రాష్ట్రపతి సచివాలయం
పతంజలి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి
విశ్వవ్యాప్త సోదరభావం, ప్రాచీన వేద జ్ఞానాన్నీ అత్యధునాతన శాస్త్రవిజ్ఞాన పరిశోధననూ కలబోయడం,
ప్రపంచ సవాళ్ల పరిష్కారం.. ఇవి ఆధునిక సందర్భాల్లో భారతీయ జ్ఞాన పరంపరను
ముందుకు తీసుకుపోతున్నాయన్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
Posted On:
02 NOV 2025 1:35PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గల పతంజలి విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవాన్ని ఈ రోజు (2025 నవంబరు 2న) నిర్వహించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మానవ సంస్కృతీ వికాసంలో మన దేశ మహానుభావులు అమూల్యమైన సేవలను అందించారని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు. రుషుల్లో అత్యంత మహనీయుడు మహర్షి పతంజలి యోగ మాధ్యమంతో మనస్సులోని మాలిన్యాన్నీ, వ్యాకరణ మాధ్యమంతో వాణిలోని అపవిత్రతనూ, ఆయుర్వేద మాధ్యమం ద్వారా శరీరంలోని కాలుష్యాన్నీ తొలగించారని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. మహర్షి పతంజలి అందించిన ఘన పరంపరను పతంజలి విశ్వవిద్యాలయం సమాజానికి చేరువగా తీసుకురావడం సంతోషాన్ని కలిగిస్తోందని రాష్ట్రపతి అన్నారు.
యోగ, ఆయుర్వేద, ప్రాకృతిక వైద్య రంగాల్లో విద్యతో పాటు పరిశోధనలను పతంజలి విశ్వవిద్యాలయం మరింత ముందుకు తీసుకుపోతోందని రాష్ట్రపతి తెలిపారు. ఇది ఆరోగ్య భారత నిర్మాణానికి సాయపడుతున్న ప్రశంసనీయ కృషి అని శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
image.png
భారత్ను కేంద్రస్థానంలో నిలుపుకొంటూ విద్యాబోధన ప్రణాళికను పతంజలి విశ్వవిద్యాలయం రూపొందించుకొని పురోగమిస్తుండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచ దేశాల పట్ల సోదరభావనతో మెలగడం, ప్రాచీన వేద జ్ఞానాన్నీ అత్యధునాతన శాస్త్రవిజ్ఞాన పరిశోధననూ జత కలపడం, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం.. ఈ దృష్టికోణానికి అనుగుణంగా విద్యను బోధిస్తుండటం ఆధునిక సందర్భాల్లో భారతీయ జ్ఞాన పరంపరను ముందుకు నడిపిస్తోంది అని రాష్ట్రపతి చెప్పారు.
ఈ యూనివర్సిటీ ఆదర్శాలకు తగ్గట్లుగా విద్యను అభ్యసించిన విద్యార్థులు.. రాబోయే కాలంలో మానవజాతి మనుగడ నిలకడగా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటుగా ప్రకృతి పట్ల సామరస్యాన్ని కనబరిచే జీవనశైలిని అలవరుచుకోవడం కూడా ఎంతైనా అవసరమని గ్రహించే ఉంటారని రాష్ట్రపతి అన్నారు. వారు వాతావరణ మార్పు సహా ప్రపంచ సవాళ్లతో తలపడటానికి సదా సిద్ధంగా ఉంటారనే తాను నమ్ముతున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.
అందరూ బాగుండాలని కోరుకోడమే మన సంస్కృతికి ప్రధాన గుర్తింపు చిహ్నంగా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఈ అభ్యున్నతే సద్భావనకూ, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేటట్లు చూడటానికీ బాట వేస్తుందన్నారు. ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు సద్భావన తాలూకు జీవన మూల్యాన్ని ఆచరణలోకి తీసుకురాగలరని తాను విశ్వసిస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.
వ్యక్తులను తీర్చిదిద్దితే కుటుంబాల పోషణకు దారి ఏర్పడుతుందనీ, తద్వారా సమాజ నిర్మాణంతో పాటు దేశ నిర్మాణానికి దోహదం లభిస్తుందనీ రాష్ట్రపతి అన్నారు. వ్యక్తిగత వికాసానికి కృషి చేస్తూ దేశ నిర్మాణానికి తోడ్పాటును అందించాలనే మార్గాన్ని పతంజలి విశ్వవిద్యాలయం అనుసరిస్తోందని శ్రీమతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు సద్గుణవంతులుగా నడుచుకొంటూ ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి తమ వంతుగా చెప్పుకోదగ్గ సహకారాన్ని అందిస్తారన్న నమ్మకాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
Please click here to see the President's speech-
***
(Release ID: 2185792)
Visitor Counter : 6