ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* బీహార్ అభివృద్ధి చెందుతుంది.. దేశాభ్యుదయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది: పీఎం
* గత దశాబ్దంలో 25 కోట్ల మంది భారతీయలు పేదరికాన్ని ఓడించారు: ప్రధాని
* మేడిన్ ఇండియాకు ప్రధాన కేంద్రంగా మారబోతున్న బీహార్లోని మర్హౌరా లోకోమోటివ్ కర్మాగారం నుంచి తయారైన మొదటి ఇంజిన్ ఆఫ్రికాకు ఎగుమతి అవుతోంది: పీఎం
Posted On:
20 JUN 2025 3:04PM by PIB Hyderabad
బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబా మహేంద్రనాథ్, బాబా హన్స్నాథ్లను స్మరించుకున్నారు. అలాగే పవిత్రమైన సోగర ధామ్ ప్రాశస్థ్యాన్ని గుర్తుచేశారు. థావే భవానీ మాత, అంబికా భవానీ మాతకు వందనం సమర్పించారు. దేశానికి తొలి రాష్ట్రపతిగా సేవలందించిన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్ను ఆయన గౌరవపురస్సరంగా తలచుకున్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తిగా నిలిచిన ప్రాంతంగా సివాన్ను శ్రీ మోదీ వర్ణించారు. ఈ భూమి దేశ ప్రజాస్వామ్యానికి సాధికారత కల్పించిందని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసిందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ రచనలోనూ, దేశానికి దిశానిర్దేశం చేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప పుత్రుడిని సివాన్ అందించిందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త బ్రజ్ కిశోర్ ప్రసాద్ రూపంలో సివాన్ సహకారం అందించిందని ప్రధానమంత్రి అన్నారు.
ఆ గొప్ప వ్యక్తుల లక్ష్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృఢమైన సంకల్పంతో ముందుకు తీసుకెళుతున్నాయని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా ఆ నిరంతర ప్రయత్నాల్లో ఒక భాగమేనని అన్నారు. ఒకే వేదిక నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపన చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఉజ్వల భవిష్యత్తు దిశగా బీహార్ను నడిపిస్తాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చదిద్దడంలో సహకరిస్తాయని వివరించారు. సివాన్, ససారాం, బక్సర్, మోతీహారీ, బేతియా, ఆరా లాంటి ప్రాంతాల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ పేదలు, అణగారిన వర్గాల వారు, దళితులు, మహాదళితులు, వెనకబడిన, అత్యంత వెనకబడిన వర్గాల వారి జీవితాలను సులభరతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో బీహార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
విదేశాల నుంచి నిన్ననే తిరిగి వచ్చానని శ్రీ మోదీ చెబుతూ ఈ పర్యటనలో అభివృద్ధి చెందిన దేశాల నాయకులతో తాను భేటీ అయినట్లు తెలిపారు. భారత్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ నాయకులు ముగ్ధులయ్యారని వెల్లడించారు. ఈ నాయకులంతా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిలో బీహార్ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ‘‘అభివృద్ధి చెందిన బీహార్ దేశ సమగ్రాభివృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తుంది’’ అని శ్రీ మోదీ తెలియజేశారు. బీహార్ ప్రజల బలం, సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనను పారదోలిన ప్రజలను ప్రధానమంత్రి అభినందించారు. రెండు దశాబ్దాల కిందటి నాటి పరిస్థితిని ప్రస్తుత యువత కథల రూపంలో తెలుసుకుంటున్నారని చెప్పారు. అరాచక పాలన సమయంలో జరిగిన నష్టాన్ని వారు పూర్తిగా గ్రహించలేకపోవచ్చని చెబుతూనే.. శతాబ్దాల పాటు భారత దేశ పురోగమనంలో కీలకపాత్ర వహించిన ఉన్న బీహార్.. గత పాలకుల కారణంగా బలవంతపు వలసలకు చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు.
