హోం మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) అధిపతుల రెండో జాతీయ సమావేశంలో మాట్లాడిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ఎన్సీబీ చేపడుతోన్న మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించి 11 చోట్ల రూ. 4,800 కోట్ల విలువైన 1.37 లక్షల కిలోల మాదక ద్రవ్యాల్ని ధ్వంసం చేసిన మంత్రి
చిన్న మాదకద్రవ్యాల ముఠాలపైనే కాకుండా పెద్ద ముఠాలపై కూడా
చర్యలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం: శ్రీ అమిత్ షా
మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థ పట్ల కఠిన విధానాన్ని అవలంబిస్తోన్న ప్రభుత్వం: శ్రీ అమిత్ షా
డిమాండ్ తగ్గింపు దిశగా వ్యూహాత్మక విధానాన్ని,
ముప్పు తగ్గింపు దిశగా మానవీయ విధానాన్ని అనుసరిస్తోన్న ప్రభుత్వం: శ్రీ అమిత్ షా
మరింత కఠినంగా వ్యవహరిస్తాం...: శ్రీ అమిత్ షా
ప్రవేశ ప్రాంతాలు, పంపిణీ వ్యవస్థ నుంచి దేశంలోని స్థానిక మాదకద్రవ్యాల అమ్మకాల వరకు సూత్రదారులకు దెబ్బ మీద దెబ్బ: శ్రీ అమిత్ షా
విదేశాల నుంచి మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసేవాళ్లపై
చట్టానికి అనుగుణంగా చర్యలు... బహిష్కరణ శిక్ష: అమిత్ షా
ఏఎన్టీఎఫ్ అధిపతులూ... మీ మీ ప్రాంతాల్లో
కృత్రిమ మాదకద్రవ్యాలను గుర్తించండి..ధ్వంసం చేయండి: అమిత్ షా
Posted On:
16 SEP 2025 6:39PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ఢిల్లీలో జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) అధిపతుల రెండో జాతీయ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) వార్షిక నివేదిక-2024ను విడుదల చేసిన ఆయన.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న మాదకద్రవ్య నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరుగుతోన్న ఈ సమావేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్సీబీ డైరెక్టర్ జనరల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్సీబీ, హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ), కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏఎన్టీఎఫ్ బృందాలు యాజమాన్య బాధ్యతతో ముందుకు సాగినప్పుడే మాదకద్రవ్య రహిత భారత్ ను సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన గొప్ప భారత్ తయారవ్వాలని ప్రధాని భావిస్తున్నారని.. ఈ దార్శనికతను సాకారం చేసుకోవటానికి యువతను మాదకద్రవ్యాల నుంచి రక్షించడం అనేది చాలా కీలకమని పేర్కొన్నారు. ఏ దేశానికైనా పునాది యువత అన్న ఆయన.. భవిష్యత్ తరాలు ఖాళీగా వ్యర్థమైపోతే దేశం పురోగతి గమనాన్ని కోల్పోతుందని అన్నారు.
మాదకద్రవ్యాల విషయంలో చిన్నపాటి ముఠాలతో పాటు పెద్ద ముఠాలపై మోదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో భాగంగా చేపడుతోన్న కార్యక్రమాలు, వాటి అమలును మరింత కఠినతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో మాదకద్రవ్యాల ప్రవేశం, పంపిణీ, స్థానిక విక్రయం, సూత్రధారులే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పోరాటం ఇకపై చిన్న తరహా మాదకద్రవ్యాల ముఠాలను పట్టుకోవటానికి మాత్రమే పరిమితం కాదని.. దేశంలోకి చొరబడే వాళ్లు కొందరు, అక్కడి నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసేవాళ్లు, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో మాదకద్రవ్యాలను విక్రయించే వాళ్లు... ఇలా మూడు స్థాయుల్లో ముఠాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ మూడు స్థాయుల్లో మాదకద్రవ్యాలపై పనిచేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసులతో కూడిన ఉన్నత స్థాయి వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ముఠాలను అరికట్టేందుకు డార్క్నెట్ విశ్లేషణ, క్రిప్టోకరెన్సీ ట్రాకింగ్, కమ్యూనికేషన్ నమూనాల విశ్లేషణ, రవాణా, ఆర్థిక ప్రవాహ విశ్లేషణ, మెటాడేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ నమూనాల వంటి సాంకేతికతలను ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతోన్న కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఈ పోరాటాన్ని సొంతదిగా భావిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంవత్సరంలో 12 రోజులను ఈ పోరాటానికి అంకితం చేయాలని భాగస్వాములను కోరిన ఆయన.. ఇటువంటి సంకల్పం లేకుండా, ముందుకెళ్లడం సాధ్యం కాదన్నారు.
మాదకద్రవ్య రహిత భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా 372 జిల్లాల్లో ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతోందని.. 10 కోట్ల మంది ప్రజలు, 3 లక్షల విద్యా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని హోం మంత్రి తెలిపారు. ఇది సరిపోదనీ, ఈ కార్యక్రమం ప్రతి జిల్లా, విద్యా సంస్థకు చేరుకోవాల్సి ఉందన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రాలు ఉపయోగించుకునేందుకు వీలున్న డ్రగ్ నెట్వర్క్ చార్ట్ను ఎన్సీబీ యూనిట్లు తయారు చేశాయని ఆయన వెల్లడించారు. డార్క్నెట్, క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను వేగిరం చేసేందుకు మానస్ (మాదక్ పదార్థ్ నిషేధ్ ఆసుచ్న కేంద్రం) హెల్ప్లైన్ వినియోగాన్ని పెంచేందుకు కృషి జరుగుతోంది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, సంస్థలలో మాదకద్రవ్య రహిత క్యాంపస్ మిషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక (పీఐటీఎన్డీపీఎస్) చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 18 కేసులను నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు (360 డిగ్రీ) చేస్తోందని తెలిపారు. దీనితో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన 35కి పైగా కేసులను కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభం అయిందన్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
మాదకద్రవ్య రహిత భారత్ కార్యక్రమంలో ఏఎన్టీఎఫ్, జాతీయ మాదకద్రవ్యాల కోఆర్టినేషన్ పోర్టల్(నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్- ఎన్సీఓఆర్డీ) నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న అమిత్ షా.. దాని విజయం జిల్లా స్థాయిలోని పోలీసులు, విద్యాశాఖ అధికారుల అవగాహనపై ఆధారపడి ఉంటుందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఈ కార్యక్రమంలో మత పెద్దలు, యువజన సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయి ఎన్సీఓఆర్డీ సమావేశాల సంఖ్య పెరిగినప్పటికీ.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 272 జిల్లాలు ఒక్క ఎన్సీఓఆర్డీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ సమావేశాలను నిర్వహించేలా జిల్లా కలెక్టర్లను ప్రోత్సహించాలని, దీని కోసం ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని ఏఎన్టీఎఫ్ అధిపతులను కోరారు.
పరారీలో ఉన్న వాళ్లను బహిష్కరించడం, అప్పగించటం అనే అంశాల ప్రాముఖ్యతను కేంద్ర హోం, సహకార మంత్రి వివరించారు. విదేశాల నుంచి మాదకద్రవ్య వ్యాపారాలను నిర్వహిస్తున్న వారిని భారత చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఆసన్నమైందన్న ఆయన.. ఈ విషయంలో మెచ్చుకోదగిన పని చేసిన కేంద్ర విచారణ సంస్థను (సీబీఐ) ప్రశంసించారు. మాదకద్రవ్యాలపై మాత్రమే కాకుండా ఉగ్రవాదం, ముఠా సంబంధిత నేరాలకు కూడా ప్రభావవంతమైన, బలమైన అప్పగింత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సీబీఐ డైరెక్టర్తో సమన్వయం చేసుకోవాలని ఏఎన్టీఎఫ్ అధిపతులను కోరారు. అప్పగింత ఎంత ముఖ్యమైనదో బహిష్కరణ విషయంలో కూడా ఆచరణాత్మక విధానం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. నేరస్థులను బహిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉండేలా చూసుకునేందుకు బహిష్కరణ ప్రక్రియలో ఉదారవాద విధానాన్ని అవలంబించాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఉన్న విదేశీ నేరస్థులను, తప్పించుకుపోయిన నేరగాళ్లను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎన్సీబీ, సీబీఐ, రాష్ట్ర పోలీసులతో కూడిన ఉమ్మడి యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుందన్నారు.
