వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్య విస్తరణ ఉద్దేశంతో స్విస్ పారిశ్రామిక జగతితో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చర్చలు
తయారీ, ప్రతిభ,నవకల్పనలకు వ్యూహాత్మక కూడలిగా
భారత్ను చూడాలంటూ స్విస్ కంపెనీలకు శ్రీ గోయల్ విజ్ఞప్తి
శ్రీ గోయల్ అధ్యక్షతన బయోటెక్, ఆరోగ్యం, రక్షణ, సూక్ష్మ ఇంజినీరింగ్లతో పాటు నూతన సాంకేతికతలపై రౌండ్టేబుల్ సమావేశాలు
Posted On:
10 JUN 2025 11:59AM by PIB Hyderabad
స్విట్జర్లాండ్ పారిశ్రామిక రంగ దిగ్గజాలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ స్విట్జర్లాండ్ లోని బెర్న్లో సోమవారం (ఈ నెల 9న) ముఖ్య సమావేశాల్లో పాల్గొన్నారు. ఆర్థిక సహకారాన్ని విస్తరింప చేయడంతో పాటు భారతదేశానికి, యూరోప్ స్వేచ్చా వాణిజ్య సంఘం (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్..ఈఎఫ్టీఏ)కు మధ్య ఇటీవల సంతకాలైన వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ)లో భాగంగా కొత్త అవకాశాలను గుర్తించే లక్ష్యాలతో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
స్విట్జర్లాండ్లో వేర్వేరు రంగాలకు చెందిన ప్రధాన కంపెనీల నేతలతో మంత్రి భేటీ అయ్యారు. నవకల్పన, సాంకేతిక బదలాయింపు, దీర్ఘకాల ప్రాతిపదికన తయారీ.. వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతూ భారతీయ కంపెనీలకు, స్విస్ కంపెనీలకు మధ్య సమన్వయ- సహకారాలను ఎలా పెంపొందించవచ్చన్న అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. స్విస్ కంపెనీలు భారత్లో వాటి కార్యకలాపాలను ఇప్పటి కంటే మరింత పెంచుకోవాల్సిందిగాను, దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెటును, మార్కెట్లోని అవకాశాలను సద్వినియోగపరుచుకోవాల్సిందిగాను మంత్రి విజ్ఞప్తి చేశారు.
నియంత్రణలో పారదర్శక ప్రక్రియలు, మేధా సంపత్తి రక్షణకో పక్కా వ్యవస్థ, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను ప్రవేశపెడుతూ ఉండడం వంటి చర్యలతో వాణిజ్యానికి సానుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి భారత్ దృఢంగా నిబద్ధమై ఉందని స్విట్జర్లాండ్ కంపెనీల ప్రముఖులకు శ్రీ గోయల్ హామీనిచ్చారు. భారత్ను కేవలం ఒక మార్కెటుగా కాక, తయారీ, ప్రతిభ, నవకల్పనలకు వ్యూహాత్మక కూడలి (స్ట్రాటజిక్ హబ్)గా చూస్తూ అవకాశాలను అన్వేషించాల్సిందిగా స్విస్ వాణిజ్య సంస్థలను ఆయన ప్రోత్సహించారు.
ఈ వ్యూహాత్మక చర్చల తరువాత, రెండు విశిష్ట రౌండ్టేబుల్ సమావేశాలకు మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో స్విస్ పారిశ్రామిక జగతిలోని విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొన్నారు. వారు బయోటెక్-ఫార్మా, ఆరోగ్యసంరక్షణ, ప్రిసిషన్ ఇంజినీరింగ్, రక్షణ, సరికొత్త సాంకేతికతలు సహా వివిధ రంగాలపై చర్చించారు. స్విట్జర్లాండ్లోని భారతీయ రాయబార కార్యాలయం సహకారంతో భారతదేశంలో కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలు, తక్కువ ఖర్చు సౌలభ్యం, నవకల్పన పరంగా ఉత్సాహకరమైన వాతావరణం నెలకొనడం ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
‘ఇన్వెస్ట్ ఇండియా’లో ఈఎఫ్టీఏ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెస్కును సద్వినియోగపరుచుకోవాల్సిందిగా స్విట్జర్లాండ్ వాణిజ్య సంస్థలకు మంత్రి శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. ఆ డెస్కు సాయాన్ని తీసుకొంటే వాటికి అవసరమైన సహాయంతో పాటు సౌకర్యాలు కూడా లభించగలవని ఆయన తెలిపారు. నియంత్రణకు సంబంధించిన విషయాల్లో పొందిక, పరస్పర గుర్తింపుతో ముడిపడ్డ ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు భారత్ సుముఖంగా ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. స్విట్జర్లాండ్, భారత్ల పెట్టుబడులను ప్రోత్సహించడానికి పరస్పర సంబంధాలు ఏర్పరుచుకొనే దిశలో భారత్ సానుకూల వైఖరిని అవలంబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి స్విట్జర్లాండ్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) చాప్టర్ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. భారత్,స్విట్జర్లాండుల మధ్య వృత్తినిపుణులను, వాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థ (బిజినెస్ ఇకోసిస్టమ్)ను ఐసీఏఐ స్విస్ చాప్టర్ బలోపేతం చేస్తూనే మరో వైపు తాను అందిస్తున్న తోడ్పాటులు, ఐసీఏఐకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరుప్రతిష్టలతోపాటు ఉన్నత ప్రమాణాలను నిలబెడుతున్న తీరు ప్రశంసనీయంగా ఉందని ఆయన అన్నారు.
