గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
రైల్వేలు మన ఆర్థిక వ్యవస్థలో, మన గుర్తింపులో ఓ భాగం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని
• పునరభివృద్ధి పనులు పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్లోని సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభం
Posted On:
22 MAY 2025 2:02PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు మన ఆర్థిక వ్యవస్థలో భాగం మాత్రమే కాదనీ, మన గుర్తింపులోనూ ఒక భాగమేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరభివృద్ధి పనులు పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్లోని సూళ్ళూరుపేట రైల్వే స్టేషనును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రోజు ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడారు. భారతీయ రైల్వేలు ప్రతి రోజూ రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయనీ, అంతేకాకుండా ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యాజమాన్య సంస్థ కూడా భారతీయ రైల్వేలనీ మంత్రి అన్నారు.
ప్రస్తుతం భారత్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే అది ఒక్క సౌకర్యాల గురించే కాదనీ, అది విశ్వాసాన్ని పెంపొందించడం గురించి కూడానని మంత్రి వ్యాఖ్యానించారు. మనకు సులభంగా చేరుకోగలిగే, సమర్ధమైన, మన దేశ గౌరవానికి అద్దం పట్టే స్టేషన్లు అవసరమని చెప్పారు. ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, రైల్వేలకు భారత అభివృద్ధి కార్యక్రమాల పట్టికలో కీలక స్థానాన్ని ఇచ్చాం. ఆయన విధానం స్పష్టం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలలో మార్పు తీసుకురావాలి. ప్రయాణికులకు కలిగే అనుభూతులను పెంపొందించాలి. రైల్వే స్టేషన్లను మన దేశ పట్టణ ప్రాంత పునరుద్ధరణ కృషితో అనుసంధానించాలి’’ అని మంత్రి వివరించారు.
దేశంలో 1,300కు పైగా స్టేషన్లకు సరికొత్త రూపురేఖలను కల్పించాలనే ఉద్దేశంతో అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొదించినట్లు శ్రీ పెమ్మసాని తెలిపారు. రూ.14.5 కోట్ల ఖర్చుతో సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులను చేశారని తెలిపారు. ఈ స్టేషన్ పవిత్రమైన తిరుపతి జిల్లాలో ఉండడంతో భారతీయ రైల్వే చిత్రపటంలో ఈ స్టేషనుకు తనదైన ప్రత్యేక స్థానం ఉంది. అదీకాక, మన దేశంలో ప్రధాన స్పేస్పోర్టు అయిన శ్రీహరికోటకు చాలా దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ కూడా సూళ్లూరుపేటయే.
గత 11 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులను గురించి మంత్రి ప్రస్తావిస్తూ... 2025–26లో బడ్జెటు కేటాయింపు రూ.9,417 కోట్లకు పెరిగిందనీ, ఇది 2009–14లో కేటాయించిన దాని కన్నా 10 రెట్లకు పైగానే అనీ తెలిపారు. మొత్తం 414 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలను జోడించారనీ, 1,217 కి.మీ. మేర రైలుమార్గాల డబ్లింగ్ పూర్తి చేశారనీ, మొత్తం 3,748 కి.మీ. మేర రైలుమార్గాన్ని విద్యుదీకరించారన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీము ఒక్క దానిలో భాగంగానే, ఆంధ్ర ప్రదేశ్లో 73 స్టేషన్ల పునరభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఇదొక రికార్డనీ మంత్రి చెప్పారు.
***
(Release ID: 2130575)