ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రజలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలుపుతూ సురక్షితమైన, పరస్పరం పనిచేసే, జవాబుదారీతనంతో డిజిటల్ పాలనను అందించే విశ్వసనీయ వేదిక డిజీలాకర్: ఎమ్ఈఐటీవై కార్యదర్శి ఎస్.కృష్ణన్
'డిజీలాకర్ - కాగిత రహితంగా అందరికీ డిజిటల్ పత్రాలను అందుబాటులో ఉంచటం' అంశంపై ఎన్ఈజీడీ జాతీయ సదస్సు.. డిజిటల్ విశ్వాసానికి, సమర్థతకు మూలస్తంభం డిజీలాకర్
'డిజీలాకర్ యాక్సిలరేటర్స్'గా ఏడు రాష్ట్రాల గుర్తింపు: అస్సాం, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం.. ఆయా రాష్ట్రాలు సాధించిన విజయాలకు అభినందనలు
పాలన, విద్య, ఆర్థిక రంగాల్లో డిజీలాకర్ను పెద్దఎత్తున విస్తరించటంపై రాష్ట్రాలు, పరిశ్రమల భాగస్వాముల ప్రదర్శన
Posted On:
08 NOV 2025 9:29AM by PIB Hyderabad
'డిజీలాకర్ - కాగిత రహితంగా అందరికీ డిజిటల్ పత్రాలను అందుబాటులో ఉంచటం' అంశంపై ఈ వారం న్యూఢిల్లీలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీనియర్ ప్రభుత్వాధికారులు, సాంకేతిక, ఆర్థిక రంగాల ప్రముఖులు, విద్యావేత్తలు, డిజిటల్ పాలనా నిపుణులు పాల్గొన్నారు. కాగిత రహిత పాలన, సమ్మిళిత విద్య, సురక్షిత డిజిటల్ సేవలను సులభతరం చేయటంలో డిజీలాకర్ పరివర్తనాత్మక పాత్రను ఈ సదస్సు స్పష్టం చేసింది. ఇది దేశ డిజిటల్ విశ్వాస విప్లవంలో కీలక మైలురాయి.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం ద్వారా భారత మండపంలో నిర్వహించిన ఈ సదస్సు.. డిజీలాకర్ అనేది డాక్యుమెంట్లను సురక్షితంగా భద్రపరచుకునే సదుపాయం అనే స్థాయి నుంచి ప్రభుత్వ, విద్య, పారిశ్రామిక రంగాల్లో విశ్వాసం, సౌలభ్యం, సామర్థ్యానికి మూలస్తంభంగా అభివృద్ధి చెందిన విధానాన్ని చర్చించటానికి, ప్రదర్శించటానికి సహకార వేదికను అందించింది.
ఎమ్ఈఐటీవై కార్యదర్శి ఎస్.కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో డిజిటల్ పరంగా జరిగిన ప్రయాణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అనుసంధానం చేయటం, సామర్థ్యంతో సేవలు అందించే స్థాయి నుంచి స్వావలంబన వైపు, పాలనలో కీలకంగా మారి విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా డిజిటలైజేషన్ పురోగమిస్తుందని అన్నారు. "డిజీలాకర్ అనేది ప్రజలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలుపుతూ సురక్షితమైన, పరస్పరం పనిచేసే, జవాబుదారీతనంతో డిజిటల్ పాలనను అందించే విశ్వసనీయ వేదిక. నమ్మకమైన డిజిటల్ లావాదేవీలు, సాధికారత సాధించిన పౌరులు, ప్రతి సంస్థ బాధ్యతాయుతంగా ఉండే భవిష్యత్తే మా లక్ష్యం" అని తెలిపారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ ప్రసంగిస్తూ, సాంకేతిక ఆధారిత పాలనలో భారతదేశ ప్రయాణాన్ని 'డిజిటల్ విశ్వాస విప్లవం'గా అభివర్ణించారు. లక్షలాది మంది ప్రజల కోసం పాలనా వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంచటంలో డిజీలాకర్ కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిజీలాకర్ భవిష్యత్తు గురించి వివరిస్తూ, ఏఐ ఆధారిత ఈ-కేవైసీ ప్రపంచస్థాయి అర్హత పత్రాల ధ్రువీకరణ ప్రణాళికలను వివరించారు. కాగిత రహిత పాలన కోసం డిజీలాకర్ను ప్రపంచ నమూనాగా నిలపాలని ఆకాంక్షించారు.
