వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగదారుల భద్రత బలోపేతం లక్ష్యంగా చెన్నైలో ప్రాంతీయ కార్యశాలను నిర్వహించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ
జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు వచ్చిన ఫిర్యాదుల్లో.. దక్షిణాది రాష్ట్రాల నుంచే 23 శాతం ఫిర్యాదులు: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి
100 శాతానికి పైగా పరిష్కార రేటుతో ముందంజలో కర్నాటక, కేరళ రాష్ట్రాల కమిషన్లు
Posted On:
14 JUN 2025 10:48AM by PIB Hyderabad
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేస్తూ, సంస్థాగత సామర్థ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈనెల 13న చెన్నైలో "దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగదారుల భద్రత"అనే అంశంపై ప్రాంతీయ కార్యశాలను నిర్వహించింది.
ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి నిధి ఖారే మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగానికి అనుకూలంగా ఉండే చట్టపరమైన, డిజిటల్ యంత్రాంగాల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ప్రారంభ దశలోనే వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో.. వేగవంతమైన, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తక్కువ ఖర్చుతోనే రైట్ టు రిపేర్ పోర్టల్, ఇ-జాగృతి, జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. డార్క్ ప్యాటర్న్ లు, నకిలీ రివ్యూలు, తప్పుదారి పట్టించే ప్రకటనలను అరికట్టడానికి సీసీపీఏ అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను కూడా ప్రస్తావించిన ఆమె.. ఈ విషయంలో ఆదర్శప్రాయమైన పనితీరును, ముఖ్యంగా అత్యధిక కేసుల్లో పరిష్కారాలను సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం, వర్చువల్ విచారణల ద్వారా ప్రపంచ స్థాయి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొందించడం కోసం నిరంతర ఆవిష్కరణలు, సహకారం, సమ్మిళిత వినియోగం అవసరమని ఆమె పిలుపునిచ్చారు.
2025లో, జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు వచ్చిన 5.41 లక్షల ఫిర్యాదుల్లో 23 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చాయని, ఇది బలమైన ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 28.54 లక్షల కేసుల్లో 5.62 లక్షల కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెండింగ్ కేసులు 13.34 శాతం మాత్రమేనని శ్రీమతి నిధి ఖారే పేర్కొన్నారు. దాఖలు అయిన వాటి కంటే ఎక్కువ కేసులను పరిష్కరించి కర్నాటక, కేరళ కమిషన్లు ముందంజలో ఉన్నాయనీ, అనేక జిల్లా కమిషన్లు సైతం వరుసగా మూడు సంవత్సరాల్లో 100 శాతానికి పైగా పరిష్కారాలను సాధించాయని ఆమె పేర్కొన్నారు. వర్చువల్ కోర్టుల ద్వారా 11,900 కంటే ఎక్కువ కేసులను విచారించామన్నారు. ఏఐ-ఆధారిత ఏకీకృత వేదిక ఇ-జాగృతిని గురించి వివరిస్తూ, ఇ-దాఖిల్, కాన్ఫోనెట్ వంటి కీలక వ్యవస్థల ఏకీకరణతో రూపొందించిన ఈ వేదిక.. చాట్బాట్ ఆధారిత రిజిస్ట్రేషన్, బహుళ భాషల్లో అందుబాటులో ఉండడం, న్యాయ నిపుణులు, దివ్యాంగులైన వినియోగదారులకు మద్దతు అందించడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపారు.
కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో, ఎన్సీడీఆర్సీ అధ్యక్షులు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి మాట్లాడుతూ.. వినియోగదారుల రక్షణ చట్టం పరిణామ పరిధిని, సంప్రదాయిక కోర్టుల నుంచి వినియోగదారుల కమిషన్లకు వ్యాజ్యాలు పెరుగుతున్న తీరును ప్రధానంగా ప్రస్తావించారు. వినియోగదారుల వివాద పరిష్కార వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించి, మరింత మందికి దానిని అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్-హితమైన, సాంకేతికత-ఆధారితమైన విధానాలను అవలంబించాలని కోరిన ఆయన.. జిల్లా వినియోగదారుల కమిషన్లకు మార్గదర్శనం చేశారు. వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను జస్టిస్ సాహి స్పష్టం చేశారు. కమిషన్ ఆదేశాలను సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వ విభాగాలతో సరైన భాగస్వామ్యం కలిగి ఉండాలనీ, వైద్యపరమైన నిర్లక్ష్యం, ఆటోమొబైల్ వివాదాల వంటి నిపుణుల అభిప్రాయాలు అవసరమయ్యే కేసుల విషయంలో వారితో సకాలంలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దాని వల్ల దర్యాప్తుల్లో జాప్యం జరగదని, వినియోగదారులకూ సకాలంలో పరిష్కారం లభిస్తుందన్నారు.
