లోక్సభ సచివాలయం
పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన 10 బ్రిక్స్ దేశాల పార్లమెంట్లు: ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమనే భారత్ విధానానికి పూర్తి మద్దతు
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో బ్రెసిలియాలో 11వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదికను సందర్శించిన భారత ప్రతినిధి బృందం
12వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదిక అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్
Posted On:
06 JUN 2025 6:49PM by PIB Hyderabad
న్యూఢిల్లీ/బ్రెసిలియా 06 జూన్ 2025: 11వ బ్రిక్స్ పార్లమెంటరీ వేదిక 2025 జూన్ 4-5 తేదీల్లో బ్రెజిల్ లోని బ్రెసిలియాలో జరిగింది. ఇందులో భారతదేశంతో సహా మొత్తం 10 సభ్య దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంతో పాటు ఉన్నత స్థాయి పార్లమెంటరీ ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది.
భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా మొదలైన పది బ్రిక్స్ దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఆయా దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు ఈ సదస్సులో చురుగ్గా పాల్గొని ఉమ్మడి ప్రకటన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
కృత్రిమ మేధ (ఏఐ) బాధ్యతాయుతమైన వినియోగం, ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, అంతర్-పార్లమెంటరీ సహకారం, ప్రపంచ శాంతి, భద్రత వంటి కీలక అంతర్జాతీయ అంశాలపై పలు దఫాల ముమ్మర చర్చలు, సంప్రదింపుల అనంతరం విస్తృత ఏకాభిప్రాయం కుదిరింది.
వివిధ అంశాలపై భారతదేశ వైఖరికి ఈ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి. వాటిని ఏకగ్రీవంగా తుది సంయుక్త ప్రకటనలో చేర్చారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ దృఢమైన విధానాన్ని బలంగా సమర్థించారు. అన్ని ఉగ్రవాద దాడులను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించని విధానాన్ని అవలంబించాలని గట్టిగా వాదించింది.
భారత్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని సంయుక్త ప్రకటన తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమష్టిగా వ్యవహరించడానికి భారత్, సభ్యదేశాల పార్లమెంటరీ ప్రతినిధులు అంగీకరించారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక మద్దతును అరికట్టడానికి, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యాన్ని పెంచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నివారించడానికి, దర్యాప్తు, న్యాయ ప్రక్రియలలో సహకారాన్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రయత్నాల అవసరాన్ని శ్రీ బిర్లా స్పష్టం చేశారు.
భారతదేశ విధానానికి, నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచ శాంతి, భద్రత కోసం అన్ని సభ్య దేశాల క్రియాశీల భాగస్వామ్యం అవసరమని బ్రిక్స్ పార్లమెంటులు ధృవీకరించాయి. శ్రీ ఓం బిర్లా తన ప్రసంగంలో, వివిధ కీలక అంశాలపై భారతదేశం తీసుకున్న దృఢమైన, స్పష్టమైన స్థానాన్ని సమర్థవంతంగా ప్రస్తావించారు. ముఖ్యంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించిన శక్తిమంతమైన, తగిన ప్రతిస్పందనతో కూడిన కఠినమైన విధానాన్ని, ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ సహకారం, న్యాయమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణలలో భాగస్వామ్యం, ప్రజాస్వామ్యబద్ధంగా సమాచార మార్పిడికి సంబంధించి భారత్ దృఢ వైఖరిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
తదుపరి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరానికి భారత్ అధ్యక్షత
సదస్సు ముగింపులో, వచ్చే సంవత్సరం జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరానికి భారత్ ఆతిథ్యం అందిస్తుంది. లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు ఈ మేరకు అధికారికంగా అధ్యక్ష పదవిని అప్పగించారు.
ఇప్పటి నుంచి భారతదేశం బ్రిక్స్ దేశాల పార్లమెంట్ల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో చురుకైన పాత్ర పోషించనుంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లనుంది.
లోకసభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వం వహించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, రాజ్యసభ సభ్యుడు శ్రీ సురేంద్ర సింగ్ నాగర్, లోకసభ సభ్యులు శ్రీ విజయ్ బఘేల్, శ్రీ వివేక్ ఠాకూర్, డాక్టర్ శబరీ బైరెడ్డి ఉన్నారు.
***
(Release ID: 2134748)