ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని నౌసారిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
Posted On:
08 MAR 2025 4:53PM by PIB Hyderabad
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, నౌసారి పార్లమెంటు సభ్యుడు, కేబినెట్ సహచరుడు, కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ గారు, గౌరవ పంచాయితీ సభ్యులు, వేదికపై ఉన్న లాఖ్పతి దీదీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా తల్లులు, అక్కాచెల్లెళ్లూ, బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
కొన్ని రోజుల కిందటే మహా కుంభమేళాలో గంగా మాత నన్ను ఆశీర్వదించింది. ఈ రోజు బృహత్తరమైన ఈ మహిళా సమ్మేళనం నుంచి మీ ఆశీస్సులు పొందుతున్నాను. మహా కుంభమేళాలో గంగా మాత ఆశీస్సులు పొందినట్టే.. ఈ రోజు మాతృశక్తి మహా కుంభమేళాలో నా తల్లులు, అక్కాచెల్లెళ్ల దీవెనలు పొందుతున్నాను. ఈ ప్రత్యేక మహిళా దినోత్సవం సందర్భంగా, నా మాతృభూమి గుజరాత్లో నా తల్లులు, అక్కాచెల్లెళ్లు, బిడ్డల నడుమ ఉన్నాను. మీ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు కృతజ్ఞతగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పవిత్ర గుజరాత్ నేల నుంచి.. దేశ ప్రజలందరికీ, ప్రతి తల్లికీ, అక్కాచెల్లెళ్లందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
గుజరాత్ సఫల్, గుజరాత్ మైత్రి అనే మరో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా.. వివిధ పథకాలకు సంబంధించిన నిధులను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాం. ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
నేడు మహిళలకు ప్రత్యేకమైన రోజు. వారి నుంచి స్ఫూర్తిని పొందాల్సిన, నేర్చుకోవాల్సిన రోజు. ఈ శుభసందర్భంగా శుభాకాంక్షలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను ప్రపంచంలో అత్యంత ధనవంతుడినని సగర్వంగా ప్రకటించగలను. ఈ ప్రకటన కొందరికి వింతగా అనిపించొచ్చు. ట్రోల్ దళాలన్నీ రంగంలోకి దిగుతాయేమో! కానీ, నేనిప్పటికీ చెప్తున్నాను- ప్రపంచంలోకెల్లా నేను అత్యంత ధనవంతుడిని. కోట్లాది మంది తల్లులు, అక్కాచెల్లెళ్లు, బిడ్డల దీవెనలు నా జీవిత ఖాతాలో జమయ్యాయి. ఇవి పెరుగుతూనే ఉన్నాయి. అందుకే నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడినని అంత నమ్మకంగా అంటున్నాను. ఈ ప్రేమ, ఆశిస్సులే నాకు గొప్ప స్ఫూర్తి, బలం, సంపద. అవే నా రక్షణ కవచాలు.
మిత్రులారా,
మన గ్రంథాలు స్త్రీలను నారాయణిగా గౌరవిస్తాయి. ప్రగతిశీల సమాజానికి, దేశ సుసంపన్నతకు మహిళలపై గౌరవమే పునాది. అందుకే అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి, దేశ పురోగతిని వేగవంతం చేయడానికి.. మహిళా నేతృత్వంలో అభివృద్ధి మార్గాన్ని మన దేశం స్వీకరించింది. మా ప్రభుత్వం మహిళల గౌరవం, సౌలభ్యం రెండింటికీ అధిక ప్రాధాన్యమిస్తోంది. కోట్లాది మహిళల జీవనాన్ని ప్రభుత్వం మెరుగుపరిచింది. టాయిలెట్లను నిర్మించడం ద్వారా, వారికి పారిశుద్ధ్యాన్ని మాత్రమే కాకుండా గౌరవాన్ని కూడా అందించాం. ఉత్తర ప్రదేశ్లోని కాశీకి చెందిన నా అక్కాచెల్లెళ్లు ఇప్పుడు వాటిని టాయిలెట్లుగా పిలవడం లేదు, వాటిని గౌరవ గృహాలు అని పిలుస్తున్నారు. మేము కోట్లాది మహిళలకు బ్యాంకు ఖాతాలను తెరిచి, బ్యాంకింగ్ వ్యవస్థతో వారిని అనుసంధానించాం. ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా ఇంట్లో పొగ సమస్య నుంచి వారికి విముక్తి కల్పించాం. గతంలో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు 12 వారాలే ఉండేవి. మా ప్రభుత్వం వాటిని 26 వారాలకు పెంచింది. