రక్షణ మంత్రిత్వ శాఖ
‘‘కదన రంగం మారుతోంది…. అల్గోరిథమ్, స్వయంచాలిత వ్యవస్థ, కృత్రిమ మేధ ముఖ్యం భావి యుద్ధాలను నిర్దేశించేది... డ్రోన్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, క్వాంటం కంప్యూటింగ్, దిశానిర్దేశిత శక్తి ఆయుధాలు:రక్షణశాఖ మంత్రి
‘‘2021-22లో రూ. 74,000 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగిన రక్షణ మూలధన వ్యయం. ఇది కేవలం గణాంకాల్లో మార్పే కాదు.. ఆధారపడే ధోరణి నుంచి ఆత్మవిశ్వాసం వైపు మారిన దృక్పథానికి సంకేతం
దేశ రక్షణ రంగంలో తొలి యూనికార్న్ను సృష్టించాలని ఐడెక్స్ ఆవిష్కర్తలకు పిలుపు;
దేశ సాంకేతిక మార్పునకు నాయకత్వం వహించాలంటూ యువతకు సూచన
నవ భారత రచయితలు మీరే... స్వావలంబన దిశగా రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి
భారత్.. సాంకేతిక స్వావలంబనకు మీ సృజనాత్మక శక్తీ, ఆవిష్కరణలే మూలం: రక్షణ మంత్రి
“నేటి వరకు 650కి పైగా ఐడెక్స్ విజేతలు, రూ. 3,000 కోట్లకు పైగా ప్రోటోటైప్ కొనుగోళ్లకు హామీ...
ఇది భారత రక్షణ ఆవిష్కరణ రంగంలో విప్లవాత్మక మార్పునకు నిదర్శనం
Posted On:
07 OCT 2025 2:02PM by PIB Hyderabad
‘‘యుద్ధ భూమి మారింది. రేపటి యుద్ధాలు అల్గోరిథమ్స్, స్వయంచాలన వ్యవస్థలు, కృత్రిమ మేధోతో జరుగుతాయి. డ్రోన్లు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, క్వాంటం కంప్యూటింగ్, దిశానిర్దేశిత శక్తి ఆయుధాలు భవిష్యత్తును నిర్వచించబోతున్నాయి. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఇలాంటి ప్రదర్శనను మనం చూశాం’’ అని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు. అక్టోబర్ 07, 2025న విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభానికి ముందు నిర్వహించిన ‘రక్షా నవచార్ సంవాద్: ఐడెక్స్ అంకుర సంస్థలతో పరస్పర చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉన్న పరిష్కారాలను మాత్రమే అభివృద్ధి చేయడం కాకుండా, యుద్ధ స్వరూపాన్ని మార్చేసే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని అవిష్కర్తలను ఉద్దేశిస్తూ ఆయన పిలుపునిచ్చారు. మనం ఇకనైనా సాంకేతికతలో అనుచరులుగా మిగిలిపోకూడదని, ప్రపంచానికి మార్గదర్శకులుగా మారాలని కోరారు.