బీహార్లో ప్రతి పౌరునికీ ఆత్మగౌరవం అత్యంత ముఖ్యమైన అంశమని ప్రధాని అన్నారు. బీహారీ సోదర సోదరీమణులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తూ, విజయం సాధిస్తున్నారని ప్రశంసించారు. వారు తమ ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడరని పేర్కొన్నారు. అయితే, గత పాలకులు బీహార్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బ తీశారని విమర్శించారు. ఈ అవినీతి పాలన బీహార్ను పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, శ్రీ నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం బీహార్ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. గత 10-11 ఏళ్లలో సుమారుగా 55,000 కి.మీ మేర గ్రామీణ రహదారులు నిర్మాణమయ్యాయని పేర్కొన్నారు. 1.5 కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం, మరో 1.5 కోట్ల గృహాలకు కుళాయి సదుపాయం కల్పించామని వెల్లడించారు. రాష్ట్రంలో 45,000కి పైగా సాధారణ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారని శ్రీ మోదీ గుర్తించారు. బీహార్లోని చిన్న పట్టణాల్లో కొత్త అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయని ఆయన వెల్లడించారు.
బీహార్ అభివృద్ధి వేగం పుంజుకుంటోందన్న శ్రీ మోదీ.. గతంలో అరాచకాలకు కారణమైన శక్తులు ఇప్పుడు ప్రభుత్వంపై, బీహార్ ఆర్థిక వనరులపై మళ్లీ అధికారాన్ని పొందాలనుకుంటున్నాయని హెచ్చరించారు. అధికారం కోసం ఈ శక్తులు కుటిల వ్యూహాలు పన్నుతున్నాయని విమర్శించారు. బీహార్ ప్రజలు జాగరూకులుగా ఉండాలని ఆయన కోరారు. సుసంపన్నమైన రాష్ట్రంగా అవతరించే దిశగా బీహార్ దిశగా ప్రస్థానాన్ని పక్కదారి పట్టించేందుకు కాచుక్కూచున్న వారిని దూరం పెట్టాలని ప్రధానమంత్రి కోరారు.
దేశంలో పేదరిక నిర్మూలన నినాదాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయని, అయితే తమ ప్రభుత్వం దాన్ని నిజం చేసి చూపిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో 25 కోట్ల భారతీయులు పేదరికాన్ని అధిగమించారు’’ అని శ్రీ మోదీ వివరించారు. ప్రపంచ బ్యాంకు వంటి ప్రఖ్యాత సంస్థలు భారత్ సాధించిన విజయాన్ని ప్రశంసించాయని గుర్తు చేశారు. దేశం సాధించిన ఈ విజయంలో బీహార్, ముఖ్యంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమూ గణనీయమైన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. బీహార్ ప్రజల్లో సగానికిపైగా కటిక బీదరికంలో కూరుకుపోయారని గతంలో ప్రధానమంత్రే చెప్పారు. అయితే గత పదేళ్లలో ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు కోట్ల ప్రజలు పేదరికాన్ని అధిగమించారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా లక్షలాది మంది భారతీయులు నిరుపేదలుగానే మిగిలిపోయారంటే.. దానికి వారి కృషి లోపించడం కారణం కాదని, పురోగమించే అవకాశాలు ప్రజలకు లేకపోవడం వల్లేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ‘లైసెన్స్ రాజ్’ వ్యవస్థ వల్ల దేశం పేదరికాన్ని అధిగమించలేకపోయిందని శ్రీ మోదీ చెప్పారు. ఆ సమయంలో ప్రతి సేవ, ప్రతి అవకాశంపైనా కోటా- పర్మిట్ వ్యవస్థ ఉండేవని, చిన్నచిన్న పనులకు కూడా అనుమతులు అవసరముండేవని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పేదలకు గృహ వసతీ దక్కలేదని, రేషన్ సరుకులను కూడా మధ్యవర్తులు పక్కదారి పట్టించేవారని ప్రధానమంత్రి అన్నారు. పేదలకు వైద్యం అందలేదన్నారు. విద్య, ఉపాధి నిత్య పోరాటాలుగానే ఉండిపోయాయంటూ విమర్శించారు. విద్యుత్ కనెక్షనో లేదా నీటి కనెక్షనో అయినా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు. గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఎంపీ సిఫార్సు చేయాల్సి వచ్చేదనీ.. లంచాలో, పలుకుబడో లేకుండా ఉద్యోగాలు వచ్చేవి కావని చెప్పారు. ప్రధానంగా దళిత, మహాదళిత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల వ్యక్తులే ఈ వ్యవస్థ వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితులయ్యారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఈ వర్గాలను కలల్లో ముంచెత్తుతూ, ఈ క్రమంలో కొన్ని కుటుంబాలే కోట్లకు పడగలెత్తాయని శ్రీ మోదీ విమర్శించారు.
“గత 11 ఏళ్లుగా తమ ప్రభుత్వం పేదల బాటలో ప్రతి అవరోధాన్నీ తొలగించేందుకు కట్టుబడి వ్యవహరించిందన్నారు. ఫలితంగా స్పష్టమైన, ప్రభావవంతమైన ఫలితాలు వస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయని, మున్ముందు మరో 3 కోట్ల గృహాలను నిర్మించబోతున్నామని చెప్పారు. ఇది బీహార్లోని పేదలు, దళితులు, మహాదళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు విశేషంగా ప్రయోజనం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఒక్క బీహార్లోనే 57 లక్షలకు పైగా పక్కా ఇళ్లు నిర్మించామన్నారు. సివాన్ జిల్లాలో పేదల కోసం ఇప్పటికే 1.10 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించామని, ఎలాంటి అంతరాయం లేకుండా ఈ పనులు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. బీహార్లో 50వేలకు పైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఇళ్లలో ఎక్కువ శాతం తల్లులూ, అక్కాచెల్లెళ్ల పేరిటే రిజిస్టర్ కావడం ఎంతో సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. సాంప్రదాయకంగా ఎప్పుడూ తమ పేరిట ఎలాంటి ఆస్తులూ లేని మహిళలు ఇప్పుడు ఇంటి యజమానులుగా గర్వించదగ్గ స్థాయిలో నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం పేదలకు గృహనిర్మాణమే కాకుండా ఉచిత రేషన్, విద్యుత్, నీటి సౌకర్యాలను కూడా అందిస్తోందని, కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా కొత్త గృహాలకు కుళాయి నీటిని అందించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒక్క సివాన్ జిల్లాలోనే 4.5 లక్షల కుటుంబాలకు తొలిసారిగా కుళాయి నీరు అందిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లను, పట్టణ ప్రాంతాల్లో సరిపడా తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇటీవల బీహార్లోని వివిధ నగరాల్లో పలు పైప్లైన్లు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఇప్పుడు పదుల సంఖ్యలో పట్టణాల్లో కొత్త పైప్ లైన్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మంజూరయ్యాయని తెలిపారు. ‘‘ఈ ప్రాజెక్టులన్నీ పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతాయి’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ ట్రాక్ రికార్డును తీవ్రంగా విమర్శించిన శ్రీ మోదీ.. ఎప్పుడూ బీహార్కూ పెట్టుబడులకూ వ్యతిరేకంగానే వారు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ పార్టీలు అభివృద్ధి గురించి మాట్లాడితే.. తాళాలు వేసిన దుకాణాలు, నిలిచిపోయిన వ్యాపారాలు, దెబ్బతిన్న పరిశ్రమలే ప్రజలకు గుర్తొస్తున్నాయని విమర్శించారు. అందుకే అలాంటి పార్టీలు బీహార్ యువత నమ్మకాన్ని పొదలేకపోయాయన్నారు. చాలాకాలం పాటు సాగిన ఈ పార్టీల పాలనలో మౌలిక సదుపాయాలు శిథిలమయ్యాయనీ.. మాఫియా పాలనను, అరాచకాలను, అవినీతిని అవి ప్రోత్సహించాయని ఆయన విమర్శించారు.
