ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఐసీఎంఆర్-ఎస్హెచ్ఐఎన్ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐసీఎంఆర్: ఇది సైన్స్, ఆరోగ్య ఆవిష్కరణల్లో తర్వాతి తరం పరిశోధకులుగా విద్యార్థులను ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం
* వైజ్ఞానిక ఆసక్తిని పెంపొందించడం, శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, తర్వాతి తరం ఆరోగ్య పరిశోధకులకు స్ఫూర్తిని అందించేందుకు ఐసీఎంఆర్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం: డీజీ, ఐసీఎంఆర్
* 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 39 జిల్లాలో ఉన్న 300 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఐసీఎంఆర్ సంస్థలను సందర్శించారు: 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 13,000 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
* గైడెడ్ లాబొరేటరీ టూర్లు, పరిశోధనా ప్రదర్శనలు, పోస్టర్ వాక్స్, వీడియో ప్రదర్శనలు, కొనసాగుతున్న పరిశోధనలకు సంబంధించి ప్రత్యక్ష వివరణల తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు
Posted On:
08 AUG 2025 1:03PM by PIB Hyderabad
‘‘ఒక రోజు శాస్త్రవేత్తగా గడపండి’’ అని విద్యార్థులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్ఆర్), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. తన సంస్థలతో పాటు డీహెచ్ఆర్-మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చి యూనిట్లు (ఎంఆర్హెచ్ఆర్యూ)లో ఆగస్టు 7, 8 తేదీల్లో ఎస్హెచ్ఐఎన్ఈ - సైన్స్, హెల్త్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ నెక్ట్స్జెన్ ఎక్స్ప్లోరర్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 39 జిల్లాలో ఉన్న 300 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఐసీఎంఆర్ సంస్థలను సందర్శించారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 13,150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్యం, బయోమెడికల్ పరిశోధనా రంగాన్ని పరిచయం చేయడం, జాతీయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఐసీఎంఆర్ అందిస్తున్న సహకారాన్ని తెలియజేయడం, సైన్స్, ప్రజారోగ్య రంగాల్లో కెరీర్ ఎంచుకొనేలా వారిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. తద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడుతుంది.
ఈ కార్యక్రమంలో డీహెచ్ఆర్ కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బల్ మాట్లాడుతూ.. ‘‘ఇది వైజ్ఞానిక ఆసక్తిని పెంపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, తర్వాతి తరం ఆరోగ్య పరిశోధకులకు స్ఫూర్తినివ్వడానికి ఐసీఎంఆర్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం’’ అని అన్నారు. భారతీయ పరిశోధన, ఆరోగ్యసేవల రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణ, యువత భాగస్వామ్య ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ‘‘ఇది కేవలం సందర్శన మాత్రమే కాదు. శాస్త్రవేత్తగా మారాలని అందిస్తున్న ఆహ్వానం’’ అని విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ బల్ చెప్పారు. ‘‘మీరు పరిశీలించాలని, ప్రశ్నించాలని, శాస్త్రీయ పరిశోధనా స్ఫూర్తిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని మేం కోరుతున్నాం. మా శాస్త్రవేత్తలతో ముచ్చటించండి, ప్రయోగశాలలు పరిశీలించండి, వైద్యారోగ్య రంగంలో భారత్ సాధించిన పురోగతిని తెలుసుకోండి. ఆసక్తి, రుజువు, ఆశయం ద్వారా వికసిత్ భారత్ను మనం సాధించగలుగుతాం’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రయోగశాల పర్యటనలు, పరిశోధనలపై ప్రదర్శనలు, పోస్టర్ వాక్ లు, వీడియో ప్రజంటేషన్లు, ప్రస్తుతం జరుగుతున్న సైన్స్ సంబంధిత కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు వంటి పరస్పరం పాల్గొనే కార్యకలాపాలను నిర్వహించారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు, వారి పరిశోధనలు, వారు నైపుణ్యం చూపిన అంశాలు, ప్రజారోగ్యంలో వారి రోజువారీ పని గురించి అవగాహన పొందడానికి విద్యార్థులకు అవకాశం లభించింది. విద్యార్థులను మరింత ఆకట్టుకునేలా డాక్టర్ క్యూరియో అనే మస్కట్ను రోజంతా విద్యార్థులకు స్నేహపూర్వకమైన గైడ్ గా ప్రదర్శించారు.
ఐసీఎంఆర్ ప్రధాన కార్యక్రమాలను ప్రముఖంగా తెలిపే నాలుగు ప్రత్యేక లఘు చిత్రాలను కూడా విద్యార్థులకు చూపించారు. భారత్ స్వదేశీ వ్యాక్సిన్ అయిన కోవాక్సిన్ అభివృద్ధి, కొత్త ఆరోగ్య సేవల కోసం ఐడిఆర్ఓఎన్ కార్యక్రమం, టీబీ నిర్మూలనలో భారత్ చేస్తున్న ప్రయత్నాలు, భవిష్యత్ లో మహమ్మారుల సంసిద్ధతను అంచనా వేయడానికి నిర్వహించిన దేశవ్యాప్త మాక్ డ్రిల్ “విషాణు యుధ్ అభ్యాస్” పై ఈ లఘు చిత్రాలను రూపొందించారు.
ముఖ్యంగా నేడు ఆగస్టు 8 వ తేదీ భారతీయ వైద్య శాస్త్రవేత్త, పాథాలజిస్ట్, మెడికల్ రైటర్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వులిమిరి రామలింగస్వామి 104వ జయంతి కావడం ఈ సందర్భంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆయన వారసత్వం తరతరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
ఎస్.హెచ్.ఐ.ఎన్.ఇ చొరవ ద్వారా, యువ అభ్యాసకులలో సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో పరిశోధనల కీలక పాత్రపై అవగాహనను పెంపొందించడంలో ఐసీఎంఆర్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
(Release ID: 2154503)