రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి గుజరాత్ పర్యటన: సోమనాథ్ ఆలయంలో పూజలు గిర్ నేషనల్ పార్క్ సందర్శన: స్థానిక గిరిజనులతో ముఖాముఖీ
प्रविष्टि तिथि:
10 OCT 2025 9:33PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (అక్టోబర్ 10, 2025) గుజరాత్లో పర్యటించారు.
సోమనాథ్ ఆలయంలో దర్శనం, పూజలతో రాష్ట్రపతి తన కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించారు.
తరువాత, రాష్ట్రపతి గిర్ నేషనల్ పార్క్ను సందర్శించారు. ససాన్ గిర్ వద్ద స్థానిక గిరిజన ప్రజలతో సంభాషించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన ప్రజలు జీవితంలో పురోగతి సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. తమ పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించడానికి కృషి చేయాలని ఆమె వారికి సూచించారు. ఒక ఆదిమ గిరిజన సమూహమైన సిద్ది గిరిజన సంఘం 72 శాతానికి పైగా అక్షరాస్యత రేటును కలిగి ఉందని తెలుసుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు.
గిరిజన ప్రజల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రారంభించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సమాచారం పొందాలని, వాటి నుంచి వారు ప్రయోజనం పొందడమే కాకుండా, తమ గ్రామం, సమాజంలోని ప్రజలను ఆ పథకాలతో అనుసంధానించాలని ఆమె కోరారు.
ప్రకృతితో గిరిజనుల స్నేహపూర్వక జీవనశైలి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అన్నారు.
గిరిజన సోదరులు, అక్కాచెల్లెళ్ల చురుకైన భాగస్వామ్యంతో, సమానత్వం, న్యాయం, గౌరవం కలిగిన వాతావరణంతో కూడిన సమాజాన్ని, దేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామని, గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వారి హక్కులను కాపాడుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2177739)
आगंतुक पटल : 43