ప్రతిభావంతులైన బీహార్ యువత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులన్నింటినీ నిశితంగా గమనిస్తూ, విశ్లేషిస్తున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్డీయే అభివృద్ధి నమూనాకు మర్హౌరా లోకోమోటివ్ ఫ్యాక్టరీని ముఖ్యమైన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. మర్హౌరా ఫాక్టరీలో తయారైన మొదటి ఇంజిన్ను ఆఫ్రికాకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపిన ప్రధానమంత్రి, ఇదొక చరిత్రాత్మక ఘట్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిన ప్రాంతంగా అభివృద్ధికి దూరమైన సరన్ జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఉందని, ఇప్పుడీ జిల్లాకు ప్రపంచ తయారీ, ఎగుమతి వ్యవస్థలో చోటు దక్కిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధి పథానికి అవరోధాలను సృష్టించాయని విమర్శించారు. అయితే, నేడు బీహార్లో తయారైన ఇంజిన్ ఆఫ్రికాలో రైళ్లను పరుగులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. ‘మేడిన్ ఇండియా’ తయారీకి ప్రధాన కేంద్రంగా బీహార్ అవతరిస్తుందని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. మఖానా, పండ్లు, కూరగాయల వంటి స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరడమే కాకుండా, బీహార్ కర్మాగారాల్లో తయారయ్యే వస్తువులకు కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందన్నారు. ‘‘బీహార్ యువత చేసిన ఉత్పత్తులు ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని బలోపేతం చేస్తాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
బీహార్ లో ప్రస్తుతం అభివృద్ధి పరుస్తున్న మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రగతికి ఇతోధికంగా దోహదపడతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, రైళ్ళు, వైమానిక సేవలు, జలమార్గాల రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్ళు సహా బీహార్ కు అనేక కొత్త రైలు సర్వీసులు అందుతున్నాయని చెప్పారు. శ్రావణమాసం మొదలు కాక ముందే బాబా హరిహరనాథ్ ప్రాంతాన్ని బాబా గోరఖ్ నాథ్ ప్రాంతంతో అనుసంధానించే కొత్త వందే భారత్ రైలు మొదలయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభించిన పాట్నా-గోరఖ్ పూర్ వందే భారత్ రైలు ద్వారా పూర్వాంచల్ భక్తులు ఆధునిక సౌకర్యాలను పొందగలుగుతారని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే రైలు బుద్ధ భగవానుడు తపస్సు చేసిన చోటు, ఆయన మహానిర్వాణం చెందిన కుషినగర్ ప్రాంతాల మధ్య కీలక అనుసంధాన మార్గంగా ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వ కృషి వల్ల పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఊపు లభించడమే కాక, రాష్ట్ర పర్యాటక రంగానికి లబ్ధి చేకూరగలదని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల వల్ల బీహార్ ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానం దక్కించుకుని, రాష్ట్ర యువతకు ఇబ్బడిముబ్బడిగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
అందరికీ సమాన అవకాశాలు కల్పించి, వివక్షను దూరం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం కాగా, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే నినాదంతో ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తోందని చెప్పారు. అయితే గత ప్రభుత్వాలు ‘సొంత కుటుంబాలకే’ ప్రాముఖ్యాన్నిచ్చి, సొంత లాభం ధ్యేయంగా పనిచేశాయని విమర్శించారు. తమ కుటుంబాల బాగుకే ప్రాముఖ్యాన్నిచ్చిన ఆ పార్టీలు బీహార్ సహా దేశంలోని లక్షలాది రైతు కుటుంబాల ప్రయోజనాలను దెబ్బతీశాయని ఆరోపించారు.
కుటుంబపాలనను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వ్యతిరేకించేవారని, ఆయా పార్టీలు బాబా సాహెబ్ ఆశయానికి అనేకసార్లు తూట్లుపొడిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక పార్టీ ప్రమేయమున్న సంఘటనలో బాబా సాహెబ్ ఫోటోకి అవమానం జరిగినట్లు వెల్లడైందని, సంఘటన పట్ల స్పందన తెలియజేస్తూ, సదరు పార్టీ క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయని గుర్తు చేశారు. దళితుల పట్ల, మహాదళితుల పట్ల ఎంత మాత్రం గౌరవం లేని ఆ పార్టీలు క్షమాపణ చెప్పగలవన్నది సందేహాస్పదమేనన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని గత పాలకులు వారి పాదాల వద్ద ఉంచారనీ, అయితే తాను అంబేద్కర్ ను తన హృదయంలో నిలుపుకున్నట్లు చెప్పారు. అంబేద్కర్ ను అవమానించడం ద్వారా ఆయన కన్నా అధికులమని వారు భావిస్తున్నారని ఆరోపించిన శ్రీ మోదీ... బాబా సాహెబ్ కు జరిగిన ఈ అవమానాన్ని బీహార్ ప్రజలు ఎన్నటికీ మరచిపోరని చెప్పారు.