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని ముస్లిం అక్కాచెల్లెళ్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కఠినమైన చట్టాన్ని చేయడం ద్వారా లక్షలాది ముస్లిం మహిళల జీవితాలను మా ప్రభుత్వం కాపాడింది. కాశ్మీర్లో 370వ అధికరణ అమల్లో ఉన్నప్పుడు మహిళలకు అనేక ప్రాథమిక హక్కులు లేకుండా పోయాయి. ఓ మహిళ రాష్ట్రం బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, పూర్వీకుల ఆస్తిపై హక్కును కోల్పోయేది. అధికరణ 370 రద్దుతో జమ్ముకాశ్మీర్లోని మన అక్కాచెల్లెళ్లు, బిడ్డలు ఇప్పుడు దేశంలోని అందరు మహిళల్లాగే సమానమైన హక్కులను పొందుతున్నారు. దేశంలో భాగమే అయినప్పటికీ అనేక ఏళ్లుగా ఈ హక్కులు వారికి అందలేదు. రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పుకొన్న వారు మౌనంగా ఉండిపోయారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వారు పట్టించుకోలేదు. 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా మన ప్రభుత్వం రాజ్యాంగ విలువలను నిలబెట్టి, దేశ సేవ కోసం వాటిని అంకితం చేసింది.
మిత్రులారా,
నేడు సమాజంలో, ప్రభుత్వంలో, ప్రధాన సంస్థల్లో మహిళలకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి. రాజకీయాలు, క్రీడలు, న్యాయవ్యవస్థ, చట్టాల అమలు... ఇలా దేశంలోని ప్రతి వ్యవస్థలో, ప్రతి రంగంలో, అన్ని విధాలుగా మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. 2014 నుంచి కీలక స్థానాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాతే కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో మహిళలు మంత్రులుగా నియమితులయ్యారు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం కూడా విశేషంగా పెరిగింది. 2019లో తొలిసారిగా 78 మంది మహిళా ఎంపీలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 18వ లోక్సభలో 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా మన న్యాయవ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యం విశేషంగా పెరిగింది. జిల్లా కోర్టుల్లో వారి ప్రాతినిధ్యం 35 శాతం దాటింది. అనేక రాష్ట్రాల్లో కొత్తగా సివిల్ జడ్జిలుగా నియమితులైన వారిలో 50 శాతం లేదా అంతకు మించి ఈ దేశ ఆడబిడ్డలే.
భారత్ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా నిలిచింది. వీటిలో దాదాపు సగానికి పైగా సంస్థల డైరెక్టర్లలో ఓ మహిళ ఉన్నారు. అంతరిక్ష పరిశోధనలు, విజ్ఞాన శాస్త్రాల్లోనూ మన దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. వాటిలో అనేక ప్రధాన మిషన్లకు మహిళా శాస్త్రవేత్తలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహిళా పైలట్లున్నది భారత్లోనే. ఇది మనకు గర్వకారణం. నౌసారిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలోనూ మహిళా శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను పూర్తిగా మహిళలే తీసుకున్నారు. కానిస్టేబుళ్లు, ఇన్స్పెక్టర్ల నుంచి డీఎస్పీలు, ఉన్నతాధికారుల వరకు.. భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తిగా మహిళా పోలీసులే నిర్వహిస్తున్నారు. మహిళా శక్తికి ఇది నిజమైన నిదర్శనం. కొద్దిసేపటి కిందటే స్వయం సహాయక బృందాలకు చెందిన నా అక్కాచెల్లెళ్లతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. వారు చెప్పిన మాటలు, వారు చూపిన ఉత్సాహం, వారు వెలిబుచ్చిన ఆత్మవిశ్వాసం... దేశంలోని అపారమైన నారీ శక్తిని ప్రస్ఫురిస్తున్నాయి. ఈ దేశ పురోభివృద్ధి బాధ్యతను మహిళలే తీసుకున్నారని స్పష్టమవుతోంది. వికసిత భారత్ కల నిస్సందేహంగా సాకారమవుతుందన్న నా నమ్మకం మీ అందరినీ కలిసినప్పుడల్లా మరింత బలపడుతుంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో మహిళలే ముందంజలో ఉన్నారు.
