సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
తెలంగాణ గవర్నరుతోనూ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ మిషన్ కర్మయోగి బృందం భేటీ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల సామర్దత పెంపు ప్రక్రియను బలపరచడమే ముఖ్యోద్దేశం
Posted On:
03 JUL 2025 1:08PM by PIB Hyderabad
తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మతో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్తో పాటు కర్మయోగి భారత్కు చెందిన మిషన్ కర్మయోగి బృందం హైదరాబాద్లో బుధవారం (2025 జులై 2న) సమావేశమైంది. ఈ బృందానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ డైరెక్టరు నవ్నీత్ కౌర్తో పాటు అదే కమిషన్లో పరిపాలన విభాగ సభ్యురాలుగా ఉన్న డాక్టర్ అల్కా మిట్టల్ నేతృత్వం వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మిషన్ కర్మయోగి అమలవుతున్న తీరుతెన్నులను ఈ బృందం గవర్నరుకు వివరించింది. ఈ కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని గవర్నరు అన్నారు. రాష్ట్రంలో మార్పు దిశగా మిషన్ సాగిస్తున్న ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిందిగా బృందాన్ని ఆయన ప్రోత్సహించారు.

అంతకు ముందు, తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాలకు ఏయే విధాలుగా మరిన్ని మెరుగులు దిద్దవచ్చో ఒక మార్గసూచీని రూపొందించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావుతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో మిషన్ కర్మయోగి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మిషన్ కర్మయోగి గురించిన సమగ్ర వివరాలను ఈ బృందం వివరించింది. డిజిటల్ మాధ్యమ శక్తియుక్తులను సద్వినియోగపరుచుకోవడం, సామర్థ్యాలకు సాన పట్టుకొనే శిక్షణను పొందడం ద్వారా భవిష్యత్తులో ఎదురుకాగల వినూత్న అవసరాలకు అనుగుణంగా, పౌరుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వారికి రకరకాల సేవలను అందించాలన్నదే తమ మిషన్ లక్ష్యమని బృందం స్పష్టం చేసింది.

చర్చల్లో ‘ఐగాట్ కర్మయోగి’ వేదిక ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ వేదిక అన్ని విభాగాల్లోనూ అధికారులకు ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ ప్రాతిపదికన జ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు బాటవేస్తోంది. విభాగాల అధిపతులు తమకు ఎదురవుతున్న సవాళ్లను, తమకు ప్రత్యేక శిక్షణను అందించాల్సిన అవసరాన్నీ వివరించారు. ప్రతి ఒక్క విభాగానికీ దానికంటూ నిర్దేశించిన పరిపాలక ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండే, విషయాలను నేర్చుకొనే పద్ధతులను రూపొందించడానికి పెద్దపీట వేయాలని వారు కోరారు. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులను ఐగాట్ వేదికపైకి తేవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయమిది. ఈ నిర్ణయంతో తెలంగాణలో సామర్థ్యాల పెంపు దిశగా సాగుతున్న ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ముందడుగును వేసినట్లయింది.

గవర్నరు, చీఫ్ సెక్రటరీలతో పాటు తెలంగాణ పరిపాలక యంత్రాంగం అందించిన మద్దతుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ హృదయపూర్వకంగా ప్రశంసలు తెలిపింది. మిషన్ కర్మయోగిలో భాగంగా జ్ఞానార్జన, అభివృద్ధి మార్గాల్లో పరిపాలనను బలోపేతం చేయాలన్న ఉమ్మడి నిబద్ధతకు ఈ ప్రయత్నాలు అద్దం పట్టాయి.
***
(Release ID: 2141784)