బీహార్ ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు అవసరమైన పునాదులని శ్రీ నితీశ్ కుమార్ నిర్మించారని, ఇక రాష్ట్రాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. బీహార్ యువతపై తనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందని, రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసికట్టుగా పని చేసి, దేశఅభివృద్ధిలో రాష్ట్రాన్ని చోదకశక్తిగా మార్చడం ఖాయమన్నారు. ప్రస్తుతం అమలవుతున్న అభివృద్ధి పనులన్నీ సజావుగా సాగాలని కోరుకుంటూ శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు.
బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, కేంద్రమంత్రులు శ్రీయుతులు రాజీవ్ రంజన్ సింగ్, జితన్ రామ్ మాంఝీ, గిరిరాజ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, నిత్యానంద్ రాయ్, రామనాథ్ ఠాకూర్, సతీష్ చంద్ర దూబే, డాక్టర్ రాజ్ భూషణ్ చౌధరి ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
బీహార్ లో మౌలిక వసతుల అభివృద్ధికి, సామాజిక-ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో ప్రధానమంత్రి సివాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
బీహార్ లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే రూ. 400 కోట్లు విలువ చేసే నూతన వైశాలి-దేవరియా రైల్వే లైన్ ప్రాజెక్టును, ఇదే మార్గంలో మరో కొత్త రైలు సర్వీస్ ను శ్రీ మోదీ ప్రారంభించారు. అదే విధంగా ఉత్తర బీహార్లో రవాణా సదుపాయాల మెరుగుదలకు దోహదపడే పాటలీపుత్ర–గోరఖ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రైలు ముజఫర్పూర్ బేతియా మార్గం ద్వారా ప్రయాణిస్తుంది.
"మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫర్ ది వరల్డ్" ఆశయానికి మరింత ఊతమిచ్చే విధంగా, గినీ దేశానికి ఎగుమతి నిమిత్తం మర్హోరా కేంద్రంలో తయారైన అత్యాధునిక రైలింజన్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రంలో తొలిసారిగా, ఎగుమతే లక్ష్యంగా రైలింజన్ తయారైంది. అధిక హార్స్ పవర్ ఇంజిన్లు, అత్యాధునిక ఏ.సి. ప్రొపల్షన్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్ ఆధారిత కంట్రోల్ సిస్టమ్స్, సుఖవంతమైన క్యాబ్ డిజైన్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి సాంకేతికతను ఈ ఇంజిన్లు కలిగి ఉన్నాయి.
గంగానది ప్రక్షాళన లక్ష్యంగా నమామి గంగే ప్రాజెక్టు కింద స్థానికులకు ఉపయోగపడే రూ. 1,800 కోట్ల విలువైన ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను (ఎస్టీపీ) ప్రధానమంత్రి ప్రారంభించారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో బీహార్ లోని పలు నగరాలు, పట్టణాల్లో రూ. 3,000 కోట్లు విలువైన నీటి సరఫరా, పారిశుద్ధ్య, ఎస్టీపీ లకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేశారు.
బీహార్లో ఇంధన రంగ అభివృద్ధి కోసం 500 మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)కు శ్రీ మోదీ శంకుస్థాపన చేశారు. ముజఫర్పూర్, మోతిహారీ, బేతియా, సివాన్ సహా మొత్తం 15 గ్రిడ్ సబ్స్టేషన్లలో బీఈఎస్ఎస్ లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సబ్స్టేషన్లో 20 నుంచి 80 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీలుంటాయి. దాంతో పంపిణీ సంస్థలు ఖరీదైన రేట్లకు విద్యుత్ను కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా, నిలువ చేసిన విద్యుత్ను తిరిగి గ్రిడ్కు పంపగలుగుతాయి. తద్వారా వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఏవై - యూ) కింద బీహార్ లోని 53,600 మంది లబ్ధిదారులకు శ్రీ మోదీ మొదటి విడత సొమ్ముని విడుదల చేశారు. ఇదే పథకంలో భాగంగా 6,600 మందికి కొత్త ఇళ్ళ గృహప్రవేశానికి సంబంధించి తాళం చెవులను అందజేస్తారు.
(Release ID: 2138202)
Read this release in:
Assamese
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam