ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
150 బిలియన్లు దాటిన ‘ఆధార్’ ప్రమాణీకృత లావాదేవీలు భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, సంక్షేమ సేవలకు ఊతం
• గత నెల ఈకేవైసీ లావాదేవీల్లో సుమారు 40 శాతం పెరుగుదల
అన్ని రంగాల్లోనూ వినియోగదారుల అనుభవం మెరుగవడంతోపాటు
మరింత సులభతరంగా మారిన వ్యాపార నిర్వహణ
• 14 కోట్ల లావాదేవీలతో యూఐడీఏఐ ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ ఆధారిత
ముఖ ధ్రువీకరణ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ...
అంతరాయాలకు తావు లేని విధంగా సేవలకు అవకాశం
Posted On:
16 MAY 2025 5:43PM by PIB Hyderabad
ఆధార్ ప్రమాణీకరణ సంబంధిత లావాదేవీల మొత్తం సంఖ్య 150 బిలియన్ల (15,011.82 కోట్ల) స్థాయిని మించిపోయింది. ఇది భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా- యూఐడీఏఐ) ప్రస్థానంతోపాటు ‘ఆధార్’ అనుబంధ విస్తారిత వ్యవస్థ ఎదుగుదలలో ఒక ముఖ్య ఘట్టాన్ని సూచిస్తోంది.
‘ఆధార్’ను విరివిగా ఉపయోగిస్తున్నారనీ, దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లుతోందనీ ఈ మహత్తర సన్నివేశం ప్రముఖంగా చాటిచెబుతోంది. ‘ఆధార్’ను ఆరంభించింన దగ్గర నుంచీఈ సంవత్సరం ఏప్రిల్ వరకు గణాంకాలను పరగణనలోకి తీసుకున్నారు.
జీవించడాన్ని సులభతరంగా మార్చడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలోనూ సేవాప్రదాత సంస్థలు సమకూర్చే వివిధ సేవలను స్వచ్ఛందంగా పొందడంలో ‘ఆధార్’ ఆధారిత ప్రమాణీకరణ ఒక ముఖ్య భూమికను పోషిస్తోంది. ఒక్క ఏప్రిల్లోనే, దాదాపు 210 కోట్ల ‘ఆధార్’ ఆధారిత ప్రమాణీకరణ లావాదేవీలు జరిగాయి. ఇది 2024 లో ఏప్రిల్లో జరిగిన లావాదేవీలతో పోల్చి చూసినప్పుడు సుమారు 8 శాతం ఎక్కువని తేలింది.
ఈకేవైసీతో వినియోగదారు అనుభవంలో మెరుగుదల
ఆధార్ ఈకేవైసీ సేవ అనేది బ్యాంకు సేవలు, ఇతర ఆర్థిక సేవలు సహా ఇతర రంగాల్లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో, వ్యాపార నిర్వహణను సులభతరంగా మార్చడంలో ఓ కీలక పాత్రను పోషిస్తూ వస్తోంది.
2025 ఏప్రిల్లో జరిగిన ఈకేవైసీ లావాదేవీల (37.3 కోట్లు) మొత్తం సంఖ్య గడచిన సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 39.7 శాతం ఎక్కువ. 2025 ఏప్రిల్ నాటికి ఈకేవైసీ లావాదేవీల మొత్తం సంఖ్య 2393 కోట్లను మించింది.
యూఐడీఏఐ ఆధారిత ముఖ ప్రమాణీకరణ ప్రక్రియకు పెరుగుతున్న ఆదరణ
యూఐడీఏఐ సొంతంగా అభివృద్ధిపరిచిన కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత ముఖ ప్రమాణీకరణ (ఫేస్ ఆథెంటికేషన్) పద్ధతి ప్రజాదరణకు నోచుకొంటోంది. ఏప్రిల్లో ఈ తరహా కార్యకలాపాలు ఇంచుమించుగా 14 కోట్ల మేరకు జరిగాయి. ఇది ఈ ప్రమాణీకరణ పద్ధతిని అంగీకరించడంతోపాటు ఆధార్ సంఖ్యను కలిగి ఉన్న వారికి దీనితో ఎలాంటి సహజ ప్రయోజనాలు లభిస్తున్నాయో తెలియజేస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు రెండిటిలో 100 కన్నా ఎక్కువ సంస్థలు ప్రయోజనాలు, సేవలను సాఫీగా అందజేయడం కోసం ముఖ ప్రమాణీకరణ పద్ధతిని ఉపయోగించుకొంటున్నాయి.
***
(Release ID: 2129298)