ఎన్ఈజీడీ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ నంద్ కుమారుమ్ మాట్లాడుతూ.. డిజీలాకర్, డాక్యుమెంట్లను సురక్షితంగా భద్రపరచుకునే స్థాయి నుంచి 'డిజిటల్ ఇండియా'లో మూలస్తంభంగా మారిన క్రమాన్ని వివరించారు. దీని ద్వారా పౌరులు తమ ఐడీలు, ఆర్థిక ధ్రువీకరణ పత్రాలు, సర్టిఫికెట్లను సురక్షితంగా యాక్సెస్ చేయటానికి, నిర్ధరించుకోవటానికి, పంచుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. "దేశ సహకార విధానాన్ని, డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రతి పౌరుడికి అందించే విశ్వాసాన్ని, సౌలభ్యాన్ని ఈ వేదిక ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.
మహారాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఏ అండ్ టీ) డాక్టర్ రిచా బగ్లా, ఆ రాష్ట్ర పెన్షన్, ట్రెజరీ వ్యవస్థల్లో డిజీలాకర్ అనుసంధానానికి సంబంధించి ప్రారంభ సమావేశంలో ఒక ప్రజెంటేషన్ను ఇచ్చారు. అస్సాంలోని సేవ సేతు పోర్టల్ ద్వారా 500కు పైగా సేవల్లో డిజీలాకర్ను అనుసంధానం చేయడంపై ఆ రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కె.ఎస్. గోపీనాథ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
డిజీలాకర్ను వినియోగించి విజయం సాధించిన రాష్ట్రాలను 'డిజీలాకర్ యాక్సిలరేటర్స్' గా గుర్తించారు. మెరుగైన భద్రత, పారదర్శకతతో వివిధ సేవల్లో డిజీలాకర్ను పెద్ద ఎత్తున అమలు చేసిన అస్సాంను 'ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్' గుర్తింపుతో సత్కరించారు. అతిపెద్ద డిజిటల్ గుర్తింపు అనుసంధానంతో ప్రజా కార్యక్రమాలను రూపొందించటానికి డిజీలాకర్ను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు గానూ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 'పీపుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్' గుర్తింపును పొందాయి. డిజీలాకర్, ఎంటిటీ లాకర్ అనే రెండు వేదికలను అనుసంధానం చేసినందుకు గానూ మేఘాలయ 'ద్వి వేదిక సమన్వయ విజేత' గుర్తింపును అందుకుంది. డిజీలాకర్ ద్వారా కాగిత రహిత పాలనను ప్రారంభించటంలో ఆవిష్కరణలకు గానూ కేరళను సత్కరించారు. డిజీలాకర్ను త్వరితగతిన అమలు చేసినందుకు మహారాష్ట్రకు 'ఫాస్ట్ ట్రాక్ ఇంటిగ్రేషన్' గుర్తింపు లభించింది. అత్యధిక సంఖ్యలో 'అభ్యర్థన నమూనా' అనుసంధానం చేసిన మిజోరం 'రిక్వెస్టర్ యాక్సిలరేటర్' గా గుర్తింపు పొందింది.
సదస్సులో జరిగిన సమాంతర బ్రేక్ అవుట్ సమావేశాల్లో.. ప్రభుత్వం, విద్య, ఫిన్టెక్, అదనపు విలువ సేవలు వంటి కీలక రంగాల్లో డిజీలాకర్ స్పష్టమైన ప్రభావంపై దృష్టి సారించారు.