రాబోయే రోజుల్లో కృత్రిమ మాదకద్రవ్యాలు, చీకటి ప్రయోగశాలల ధోరణి పెరిగే అవకాశం ఉందని హోంమంత్రి హెచ్చరించారు. ప్రతి రాష్ట్రానికి చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు అప్రమత్తంగా ఉండాలని.. అటువంటి ప్రయోగశాలలు, కృత్రిమ మాదకద్రవ్యాలను గుర్తించి నాశనం చేయాలని ఆయన కోరారు. గత సంవత్సరంలో ఈ విషయంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు చెబుతూ… అటువంటి చీకటి ప్రయోగశాలలు, మాదకద్రవ్యాల తయారీని పూర్తిగా నిరోధించాల్సి ఉందన్నారు. మాదకద్రవ్యాల లభ్యం కాని పరిస్థితి ఉంటే వాటిని వాడే వాళ్లు వైద్య సహాయం కోసం ముందుకు వస్తారని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సుమారు రూ. 4,800 కోట్ల విలువైన సుమారు 1,37,917 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్లు శ్రీ అమిత్ షా తెలియజేశారు. పోలీసుల అదుపులో ఉన్న మాదకద్రవ్యాలు కూడా ముప్పును కలిగిస్తాయన్న ఆయన.. ప్రతి రాష్ట్రంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వాధీనంలో ఉన్న మాదకద్రవ్యాలను నాశనం చేసేందుకు ఒక శాస్త్రీయ విధానాన్ని తయారు చేసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి, క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి అనే ద్విముఖ వ్యూహం అవసరమని కేంద్ర హోం మంత్రి చెప్పారు. గణాంకాలను తయారుచేయటం కాదు... అటువంటి గణాంకాలు అవసరం లేని భారత్ను నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి- క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి అనే విధానాన్ని అవలంబించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు
వ్యవస్థల ఉమ్మడి నిర్మాణం, కార్యాచరణలో ఏకరూపత చాలా ముఖ్యమైన అంశమని శ్రీ అమిత్ షా అన్నారు. ఉత్తమ పద్ధతుల మార్పిడి, వాటిని అమలు చేయటం ద్వారా మాత్రమే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జాతీయ స్థాయి ఎన్ఓపీలో భాగంగా రాష్ట్రలకు ప్రత్యేకించిన ప్రామాణిక కార్యనిర్వహణ విధానాలను (ఎస్ఓపీ) తయారు చేయవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి యంత్రాంగాన్ని తయారు చేయనట్లయితే ఈ పోరాటంలో మనం చాలా వెనుకబడిపోతామని ఆయన హెచ్చరించారు. కనీసం ప్రతి ఒక్క ప్రధాన మాదకద్రవ్యాల కేసులోనైనా మొత్తం నెట్వర్క్ను గుర్తించడానికి జాతీయ నిఘా గ్రిడ్ను (నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్- న్యాట్గ్రిడ్) ఉపయోగించేందుకు ప్రయత్నించాలని అమిత్ షా సూచించారు. ఇది కేసును బలోపేతం చేయడమే కాకుండా మొత్తం నెట్వర్క్ను విజయవంతంగా విచ్ఛిన్నం చేయడానికి కూడా వీలు కల్పిస్తుందన్నారు. మాదకద్రవ్యాలపై జరిగే పోరాటంలో రాష్ట్రాలకు సహాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం ఎటువంటి అవకాశాన్ని విడిచిపెట్టటం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. దర్యాప్తు చేపట్టిన తీరు, కేసును గుర్తించేందుకు జిల్లా పోలీసులు చేసిన కృషితో కూడిన మాదకద్రవ్యాల నిరోధక చర్యల చెక్లిస్ట్ను సిద్ధం చేయాలని ఆయన ఏఎన్టీఎఫ్ అధిపతులను కోరారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ చెక్లిస్ట్ను సమీక్షించడం ద్వారా మాదరద్రవ్యాలకు సంబంధించిన పోరాటం క్షేత్ర స్థాయికి చేరుతుందని ఆయన అన్నారు.
ఆర్థిక లావాదేవీల ఆనుపానుల్నీ, హవాలా లింకులను పసిగట్టేందుకూ, క్రిప్టో లావాదేవీలను పర్యవేక్షించడానికి, సైబర్ తనిఖీలను నిర్వహించేందుకు... ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర హోం, సహకార మంత్రి సూచించారు. అప్పుడే మనం ఈ పోరాటంలో నిర్ణయాత్మకంగా పోరాడగలమని అన్నారు. ప్రతి రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పనిచేసే ఫోరెన్సిక్ పరీక్ష కేంద్రం కూడా ఉండాలని.. తద్వారా నేరస్థులు సులభంగా బెయిల్ పొందలేరని ఆయన అన్నారు. అర్హత ఉన్న అన్ని కేసులలో పీఐటీఎన్డీపీఎస్ను అమలు చేసేందుకు ఏ విధమైన సంకోచం ఉండకూడదని, ఎన్సీబీ ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిచిన కేసులను అధ్యయనం చేయడం ద్వారా ప్రతి రాష్ట్రంలో దర్యాప్తు వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
రాష్ట్ర స్థాయి ఎన్సీఓఆర్డీ సమావేశాల నివేదికలను పోర్టల్లో సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అన్నారు. మానస్ హెల్ప్లైన్ నంబర్ అయిన 1933ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కఠిన విధానాన్ని అవలంబించటం, డిమాండు తగ్గింపు కోసం వ్యూహాత్మక విధానాన్ని పాటించటం, హానిని తగ్గించే విషయంలో మానవీయంగా వ్యవహరించడం అనే త్రిముఖంయ వ్యూహానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అమిత్షా సూచించారు.
2004 నుంచి 2013 వరకు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు 2.6 మిలియన్ కిలోలని, వీటి విలువ రూ. 40,000 కోట్లు అని కేంద్ర హోం మంత్రి తెలియజేశారు. 2014 నుంచి 2025 వరకు ఇది రూ. 1.65 లక్షల కోట్ల విలువైన 1 కోటి కిలోలకు పెరిగిందని తెలిపారు. సమన్వయంతో కృషి చేసినప్పుడు విజయం సాధిస్తామని ఆయన అన్నారు. వ్యూహాత్మక విధానంతో మన కార్యక్రమానలను వేగవంతం చేయాలన్న ఆయన.. అప్పుడే మనం మాదకద్రవ్య రహిత భారత్ దార్శనికతను సాకారం చేసుకునే స్థాయికి చేరుకోగలమని ఉద్ఘాటించారు.
2004 -2014 మధ్య రూ. 3.63 లక్షల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేశామన్న అమిత్ షా.. 2014, 2025 మధ్య రూ. 35.21 లక్షల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2004, 2014 మధ్య వాస్తవానికి నాశనం చేసిన మాదకద్రవ్యాల విలువ రూ. 8,150 కోట్లు కాగా.. 2014 నుంచి 2025 వరకు ఇది రూ. 71,600 కోట్లకు పెరిగిందని అన్నారు. 2020లో మాదకద్రవ్యాల మొక్కల సాగుకు ఉపయోగించిన 10,700 ఎకరాల పంట భూముల్ని నాశనం చేసినట్లు తెలిపిన ఆయన.. ఇది 2021లో 11,000 ఎకరాలు, 2022లో 13,000 ఎకరాలు, 2023లో 31,761 ఎకరాలకు చేరుకుందన్నారు. గంజాయి సాగు కోసం ఉపయోగించిన భూమిని నాశనం చేయటం కూడా 21,000 ఎకరాల నుంచి 34,000 ఎకరాలకు పెరిగింది. 2004 నుంచి 2014 వరకు 1.73 లక్షల మందిని అరెస్టు చేయగా.. 2014, 2025 మధ్య 7.61 లక్షల మందిని అరెస్టు చేసినట్లు శ్రీ అమిత్ షా వెల్లడించారు. సమస్య స్థాయితో పోల్చితే ఈ విజయం ఇప్పటికీ చిన్నదేనని.. విజయం సాధించాలంటే చేసే కృషిని అనేక రెట్లు పెంచాలని ఆయన అన్నారు.
***
(Release ID: 2167467)
Visitor Counter : 2