వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఇండియా-న్యూజిలాండ్ బిజినెస్ ఫోరమ్: సహకారానికి కొత్త మార్గాల అన్వేషణ
ఇండియా-న్యూజిలాండ్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి: మహాత్మాగాంధీ సెంటర్లో సామూహిక కార్యక్రమం
భారత వాణిజ్య ప్రతినిధులతో చర్చలు: ప్రపంచవ్యాప్త విస్తరణకు ప్రోత్సాహం
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2025 8:10PM by PIB Hyderabad
ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి(ఎఫ్టీఏ) సంబంధించి నాలుగో రౌండ్ చర్చలు ప్రస్తుతం ఆక్లాండ్లో జరుగుతున్నాయి.(నవంబర్ 3-7, 2025)
ఆక్లాండ్ బిజినెస్ ఛాంబర్ నిర్వహించిన ఇండియా-న్యూజిలాండ్ బిజినెస్ ఫోరమ్లో, న్యూజిలాండ్ వాణిజ్య శాఖ మంత్రి టాడ్ మెక్క్లేతో కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్న ప్రత్యేక చర్చను ఆక్లాండ్ బిజినెస్ ఛాంబర్ సీఈవో శ్రీ సైమన్ బ్రిడ్జెస్ నిర్వహించారు.
ఈ సమావేశం ప్రారంభంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి మిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల గురించి కేంద్రమంత్రి శ్రీ గోయల్ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో సహకార మార్గాన్ని నిర్దేశించేందుకు ఈ చర్చలు మరింత ప్రోత్సాహనిచ్చాయన్నారు.
ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునేందుకు నూతన సహకార మార్గాలను అన్వేషించాలని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. సముద్రయానం, అటవీ శాఖ, క్రీడలు, విద్య, సాంకేతికత, పర్యాటకం వంటి కీలక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా భారత పరిశ్రమల రంగ విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ, న్యూజిలాండ్ను ఇంత పెద్ద భారత వాణిజ్య ప్రతినిధి బృందం సందర్శించటం మొదటిసారని ఆయన స్పష్టం చేశారు.
కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ ఎఫ్టీఏ చర్చల గురించి మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. పరస్పర గౌరవం, సమాన ఫలితాలు సాధించాలనే ఉమ్మడి ప్రాధాన్యతతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్లో విస్తరిస్తున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ద్వారా న్యూజిలాండ్ ప్రయోజనం పొందవచ్చని.. అదేవిధంగా న్యూజిలాండ్ సాంకేతిక నైపుణ్యం, ప్రత్యేక సామర్థ్యాలను భారత్ వినియోగించుకోవటం వల్ల పరస్పరం లాభదాయకమైన సహకారాన్ని పెంపొందించుకోవచ్చని మంత్రి అన్నారు. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంలో, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటంలో ప్రవాస భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆక్లాండ్లోని మహాత్మాగాంధీ సెంటర్లో జరిగిన సామూహిక కార్యక్రమం సందర్బంగా భారత్-న్యూజిలాండ్ భాగస్వామ్య వేడుకలో పాలుపంచుకున్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి శ్రీ క్రిస్టోఫర్ లక్సన్కు శ్రీ పీయూష్ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగంలో భారత సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ.. జన్మభూమి మన మూలాలను గుర్తుచేస్తుందని, కర్మభూమి సేవ చేయటానికి, సహకరించటానికి అవకాశమిస్తుందన్నారు. జన్మభూమి విలువలతో ప్రవాస భారతీయులు కర్మభూమికి నమ్మకంగా, విధేయతతో ఉండాలని చెప్పారు.
వివిధ రంగాల్లో మరింత లోతైన సహకారానికి ఉమ్మడిగా కృషి చేసి మరెన్నో న్యూజిలాండ్-భారత్ విజయగాథలు సృష్టించగలమని శ్రీ పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల కఠోర శ్రమను ఆయన కొనియాడారు. ఉమ్మడి విలువలు, సంస్కృతి, ఆశయాలు.. భారత్, న్యూజిలాండ్లను మరింత దగ్గర చేస్తూ, దృఢమైన, భవిష్యత్ కార్యాచరణ కలిగిన భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగటానికి న్యూజిలాండ్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ఆయన అన్నారు.
పరస్పర గౌరవం, నిష్పాక్షికత, ఉమ్మడి దార్శనికతపై భారత్-న్యూజిలాండ్ సంబంధాలు బలపడినట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రవాస భారతీయులను ఈ రెండు దేశాల మధ్య బంధాలను దృఢపరిచే "వంతెనలు"గా అభివర్ణించారు.
"టీ విత్ ఇండియన్ బిజినెస్ డెలిగేషన్" పేరుతో భారతీయ వాణిజ్య ప్రముఖులతో మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ముఖాముఖి నిర్వహించారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించటంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు, న్యూజిలాండ్ను సందర్శించిన అతిపెద్ద భారత వాణిజ్య ప్రతినిధి బృందాన్ని ఆయన అభినందించారు.
ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న సహకారం ముఖ్యంగా వ్యవసాయం, ఆహార శుద్ధి, కలప, అటవీ సంపద, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లోని అవకాశాలను ఈ చర్చలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత భవిష్యత్ విధానాలను వాణిజ్య ప్రముఖులు ప్రశంసించారు. ఉత్పాదక అనుబంధ ప్రోత్సాహక పథకాలు, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్థల విస్తరణకు వీలు కల్పించాయి.
నిరంతరం పట్టుదలతో పనిచేయాలని భారత వాణిజ్య సంస్థలను మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రోత్సహించారు. వ్యాపార స్ఫూర్తి, ఆవిష్కరణలే అభివృద్ధికి, భాగస్వామ్యాల బలోపేతానికి కారణమవుతాయని ఆయన తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2186920)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24