ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణపై విదేశాంగ కార్యదర్శి ప్రకటన
Posted On:
18 JUN 2025 12:32PM by PIB Hyderabad
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో సమావేశం జరగలేదు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు వారిద్దరూ ఫోన్లో సంభాషించారు. దాదాపు 35 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి శ్రీ మోదీతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్కు మద్దతు తెలిపారు. దాని తర్వాత వారిద్దరూ మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి.
ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్తో ప్రధానమంత్రి మోదీ వివరంగా మాట్లాడారు. ఏప్రిల్ 22 తర్వాత ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ దిశగా భారత్ తన దృఢ సంకల్పాన్ని యావత్ ప్రపంచం దృష్టికి తెచ్చినట్లు భారత ప్రధానమంత్రి మోదీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తెచ్చారు. మే 6,7 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు, రహస్య స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ చాలా స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని విధంగా చర్యలు తీసుకుంది. పాక్ ఎలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని భారత్ స్పష్టం చేసింది.
మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. భారత్పై పాకిస్థాన్ భారీ దాడికి పాల్పడే అవకాశముందని వాన్స్ హెచ్చరించారు. ఒకవేళ అదే జరిగితే భారత్ మరింత దీటుగా బదులిస్తుందని ప్రధానమంత్రి మోదీ ఆయనతో స్పష్టంగా చెప్పారు.
మే 9-10 రాత్రి పాకిస్థాన్ దాడికి భారత్ బలంగా, నిర్ణయాత్మకంగా బదులిచ్చింది. ఇది పాక్ సైన్యానికి భారీ నష్టం కలిగించింది. వారి సైనిక వైమానిక స్థావరాలు పనిచేయకుండా పోయాయి. భారత్ దృఢతర చర్యల వల్ల.. సైనిక చర్యలను నిలిపివేయాల్సిందిగా చివరికి పాకిస్థాన్ బతిమాలుకోవాల్సి వచ్చింది.
ఈ మొత్తం సంఘటనల్లో ఏ దశలోనూ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలుగానీ, భారత్-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం కోసం ప్రతిపాదన గానీ ఏదీ జరగలేదని భారత ప్రధానమంత్రి మోదీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో స్పష్టంగా చెప్పారు. పాక్ అభ్యర్థన మేరకే, ఇరుదేశాల సాయుధ దళాల మధ్య ఉన్న సమాచార మార్గాల ద్వారా నేరుగా భారత్, పాకిస్థాన్ మధ్యే సైనిక చర్య నిలుపుదలపై చర్చ జరిగింది. మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదని, ఇకపై అంగీకరించబోదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉంది.
ప్రధానమంత్రి మోదీ చెప్పిన అంశాలను సావధానంగా విన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతు తెలిపారు. ఇకపై భారత్... ఉగ్రవాదాన్ని పరోక్ష యుద్ధంగా చూడబోదని, దాన్ని యుద్ధంగానే పరిగణిస్తుందనీ మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందన్నారు.
కెనడా నుంచి తిరిగొస్తున్న సమయంలో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో ఆగే అవకాశముందా అని ట్రంప్ అడిగారు. అయితే, కొన్ని కార్యక్రమాలు ముందుగానే నిర్ణయించి ఉండడంతో రాలేకపోతున్నట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. త్వరలోనే సమావేశానికి ఏర్పాట్లు చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణపైనా అధ్యక్షుడు ట్రంప్, ప్రధానమంత్రి మోదీ చర్చించారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలంటే ఇరు పక్షాల మధ్య నేరుగా చర్చలు అత్యావశ్యకమని, ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని వారిద్దరూ అంగీకరించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంపట్ల తమ ఆలోచనలను వారిద్దరూ పంచుకున్నారు. ఈ ప్రాంతంలో క్వాడ్ పాత్ర అత్యంత ప్రధానమైందన్నారు. తదుపరి క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ రావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన ట్రంప్.. భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
గమనిక: విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటనకు ఇది ఇంచుమించుగా చేసిన అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(Release ID: 2137264)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam