వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు 2025లో భాగంగా జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (ఎన్సీహెచ్)లో జీఎస్టీ ఫిర్యాదుల పరిష్కారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ
ప్రత్యేక జీఎస్టీ ఉప కేటగిరీ కింద వినియోగదారులకు మరింత సాధికారత కల్పిస్తున్న జాతీయ హెల్ప్లైన్
Posted On:
20 SEP 2025 11:42AM by PIB Hyderabad
కేంద్ర ఆర్థికమంత్రి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఆమోదించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు 2025 తో జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (ఎన్సీహెచ్) ను అనుసంధానించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి వ్యక్తీకరించిన దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
22.09.2025 నుంచి అమలులోకి వచ్చే సవరించిన జీఎస్టీ ఛార్జీలు, రేట్లు, మినహాయింపులను అమలు చేసిన తరువాత వినియోగదారుల నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి, ఐఎన్జీఆర్ఏఎం పోర్టల్లో ప్రత్యేక కేటగిరీని అందుబాటులోకి తెచ్చారు. ఈ కేటగిరీలో ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, దీర్ఘకాల వినియోగ వస్తువులు, ఇ-కామర్స్, ఎఫ్ఎంసీజీ వంటి ప్రధాన ఉప కేటగిరీలు ఉన్నాయి. వీటిలో జీఎస్టీ సంబంధిత ఫిర్యాదులను నమోదు చేస్తారు.
ఈ ఏర్పాటుకు సన్నాహకంగా, జీఎస్టీ సంబంధిత ప్రశ్నలు, ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేలా ఎన్సీహెచ్ కౌన్సెలర్లను సన్నద్ధం చేయడానికి కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (సీబీఐసీ) అధికారులు 11.09.2025న మొదటి శిక్షణా తరగతిని నిర్వహించారు. ప్రముఖ ఇ-కామర్స్ వేదికలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు, దీర్ఘకాల వినియోగ వస్తువుల తయారీ కన్స్యూమర్ కంపెనీల భాగస్వామ్యంతో 17.09.2025న వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి అధ్యక్షతన భాగస్వాముల సలహా సంప్రదింపుల సమావేశం కూడా జరిగింది. నిర్దిష్ట వస్తువులు, సేవలపై జీఎస్టీ రేటు తగ్గింపుల ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని సమావేశంలో పాల్గొన్నవారిని కోరారు.
ఈ విభాగంలో వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని, విశ్లేషణలను సంబంధిత కంపెనీలు, సీబీఐసీ, ఇతర సంబంధిత అధికారులతో హెల్ప్లైన్ పంచుకుంటుంది. తద్వారా సంబంధిత చట్టాల ప్రకారం తక్షణ చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ చర్య జీఎస్టీ కట్టుబాటును బలోపేతం చేస్తుందని, సహేతుకమైన మార్కెట్ పద్ధతులలో వినియోగదారులు చురుకైన వాటాదారులుగా మారేలా భాగస్వామ్య పాలనా నమూనాను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (www.consumerhelpline.gov.in) దేశవ్యాప్తంగా వినియోగదారులు తమ ఫిర్యాదులను న్యాయ ప్రక్రియకు ముందున్న దశలో నమోదు చేసుకునే ఏకైక వేదికగా ఆవిర్భవించింది. వినియోగదారులు ఇప్పుడు 17 భాషల్లో (హిందీ, ఇంగ్లీష్, కాశ్మీరి, పంజాబీ, నేపాలి, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మైథిలీ, సంతాలి, బెంగాలీ, ఒడియా, అస్సామీ, మణిపురి) తమ ఫిర్యాదులను టోల్-ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం (ఐఎన్జీ ఆర్ఏఎం) ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ ఐటీ ఆధారిత ఓమ్ని-చానల్ వేదిక వినియోగదారులకు సౌలభ్యాన్ని, సానుకూలతను అందిస్తూ, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇమెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమాంగ్ యాప్ వంటి అనేక రకాల రిజిస్ట్రేషన్ విధానాలకు మద్దతు ఇస్తుంది.
ఎన్సీహెచ్ క్రమంగా ప్రైవేట్ కంపెనీలు, రెగ్యులేటర్లు, అంబుడ్స్ మన్, ప్రభుత్వ ఏజెన్సీలతో కూడిన 1,142 భాగస్వాములతో కలిసి బలమైన వ్యవస్థగా అభివృద్ధి చెందింది. తద్వారా కేంద్రీకృత, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారాన్ని సాధ్యమయ్యేలా చేసింది. ప్రతి ఫిర్యాదుకూ పారదర్శకంగా ట్రాకింగ్, పరిష్కారం కోసం ప్రత్యేకమైన డాకెట్ నంబర్ కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ వేదికకు నెలకు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది వినియోగదారుల పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎన్సీహెచ్ లో చేసిన సాంకేతిక మార్పు దాని కాల్-హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. 2015 డిసెంబర్లో 12,553 కాల్స్ మాత్రమే స్వీకరించిన ఎన్సీహెచ్ 2024 డిసెంబర్ నాటికి 1,55,138 కాల్స్ అందుకుని పది రెట్లుపైగా వృద్ధి సాధించింది. ఇంతటి పెరుగుదల, హెల్ప్లైన్పై వినియోగదారులకు పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా, ప్రతి నెలా నమోదయ్యే సగటు ఫిర్యాదుల సంఖ్య 2017లో 37,062 నుంచి 2025 నాటికి 1,70,585కి పెరిగింది. డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టడంతో, హెల్ప్లైన్లోని దాదాపు 65% వినియోగదారుల ఫిర్యాదులు ఆన్లైన్ డిజిటల్ ఛానెళ్ల ద్వారా నమోదు అయ్యాయి.
***
(Release ID: 2169068)