ఈ కార్యశాలలో సాంకేతికత అంశంపై చర్చకు నాలుగు సమావేశాలు, అదే సమయంలో మరో రెండు సమావేశాలనూ నిర్వహించారు. ఈ సమావేశాలకు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి అధ్యక్షత వహించగా, శ్రీమతి నిధి ఖారే సహాధ్యక్షత వహించారు. కీలక రంగాల్లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేయడం గురించి ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. న్యాయరంగ ప్రముఖులు, రాష్ట్రస్థాయి అధికారులు, న్యాయ నిపుణుల క్రియాశీల భాగస్వామ్యంతో.. ఈ సమావేశాల్లో ఇ-జాగృతి, రియల్ ఎస్టేట్-బీమా ఫిర్యాదుల యంత్రాంగాలు, వైద్య నిర్లక్ష్య పరిష్కార వేదికల ద్వారా డిజిటల్ ఆవిష్కరణలను గురించి ప్రధానంగా చర్చించారు. ఇతర సమావేశాల్లో జన్ విశ్వాస్ చట్టం-2023కు అనుగుణంగా లీగల్ మెట్రాలజీని అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను చర్చించారు. అలాగే స్వతంత్ర పరీక్షల నిర్వహణతో ఉత్పత్తి నాణ్యత, భద్రతను నిర్ధారించడం ద్వారా, దక్షిణ భారత వినియోగదారుల భద్రతను, ఈ రంగంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో నేషనల్ టెస్ట్ హౌస్ కీలక పాత్రను ప్రధానంగా చర్చించారు.
దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసుల నిరంతర పర్యవేక్షణ కోసం ఈ విభాగం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకరోజు ప్రాంతీయ కార్యశాలలు, రాష్ట్రస్థాయి సమావేశాలను నిర్వహించడం దీనిలో భాగంగా ఉంది. వినియోగదారుల కేసుల పెండింగ్ సమస్యను చర్చించడానికి, అలాగే వేగవంతమైన, మరింత ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందించడానికి ఆచరణీయ పరిష్కారాలను గుర్తించడంలో ఈ చర్చలు కీలక వేదికలుగా పనిచేశాయి.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ భరత్ ఖేరా మాట్లాడుతూ, నైతిక వాణిజ్యంలో భారత చారిత్రక మూలాలను, వినియోగదారుల భద్రత చట్టం-2019 పరివర్తన ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడు ప్రభుత్వ సహకార, ఆహారం-వినియోగదారుల భద్రత శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ తిరు సత్యబ్రత సాహూ మాట్లాడుతూ, వినియోగదారుల భద్రత సంస్థలను బలోపేతం చేయడానికి సామర్థ్యాలను పెంపొందించడం, శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు న్యాయం జరిగేలా చేయడంలో విధాన రూపకర్తల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.
ఈ కార్యశాలలో పాల్గొన్న రాష్ట్రాలు, సంబంధిత వ్యక్తులు వారి అధికారిక పరిధిలో వినియోగదారుల భద్రత విధానాల బలోపేతం కోసం కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో ఈ కార్యశాల ముగిసింది. దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా వినియోగదారుల శ్రేయస్సు కోసం వినియోగదారుల భద్రతా చట్టాలు, నిబంధనలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో రాష్ట్రాలు, ఇతర సంబంధిత వ్యక్తులు, సంస్థలకు సహకారం కొనసాగుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది.
సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర కమిషన్ ల సభ్యులు, జిల్లా కమిషన్ ల అధ్యక్షులు, సభ్యులు, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు సహా దక్షిణ భారత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర ప్రముఖులు సహా ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద వినియోగదారుల సంస్థల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.
***
(Release ID: 2136328)