కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ప్రజారోగ్య సంరక్షణ, వైద్య విద్య.. విశిష్ట నమూనాగా నిలిచిన ఈఎస్ఐసీ సనత్ నగర్ ప్రాంగణం
* ఈఎస్ఐసీ సనత్ నగర్ ప్రాంగణాన్ని ప్రజారోగ్య సంరక్షణలోనూ, వైద్య విద్యలోనూ
సాటిలేని శ్రేష్ఠత్వానికి నమూనాగా నిలిపిన 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం
Posted On:
12 JUN 2025 1:17PM by PIB Hyderabad
హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) వైద్య కళాశాల-ఆసుపత్రితోపాటు ఇదే సంస్థకు చెందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధించిన అసాధారణ విజయాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సగర్వంగా ప్రధానంగా ప్రస్తావించింది. 21 ఎకరాల బిల్టప్ ఏరియాలో ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. విస్తరణ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని మరో 11 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాంగణం (క్యాంపస్) శ్రామిక వర్గంతో పాటు వారి కుటుంబాలకు తక్కువ ఖర్చులో, ఉన్నత నాణ్యత కలిగిన ఆరోగ్యసంరక్షణ సేవలను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఓ నిదర్శనంగా నిలుస్తోంది.

ఈఎస్ఐసీ సనత్ నగర్ ప్రాంగణం 72 లక్షల 60 వేల మంది బీమా సదుపాయం కలిగిన వ్యక్తుల (ఐపీస్)తో పాటు వారికి చెందిన ఇతర లబ్ధిదారులకు తన సేవలను అందిస్తోంది. ఆరోగ్యసంరక్షణ సేవలను సమకూర్చడం, విద్యాబోధన, సాంకేతిక సమగ్రత.. వీటిలో ఈ ప్రాంగణం ఒక జాతీయ ప్రమాణసూచికగా ఉంది. 159 ఐసీయూ పడకలు, 45 డయాలిసిస్ పడకలు, 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 5 అడ్వాన్స్డ్ ఓటీ గదులు సహా మొత్తం 1,044 పడకలు కలిగి ఉన్న ఈ క్యాంపస్ రోగుల పట్ల కారుణ్యం, సహకార పూర్వక ధోరణిలోనూ, ప్రతి ఒక్క రోగిపై ప్రత్యేక శ్రద్ధతోను సేవలు అందేటట్లు జాగ్రత్తలు తీసుకొంటోంది. ఈ సంస్థలోని ఓపీ విభాగం రోజూ 3,200 మందికి పైగా రోగులను పరిశీలించడంతో పాటు, వివిధ విభాగాలన్నింటిలోనూ 200 మందికి పైగా ప్రవేశాలకు తగిన ఏర్పాట్లు కలిగి ఉంది. దీంతో ఇది ఈఎస్ఐసీ నెట్వర్క్లోనే అత్యంత చురుకుగా పనిచేస్తున్న ఆరోగ్యసంరక్షణ కూడళ్లలో (హబ్స్) ఒకటిగా మారింది.

