ఆర్థిక మంత్రిత్వ శాఖ
మొత్తం 8 కోట్ల మందితో కీలక మైలురాయిని సాధించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)
Posted On:
25 JUL 2025 5:44PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సామాజిక భద్రత పథకం- అటల్ పెన్షన్ యోజనను (ఏపీవై) పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) 39 లక్షల మంది కొత్త చందాదారులు రావటంతో మొత్తంగా 8 కోట్ల మందితో కీలక మైలురాయిని సాధించింది. 2015 మే 9న ప్రారంభించిన ఈ పథకం 10వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ ఘనత సాధించటం విశేషం.
ప్రజలందరికీ సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను సృష్టించాలనే దార్శనికతతో ఏపీవైని ప్రారంభించారు. పేదలు, ఈ స్వచ్ఛంద సహకార పింఛను పథకం అణగారిన వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులపై దృష్టి సారించింది. అన్ని బ్యాంకులు, పోస్టల్ శాఖ (డీఓపీ), ఎస్ఎల్బీసీలు, యూటీఎల్బీసీలు అంకితభావంతో చేసిన అవిశ్రాంత కృషి, కేంద్ర ప్రభుత్వ నిరంతర మద్దతు వల్ల ఈ అద్భుతమైన విజయం సాధ్యమైంది. అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, బహుభాషా కరపత్రాలు, మీడియా ద్వారా ప్రచారం, క్రమం తప్పకుండా సమీక్షలు చేయటం ద్వారా పీఎఫ్ఆర్డీఏ నమోదులను పెంచింది.
60 సంవత్సరాల తర్వాత చందాదారునికి తప్పకుండా రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు నెలవారీ పింఛను అందిస్తూ 'సంపూర్ణ సురక్ష కవచం'గా ఉండే విధంగా ఏపీవైని రూపొందించారు. చందాదారుడి మరణం తర్వాత జీవిత భాగస్వామికి అదే పింఛను వస్తుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే నిధులు నామినీకి అందుతాయి. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు మినహా 18-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారంతా ఇందులో చేరొచ్చు.
“ఏపీవై ఉంటే జీవితం సురక్షితంగా ఉన్నట్లే”
(Release ID: 2148803)