సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జాతీయ అనుభవ్ అవార్డుల పథకం- 2025 కింద 2025 అగస్టు 18న అనుభవ్ అవార్డులను ప్రదానం చేయనున్న కేంద్ర పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
42 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి ప్రచురితమైన
1459 అనుభవాల్లో 05 అనుభవ్ అవార్డులు, 10 జ్యూరీ ధ్రువపత్రాలకు ఎంపిక
తొలిసారిగా పాల్గొని జాతీయ అనుభవ్ అవార్డుల పథకం కింద తుది జాబితాలో చోటు సంపాదించుకున్న సీపీఎస్ఈలు, పీఎస్బీలు
Posted On:
28 MAY 2025 5:22PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పదవీ విరమణ చేస్తోన్న, చేసిన ఉద్యోగులు వారి ఉద్యోగ జీవితంలోని అనుభవాలను పంచుకునేందుకు పింఛన్లు, పింఛనుదారుల సంక్షేణ శాఖ 2015లో అనుభవ్ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది.
ఆ తర్వాత పదవీ విరమణ చేస్తోన్న, చేసిన ఉద్యోగులు తమ అనుభవాలను సమర్పించేలా ప్రోత్సహించేందుకు వార్షిక అవార్డుల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు 59 అనుభవ్ అవార్డులు, 19 జ్యూరీ ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.
2025కు సంబంధించిన ప్రకటించిన జాతీయ అనుభవ్ అవార్డుల పథకానికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ఉద్యోగులు కూడా దేశ నిర్మాణంలో వారి తోడ్పాటును గుర్తించే ఈ పథకంలో పాల్గొన్నారు. 2024 జనవరి 04 నుంచి 2025 మార్చి 31 వరకు ప్రచురించిన ఉద్యోగుల అనుభవాలను ప్రస్తుత అవార్డులకు పరిగణనలోకి తీసుకున్నారు.
'అనుభవ్ కలయిక కార్యక్రమం’ నిశిత పర్యవేక్షణలో రికార్డు స్థాయిలో 42 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి మొత్తం 1459 రైటప్లు ప్రచురితమయ్యాయి. 2023లో 30 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి మాత్రమే అనుభవాలు ప్రచురితమయ్యాయి.
ప్రచురితమైన ఈ అనుభవాల తర్వాత తగిన ప్రక్రియను అనుసరించి రెండు స్థాయిలలో పరీక్షించారు. తద్వారా 05 మంది అనుభవ్ అవార్డు గ్రహీతలు, 10 మంది జ్యూరీ ధ్రువపత్రాల విజేతలను ఖరారు చేశారు.
అనుభవ్ అవార్డు గ్రహీతలలో.. భూ వనరుల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ హుకుం సింగ్ మీనా, ఎస్బీఐ సీజీఎం శ్రీమతి షాలిని కాకర్, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి ఓఎస్డీ శ్రీ ఎం. వెంకటేషన్, సీనియర్ పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ ఓ. విరూపాక్షప్ప, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ సాజు పీ.కే ఉన్నారు.
జ్యూరీ ధ్రువపత్రాల కోసం ఎంపికైన వారిలో బీహెచ్ఈఎల్ డైరెక్టర్ శ్రీ జై ప్రకాష్ శ్రీవాస్తవ, డీఆర్డీఓ శాస్త్రవేత్త శ్రీ వినోద్ పీ, అంతరిక్ష శాఖ అత్యుత్తమ శాస్త్రవేత్త డాక్టర్ జాలీ ధర్, డీఓటి స్పెషల్ డీజీ శ్రీ సునీత చెరోదత్, డీఆర్డీఓ శాస్త్రవేత్త శ్రీ సాబు సెబాస్టియన్ ఎం, జల శక్తి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెలగ కుమారి, ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ జీడీ శ్రీ సంతోష్ గావ్లి, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ శ్రీ బాలం సింగ్ రావత్, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్,ఫార్మసిస్ట్ శ్రీ ఎస్. మీనాక్షి సుందరం.. సీఆర్పీఎఫ్ ఎస్ఐ, జీడీ శ్రీ షీలా రాణి పోద్దార్ ఉన్నారు.
అనుభవ్ అవార్డులు, జ్యూరీ ధ్రువపత్రాలను 2025 అగస్టు 18న జాతీయ స్థాయి కార్యక్రమంలో సహాయ మంత్రి (పీపీ) డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేయనున్నారు.
***
(Release ID: 2132212)