యు పి ఎస్ సి
కళాశాలలు, విద్యాసంస్థలకు ఈమెయిల్ ద్వారా యుూపీఎస్సీ ఉద్యోగ ప్రకటనల సమాచారం
బహుళ ప్రచారం, మరింత మంది పరీక్షలు రాసేలా చూడాలన్నది లక్ష్యం: డాక్టర్ అజయ్ కుమార్, ఛైర్మన్, యూపీఎస్సీ
Posted On:
05 AUG 2025 3:33PM by PIB Hyderabad
పరీక్షలకు మరింత మంది ఉద్యోగార్ధులు హాజరయ్యేందుకు వీలుగా యూపీఎస్సీ మరో ముందడుగు వేసింది. కళాశాలలు, విద్యాసంస్థలకు ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగ నియామక ప్రకటనలను నేరుగా పంపాలని నిర్ణయించారు. ఫలితంగా విద్యాసంస్థలు, కళాశాలలు... యూపీఎస్సీ ప్రకటనలను ఇక మీదట నేరుగా ఈ-మెయిల్ రూపంలో పొందనున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వివిధ గ్రూప్ ఏ, గ్రూప్ బీ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నియామకాలను చేపడుతోంది. అంతేకాకుండా సాధారణ పరీక్షలను కూడా తరచుగా నిర్వహిస్తోంది. విధుల స్వభావాన్ని బట్టి నియామకాల విషయంలో అభ్యర్థులు విద్యా, అనుభవానికి సంబంధించి అర్హతలను, కొన్ని సందర్భాల్లో అదనపు అర్హతలను కూడా యూపీఎస్సీ నిర్దేశిస్తోంది.
ఈ సందర్భంగా యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ... "మేం సాధారణంగా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అభ్యర్థనలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి పలు రకాల ఉద్యోగాల విషయంలో కూడా నియామక అభ్యర్థనలు యూపీఎస్సీకి చేరతాయి. ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, వేగవంతం చేయటానికి జనవరి నుంచి మార్చి వరకు గల 3 నెలల వ్యవధిలో ఈ అభ్యర్థనలు అందేలా చూసుకుంటున్నాం. ఒకేరకమైన వాటికి ఉమ్మడి పరీక్ష నిర్వహించటం ద్వారా సమాయానుకులంగా ప్రక్రియను పూర్తి చేసి నియమకాలు చేపట్టేందుకు కావాల్సిన ప్రణాళికను మెరుగైన రీతిలో తయారు చేసుకోవచ్చు” అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి కమిషన్ ఏటా 200కి పైగా నియామక ప్రతిపాదనలను అందుకుంటుంది. వాటికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను కమిషన్ పూర్తి చేసిన అనంతరం ఆన్లైన్ ప్రకటనలను విడుదల చేస్తోంది. కేవలం 2025లో ఇప్పటికే 240కి పైగా నియామక అభ్యర్థనలను యూపీఎస్సీ అందుకుంది. ఇందులో వైద్య, శాస్త్రీయ- ఇంజనీరింగ్- సాంకేతిక, చట్టపరమైన, బోధన, ప్రత్యేక (మేనేజ్ మెంట్, ఫైనాన్స్, అక్కౌంట్స్, ఫోరెన్సిక్ ఆడిట్ మొదలైనవి) పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గ్రూప్-ఏ, గ్రూప్-బీ గెజిటెడ్ స్థాయికి చెందినవే.
ప్రస్తుతం నియామక ప్రక్రియ సమాచారాన్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్, యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్, యూపీఎస్సీ అధికారిక లింక్డ్ఇన్ ఖాతాల్లో ఇస్తున్నారు. ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించటం గురించి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ.. “గతంలో వివిధ పోస్టులకు సంబంధించి మాకు అందే దరఖాస్తుల సంఖ్యలో కొన్ని లోటుపాట్లు గుర్తించాం. దరఖాస్తులను తనిఖీ చేస్తున్న సమయంలో అర్హతలు కలిగిన దరఖాస్తుదారులు లేకపోవటం వల్ల కొన్ని సార్లు నియామక ప్రక్రియ నిరర్థకం అవుతోంది. చాలా నియమకాల విషయంలో పోస్టుల కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తగిన అభ్యర్థులు లేరని ఇంటర్వ్యూ బోర్డు తేల్చటం వల్ల కూడా పోస్టులు ఖాళీగా ఉండటం కానీ ఇంటర్వ్యూ దశలో నియామక ప్రక్రియ నిరర్థకమవటం కానీ అవుతుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు.. అవసరమైన, అర్హత కలిగిన అభ్యర్థులకు చేరుకునేందుకు నియామక ప్రకటనలకు సంబంధించి కొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఇతర విషయాలతో పాటు.. సంబంధిత సంస్థలకు ఈ-మెయిల్ ద్వారా ప్రకటనలు, తాజా సమాచారాన్ని పంపాలని నిర్ణయించాం. నమోదైన ఇతర, ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ సమాచారం వెళ్లనుంది. యూపీఎస్సీకి సంబంధించినంత వరకు సమాచారం లేకపోవడం వల్ల అర్హత ఉన్న వారిని విడిచిపెట్టకూడదని మేం కోరుకుంటున్నాం” అని అన్నారు.
నియామకాలకు సంబంధించి ఈ కొత్త విధానంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు:
* విశ్వవిద్యాలయాలు, సంస్థలు, సంఘాలు.. వృత్తిపరమైన, గుర్తింపు పొందిన సంస్థలు మొదలైన వాటికి ఈ-మెయిల్ ద్వారా ప్రకటనలు, తాజా సమాచారం వెళ్లనుంది.
* నియామక ప్రకటనలు, తాజా సమాచారం కావాలని యూపీఎస్సీని అభ్యర్థించే ఇతర సంస్థలకు కూడా ఈ-మెయిల్ ద్వారా సంబంధిత సమాచారం అందుతుంది. Ra-upsc[at]gov[dot]inకి మెయిల్ చేయటం ద్వారా అభ్యర్థనను నమోదు చేసుకోవచ్చు.
* ఏ మంత్రిత్వ శాఖ, విభాగం కోసమైతే నియామకాలు జరుగుతున్నాయో వాటి అధికారిక వెబ్సైట్లో నియామక ప్రకటనలను ఉంచాలని యూపీఎస్సీ అధికారికంగా కోరనుంది.
* నియామక ప్రకటనలను ఇప్పటికే లింక్డ్ఇన్లో యూపీఎస్సీ పంచుకుంటోంది. ప్రభుత్వ ప్రసార మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారం చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
* కమిషన్ వెబ్సైట్లో ఆర్ఎస్ఎస్ ఫీడ్లను ప్రారంభించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
ఈ-మెయిల్ సమాచార సేవలను పొందాలనుకునే సంస్థలు ra-upsc[at]gov[dot]in కు "సబ్ స్క్రిప్షన్ రిక్వెస్ట్ - యూపీఎస్సీ రిక్రూట్మెంట్ అలర్ట్స్" అనే సబ్జెక్ట్తో అభ్యర్థనను పంపాలి.
మరిన్ని వివరాలు, తాజా సమాచారం కోసం చూడండి: https://www.upsc.gov.in
***
(Release ID: 2152833)