పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
వర్షాకాల విరామానంతరం చార్ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవలకు ఆమోదం తెలిపిన డీజీసీఏ
సురక్షిత, నిరంతరాయ నిర్వహణకు వీలుగా
మరిన్ని భద్రతా చర్యలతో హెలికాప్టర్ సేవలు పునఃప్రారంభం
చర్యలు తీసుకున్న పౌర విమానయాన మంత్రి శ్రీ రాంమోహన్ నాయుడు,
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ
డీజీసీఏకు, ఏఏఐకీ, ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థల మధ్య సమన్వయం
Posted On:
18 SEP 2025 5:50PM by PIB Hyderabad
వర్షాకాల విరామం తరువాత.. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రకు సంబంధించిన హెలీకాప్టర్ సేవలను ఈ నెల 15, 16 తేదీల నుంచి పునఃప్రారంభించడానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతిని ఇచ్చింది.
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రాంమోహన్ నాయుడు నాయకత్వంలో సమగ్రంగా సమీక్షించిన అనంతరం చార్ధామ్ యాత్రను మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సురక్షితంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలను చేపట్టారు. భద్రత పరంగా ఎలాంటి లోటుపాట్లనూ సహించేది లేదని ఆదేశాలు జారీ చేస్తూ, ఈ యాత్ర సురక్షితంగా ఉండేటట్లు చూడాలనీ, అవసరమైన కఠిన చర్యలన్నింటినీ తీసుకోవాలనీ డీజీసీఏకు ఆదేశాలిచ్చారు.
డీజీసీఏ, ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థ (యూసీఏడీఏ) మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏర్పరిచేందుకు మంత్రి శ్రీ రాంమోహన్ నాయుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీతో కలిసి డెహ్రాడూన్లో, ఢిల్లీలో అనేక సార్లు సమావేశాలను నిర్వహించారు.
మంత్రి ఆదేశించిన ప్రకారం, డీజీసీఏ బృందం ఈ నెల 13-16 తేదీల మధ్య అన్ని హెలీప్యాడ్లు, హెలీకాప్టర్లతో పాటు హెలీకాప్టర్ సేవానిర్వహణ సంస్థల సన్నద్ధత చర్యలను, సహాయక వ్యవస్థలను సమగ్రంగా పరీక్షించడంతో పాటు తనిఖీలను కూడా పూర్తి చేసింది. హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు యూసీఏడీఏకూ, హెలికాప్టర్ సేవల నిర్వహణ సంస్థలకూ ఆమోదం తెలిపారు.
దీనికి తోడు, హెలీకాప్టర్ సేవల నిర్వహణ సంస్థలతో పాటు పైలట్లందరికీ ఈ యాత్రలో ఎదురయ్యే సవాళ్లు, తీర్థయాత్ర నిర్వహణ కార్యకలాపాలు, అదనపు భద్రత చర్యలన్నింటినీ డీజీసీఏ సమగ్రంగా తెలియజేసింది.
హెలికాప్టర్లలో చార్ధామ్ యాత్ర రెండు దశలలో సాగుతుంది: మొదటి దశ.. డెహ్రాడూన్ (సహస్త్రధార) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు చార్టర్ సేవలు. రెండో దశ.. గుప్త్కాశీ, ఫాటా, సీతాపుర్ క్లస్టర్ నుంచి శ్రీ కేదార్నాథ్ జీ హెలీప్యాడ్ వరకు షటిల్ సేవలు. మొత్తం ఆరు హెలీకాప్టర్ ఆపరేటర్లు (హెలీకాప్టర్ సేవల నిర్వహణ సంస్థలు) గుప్త్కాశీ, ఫాటా, సీతాపుర్ క్లస్టర్ నుంచి హెలీకాప్టర్ షటిల్స్ను నడుపుతాయి. ఏడు హెలీకాప్టర్ సేవల నిర్వహణ సంస్థలు, సంఘాలు (కన్సార్టియమ్లు) డెహ్రాడూన్ (సహస్త్రధార) నుంచి చార్టర్ సేవలను అందిస్తాయి.