‘500కు పైగా పడకలను కలిగి ఉన్న కేటగిరీలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఈఎస్ఐసీ ఆసుపత్రి’ పేరిట ఇచ్చే అవార్డును ప్రాంగణంలోని జంట ఆసుపత్రులు 2019 నుంచి అందుకొంటూ వచ్చాయి. ఎన్ఏబీహెచ్ (ఆసుపత్రి - బ్లడ్ బ్యాంకు), ఎన్ఏబీఎల్ ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవెల్) గుర్తింపులతో పాటు ఐఎస్ఓ ధ్రువపత్రాలున్న ఈ క్యాంపస్ ప్రజారోగ్యానికి సంబంధించిన పాలన రంగంలో పెనుమార్పును తీసుకువచ్చిన క్యాంపస్గా ఎదిగింది.
ఈ ప్రాంగణంలో వైద్య పరంగా సాధించిన ప్రావీణ్యం అనేక సూపర్ స్పెషాలిటీ విభాగాల రూపంలో విస్తరించింది. కార్డియాలజీ (గుండెకు సంబంధించిన శాస్త్రం), సీటీవీఎస్ల విషయానికి వస్తే, ఈ ప్రాంగణంలో టీఏవీఐ - టీఏవీఆర్, సీఏబీజీ లు సహా సంక్లిష్ట ప్రక్రియలకు వెసులుబాటు ఉంది. డివైస్ క్లోజర్లు, ఇంటర్వెన్షనల్ ఎలక్ట్రోఫిజియాలజీ సేవలు సైతం ఇక్కడ లభిస్తాయి. నెఫ్రాలజీ (మూత్రపిండ శాస్త్రం), యూరోలజీ (మానవ దేహంలో మూత్రాన్ని ఉత్పత్తి చేసే, మూత్రాన్ని విసర్జించే అవయవాలకు సంబంధించిన వైద్య శాస్త్రం) విభాగాల్లో వారంలో ప్రతి రోజూ పగలు, రాత్రి (24x7) రక్తశుద్ధితో పాటు మూత్రపిండం మార్పిడి చికిత్సల (లైవ్, కాడెవరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటులు) సదుపాయాలు ఉన్నాయి. అంతేకాక ఇక్కడి న్యూరాలజీ (నాడీశాస్త్రం), న్యూరో-సర్జరీ (నాడీ శస్త్రచికిత్స) విభాగం అవేక్ క్రేనియోటమీ, స్టీరియోటాక్టిక్ బయోప్సీ, ఇంట్రా-ఆపరేటివ్ న్యూరో-మానిటరింగ్ మొదలైన ఆధునిక ప్రొసీజర్లను పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంటు (శిశురోగులకు చేసే శస్త్రచికిత్స విభాగం) , ప్లాస్టిక్ - రికన్స్ట్రక్టివ్ సర్జరీ డిపార్ట్మెంటు, ఆంకాలజి (కేన్సర్ అధ్యయన శాస్త్ర సంబంధిత) డిపార్ట్మెంటు.. ఇవి అత్యధునాతన ఇంటర్వెన్షన్ సేవలను సమకూర్చగలవు. మరణాల నిష్పత్తిని పరిశీలిస్తే అది కూడా జాతీయ స్థాయి ప్రమాణాల కన్నా తక్కువగానే ఉంది. హెమటాలజీ డిపార్ట్మెంటు (రక్తం, రక్తాన్ని తయారు చేసుకునే అవయవాలకు సంబంధించిన వైద్య శాస్త్ర విభాగం) ఎముక మజ్జ మార్పిడిలను విజయవంతంగా చేపట్టింది. పీఎంఆర్ డిపార్ట్మెంట్లో అన్ని విధాలైన పరికరాలను కలిగి ఉండి పూర్తి స్థాయిలో పనిచేసే కార్డియాక్, న్యూరో-రిహాబిలిటేషన్ యూనిట్లు శస్త్రచికిత్స తరువాత రోగి కోలుకొనగలిగేలా ప్రత్యేక శ్రద్ధ అవసరపడే సేవలను సైతం అందిస్తున్నాయి. అత్యవసర సేవలను వారంలో ప్రతి రోజూ పగలు, రాత్రి (24x7) ప్రాతిపదికన పొందవచ్చు.

ఆధునిక రోగనిర్ధారణ పద్ధతులు, ప్రయోగశాల సేవలు.. ఇవి రోగచికిత్స సంబంధిత సేవలకు చేదోడువాదోడుగా ఉంటున్నాయి. పిక్చర్ ఆర్కైవింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (పీఏసీఎస్) ధన్వంతరి హెచ్ఈఆర్తో సంధానించిన ప్రయోగశాల సమాచార వ్యవస్థ వంటి సమాచార సాంకేతికత (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ) ఆధారిత పరిష్కారాలను అమలులోకి తీసుకు వచ్చారు. దీంతో వాస్తవిక సమయంలో, కాగితాలతో పని లేని, దక్షత కలిగిన రోగనిర్ధారణ కు మార్గం సుగమం అయింది. ముఖ్యంగా ఆంకాలజీ బాధితుల విషయంలో, ఇమ్యూనో-హిస్టోకెమిస్ట్రీ, మోలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, పీసీఆర్ సహా పరీక్షలను క్రమ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు.
నిదర్శన- ఆధారిత ప్రోటోకాల్స్, నాణ్యతపై హామీ.. ఇలా ఒక బలమైన సంస్కృతి నుంచి ప్రేరణను పొందిన ఆసుపత్రి పాలనయంత్రాంగం అంటురోగాల నియంత్రణ, సురక్షితమైన మందులను ఇస్తూ ఉండడం, రోగి తూలిపడకుండా కాపాడడం, రోగిని గుర్తించడంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని కచ్చితంగా పాటించడం వంటి అంశాలను పక్కాగా అమలుపరుస్తోంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని నిర్వహించడం, సిబ్బందికి క్రమం తప్పక శిక్షణను కొనసాగిస్తూ ఉండడం, నాణ్యతను మెరుగుపరచడానికి నిరంతర ప్రాతిపదికన కార్యక్రమాలను చేపడుతూ ఉండడం.. ఈ మార్గాలను అనుసరిస్తూ సేవలో ఉన్నత ప్రమాణాల్ని నిలబెడుతూ వస్తున్నారు.
ఐటీ-ఆధారిత రోగుల సేవల అందజేతలోనూ సనత్ నగర్ ఈఎస్ఐసీ మార్గదర్శిగా ఉంది. మందులను ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి అందించడం, ఇంటి వద్ద నమూనా సేకరణ, ఏఏఏ+ యాప్ సాయంతో ఆన్లైన్ కన్సల్టేషన్, 5జీ-అండదండలున్న అంబులెన్సులు.. ఈ ప్రక్రియలతో ప్రజారోగ్య రంగంలో నవకల్పన, ప్రజాసంబంధాల్లో ఈ ప్రాంగణం ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది.

వైద్య విద్యా రంగంలో, ఈ ప్రాంగణంలోని వివిధ సూపర్-స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కో బ్యాచ్లో 25 మంది ఏఎఫ్ఐహెచ్ శిక్షణార్థులు ఉన్నారు. వీరితో పాటు 125 మందికి పైగా ఎంబీబీఎస్, 83 మంది ఎండీ, ఎంఎస్ విద్యార్థులు, 15 మంది ఎంసీహెచ్, 12 మంది డీఆర్ఎన్బీ విద్యార్థులతో పాటు 72 మంది పారామెడికల్ విద్యార్థులు కూడా ఉన్నారు. డిజిటల్ గ్రంథాలయాలు, ఆధునిక ప్రయోగశాలలు, స్కిల్ ల్యాబులు, సిమ్యులేషన్-ఆధారిత శిక్షణ వసతులు, ప్రముఖ అధ్యాపకుల ఉపన్యాసాలు.. వీటన్నిటినీ కలబోసుకున్న ఒక సమృద్ధ విద్యాబోధన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఈ సంస్థ తీర్చిదిద్దింది. ఇది నేర్పడంతో పాటు నేర్చుకోవడం, పరిశ్రమతోనూ, సమాజంతోనూ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం, పరిశోధన-విజ్ఞానాల బదిలీ, సుపరిపాలనతో ముడిపడ్డ నాయకత్వం.. ఈ నాలుగు ఈఎస్ఐసీ ముఖ్య స్తంభాలనూ సగర్వంగా నిలబెడుతోంది.

ఈ చైతన్యభరిత, ఉన్నత పనితీరు కలిగి ఉన్న క్యాంపస్ ప్రజారోగ్య సేవలను అందించడంలో ముందుండడం ఒక్కటే కాకుండా, వైద్యచికిత్సల రంగంలో భావి ప్రముఖులను తీర్చిదిద్దుతున్న కేంద్రంగా కూడా మారుతోంది. ఒకదాని తరువాత మరొకటిగా విస్తరణ పథకాలను చేపడుతూ, సాంకేతికత, నైపుణ్యాలకు పదును పెట్టడం, రోగులకు సేవలపై దృష్టిని కేంద్రీకరించడం.. ఈ ఉద్దేశాలతో ఈఎస్ఐసీ సనత్ నగర్ ప్రాంగణం ప్రజారోగ్య సంరక్షణ, వైద్య విద్యాబోధన రంగాల్లో ఒక జాతీయ శ్రేష్ఠత్వ కేంద్రంగా రూపుదిద్దుకొంటోంది.
***
(Release ID: 2135960)