నీతి ఆయోగ్
మధ్యతరహా పరిశ్రమల కోసం విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ నివేదిక
మధ్యతరహా పరిశ్రమలే భవిష్యత్తులో పెద్ద సంస్థలు.. వికసిత భారత్కు చోదకాలు
భారత జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 29%
60% శ్రామిక శక్తికి ఎంఎస్ఎంఈలతో ఉపాధి
ఎంఎస్ఎంఈల్లో మధ్యతరహా పరిశ్రమల వాటా 0.3 శాతమే అయినా,
ఆ రంగంలో ఎగుమతుల్లో 40 శాతం వాటా.. వాటి సమర్థతకు ఇది నిదర్శనం
తగిన ఆర్థిక మార్గాలు, సాంకేతిక ఏకీకరణ, ఇండస్ట్రీ 4.0, క్లస్టర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు,
పరిశోధన- అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, కేంద్రీకృత డిజిటల్ పోర్టలుపై దృష్టి
Posted On:
26 MAY 2025 1:52PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యతరహా పరిశ్రమలను భవిష్యత్ వృద్ధి చోదకాలుగా నిలిపే సమగ్ర ప్రణాళికను అందిస్తూ.. ‘మధ్యతరహా పరిశ్రమల కోసం విధాన రూపకల్పన’ పేరిట నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వాటికి తక్కువ ప్రాధాన్యమే ఇస్తున్నారని ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొన్నది. వాటి పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించడం లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించింది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్, డాక్టర్ అరవింద్ వీర్మానీ సమక్షంలో వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ నివేదికను ఆవిష్కరించారు.
దేశ జీడీపీలో దాదాపు 29 శాతం, ఎగుమతుల్లో 40 శాతం వాటాతోపాటు శ్రామిక శక్తిలో 60 శాతానికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో నిర్మాణాత్మక అసమతౌల్యాన్ని ఈ నివేదిక పరిశీలిస్తుంది. కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగం కూర్పు అసమానంగా ఉంది: నమోదైన ఎంఎస్ఎమ్ఈలలో 97% సూక్ష్మ సంస్థలు, 2.7% చిన్న సంస్థలు కాగా, 0.3% మాత్రమే మధ్యతరహా సంస్థలు.
అయితే, ఈ 0.3 శాతం మధ్యతరహా పరిశ్రమల నుంచే దాదాపు 40% ఎంఎస్ఎంఈ ఎగుమతులు జరుగుతున్నాయి. భారీ, ఆవిష్కరణ ఆధారిత యూనిట్లుగా వాటి సామర్థ్యాన్ని ఇంకా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తుంది. వికసిత భారత్ @2047లో భాగంగా స్వయంసమృద్ధి, అంతర్జాతీయ పారిశ్రామిక పోటీతత్వం దిశగా భారత పరివర్తనలో మధ్యతరహా సంస్థలను వ్యూహాత్మక పాత్రధారులుగా ఈ నివేదిక గుర్తించింది.
పరిమిత ఆర్థిక వనరులు, అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో పరిమితులు, పరిశోధన- అభివృద్ధికి తగినంత చేయూత లేకపోవడం, రంగాల వారీగా పరీక్ష మౌలిక సదుపాయాలు లేకపోవడం, శిక్షణ కార్యక్రమాలు - సంస్థల అవసరాలకు మధ్య అసమతౌల్యం సహా మధ్యతరహా సంస్థలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను ఈ నివేదిక ప్రస్తావించింది. ఇవి వాటి స్థాయిని పరిమితం చేయడంతోపాటు ఆవిష్కరణ సామర్థ్యానికీ ఆటంకంగా ఉన్నాయి.
ఈ సమస్యల పరిష్కారం కోసం, ఆరు ప్రాధాన్య రంగాల్లో లక్ష్యాల సాధన దిశగా కార్యక్రమాలతో సమగ్ర విధానాలను ఈ నివేదిక వివరిస్తుంది:
-
తగిన ఆర్థిక సాధనాలు: సంస్థ టర్నోవర్తో ముడిపడి ఉన్న నిర్వహణ మూలధన పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టడం, మార్కెట్ రేట్ల ప్రకారం రూ.5 కోట్ల క్రెడిట్ కార్డు సదుపాయం, రిటైల్ బ్యాంకుల ద్వారా త్వరితగతిన నిధుల పంపిణీ యంత్రాంగాలు, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ.
-
సాంకేతిక ఏకీకరణ, ఇండస్ట్రీ 4.0: ఇండస్ట్రీ 4.0 అంశాలను ప్రోత్సహించేలా ప్రస్తుత సాంకేతిక కేంద్రాలను రంగాలవారీగా, ప్రాంతీయంగా అనుకూలీకరించిన ఇండియా ఎస్ఎంఈ 4.0 సామర్థ్య కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం.
-
పరిశోధన - అభివృద్ధి ప్రోత్సాహక యంత్రాంగం: ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో పరిశోధన- అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, జాతీయ ప్రాధాన్యం కలిగిన క్లస్టర్ ఆధారిత ప్రాజెక్టుల కోసం స్వయంసమృద్ధ భారత్ నిధిని ఉపయోగించడం.
-
క్లస్టర్ ఆధారిత పరీక్ష సదుపాయాలు: అనుమతులను సులభతరం చేయడంతోపాటు ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి రంగాలవారీగా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం.
-
నైపుణ్యాభివృద్ధి: ప్రాంతాలు, రంగాల వారీగా పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య కార్యక్రమాలను రూపొందించడం, ప్రస్తుత పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో (ఈఎస్డీపీ) మధ్యతరహా సంస్థల కేంద్రీకృత నమూనాలను అనుసంధానం చేయడం.
-
కేంద్రీకృత డిజిటల్ పోర్టల్: ఉద్యమ్ వేదికలో ప్రత్యేక సబ్పోర్టల్ ఏర్పాటు చేయడం. సంస్థలు తమ వనరులను సమర్థంగా గుర్తించడంలో సాయపడేలా పథకాలను గుర్తించే సాధనాలు, అనుమతుల కోసం చేయూత, ఏఐ ఆధారిత సహాయాన్ని ఈ సబ్ పోర్టల్లో అంతర్భాగం చేయడం.
సమ్మిళిత విధాన రూపకల్పనను సహకారంతో కూడిన నిర్వహణ దిశగా మళ్లించడం ద్వారా మధ్యతరహా సంస్థల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. పెట్టుబడి, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, సమాచారాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా.. సృజనాత్మకత, ఉపాధి, ఎగుమతుల్లో వృద్ధికి చోదకాలుగా మధ్యతరహా పరిశ్రమలు నిలుస్తాయి. 2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేసుకోవడానికి ఇది అత్యంత కీలకమైన అంశం.
పూర్తి నివేదికను ఇక్కడ చదవండి: https://www.niti.gov.in/sites/default/files/2025-05/Designing-a-Policy-for-Medium-Enterprises.pdf
***
(Release ID: 2131393)