పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేదార్ నాథ్ సెక్టార్ లో హెలికాప్టర్ ప్రమాదం సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు


చార్ ధామ్ యాత్ర కు ఆర్యన్ ఏవియేషన్ నిర్వహిస్తున్న హెలికాప్టర్ సేవల నిలిపివేత

Posted On: 15 JUN 2025 3:43PM by PIB Hyderabad

శ్రీ కేదారనాథ్ జీ – ఆర్యన్ హెలిప్యాడ్, గుప్తకాశీ మార్గంలో నడిచే ఆర్యన్ ఏవియేషన్‌కి చెందిన బెల్ 407 హెలికాప్టర్ (రిజిస్టర్.వీటీ-బీకేఏ) ఈరోజు విషాద ప్రమాదానికి గురైంది.  ఈ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, ఒక శిశువు,  సిబ్బంది లోని ఒక సభ్యుడు ఉన్నారు.

గుప్తకాశి నుంచి సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ 05:18 గంటలకు శ్రీ కేదార్ నాథ్ జీ హెలిప్యాడ్ లో ల్యాండ్ అయింది. తిరిగి 05:19 గంటలకు గుప్తకాశీకి  బయలుదేరి 05:30  - 05:45 గంటల మధ్య గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు సమాచారం.

లోయ ప్రవేశ ప్రాంతంలో తక్కువగా ఉన్న దృశ్యమానత (విజిబిలిటీ), మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉన్నప్పటికీ హెలికాప్టర్ గాల్లోకి ఎగరడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక సంకేతాలు సూచిస్తున్నాయి. ప్రమాద కారణాలను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు ద్వారా నిర్ధారించవలసిఉంది.

ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటన అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ఉదయం 11:00 గంటలకు  ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, డీజీసీఏ అధికారులు,   సంబంధిత బృందాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కింది తక్షణ చర్యలు తీసుకున్నారు.

*చార్ ధామ్ యాత్ర కు నడిపే ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేశారు.

*ట్రాన్స్‌భారత్ ఏవియేషన్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు - వి టి- టిబిసి  (పైలట్ ఇన్ కమాండ్: (కెప్టెన్ యోగేశ్ గ్రేవాల్, సీపీఎల్ (హెచ్)-1453), వీటీ-టీబీఎఫ్ (పైలట్ ఇన్ కమాండ్: కెప్టెన్ జితేందర్ హర్జాయ్, సీపీఎల్ (హెచ్)-1453)-1046) అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులలో గగనతలంలో ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల, ఈ ఇద్దరు పైలట్ల లైసెన్సులు ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.

*ముందుజాగ్రత్తగా 2025 జూన్ 15, 16 తేదీలలో ఈ ప్రాంతంలో అన్ని చార్టర్,  షటిల్ హెలికాప్టర్ కార్యకలాపాలను నిలిపివేశారు.

*సేవలు తిరిగి ప్రారంభించే ముందు అందరు భద్రతా నియమాలకు అనుగుణంగా  ఆపరేటర్లు,  పైలట్లతో సమగ్ర సమీక్ష నిర్వహించాల్సిందిగా ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) ని ఆదేశించారు.

*తక్షణ  కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ఏవైనా ప్రమాద సూచనలు ఉన్నట్లయితే వెంటనే స్పందించేందుకు యుసిఎడిఎ ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంది.

*కేదార్ నాథ్ లోయలో అన్ని హెలికాప్టర్ కార్యకలాపాలను చురుకుగా పర్యవేక్షించడానికి, యుసిఎడిఎ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పనితీరును క్షుణ్ణంగా సమీక్షించడానికి ఎయిర్ వర్థినెస్, సేఫ్టీ, ఆపరేషన్స్ నుంచి  అధికారులను వెంటనే నియమించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించింది.

విమానయాన భద్రతపై ఎలాంటి రాజీ ప్రసక్తి లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టంగా తెలిపింది  వాతావరణ సంబంధిత నియమాలు లేదా ఇతర భద్రతా నియమాలకు విరుద్ధంగా ఏ ఆపరేటరూ విమాన సేవలు నిర్వహించరాదని మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని విమానయాన కార్యకలాపాల్లో క్రమశిక్షణను అన్ని విధాలుగా పాటించేలా చూడాలని, ప్రస్తుతమున్న అన్ని నిబంధనలను పూర్తి అధికారంతో అమలు చేయాలని మంత్రిత్వ శాఖ డీజీసీఏకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


 

***


(Release ID: 2136555)