తల్లులారా, అక్కాచెల్లెల్లారా,
మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి గుజరాత్ ఓ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. విజయవంతమైన సహకార నమూనాను మన రాష్ట్రం నిర్దేశించింది. గుజరాత్ మహిళల అంకితభావం, సమర్థత వల్లే ఇది ఇంతలా అభివృద్ధి చెందిందన్న విషయం స్వయంసహాయక బృందాల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లందరికీ బాగా తెలుసు. నేడు అమూల్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. గుజరాత్లోని ప్రతి గ్రామానికి చెందిన లక్షలాది మహిళలు పాల ఉత్పత్తిని విప్లవాత్మక కార్యక్రమంగా మలిచారు. గుజరాత్ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయల విలువైన బ్రాండ్గా ఎదిగిన లిజ్జత్ పాపడ్ను స్థాపించింది గుజరాతీ మహిళలే.
తల్లులారా, అక్కాచెల్లెల్లారా,
నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలు, బాలికల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చిరంజీవి యోజన, బేటీ బచావో అభియాన్, మమతా దివస్, కన్యా కెలవాని రథయాత్ర, కున్వర్బాయి ను మామేరు, సాత్ ఫేరే సమూహ లగ్న యోజన, అభయం హెల్ప్లైన్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. సరైన విధానాలు మహిళలను ఏ విధంగా సాధికారులను చేయగలవో యావద్దేశానికీ గుజరాత్ చాటిచెప్పింది. ఉదాహరణకు, నేనింతకుముందు పేర్కొన్న పాల సహకార సంఘాలనే తీసుకోండి. పాడి పరిశ్రమ పనులకు సంబంధించిన చెల్లింపులు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ అయ్యేలా చేసిన మొదటి రాష్ట్రం గుజరాతే. గతంలో చెల్లింపులు నగదు రూపంలో చేసేవారు, లేదంటే పాల వ్యాపారులు డబ్బులు తీసుకెళ్లేవారు. పాడిపరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకే వెళ్లాలని, ఒక్క పైసా కూడా ఇతరుల చేతుల్లోకి మళ్లకుండా చూడాలని మేం నిర్ణయించాం. ఈ విధానమే దేశవ్యాప్తంగా నేడు అనుసరిస్తున్న పద్ధతికి పునాదులు వేసింది. ప్రస్తుతం వివిధ పథకాల కింద నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే ప్రభుత్వం బదిలీ చేస్తోంది. నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు చేరుతున్నాయి. ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణాలను అరికట్టి, పేదలకు ప్రయోజనం కలిగేలా చూస్తోంది.
మిత్రులారా,
ఇక్కడే గుజరాత్లో భుజ్ భూకంపం విధ్వంసం అనంతరం, ఇళ్లను తిరిగి నిర్మిస్తున్న సమయంలో మా ప్రభుత్వం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఇళ్లను మహిళలకు కేటాయించాలని నిశ్చయించింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లను మన అక్కాచెల్లెళ్ల పేరిటే రిజిస్టర్ చేసే సంప్రదాయానికి ఈ విధానం నాంది పలికింది. నేడు ఈ సూత్రం ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా దేశవ్యాప్తంగా అమలవుతోంది. అంతేకాకుండా గతంలో పిల్లలను బడిలో చేర్పించినప్పుడు తండ్రి పేరు మాత్రమే నమోదు చేసేవారు. అయితే, పిల్లల జీవితంలో తల్లికీ సమానమైన ప్రాధాన్యముందని గుర్తిస్తూ.. పాఠశాల రికార్డుల్లో తల్లి పేరును కూడా చేర్చాలని నేను నిర్ణయించాను. 2014 నుంచి దాదాపు మూడు కోట్ల మహిళలు గృహాలకు యజమానులయ్యారు.
మిత్రులారా,
ప్రస్తుతం జల్ జీవన్ మిషన్పై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి గ్రామానికి నీరందుతోంది. గత ఐదేళ్లలో లక్షలాది గ్రామాల్లోని 15.5 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు అందించాం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం, ఇక్కడే గుజరాత్లో ‘మహిళా పానీ సమితుల’ (మహిళల నేతృత్వంలోని జల సంఘాలు)ను మేం ప్రారంభించాం. ఇప్పుడు ఈ నమూనా దేశవ్యాప్తంగా అమలవుతోంది. ఈ పానీ సమితులు కీలక పాత్ర పోషించాయి. వీటిని దేశానికి పరిచయం చేసింది గుజరాతే. నేడు దేశవ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
మిత్రులారా,
జల సమస్యల పరిష్కారం గురించి మనం మాట్లాడుకుందాం. నీటిని అందించడం ఎంత ముఖ్యమో దానిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం. క్యాచ్ ద రైన్! పేరుతో జాతీయ స్థాయి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి వాన బొట్టునూ ఒడిసి పట్టుకోవడమే దీని లక్ష్యం. తద్వారా ఆ నీరు వృథాగా పోదు. ఇది చాలా సులువైన ఆలోచన: గ్రామంలో పడిన వాన గ్రామంలోనే ఉండాలి. ప్రతి ఇంట్లోనూ నీటిని సంరక్షించాలి. నవసారి ఎంపీ సీఆర్ పాటిల్ నాయకత్వంలో ఈ ప్రచార కార్యక్రమం దేశమంతా విస్తరించడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయత్నానికి నౌసారి మహిళలు కూడా గణనీయంగా తోడ్పడుతున్నారు. వర్షపు నీటిని సంరక్షించడానికి నవసారిలోనే 5,000 కంటే ఎక్కువ చెరువులు, చెక్ డ్యాంలు, బోర్వెల్ రీచార్జి వ్యవస్థలు, సామూహిక ఇంకుడు గుంతలు, తదితర నిర్మాణాలను చేపట్టారు. ఇదంతా ఈ జిల్లాలోనే సాధించిన ఘనత. ఇంకా వందల సంఖ్యలో నీటి సంరక్షణ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 1,100 అదనపు ప్రాజెక్టులు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయని సీఆర్ పాటిల్ గారు ఇప్పుడే నాకు చెప్పారు. వాస్తవానికి ఈ ఒక్క రోజులోనే భూగర్భ జలాలను పెంపొందించే 1,000 పెర్కోలేషన్ గుంతలను నిర్మిస్తున్నారు. గుజరాత్లో వర్షపు నీటిని సేకరించడం, దానిని పరిరక్షించడంలో నవసారి ముందంజలో ఉంది. ఈ అసాధారణ ప్రయత్నాలు చేపట్టిన నవసారి తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒకే జిల్లా నుంచి లక్షల మంది మాతృమూర్తులు ఈ మహాకుంభ్లో పాల్గొనడం చూస్తుంటే.. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని చూసిన తల్లి పొందే ఆనందం గుర్తొస్తుంది. నా ముందున్న వారి ముఖాల్లో ఆ సంతోషాన్ని నేను చూస్తున్నాను. మూడోసారి ప్రధానమంత్రిగా సేవలు అందించేలా మీరు ఆశీర్వదించి పంపిన కొడుకుగా నేను మీ ముందు ఈ రోజు నిలబడ్డాను. మీ ఆశీర్వాదాల వల్లే ఇది సాధ్యమైంది. తన కొడుకుని చూడగానే తల్లి ముఖం ఎలా వెలిగిపోతుందో.. ఇక్కడ ఉన్న ప్రతీ తల్లి ముఖంలోనూ నేను అదే సంతోషాన్ని, ఆప్యాయతను చూస్తున్నాను. ఈ ప్రేమ, ఈ సంతృప్తి, ఈ ఆశీర్వాదాలే నా జీవితంలో గొప్ప బహుమతులు.
మిత్రులారా,
గుజరాత్ మహిళల శక్తి, రాష్ట్రం నెలకొల్పిన ఉదాహరణలు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. ఇక్కడ, పంచాయతీ స్థానాల్లో 50 శాతం సీట్లను మహిళలకే రిజర్వేషన్ చేశారు. ప్రధాన సేవకుడిగా నన్ను ఢిల్లీకి పంపించినప్పుడు.. ఈ అనుభవాన్ని, అంకితభావాన్ని నా వెంట తీసుకెళ్లాను. మన దేశం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మొదట మేం ఆమోదించిన బిల్లును నారీశక్తికి అంకితమిచ్చాం. నూతన పార్లమెంట్ భవనంలో చేపట్టిన మొదటి ప్రయత్నం మన సోదరీమణుల కోసమే. ఇది మాతృమూర్తులు, సోదరీమణుల సంక్షేమం పట్ల మోదీకున్న అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. నారీశక్తి వందన్ చట్టాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తున్నదేమిటో తెలుసా? నిరాడంబరమైన, గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన మహిళా రాష్ట్రపతి ఈ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. ఇది గర్వపడాల్సిన క్షణం. ఇక్కడ ఉన్న వారిలో ఒకరు ఇదే తరహా వేదికపై ఎంపీగా, ఎంఎల్ఏగా నిలబడి, మన దేశ భవిష్యత్తును రూపొందించే రోజు ఎంతో దూరంలో లేదు.
మిత్రులారా,
భారత దేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీజీ ఓ సందర్భంలో అన్నారు. ఈ రోజు దీనికి మరొకటి జోడించాలని అనుకుంటున్నాను. గ్రామీణ భారత ఆత్మ.. గ్రామీణ మహిళల సాధికారతలో ఉంది. అందుకే మహిళల హక్కులకు, వారికి నూతన అవకాశాలను కల్పించడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈరోజు, భారతదేశం.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మీలాంటి కోట్లాది మంది శ్రమతోనే ఈ పురోగతి సాధ్యమైంది. ఈ పరివర్తనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళలు నిర్వహిస్తున్న స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషించాయి. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా మహిళలు 90 లక్షల స్వయం సహాయక బృందాలను నిర్వహిస్తున్నారు. వాటిలో 3 లక్షల స్వయం సహాయక బృందాలు గుజరాత్లోనే ఉన్నాయి. ఈ ఆర్థిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ఈ కోట్లాది మంది మహిళల ఆదాయాన్ని పెంచాలని మేం ప్రతిజ్ఞ చేశాం. వారందరినీ లఖ్పతీ దీదీలుగా మేం మారుస్తున్నాం. ఇప్పటికే, 1.5 కోట్ల మంది మహిళలు ఈ లక్ష్యాన్ని సాధించారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతీ దీదీలను తయారు చేయాలని మేం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సోదరీమణులు పనిచేస్తున్న వేగం, చిత్తశుద్ధి చూస్తుంటే, ఈ లక్ష్యాన్ని అతి త్వరలోనే సాధిస్తామని నమ్ముతున్నాను.
తల్లులారా, అక్కాచెల్లెల్లారా,
మన సోదరీమణుల్లో ఒకరు లఖ్పతీ దీదీగా మారితే.. ఆ కుటుంబం పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు తమ గ్రామంలోని ఇతరులను అభ్యున్నతి దిశగా నడిపిస్తారు. మరింత మంది అక్కాచెల్లెళ్లను తమతో పాటు నడిపిస్తారు. మన మాతృమూర్తులు, సోదరీమణులు చేపట్టిన ఏ కార్యమైనా సరే సహజంగానే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చుకుంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. ఇంటి నుంచి మొదలైన ఓ చిన్న పని.. క్రమంగా ఆర్థిక ఉద్యమంగా ఎదుగుతుంది.
గడచిన దశాబ్దంలో మా ప్రభుత్వం స్వయం సహాయక బృందాల సామర్థ్యానికి తోడ్పడేలా వారి బడ్జెట్ను అయిదు రెట్లు మేర పెంచింది. ఇప్పుడు ఈ బృందాలు రూ. 20 లక్షల వరకు హామీ రహిత రుణాలను పొందేందుకు అర్హత సాధించాయి. దీనికి అదనంగా, స్వయంసహాయక బృందాల సభ్యులకు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, వారి పనితీరు మెరుగుపరుచుకొనేందుకు ఆధునిక సాంకేతికతను స్వీకరించే అవకాశాలను కల్పిస్తున్నాం.
మిత్రులారా,
మన దేశ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. తమ సందేహాలను తొలగించుకుంటూ.. మూసధోరణులను ఛేదిస్తున్నారు. మేం డ్రోన్ దీదీ యోజనను ప్రారంభించినప్పుడు గ్రామీణ మహిళలు ఇలాంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోగలరరా అని చాలామంది మమ్మల్ని ప్రశ్నించారు. మన సోదరీమణులు, మాతృమూర్తుల ప్రతిభ, చిత్తశుద్ధిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయంలో నమో డ్రోన్ దీదీ అభియాన్ విప్లవం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మహిళలు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వారి కుటుంబం, గ్రామంలో వారి స్థాయి పెరిగింది. పైలట్ దీదీలు, డ్రోన్ దీదీల వైపు సమాజం గర్వంగా చూస్తోంది. అలాగే బ్యాంకు సఖి, ఇన్స్యూరెన్స్ సఖి లాంటి కార్యక్రమాలు సైతం మహిళలకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాయి. గ్రామీణ మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి, దేశ పురోగతికి సహకరించడానికి కృషి సఖి, పశు సఖి లాంటి కార్యక్రమాలను సైతం ప్రారంభించి లక్షలాది మంది మహిళల ఆదాయం పెరిగేలా వారికి తోడ్పాటును అందిస్తున్నాం.
తల్లులారా, అక్కాచెల్లెల్లారా,
ఈ ప్రభుత్వ కార్యక్రమాల నుంచి గుజరాత్ మహిళలు వీలైనంత లబ్ధి పొందేలా చేసేందుకు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రశంసనీయమైన ప్రయత్నం చేపట్టిన భూపేంద్ర భాయ్, గుజరాత్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేను ప్రధానినయ్యాక ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మొట్టమొదటి సారి మాట్లాడినప్పుడు వెలిబుచ్చిన ఒక ఆందోళన ఈనాటికీ సందర్భోచితంగానే ఉంది. అప్పట్లో నేను మాట్లాడిన విషయం ఇదీ.. ఒక అమ్మాయి సాయంత్రం పూట ఆలస్యంగా ఇంటికి చేరినప్పుడు, తల్లితండ్రులు ఆమెను పదే పదే అడిగే ప్రశ్నలు.. ఆమె ఎక్కడకు వెళ్లింది?, ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చినట్లు?, ఎవరితో ఉన్నట్లు?.. అని వాళ్లు వంద ప్రశ్నలు వేస్తారు. అయితే నేను అడిగింది.. వాళ్లు తమ అబ్బాయి రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత ఇంటికి వస్తే, అతణ్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా? అని.. ‘నువ్వు ఎక్కడకు వెళ్లావు? నీతో ఎవరున్నారు? నువ్వు ఏం చేస్తున్నావు?’.. అంటూ ఆ అబ్బాయిని వాళ్లు అడుగుతున్నారా?
మహిళల భద్రతకు హామీ పడడం, మరింత బాధ్యత కలిగిన సమాజాన్ని తయారు చేయడం అంటే, దానికి మనస్తత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. గత పదేళ్లకు పైగా, మేం మహిళలకు భద్రతను పెంచడానికి పెద్ద పీట వేశాం. మహిళలపై నేరాలకు ఒడిగట్టకుండా చూడాలని, న్యాయాన్ని సత్వరం అందించాలని కఠినతర చట్టాల్ని తీసుకువచ్చాం. మహిళలపై తీవ్ర నేరాలకు పాల్పడితే విచారణను సత్వరం జరిపించడానికి, అపరాధులకు వెంటనే శిక్షలు వేయడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేశాం. ఇంతవరకు, దేశమంతటా సుమారుగా అలాంటి 800 న్యాయస్థానాల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. వాటిలో చాలావరకు న్యాయస్థానాలు ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ కోర్టులు అత్యాచారాలకు సంబంధించిన దాదాపు 3 లక్షల కేసులను త్వరగా విచారించాయి. మహిళలకు, చిన్నారులకు ‘పోస్కో’ సకాలంలో న్యాయం చేసింది. ఘోర నేరాలతో ప్రమేయం ఉన్న రేపిస్టులకు కఠినాతికఠిన దండన.. మరణ దండనను విధించడం కోసం చట్టంలో సవరణను మా ప్రభుత్వం తీసుకొచ్చింది. మేం మహిళలకు హెల్ప్లైనును బలోపేతం చేశాం.. అది రోజులో ప్రతి క్షణం, ఏడాదిలో ప్రతి రోజూ అందుబాటులో ఉండేటట్లు చూశాం. దీనికి తోడు, మహిళలు ఆపదలో చిక్కుకుంటే వారికి తక్షణ సహాయాన్ని అందించడం కోసం దేశవ్యాప్తంగా వన్ స్టాప్ సెంటర్లను ప్రారంభించాం. ఇలాంటి సుమారు 800 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో 10 లక్షల కన్నా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగింది.