ఉత్తరాఖండ్లో అతి ఎత్తయిన ప్రాంతాల్లోను, సుదూర ప్రాంతాల్లోను నెలకొన్న తీర్థస్థలాల వద్దకు యాత్రికుల రాకపోకలను సులభతరం చేయడానికి హెలీకాప్టర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. డీజీసీఏ సురక్షిత, నిరంతరాయ సేవలను అందించే దృష్టితో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకున్నారు. చార్ధామ్ యాత్రకు సంబంధించిన హెలీకాప్టర్ సేవల నిర్వహణపై డీజీసీఏ నిరంతరం నిఘా ఉంచుతుంది. ఈ ఏడాది మే-జూన్ నెలల్లో చార్ధామ్ సెక్టర్లో హెలీకాప్టర్ దుర్ఘటనలు అనేకం చోటుచేసుకొన్న నేపథ్యంలో, హెలీకాప్టర్ సేవలను సురక్షితంగా నిర్వహించడానికి సంబంధించి వివిధ ఉన్నతాధికారులు నిర్దిష్ట చర్యలను సిఫారసు చేశాయి. ఏఏఐ ఆధ్వర్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లనూ, ఐఎండీ పక్షాన వాతావరణ అధ్యయన అధికారులనూ, అలాగే యూఏసీఏడీఏ తరఫున కంట్రోల్ రూముల్లో అర్హులైన సిబ్బందినీ నియమించి, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
డీజీసీఏ అమలుచేసిన ముఖ్య భద్రత కార్యక్రమాల్లో ఈ కింద ప్రస్తావించినవి కొన్ని :
పైలట్ల అర్హతతో పాటు శిక్షణ పటిష్ఠీకరణ
-
చార్ధామ్ సెక్టర్లో విధులు నిర్వహించే పైలట్లందరికీ మార్గ తనిఖీతో పాటు తరచుగా శిక్షణ తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు.
-
ఎక్కువ ఎత్తులో నిర్వహణ, వాతావరణ పరంగా ప్రతికూల స్థితిని ఎదురైనప్పుడు ప్రతిస్పందన, క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్లపై ప్రత్యేక శ్రద్ధ.
-
ఈ రంగంలో పూర్వానుభవం ఉన్న అర్హులైన పైలట్లను మాత్రమే నియమించడం.. వంటివి ఉన్నాయి.
గగనయాన యోగ్యతను ఉన్నత స్థాయిలో పరీక్షించడం
నిర్వహణ పరంగా వివిధ భద్రతా చర్యలు
-
సవాళ్లతో కూడిన ప్రాంతంలో సురక్షిత యానంతో పాటు ల్యాండింగ్ కూడా సురక్షిత రీతిన జరిగేలా బరువు, సమతౌల్యం పరిమితులను కచ్చితంగా పాటించేలా చూడడం.
-
పరిస్థితి ఎలా ఉందీ తెలుసుకోవడానికి ఆధునిక నేవిగేషన్, కమ్యూనికేషన్ సహాయక ఉపకరణాలను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేశారు.
-
ఒక ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి పైలట్లకు రియల్ టైంలో తాజా సమాచారం ఇవ్వడంతోపాటు వాతావరణ పర్యవేక్షణకు ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని సమకూర్చడం.
-
ఎయిర్ ట్రాఫిక్ సర్వీసుల మార్గదర్శకత్వాన్ని వినియోగించుకోవడం..
ప్రయాణికుల సురక్షతో పాటు వారి అవగాహనను పెంచడం
-
హెలీకాప్టర్లో కూర్చొనే ముందే ప్రయాణికులందరికీ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. సీటు బెల్టును ధరించడం, సురక్షితంగా ఎక్కడం, దిగడం తాలూకు సమాచారాన్ని అందించడంతో పాటు, అత్యవసర స్థితిలో ఏయే జాగ్రత్తచర్యలు అవలంబించాలో తెలియజేస్తారు.
-
ప్రయాణికుల రాకపోకల్లో సహాయంతో పాటు వారిని నియత్రించడం కోసం హెలీప్యాడ్ వద్ద గ్రౌండ్ సేఫ్టీ సిబ్బందిని మరింత మందిని నియమిస్తారు.
-
నియంత్రణ సంబంధిత పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలపరచడం
-
భూమి మీది నుంచి పర్యవేక్షణ నిమిత్తం ముఖ్యమైన హెలీప్యాడ్ల వద్ద డీజీసీఏ ఫ్లయిట్ ఆపరేషన్స్ బృందాలతో పాటు విమానయాన యోగ్యత బృందాలను మోహరిస్తారు.
భద్రత పరమైన ఆదేశాలను తుచ తప్పక పాటిస్తున్నదీ లేనిదీ సరిచూడడానికి ఆకస్మిక తనిఖీలు చేస్తారు.
విమానయాన పరంగా అత్యున్నత స్థాయి భద్రతను అందించేందుకు డీజీసీఏ కట్టుబడి ఉంది. ప్రయాణికుల భద్రతతో పాటు హెలీకాప్టర్ల సిబ్బంది భద్రత కూడా అన్నింటి కన్నా మిన్నగా పరిగణిస్తామని పునరుద్ఘాటించింది. చార్ధామ్ యాత్రను దృష్టిలో పెట్టుకొని హెలీకాప్టర్ సేవలను పునఃప్రారంభించడంతో, ఈ పవిత్ర తీర్థస్థలాల వద్దకు చేరుకోవడానికి యాత్రికులకు సురక్షిత, సమర్థ, విశ్వసనీయ రవాణా సాధనాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
***
(Release ID: 2168774)
Visitor Counter : 9