేషన్ సౌకర్యాలు, ఎగ్జిబిషన్ ప్రాంతంతో కూడిన ఈ భవనం.. డీపీఎస్యూల సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడానికి, భారత రక్షణ తయారీ సామర్థ్యాలను దేశీయ, అంతర్జాతీయ భాగస్వామ్యులకు ప్రదర్శించడానికి సహకరిస్తుంది.
రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, అన్ని డీపీఎస్యూల ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు. రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2188582)
आगंतुक पटल : 10