స్వదేశీకరణలో నమోదైన గణనీయమైన పురోగతిని వివరిస్తూ.. 2021-22లో రూ. 74,000 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ మూలధన కొనుగోళ్లు, 2024-25 నాటికి రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగాయని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.. ‘‘ఇది కేవలం గణాంకాల మార్పు మాత్రమే కాదని, ఆధారపడే మనస్తత్వం నుంచి ఆత్మవిశ్వాసం వైపు మారిన దృక్పథం’’ అని అభివర్ణించారు. ప్రభుత్వ కొనుగోలు విధానంలో ప్రతి యేటా నిర్వహించే కొనుగోళ్లలో కనీసం 25 శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం కేటాయించినట్లు తెలిపారు. అంతేకాక 350కి పైగా ఉత్పత్తులు వీటి కోసం ప్రత్యేకంగా కేటాయించినట్లు చెప్పారు.‘‘దేశ రక్షణ రంగంలో స్వావలంబన ఒక నినాదం నుంచి ఓ ఉద్యమంగా మారింది. విధానాల నుంచి అమలుకు, ఆవిష్కరణల నుంచి ప్రభావానికి.. ఈ మార్పు మన ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, యువ పారిశ్రామికవేత్తల వల్ల సాధ్యమైంది" అని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అంకుర సంస్థలు ఉన్నత ప్రమాణాలును నిర్దేశించుకోవాలంటూ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రోత్సహించారు. ప్రస్తుతం భారత్లో 100కి పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నప్పటికీ, రక్షణ రంగంలో ఒక్కటైనా యూనికార్న్ లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితిని మార్చాలని అన్నారు. ‘‘దేశ తొలి రక్షణ యూనికార్న్ మీ నుంచి ఉద్బవించాలి. ఇది మీకే కాదు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది’’ అని తెలిపారు. ఆలోచన నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం ఆవిష్కర్తలు, అంకుర సంస్థలకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని అన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు, రూ.23,000 కోట్లకుపైగా ఎగుమతులతో రికార్డు స్థాయి విజయాలు సాధించడంలో దోహదపడిన ఆవిష్కర్తల సమష్టి కృషిని రక్షణశాఖ మంత్రి ప్రశంసించారు. “మీరు స్వయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసే విశ్వాసంతో కూడిన నవ భారత్ కు మీరే రచయితలు. స్వావలంబన కలిగిన భారత్ ను తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసుకోనేందుకు మీరు అందించే శక్తి, ఆవిష్కరణలే కీలకం” అని తెలిపారు.
2018లో ఐడెక్స్ ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటూ.. దేశంలో రక్షణ ఆవిష్కరణలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగిన విప్లవాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు. ఐడెక్స్ ప్రారంభించిన సమయంలో దేశ యువత ప్రతిభను సైనిక బలగాల సాంకేతిక అవసరాలతో అనుసంధానించడానికి ఈ ఆలోచన సాదాసీదాగా కనిపించినా, అది శక్తిమంతమైనదని ఆయన పేర్కొన్నారు. ‘‘కేవలం ఏడు సంవత్సరాలలోనే 650 కంటే ఐడెక్స్ విజేతలు వెలుగుచూశారు. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ప్రోటోటైప్ కొనుగోళ్లను ధ్రువీకరించాం. ఇది భారత రక్షణ ఆవిష్కరణ రంగంలో విప్లవాత్మక పరిణామం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఐడెక్స్ ప్రారంభానికి ముందే భారత ప్రతిభ ప్రపంచస్థాయిలో ముఖ్యంగా ఐటీ, టెలికాం, అంతరిక్ష రంగాల్లో అత్యుత్తమంగా పనిచేస్తోందని.. కానీ రక్షణ రంగంలో తక్కువగా ఉపయోగించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ‘‘ఐడెక్స్ ద్వారా భారత ప్రతిభ దేశ భద్రత కోసం పనిచేయాలని మేం నిర్ధారించుకున్నాం. ఈ చొరవ ప్రస్తుతం కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, దేశ రక్షణ తయారీ భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న ఒక ఉద్యమంగా మారింది’’ అని ఆయన స్పష్టం చేశారు.
అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య వాణిజ్య సంస్థలకు మద్దతుగా ప్రభుత్వం రక్షణ కొనుగోలు, ఉత్పత్తి, పరీక్షా మౌలిక సదుపాయాల్లో అనేక కీలక సంస్కరణలను చేపట్టినట్లు రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉదాహరణకు.. కొత్త రక్షణ కొనుగోళ్ల విధానం (డీపీఎం-2025) ద్వారా అయిదు సంవత్సరాలపాటు నిర్ధారిత ఆర్డర్లు ఇస్తామని అదనంగా మరో అయిదేళ్ళు దీనిని పొడగించవచ్చని చెప్పారు. ఇది ఆవిష్కర్తలకు అవసరమైన స్థిరత్వం, అంచనాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రక్రియలు సులభతరం కావడం, ట్రయల్స్ వేగవంతం చేయడం, వినూత్న పరిష్కారాలకు ఖచ్చితమైన సేకరణను నిర్దారించడం కోసం రక్షణ వ్యయ విధానంలో సవరణలు కొనసాగుతున్నాయని తెలిపారు.
‘‘ఐడెక్స్ సాంకేతిక అభివృద్ధి నిధి, రక్షణ పరీక్షా మౌలిక సదుపాయాల పథకం, స్వీయ ధ్రువీకరణ నిబంధనల ద్వారా ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మద్దతు కలిగించే సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేస్తున్నాం. భారత్ను కేవలం రక్షణ తయారీదారుగా మాత్రమే కాకుండా ప్రపంచానికి రక్షణ ఆవిష్కర్తగా మార్చడమే మా లక్ష్యం.’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించి, ఐడెక్స్ విజేతలుగా నిలిచిన రిఫై ఎం. ఫైబర్, గ్రావిటీ సిస్టమ్స్ వంటి అంకుర సంస్థల విజయాలను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. దేశీయ అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నాయి. ‘‘భారత మట్టిలో పుట్టిన ఆవిష్కరణకు మన సైనికులు సెల్యుట్ చేయడం ఎంతో గర్వకారణం. అనేక భారతీయ స్టార్టప్లు 2025 దుబాయ్ ఎయిర్షో వంటి అంతర్జాతీయ వేదికలపై తమ నూతన సాంకేతికతలను ప్రదర్శిస్తున్నాయి. భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని నేడు ప్రపంచమంతా గమనిస్తోంది’’ అని అన్నారు.
అంకుర సంస్థలకు పూర్తి స్థాయి మద్దతు అందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర, సాంకేతిక శాఖ, పరిశ్రమ ప్రోత్సాహక శాఖ, ప్రముఖ ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరుస్తోందని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ‘‘ప్రతి ఆలోచన ఒక ఉపయోగకరమైన ఉత్పత్తిగా మారడానికి అవకాశం కల్పించే, ప్రతి ప్రోటోటైప్... ఉత్పత్తి స్థాయికి ఎదిగేలా, ప్రతి ఆవిష్కరణ దేశ రక్షణ సన్నద్ధతకు తోడ్పడే వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం” అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా రక్షణ ఉత్పత్తి రంగం ప్రైవేటు పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి, ఉపాధి కల్పనకు అత్యంత ఆశాజనక రంగంగా మారిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. బలమైన స్వదేశీ రక్షణ పరిశ్రమ కేవలం వ్యూహాత్మక అవసరం మాత్రమే కాక, ఆర్థికంగా కూడా బహుముఖ ప్రభావం కలింగించే రంగమని తెలిపారు.
దేశ రక్షణ ఆవిష్కరణ ప్రయాణం ఆలోచన నుంచి అమలుకు, దృష్టి నుంచి విజయం వైపు స్థిరంగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి తెలిపారు. దేశం మొత్తం కలిసి భారత్ను స్వయం సమృద్ధిగా మాత్రమే కాకుండా, రక్షణ సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దుతుందన్నారు. భారతదేశ రక్షణ స్టార్టప్ వ్యవస్థ దేశ భద్రత, స్వయం సమృద్ధి భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.
రక్షణ ఉత్పత్తుల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడెక్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐడెక్స్, అదితి అభివృద్ధి చేసిన అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆవిష్కర్తలతో రక్షణ మంత్రి మాట్లాడుతూ… వారి సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రక్షణ అంకుర సంస్థల విస్తరణ, ఆవిష్కరణను ఉత్పత్తితో అనుసంధానించడం, ఆర్ అండ్ డీ సహకారంతో స్వావలంబనను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చా సమావేశాలు, అనుభవాలను పంచుకునే సమావేశాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, డీడీఆర్ అండ్ డీ కార్యదర్శి, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ, డీడీపీశాఖ సీనియర్ అధికారులు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు, సాయుధ దళాల ప్రతినిధులు, వివిధ రక్షణ పిఎస్యుల అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2176084)
Visitor Counter : 10