జాతీయ మానవ హక్కుల కమిషన్
ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యూఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ సదస్సు: ఇతివృత్తం: రీవాంపింగ్ స్పేసెస్, రీక్లయిమింగ్ వాయిసెస్ తేదీ: సెప్టెంబర్ 4, 2025
Posted On:
02 SEP 2025 1:07PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లోని స్టెయిన్ ఆడిటోరియంలో 2025, సెప్టెంబర్ 4, గురువారం ట్రాన్స్జెండర్ల హక్కులపై జాతీయ స్థాయి సదస్సును భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నిర్వహిస్తుంది. ‘‘రీవాంపింగ్ స్పేసెస్, రీక్లయిమింగ్ వాయిసెస్’’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో వ్యవస్థీకృత వివక్షపై పోరాడటం, జీవిత అనుభవాలను మెరుగుపరచడం, అన్ని ప్రదేశాల్లోనూ ట్రాన్స్జెండర్ల అర్థవంతమైన సమ్మిళిత్వాన్ని ప్రోత్సహించాల్సిన తక్షణావసరంపై దృష్టి సారిస్తారు. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ శ్రీ వీ రామసుబ్రమణియన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రభుత్వ అధికారులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు, విధాన రూపకర్తలు, పౌర సంఘాలు, ప్రజా నాయకులు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు, పత్రికా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి లభించే అవకాశాలు, వారి హక్కులకు హామీ ఇచ్చే.. విధాన ప్రాధాన్యాలపై ఒక రోజు పాటు నిర్వహించే ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు.
ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమంపై చర్చించేందుకు జాతీయ వేదికను తయారు చేయడం, ట్రాన్స్జెండర్ పర్సన్స్ చట్టం- 2019, స్మయిల్ పథకం, లాంటి న్యాయపరమైన ప్రొవిజన్లు, సంక్షేమ పథకాల అమలును సమీక్షించడం, సంస్థాగత సంరక్షణను బలోపేతం చేయడానికి, చులకన భావాన్ని తగ్గించడానికి, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ఆచరణ సాధ్యమైన విధాన సంస్కరణలను సూచించడమే ఈ సదస్సు లక్ష్యం. అలాగే చట్టాన్ని అమలు చేసే సంస్థల్లో జవాబుదారీతనం, చైతన్యం ఉండేలా నిర్ధారిస్తూనే.. ట్రాన్స్జెండర్ల స్వరాన్ని, పోరాడేతత్వాన్ని గౌరవిస్తూ భారతీయ సామాజిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని కూడా గుర్తిస్తుంది.
భారతీయ సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎల్లప్పుడూ ఒక భాగంగా ఉన్నారు. తెర వెనుక సాగించే ప్రయాణం నుంచి గుర్తింపు వరకు సమ్మిళిత్వం దిశగా వారి పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఒకప్పుడు ఇతిహాసాలు, సంప్రదాయాలు, సామాజిక ఆచారాల్లో మన్నన పొందిన ఈ వర్గానికి కాలక్రమేణా గౌరవం, సామాజిక హోదా తగ్గుతూ వచ్చాయి. ఫలితంగా ఆమోదం, సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితులు ఎదురయ్యాయి.
స్వాతంత్రం వచ్చిన తర్వాతి దశాబ్దాల్లో సమానత్వం, గౌరవం, వివక్ష రహిత రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ భారత్లోని ట్రాన్స్జెండర్లు నిరాదరణకు, అణచివేతకు గురవుతున్నారు. అయితే.. వీరి సంకల్పానికి పౌర సమాజం, సామాజిక, న్యాయపరమైన సహకారం తోడవడంతో.. ఈ కథ సరికొత్త రూపం సంతరించుకుంటోంది. స్వీయగుర్తింపును ప్రాథమిక హక్కుగా, ట్రాన్స్జెండర్లను ‘‘థర్డ్ జెండర్’’గా గుర్తిస్తూ.. ఎన్ఏఎల్ఎస్ఏ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014)లో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. వివక్షను రూపుమాపి, సంక్షేమానికి, సమ్మిళిత్వానికి విధాన ప్రక్రియను రూపొందించే ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్, 2019 ద్వారా ఈ గుర్తింపు మరింత బలోపేతం అయింది.
విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతకు సమాన అవకాశాలకు హామీ ఇవ్వాలని కోరుతూ 2023లో ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి సమగ్ర సూచనలు జారీ చేయడం ద్వారా... ఈ ప్రయాణాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు తీసుకెళ్లింది. వెనకబాటుతనం నుంచి గౌరవం పొందే వరకు, నిశ్శబ్దం నుంచి స్వరాన్ని వినిపించేంత వరకు, బహిష్కరణ నుంచి సమ్మిళిత్వం వరకు సాగుతున్న స్థిరమైన ప్రయాణాన్ని ఈ విజయాలు సూచిస్తాయి. ఈ సానుకూల మార్పుల ఆధారంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు.. సమ్మిళిత్వానికి నూతన అవకాశాలను వెతకడంతో పాటు.. ప్రతి ట్రాన్స్జెండర్ గౌరవం, అవకాశం, గర్వంతో నివసించేలా హామీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
నిరాశ్రయులైన వయోజన ట్రాన్స్జెండర్లకు సురక్షితమైన ఆవాసం, సమగ్ర సాయం అందించేందుకు గరిమా గృహ కార్యక్రమాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆరంభించింది. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12 షెల్టర్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకం స్మయిల్ లో విలీనమైంది. సురక్షితమైన ఆశ్రయం, అవసరమైన సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాలతో సహా ఏడాది వరకు తాత్కాలిక పునరావాసాన్ని లక్షిత లబ్ధిదారులకు ఈ పథకం అందిస్తుంది. తద్వారా గౌరవం, స్వాతంత్ర్యంతో సమాజంలో పునరేకీకృతమయ్యేలా చేస్తుంది.
ప్రగతిశీల లక్ష్యాలు ఉన్నప్పటికీ, నిధుల విడుదలలో జాప్యం, నిర్వహణా సవాళ్లు, వ్యవస్థాగత అంతరాలను ఈ పథకం ఎదుర్కొంటోంది. పరిమిత కవరేజీ, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం, లక్షిత లబ్ధిదారులలో తక్కువ అవగాహన, ప్రభావంతంగా సామాజిక పునరేకీకరణ చేయడంలో ఇబ్బందులు వంటి సమస్యలను గరిమా గృహ ఆశ్రయాలు ఎదుర్కొంటున్నాయి. ఈ వర్గానికి ఉన్న సున్నితత్వాన్ని, ఈ సవాళ్లను అర్థం చేసుకొని, ఈ కార్యక్రమం తన లక్ష్యాలను సమగ్రంగా నెరవేరుస్తోందని నిర్దారించుకోవడానికి, గరిమా గృహ నిర్వహణలో వాస్తవాలను అంచనా వేయడానికి ఎన్హెచ్ఆర్సీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇలాంటి పునరావాస కార్యక్రమాలను మెరుగ్గా అమలు చేయడం, పర్యవేక్షించడం ద్వారా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమాన్ని నిలబెట్టడానికి కమిషన్కున్న అంకితభావంలో ఈ అంచనా ఓ భాగం.
ఈ పర్యటనల ఫలితాల ఆధారంగా.. ట్రాన్స్జెండర్ల హక్కులు, వారి గౌరవాన్ని కాపాడే విధానాలు, నిబంధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సమగ్ర నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల అమలులో అంతరాలను గుర్తించడం, ప్రభావవంతమైన ప్రయేమాలను తెలియజేయడం ద్వారా విధాన సంస్కరణలకు ఆధార సహితమైన సిఫార్సులను ఈ పరిశోధన అందిస్తుంది. ఈ ప్రయత్నాల కొనసాగింపుగా.. కీలకమైన అంశాలను చర్చించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులపై జాతీయ సమావేశాన్ని కమిషన్ నిర్వహిస్తోంది.
ఈ జాతీయ సదస్సును నాలుగు సెషన్లు, ఒక ముగింపు కార్యక్రమంగా రూపొందించారు. ప్రతి సెషన్ కీలకమైన ప్రాధాన్యాంశాలపై దృష్టి సారిస్తుంది. క్షేత్ర స్థాయి పర్యటనల్లో ఎన్హెచ్ఆర్సీ కనుగొన్న అంశాలను సమర్పిస్తూ.. స్మయిల్ పథకం ద్వారా గరిమా గృహ షెల్టర్లను బలోపేతం చేయడంపై మొదటి కార్యక్రమంలో సమీక్షిస్తారు. అలాగే.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యసేవలు, విద్య, జీవనోపాధి తోడ్పాటును పెంపొందించడంపై చర్చిస్తుంది. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ చిన్నారులు, వయసు మళ్లిన ట్రాన్స్జెండర్ల విషయంలో సంస్థాగత సంరక్షణపై రెండో సెషన్ దృష్టి సారిస్తుంది. అలాగే చిన్నారుల సంరక్షణ చట్టాల్లో న్యాయపరమైన అంతరాలను చూపుతూ.. చిన్న వయసులోనే తిరస్కరణను ఎదుర్కొంటున్న వారికి, శాశ్వత తోడ్పాటు అవసరమయ్యే వృద్ధ ట్రాన్స్జెండర్లకు సంపూర్ణ రక్షణను అందించే మార్గాలను అన్వేషిస్తుంది. ట్రాన్స్జెండర్లు తరచూ ఎదుర్కొనే వేధింపులను పరిష్కరించేలా న్యాయమైన, సమగ్ర చట్ట అమలు విధానాన్ని రూపొందించడంపై మూడో సెషన్లో చర్చిస్తారు. అలాగే ట్రాన్స్జెండర్ల ప్రొటెక్షన్ సెల్స్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పోలీసు, భద్రతా దళాల్లో ట్రాన్స్జెండర్ల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడంపై చర్చిస్తారు. చివరి సెషన్లో నిర్వహించే ‘అన్లాకింగ్ ఎంప్లాయ్మెంట్, డిఫైయింగ్ ఛాలెంజెస్ - స్టోరీస్ ఆఫ్ ట్రయంఫ్’లో నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికరంగం, సమ్మిళిత నియమాల ద్వారా గౌరవప్రదమైన ఉపాధిని కల్పించే అవకాశాలపై చర్చిస్తారు. అలాగే.. ప్రభుత్వం, సామాజిక కార్యక్రమాల తోడ్పాటుతో అవరోధాలను అధిగమించి విజేతలుగా నిలిచిన ట్రాన్స్జెండర్ల విజయ గాథలను ప్రదర్శిస్తారు.
ఈ ప్యానెల్లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, యూఎన్ ఏజెన్సీ, విద్యాసంస్థలు, సామాజిక ప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు, ఇతర ముఖ్యమైన భాగస్వాములు ఉంటారు.
ట్రాన్స్జెండర్లను సమాజంలో ఏకీకృతం చేయడం కేవలం చట్టపరమైన లేదా సంస్థాగత బాధ్యత మాత్రమే కాదని నైతిక విధి అని ఎన్హెచ్ఆర్సీ దృఢంగా విశ్వసిస్తుంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, భారతదేశంలోని ప్రతి ట్రాన్స్జెండర్ గౌరవంగా జీవించగలరని, సమాన అవకాశాలను, సమాజంలో వారి హక్కులు తిరిగి పొందగలరని నిర్ధారించుకొనేలా మార్పులకు మార్గం సుగమం చేయడానికి కమిషన్ ప్రయత్నిస్తుంది. సమ్మిళిత విధానాలు, పద్ధతులను బలోపేతం చేయడానికి, ట్రాన్స్జెండర్ల హక్కులను ముందుకు తీసుకెళ్లడానికి, మానవ హక్కులు, సమానత్వం, అందరికీ న్యాయం అనే సూత్రాల పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ సదస్సులో చేపట్టే చర్చలు, సిఫార్సులు దోహదపడతాయి.
***
(Release ID: 2163166)
Visitor Counter : 3