ప్రభుత్వం, విద్య:
జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా డిజీలాకర్ విద్యా వ్యవస్థను మార్చిన విధానాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్య సంయుక్త కార్యదర్శి శ్రీ గోవింద్ జైస్వాల్ వివరించారు. సాంకేతికత సాయంతో ఎన్ఈపీ 2020 లక్ష్యాన్ని ఎన్ఈటీఎఫ్ ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఈటీఎఫ్) ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి. సహస్రబుద్ధే తెలిపారు. కేరళలో సర్టిఫికెట్లెస్ గవర్నన్స్ కార్యక్రమం గురించి ఆ రాష్ట్ర ఐటీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ కుమార్ వెల్లడించారు. ఒకే పోర్టల్లో డిజీలాకర్, ఎంటిటీలాకర్ రెండింటినీ సమన్వయం చేయటంపై మేఘాలయ ఐటీ కమిషనర్, కార్యదర్శి శ్రీ ప్రవీణ్ బక్షి వివరాలు తెలిపారు. సమగ్ర/సింగిల్ సిటిజెన్ డేటాబేస్ గురించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఈ-మిషన్ బృందం అధిపతి శ్రీమతి రూచా మహాలె వివరించారు. టీసీఎస్ ఐయాన్ నుంచి శ్రీ వైభవ్ మంగళ్, ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ముఖేశ్ కల్లా మాట్లాడుతూ.. మార్కుల షీట్లు, డిగ్రీలు, సర్టిఫికెట్లను దానంతట అదే, తారుమారు చేయలేని విధానంలో డిజీలాకర్ పాత్ర గురించి తెలిపారు. డిజీలాకర్ వ్యవస్థను విస్తరించటంపై ఢిల్లీ ఐఐఐటీకి చెందిన శ్రీ అంకిత్ జైన్, శ్రీ సలిల్ అరోరా దృష్టి సారించారు. రాజస్థాన్లో డిజీలాకర్కు అనుబంధంగా పనిచేసే రాజ్ ఈ-వాల్ట్ కేంద్రీకృత డిజిటల్ రిపాజిటరీగా ఎలా సేవలందిస్తుందో ఆ రాష్ట్ర ఐటీ ఉపాధి, కార్మిక పథకాల ధ్రువీకరణ, సంయుక్త సంచాలకులు శ్రీమతి వినీల శ్రీవాస్తవ వివరించారు. విద్యారంగంలో డిజీలాకర్కు పెరుగుతున్న ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రమాదాల గురించి ఐఐటీ మద్రాస్కు చెందిన శ్రీ జయ కృష్ణన్ ఎమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఫిన్టెక్, అదనపు విలువ సేవలు (వీఏఎస్):
పాన్ ఆధారంగా ఎంటిటీ లాకర్ ద్వారా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీలను (ఈ-బీజీలు) ఎలా పొందవచ్చనే అంశంపై ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిలిడ్ (ఎన్ఈఎస్ఎల్) ఎండీ అండ్ సీఈఓ శ్రీ దేబజ్యోతి రే చౌదరి ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో సవాళ్ల స్వీకరణపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చిరాగ్ జైన్ మాట్లాడారు. డిజీలాకర్ ద్వారా ఎడెల్వైస్ సంస్థ సంపూర్ణ డిజిటల్ ప్రవేశ ప్రక్రియ గురించి ఎడెల్వైస్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ ఉత్పత్తుల అధిపతి శ్రీమతి హనీ జగ్యసి వెల్లడించారు. వీసా ప్రక్రియలో డిజీలాకర్ మద్దతుకు సిఫార్సులను దస్తావేజుల పరిశీలన, వీసా ప్రక్రియ డైరెక్టర్ శ్రీ షమీమ్ జలీల్ అందించారు. డిజీలాకర్కు వస్తున్న నూతనావకాశాలను ఐసీఐసీఐ బ్యాంకు డిజిటల్ బిజినెస్ హెడ్ శ్రీ సురేశ్ ముత్యాల ప్రతిపాదించారు. బ్యాంకు ప్రక్రియల్లో డిజీలాకర్ విస్తృతమైన అనుసంధానాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు కార్యానిర్వహక ఉపాధ్యక్షుడు శ్రీ ప్రశాంత్ ఎమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ కిరుబానందన్ కె ప్రదర్శించారు. డిజీలాకర్ ద్వారా విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలపై పరిశ్రమ వర్గ ఆలోచనలను డిజియో సహ-వ్యవస్థాపకులు శ్రీ సంకేత్ నాయక్ తెలిపారు.
డిజీలాకర్ ద్వారా దేశంలోని ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్న లక్ష్యానికి ఈ జాతీయ సదస్సు ఒక నిదర్శనం. డిజీలాకర్ కేవలం సాంకేతిక వేదిక మాత్రమే కాదు.. సుపరిపాలనకు సాధనమని ఈ సదస్సు నిరూపించింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను, డిజిటల్ సేవలకు భద్రతను డిజీలాకర్ ఎలా కల్పిందనే విషయాలను ఈ సదస్సు తెలియజేసింది. విశ్వాసం, పారదర్శకత, సాంకేతిక నైపుణ్యం అనే మూలాలపై పాలనా నమూనాను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
***
(Release ID: 2188165)
Visitor Counter : 13