మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
లివర్పూల్ విశ్వవిద్యాలయానికి ఎల్ఓఐ అందించే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
భారత్లో క్యాంపస్ ఏర్పాటు చేసిన రెండో యూకే విశ్వవిద్యాలయంగా లివర్పూల్ విశ్వవిద్యాలయం
ఎస్టీఈఎమ్లో క్యాంపస్లను ప్రారంభించనున్న 15 విదేశీ విశ్వవిద్యాలయాలు - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
సుస్థిరత, ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి నేటి ప్రపంచ ఉమ్మడి ఎజెండా
హాట్స్పాట్లుగా విశ్వవిద్యాలయాలు - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
26 MAY 2025 3:13PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన లివర్పూల్ విశ్వవిద్యాలయానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) అందించే కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. యుజిసి (భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల అనుబంధ కళాశాలల ఏర్పాటు - నిర్వహణ) నిబంధనలు, 2023 ప్రకారం ఎల్ఓఐ జారీ అయిన రెండో విదేశీ విశ్వవిద్యాలయమిది.
భారత్లో బ్రిటిష్ హైకమిషనర్ శ్రీమతి లిండీ కామెరూన్ సీబీ ఓబీఈ, యుజిసి తాత్కాలిక ఛైర్మన్, విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి శ్రీ డాక్టర్ వినీత్ జోషి, లివర్పూల్ యూనివర్సిటీ వైస్-ఛాన్సెలర్ ప్రొఫెసర్ టిమ్ జోన్స్, లివర్పూల్ యూనివర్సిటీ గ్లోబల్ ఎంగేజ్మెంట్ అండ్ పార్టనర్షిప్స్ ప్రో-వైస్-ఛాన్సెలర్ ప్రొఫెసర్ తారిఖ్ అలీ, విదేశీ వ్యవహారాల శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లకు చెందిన అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఆర్సీఓజీ), ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్, యూవీకెన్, డ్రీమ్11 వంటి కంపెనీలు, సంస్థలతో భవిష్యత్ సహకార అవకాశాల అన్వేషణ లక్ష్యంగా ఈరోజు మూడు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, ప్రపంచ ఉన్నత విద్యలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఆవిర్భవించడాన్ని ఈ ఎల్ఓఐ పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రముఖ ప్రపంచ విశ్వవిద్యాలయాలతో విద్యా భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా భారత ప్రయాణంలో ఇది మరో మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 పరివర్తనాత్మక దార్శనికతలో దృఢంగా పొందుపరచి ఉన్న ఆకాంక్షగా దీనిని ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను పునరుద్ఘాటిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి నిర్దేశించారని కేంద్ర విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి ఎన్ఈపీ 2020ని అక్షరాలా అమలు చేయడం కీలకమని ఆయన స్పష్టం చేశారు. మూలాలకు కట్టుబడిన, భవిష్యత్తు కోసం సన్నద్ధమైన, ప్రపంచస్థాయి విద్యను ఎన్ఈపీ 2020 ప్రాథమిక సిఫార్సుల్లో ఒకటిగా పేర్కొన్న ఆయన, దీని లక్ష్యం ప్రపంచస్థాయి పౌరులను తయారు చేయడమేనని తెలిపారు.
పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని శ్రీ ప్రధాన్ కోరారు. లివర్పూల్ విశ్వవిద్యాలయం ఆవిష్కరణలకు దారితీసే ఎస్టీఈఎమ్-సంబంధిత పరిశోధనలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. నవతరం నుంచి ప్రపంచస్థాయి పౌరులను తయారుచేయడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఈ ఆవిష్కరణ కేంద్రం విశ్వవిద్యాలయానికి, సమాజానికి రెండింటి కోసం పరస్పర ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో తమ క్యాంపస్ ఏర్పాటు గురించి బహిరంగంగా ప్రకటించిన నాలుగో విదేశీ విశ్వవిద్యాలయంగా లివర్పూల్ విశ్వవిద్యాలయం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నాటికి, ముఖ్యంగా ఎస్టీఈఎమ్బీలో 15 విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో అనుబంధ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
బెంగళూరులోని లివర్పూల్ విశ్వవిద్యాలయ ప్రాంగణం పరిశోధన, ఆవిష్కరణల హద్దులను అధిగమించి, ప్రపంచ సంక్షేమం, శ్రేయస్సుకు దోహదపడే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ప్రపంచస్థాయి అనుబంధ కళాశాలగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిరత్వం, ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి నేటి ప్రపంచపు సాధారణ ఎజెండాగా పేర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి, విశ్వవిద్యాలయాలు వీటి కోసం హాట్స్పాట్లుగా ఉన్నాయని తెలిపారు. 'వసుధైక కుటుంబం' భావనతో ప్రపంచ ఎజెండాను కొనసాగిస్తూ, ప్రపంచ బాధ్యతలను నెరవేర్చడానికి భారత్ తగిన ప్రదేశమని ఆయన అన్నారు.