స్విస్ పారిశ్రామిక జగతిలో బయోటెక్నాలజీ, ప్రిసిషన్ మాన్యుఫాక్చరింగ్, ఆరోగ్యసంరక్షణ, ఆటోమేషన్, రక్షణ, సైబర్ భద్రత, ఉన్నత శ్రేణి సామగ్రి సహా విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలు.. ప్రపంచ ఆర్థిక మహాశక్తి గా, నవకల్పనల దన్నుతో వృద్ధిపథంలోకి దూసుకుపోతున్న దేశంగా భారత్ ప్రస్థానానికి ఢోకా లేదన్న దృఢ విశ్వాసాన్ని- సమావేశాలు కొనసాగిన క్రమంలో- వ్యక్తం చేశారు.
భారీ, క్రియాశీల మార్కెటు, అంతకంతకూ పెరుగుతున్న మధ్యతరగతి కుటుంబాలు, ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రతిభావంతులు, వాణిజ్య సౌలభ్యాన్ని, ఐపీ సంరక్షణను, సాంకేతిక భాగస్వామ్యాలను బాగా ప్రోత్సహిస్తున్న విధానాలు.. ఇలా భారత్ కున్న ప్రత్యేక బలాలపై కంపెనీలు ప్రశంసలు కురిపించాయి. చాలా మంది భారత్ను ఓ ఆశాజనక మార్కెట్ గానే కాకుండా తయారీ, పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉండే తరహా సేవలను (గ్లోబల్లీ కాంపిటీటివ్ సొల్యూషన్స్) కలిసికట్టుగా ఆవిష్కరించడానికి ఒక ఆదర్శ గమ్యస్థానంగా కూడా చూస్తున్నారు.
అనేక కంపెనీలు భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని సంయుక్త సంస్థలను (జాయింట్ వెంచర్స్.. జేవీలు) ఏర్పాటు చేయడంపైన, నిర్వహణ కార్యకలాపాలను పెంచడంపైన, స్థానికంగా ఉత్పాదనను చేపట్టడం పైన ఆసక్తిని వ్యక్తం చేశాయి. అత్యాధునిక కేన్సర్ చికిత్స పద్ధతులు, కణజాల సంబంధిత విజ్ఞానశాస్త్రాలు (సెల్ సైన్సెస్) మొదలు పారిశ్రామిక ఆటోమేషన్, ఫైబర్ ఆప్టిక్స్, అంతరిక్ష సాంకేతికతలతో పాటు డిజిటల్ భద్రత వరకు.. వీటిని అభివృద్ధిపరచడానికి భారత్ నిర్దేశించుకొన్న ప్రాధాన్య క్రమం, రంగాల వారీ వృద్ధి ప్రణాళికలతో సరిపోలే లక్ష్యాలను తాము కూడా పెట్టుకొని కలిసి పనిచేయాలనే ఆలోచనను స్విస్ కంపెనీలు చాటిచెప్పాయి. ఈ భావనతో ఒకే తరహా వ్యూహాత్మక, దీర్ఘకాలిక నిబద్ధతలు వ్యక్తం చేసినట్లయింది. స్విట్జర్లాండుకు భారత్ సహజ భాగస్వామి అని సమావేశాల్లో పాల్గొన్న వారు అభివర్ణించారు. వృద్ధి తాలూకు తదుపరి దశలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని వెల్లడించారు. దేశీయ డిమాండును నెరవేర్చడం ఒక్కటే కాకుండా, భారత్ను తమ వాణిజ్య కార్యకలాపాల గ్లోబల్ చైన్లో ఓ కూడలి (హబ్)గా నిలపాలన్నది కూడా దీని ఉద్దేశంగా ఉంది.
***
(Release ID: 2135402)