మిత్రులారా,
బ్రిటిషు కాలం నాటి అణచివేత చట్టాలను తొలగించి, ‘భారతీయ న్యాయ సంహిత’ను ఇప్పుడు దేశం నలు మూలల అమలుచేస్తున్నారు. స్వాతంత్య్రం సాధించుకున్న 75 ఏళ్లకు, మీరు ఈ ముఖ్యమైన, పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించే విశేషాధికారాన్ని నాకు కట్టబెట్టారు. మరి మేం తీసుకున్న నిర్ణయాలేమిటి అంటే, మహిళల సురక్షకు సంబంధించిన నియమావళిని మరింత బలోపేతం చేశాం. మహిళలకు, బాలలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేర కృత్యాలకు సంబంధించి ‘భారత న్యాయ సంహిత’లో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్నే జోడించాం. న్యాయం కోసం ఎంతో కాలం వేచి ఉండాల్సిరావడంపైన బాధితులు, వారి కుటుంబాలతో పాటు సభ్య సమాజం కూడా ఏళ్ల తరబడి తమ నిరాశను వెలిబుచ్చుతూ వచ్చాయి. కేసుల్లో తరచు జాప్యం చోటుచేసుకుంటూ, ఏళ్లకేళ్లు గడిచిపోయేవి. ఈ సమస్యకు భారతీయ న్యాయ సంహిత సూటి సమాధానానాన్ని అందించింది. ఇకపై, అత్యాచారం వంటి ఘోర నేరాల్లో.. 60 రోజుల లోపల అభియోగాలు నమోదు చేసి తీరాలి. 45 రోజుల లోపల కోర్టు నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇంతకు ముందు, ఒక ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలంటే బాధితులు చాలా సందర్భాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంగా పోలీస్ స్టేషనుకు వెళ్లాల్సివచ్చేంది. కొత్త చట్టాల ప్రకారం, ఎక్కడి నుంచయినా ఈ-ఎఫ్ఐఆర్ను నమోదు చేయడానికి వీలు ఉంది. దీంతో పోలీసులు తక్షణం రంగంలోకి దిగడం కుదురుతుంది. దీనికి తోడు, జీరో ఎఫ్ఐఆర్ నిబంధన ప్రకారం, వేధింపులకు గాని లేదా హింసకు గాని గురైన మహిళలు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే ఎఫ్ఐఆర్ను దాఖలు చేయవచ్చు. మరో ముఖ్య మార్పు.. పోలీసులు ఇప్పుడు అత్యాచార బాధితురాలి వాదనను శ్రవణ మాధ్యమం ద్వారా గాని, లేదా దృశ్య మాధ్యమం ద్వారా గాని నమోదు చేసుకోవచ్చు. ఈ పద్ధతికి చట్టపరంగా గుర్తింపు కల్పించారు. ఇంతకు ముందు, వైద్య సంబంధిత నివేదికలు రావడానికి చాలా సమయం పట్టేది. దీంతో బాధితులు మరింత దుస్థితిని ఎదుర్కొనేవారు. ప్రస్తుతం, వైద్యులు వారం రోజుల లోపల వైద్య నివేదికలను అందజేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో ఊరటనిచ్చేదే కాకుండా చట్ట ప్రక్రియను కూడా వేగవంతం చేస్తోంది.
