వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వ్యాపారులు, టోకు, చిల్లర వ్యాపారులు, చిల్లర విక్రయ రంగంలోని బడా సంస్థలు, శుద్ధి సంస్థలకు గోధుమ సరుకు నిల్వపై పరిమితులు విధించిన కేంద్రం
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 మార్చి 31 వరకు ఈ నిల్వ సరుకు పరిమితి వర్తింపు
Posted On:
29 MAY 2025 4:23PM by PIB Hyderabad
సమగ్ర ఆహార భద్రత నిర్వహణతో పాటు దొంగ నిల్వలు, అన్యాయానికి వెనుకాడని సట్టావ్యాపారం.. ఈ రెండిటికీ అడ్డుకట్ట వేయడానికి వ్యాపారులు, టోకు, చిల్లర వ్యాపారులు, చిల్లర విక్రయ రంగంలోని బడా సంస్థలు (బిగ్ చైన్ రిటైలర్స్), ఆహార శుద్ధి సంస్థలకు గోధుమ నిల్వ సరుకుకు సంబంధించి భారత ప్రభుత్వం పరిమితులను విధించింది. లైసెన్సింగ్ ఆవశ్యకతల, నిల్వ సరుకుకు పరిమితుల తొలగింపు, నిర్దిష్ట ఆహార పదార్థాల రవాణా (సవరణ) ఉత్తర్వు-2025ను గత మంగళవారం (అంటే 2025 మే 27న) జారీ చేశారు. ఈ ఉత్తర్వు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 మార్చి 31 వరకు వర్తిస్తుంది.
గోధుమల నిల్వ సరుకు పరిమితులు ఈ కింది విధంగా ఉన్నాయి:
(i) వ్యాపారులు, టోకు వ్యాపారులకు: 3000 ఎంటీ
(ii) చిల్లర విక్రేతకు: ప్రతి చిల్లర విక్రయ దుకాణానికీ 10 ఎంటీ చొప్పున.
(iii) చిల్లర విక్రయరంగంలోని బడా సంస్థకు: ప్రతి చిల్లర విక్రయ దుకాణానికి 10 ఎంటీ వరకు. అయితే ఇది గరిష్ఠ నిల్వ పరంగా చూసినప్పుడు (దుకాణాల మొత్తం సంఖ్యను 10తో గుణించగా వచ్చే) ఎంటీగా ఉంటుంది. ఇది ఆయా సంస్థల అన్ని రిటైల్ అవుట్లెట్లు, డిపోలు కలుపుకొంటే అట్టిపెట్టుకో దగిన గరిష్ఠ నిల్వ అవుతుంది.
(iv) శుద్ధి సంస్థలకు: నెలవారీ స్థాపిత సామర్థ్యం (ఎంఐసీ)లో 70 శాతాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న నెలలతో గుణించాలి.
గోధుమ నిలవ సరుకును పెట్టుకొనే సంస్థలన్నీ ప్రతి శుక్రవారం నిల్వ సరుకు స్థితిని ప్రకటించడమో, సదరు సమాచారాన్ని తాజాపరచడమో చేయాలి. ఈ పనిని గోధుమల స్టాక్ పోర్టల్ (https://evegoils.nic.in/wsp/login) లో పూర్తి చేయాలి. గోధుమల స్టాక్ పోర్టల్ను త్వరలో https://foodstock.dfpd.gov.in లో చేర్చనున్నారు. ఏ సంస్థ అయినా పోర్టల్లో నమోదు కాకున్నా, లేదా నిల్వ సరుకు పరిమితులను అతిక్రమించినా ఆ సంస్థ నిత్యావసర వస్తువుల చట్టం-1955 లోని 6, 7 సెక్షన్లలో భాగంగా తగిన శిక్ష తీసుకుంటారు.
పైన ప్రస్తావనకు వచ్చిన సంస్థల వద్ద ఉన్న నిల్వ సరుకు నిర్దేశిత పరిమితికి మించిపోయినట్లయితే, అవే నిర్దిష్ట నిల్వ సరుకు పరిమితులను వారు నోటిఫికేషన్ జారీ అయిన 15 రోజుల్లో చూపించాలి. దేశంలో గోధుమలకు ఎలాంటి కృత్రిమ కొరతా రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకొనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ నిల్వ సరుకు పరిమితుల అమలును నిశితంగా పర్యవేక్షించనున్నారు.
పీడీఎస్, ఓడబ్ల్యూఎస్లతో పాటు మార్కెట్లో జోక్యం చేసుకొనేందుకు ఉద్దేశించిన ఇతర పథకాల కోసం అవసరంపడేటంత నిల్వలను కలిగి ఉండడానికి ఎఫ్సీఐ, రాష్ట్రాల ఏజెన్సీల ద్వారా 298.17 ఎంటీ గోధుమలను (ఈ నెల 27 వరకు) కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ధరలను నియంత్రిస్తూ ఉండటంతో పాటుగా దేశంలో గోధుమల లభ్యత సులభసాధ్యమయ్యేటట్టు చూసే ఉద్దేశంతో ఆహార, ప్రజా పంపిణీ విభాగం గోధుమ నిల్వ సరుకు స్థితిని శ్రద్ధగా గమనిస్తోంది.
***
(Release ID: 2132444)