డాక్టర్ వినీత్ జోషి మాట్లాడుతూ, లెటర్ ఆఫ్ ఇంటెంట్ కేవలం ఒక వేడుకను సూచించేది మాత్రమే కాదని, ఇది భారత ఉన్నత విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న విస్తృత, లోతైన పరివర్తనను ప్రతిబింబిస్తుందన్నారు. ఇది వ్యూహాత్మక సంస్కరణ, అంతర్జాతీయ భాగస్వామ్యం, విధానపరమైన బలమైన పునాది ద్వారా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ విద్యను మరింత సమ్మిళితంగా, ప్రపంచంతో పోటీపడేలా, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంచే లక్ష్యంతో ఎన్ఈపీ 2020 లక్ష్యాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఈపీ 2020 పరివర్తనాత్మక ఎజెండాలో భాగంగా ఉన్న అంతర్జాతీయీకరణ ఒక ప్రధాన ప్రాధాన్యంగా మారిందన్న ఆయన, ఇది ప్రపంచ కనెక్టివిటీ, ఉన్నత ప్రమాణాలు, సంస్థాగత సౌలభ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు.
లివర్పూల్ విశ్వవిద్యాలయం బెంగళూరులో తొలి విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్ను ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఆమోదాన్ని పొందింది. 2026, ఆగస్టులో అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థుల మొదటి బ్యాచ్ను స్వాగతించేలా షెడ్యూల్ చేసిన ఈ క్యాంపస్లో.. మొదట బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంటింగ్-ఫైనాన్స్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ సైన్సెస్ వంటి ప్రోగ్రామ్లను అందించనున్నారు. ముఖ్యంగా, ఇది గేమ్ డిజైన్లో ఒక ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెడుతుంది. భారత్లోని యూకే విశ్వవిద్యాలయ క్యాంపస్ ఒక ప్రత్యేకమైన ఆఫర్గా ఈ వినూత్న సబ్జెక్టును అందించనుంది. ఈ కొత్త క్యాంపస్ అంతర్జాతీయ విద్య కోసం యూకే విద్యార్థులకు ఒక ఉత్తేజకరమైన గమ్యస్థానంగా ఉంటూ, ప్రపంచస్థాయి జ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు సమృద్ధిగా అవకాశాలు కల్పించనుంది.
బెంగళూరు క్యాంపస్ పరిశోధనాభివృద్ధి కోసం అన్ని రకాల వసతులు, సదుపాయాలను అందించనుంది. ముఖ్యమైన ప్రాథమిక, అనువర్తిత, పరిశ్రమ ఆధారిత పరిశోధనలకు బెంగళూరు క్యాంపస్ వేదికగా మారనుంది, ఇది ప్రపంచస్థాయి, స్థానిక సవాళ్లు అలాగే అవసరాల కోసం పరిష్కారాలను అందిస్తుంది. యాజమాన్యాలతో విశ్వవిద్యాలయానికి గల సుస్థిర సంబంధాలు, విజయవంతమైన పూర్వ విద్యార్థులు, వ్యాపారం, వ్యవస్థాపక కార్యకలాపాల కోసం మెరుగైన మద్దతు ద్వారా ఈ క్యాంపస్ విద్యార్థులు విజయవంతంగా తాము ఎంచుకున్న కెరీర్ కొనసాగించడానికి.. ఉన్నత చదువులకు వెళ్లడానికి అవసరమైన నైపుణ్యాలను అందించనుంది.
నిజమైన అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా, ఇది లివర్పూల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విద్యాపరమైన, వృత్తిపరమైన, వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం ముఖ్యమైన అవకాశాలను.. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన అంతర్జాతీయ దృక్పథాన్ని పొందే వీలున్న గ్లోబల్ మొబిలిటీ స్కీమ్ను కూడా భారత విద్యార్థులకు అందుబాటులో ఉంచనుంది. ప్రపంచ పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన, విభిన్న అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలు, విద్యార్థులను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో పోటీ పడటానికి, ప్రపంచ శ్రామిక శక్తికి అర్థవంతమైన తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉండే పట్టభద్రులుగా తీర్చిదిద్దనున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా 'ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ బియాండ్', 'ది ఇండియా–యూకే ఛాలెంజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)' అనే శీర్షికలతో రెండు ప్యానెల్ చర్చలు కూడా నిర్వహించారు.
లివర్పూల్ విశ్వవిద్యాలయం గురించి
1881లో ఒరిజినల్ 'రెడ్ బ్రిక్'గా స్థాపించిన ఈ లివర్పూల్ విశ్వవిద్యాలయం, యూకేలోని పరిశోధనాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించే ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలలో ఒకటిగా ఉంది. దీని వార్షిక టర్నోవర్ 708.3 మిలియన్ల యూరోలు. ప్రపంచవ్యాప్తంగా గల టాప్ 175 విశ్వవిద్యాలయాల్లో సుస్థిరమైన ర్యాంక్తో, యూకేలోని ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాలతో కూడిన ప్రతిష్ఠాత్మక రస్సెల్ గ్రూపులో మెంబర్గా ఉంది. దేశంలోని అతిపెద్ద పౌర సంస్థల్లో ఒకటిగా మన విద్యా వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్త విస్తరణను, ప్రభావాన్ని కలిగి ఉంది.
***
(Release ID: 2131396)