మిత్రులారా,
భారతీయ న్యాయ సంహిత లో ఈ కొత్త నియమాలు ఇప్పటికే ఫలితాలను అందిస్తున్నాయి. సూరత్ జిల్లాయే ఒక ప్రధాన ఉదాహరణ. గత ఏడాది అక్టోబరులో, ఒక విషాదభరిత అత్యాచార ఘటన ఆ ప్రాంత వాసులను కలచివేసింది. ఆ నేరానికి ఉన్న తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, కొత్త శిక్షాస్మృతి ప్రకారం, అభియోగాలను 15 రోజుల లోపల నమోదు చేశారు. కొన్ని వారాల కిందటే, నేరగాళ్లకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. పదిహేనంటే పదిహేను రోజుల లోపే, పోలీసులు వారి దర్యాప్తును పూర్తి చేసి, న్యాయవిచారణ ప్రక్రియను మొదలుపెట్టి, వెనువెంటనే న్యాయాన్ని అందించారు. భారతీయ న్యాయ సంహితను అమలులోకి తీసుకువచ్చినప్పటి నుంచి, మహిళలపై నేరాల విచారణ తీరు దేశవ్యాప్తంగా వేగవంతం అయింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినందుకు ఒక పురుషుడికి 20 సంవత్సరాల జైలుశిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ రాష్ట్రంలో భారతీయ న్యాయ సంహిత పరిధిలో దోషిని నిర్ధారించిన మొదటి సందర్భం ఇది. అభియోగపత్రాన్ని దాఖలు చేసిన 30 రోజుల్లోపే ఈ న్యాయనిర్ణయం వెలువడడం అసాధారణం. ఇదే మాదిరిగా, కోల్కతాలో ఒక న్యాయస్థానం ఏడు నెలల వయసున్న చిన్నారిపై అత్యాచారానికి గాను ఒక పురుషునికి మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 80 రోజుల లోపల తీర్పు చెప్పారు. వేర్వేరు రాష్ట్రాలలోని ఈ ఉదాహరణలు మా ప్రభుత్వం తీసుకున్న భారతీయ న్యాయ సంహిత గాని, ఇతర నిర్ణయాలు గాని మహిళల భద్రతను పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండా బాధితులకు వెనువెంటనే న్యాయాన్ని కూడా ఎలా అందించగలిగిందీ ప్రధానంగా చాటిచెబుతున్నాయి.
తల్లులు, అక్కచెల్లెళ్లారా,
మీ కలలను నెరవేర్చుకొనే దారిలో ఏదీ మీకు అడ్డురాదని ప్రభుత్వ సారథిగాను, మీ వినమ్ర సేవకుడిగాను నేను మీకు హామీ ఇస్తున్నాను. ఒక బిడ్డ తన తల్లికి భక్తిశ్రద్ధలతో సేవ చేసేటట్లుగానే, నేను భరత మాతతో పాటు మీకు.. నా తల్లులకు, నా అక్కచెల్లెళ్లకు.. అంతే అంకితభావంతో సేవ చేస్తాను. మనందరి ఉమ్మడి కృషి, కష్టపడి పనిచేసే తత్వంతో పాటు మీ ఆశీస్సులతో.. భారత్ స్వాతంత్య్ర శతవార్షికోత్సవాన్ని 2047లో జరుపుకొనేటప్పటికల్లా.. ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న మన స్వప్నం సాకారం అవుతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఈ సంకల్పంతో, నేను మరో సారి మీకందరికి.. ప్రతి మాతృమూర్తికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, నా దేశ కుమార్తెలకు, ఈ విశిష్ట మహిళా దినోత్సవం రోజున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకందరికీ అభినందనలు.
ఇప్పుడు, రెండు చేతులూ పైకెత్తి నాతో కలిసి పలకండి..
భారత్ మాతా కీ జై
ఇవాళ, మహిళామణుల గొంతు మరింత బిగ్గరగా వినిపించాలి సుమా.
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కీ జై
వందే మాతరం.
వందే మాతరం.
వందే మాతరం.
వందే మాతరం.
వందే మాతరం.
వందే మాతరం.
వందే మాతరం.
ఇవాళ, మనం వందే మాతరం అని పలుకుతున్నప్పుడు, మనం భారత మాతకు వందనాన్ని మాత్రమే ఆచరించడంలేదు, మనం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మాతృమూర్తులందరిని కూడా గౌరవించుకుంటున్నాం.. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
గమనిక : ప్రధానమంత్రి ఉపన్యాసంలో కొన్ని సార్లు గుజరాతీలో మాట్లాడారు. ఆయన గుజరాతీలో చెప్పినదాని అనువాదాన్ని ప్రసంగ పాఠంలో చేర్చడమైంది.
***
(Release ID: 2159539)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam