వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2030 నాటికి భారత్-ఖతార్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్
దోహలో జరిగిన జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ)లో ప్రసంగించిన భారత్, ఖతార్ వాణిజ్య మంత్రులు
Posted On:
06 OCT 2025 9:54PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అక్టోబర్ 6 నుంచి 7వ తేదీ వరకూ ఖతార్ లోని దోహలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హెచ్ ఈ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కలిసి భారత్-ఖతార్ ఆర్థిక, వాణిజ్య సహకారంపై సంయుక్త వాణిజ్య సమావేశానికి సహాధ్యక్షుడిగా వ్యవహరించారు.
తొలిరోజు పర్యటనలో భాగంగా దోహాలోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారు. ఇది సుస్థిరత, పర్యావరణ పరిరక్షణకు భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
ద్వైపాక్షిక సమావేశంలో ఇరుదేశాల వాణిజ్య, పరిశ్రమల మంత్రులు.. వాణిజ్య, ఆర్థిక సంబంధాలను సమీక్షించారు. ప్రస్తుత వాణిజ్య సమస్యలు ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సహకారానికి నూతన విధానాలపై చర్చించారు.
భారత్-ఖతార్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ (జేబీసీ)లో ఇరు దేశాల మంత్రులతో పాటు ఎఫ్ఐసీసీఐ, సీఐఐ, అసోచామ్ సీనియర్ అధికారులు, ఖతార్ ఛాంబర్, ఇరు దేశాలకు చెందిన వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు, వస్తు సరఫరా వ్యవస్థలో అవాంతరాలున్నప్పటికీ భారతదేశం బలమైన ఆర్థిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇది స్టార్టప్ వ్యవస్థకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ, అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి మెరుగైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ క్రమంలో భారత్, ఖతార్ వాణిజ్యం మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హెచ్ ఈ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కలిసి భారత్-ఖతార్ ఆర్థిక, వాణిజ్య సహకారంపై సంయుక్త సంఘ సమావేశానికి కేంద్రమంత్రి సహాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయటం, ప్రస్తుత వాణిజ్యం, పన్నుయేతర సవాళ్లు, కీలక రంగాల్లో ఆర్థిక సహకారం పెంపుదలకు నూతనావకాశాలను గుర్తించటం వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. భారత్-ఖతార్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పట్ల ఇరుదేశాలు తమ నిబద్ధతను తెలిపాయి. ఖతార్ నుంచి ఇంధన ఎగుమతులు, 2028 నుంచి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్ జీ సరఫరా ఒప్పందాన్ని ప్రశంసించిన శ్రీ పీయూష్ గోయల్, ఖతార్ కు భారత్ నుంచి ఎగుమతులను పెంచాలన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 14 బిలియన్ డాలర్లు ఉందని, 2030 నాటికి దాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం ఇరుదేశాలకు ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాసెస్డ్ ఫుడ్, టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఐటీ, అభివృద్ధి చెందుతున్న హై-టెక్ పరిశ్రమలు, సౌరశక్తి వంటి ఆశాజనక రంగాలున్నాయని ఇరుదేశాల నేతలు గుర్తించారు. మెరుగైన వ్యాపార అవకాశాల ప్రాముఖ్యత, ఆర్థిక సంబంధాలను పెంపొందించటంలో మొదటి జాయింట్ బిజినెస్ కౌన్సిల్ సమావేశం విజయవంతమైందని కేంద్రమంత్రి తెలిపారు.
జాయింట్ బిజినెస్ కౌన్సిల్ సందర్భంగా ఖతార్ సీనియర్ నాయకులు, కార్పొరేట్ నేతలతో మంత్రి శ్రీ గోయల్ ఉన్నతస్థాయి వాణిజ్య సమావేశాలను నిర్వహించారు. దీని ద్వారా భారత్, ఖతార్ సంస్థల మధ్య పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం, జాయింట్ వెంచర్లపై చర్చించే అవకాశం లభించింది. పెర్ల్ ఐలాండ్ లోని లులూ మాల్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పాల్గొనటం.. ఖతార్ తో భారత్ డిజిటల్ సహకారంలో కీలక పాత్రను సూచిస్తుంది. ఖతార్ లోని భారతీయులకు, స్థానిక వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలను సులభతరం చేస్తుంది.
భారత్-ఖతార్ సంబంధాలను బలోపేతం చేస్తున్న ప్రవాస భారతీయులను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అభినందించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు, 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాల ప్రాముఖ్యతను తెలిపారు. ఖతార్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలను, పెరుగుతున్న భారత ఆర్థిక శక్తిని ఆయన అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, 2047 నాటికి వికసిత్ భారత్ గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మిళిత్వం, ఆవిష్కరణ, ప్రపంచ సహకారానికి కట్టుబడి ఉన్నామనీ, ఇరుదేశాల మధ్య వారధిగా, భారత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవటంలో కీలక భాగస్వాములుగా కొనసాగాలని ప్రవాస భారతీయులను కేంద్రమంత్రి కోరారు.
***
(Release ID: 2175839)
Visitor Counter : 18