రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నాణ్యమైన ఆయుధ సంపత్తి, శక్తిమంతమైన, సుశిక్షితులైన భద్రతా సిబ్బంది వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతం: నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ 2025లో రక్షణ మంత్రి


* ‘‘భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన దేశంగానే ఉంటుంది, ఆ సంయమనాన్ని ఎవరైనా అలుసుగా తీసుకుంటే ‘తీవ్రమైన పర్యవసానాలు’ ఎదుర్కోవాల్సి వస్తుంది’’

* సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏ పరిమితీ భారత్‌కు అడ్డంకిగా మారదు, భవిష్యత్తులో సైతం బాధ్యతాయుతమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

* ‘‘రక్షణ పారిశ్రామిక వ్యవస్థ విస్తరణ భారత్‌కు అపూర్వ బలాన్ని అందిస్తోంది’’

* ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, అతి పెద్ద రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదగాలంటే.. మనం పరికరాలపై అంతర్జాతీయంగా విశ్వాసాన్ని పెంపొందించడం అవసరం’’

Posted On: 08 MAY 2025 5:53PM by PIB Hyderabad

‘‘నాణ్యమైన ఆయుధ సంపత్తి, శక్తిమంతమైన, సుశిక్షితులైన భద్రతా సిబ్బంది వల్లనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో రక్షణ మంత్రి ప్రసంగించారు. ఏ అమాయక పౌరుడికి హాని చేయకుండా, అతి తక్కువ నష్టంతో త్రివిధ దళాలు ఆపరేషన్ పూర్తి చేశాయని, ఇది ఊహకు అందని విజయమని, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
‘‘ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో ‘నాణ్యత’ పోషించే కీలకపాత్రను తెలియజేస్తుంది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
అత్యంత సంయమనం పాటించే బాధ్యతాయుతమైన దేశంగా భారత్ ఎల్లప్పుడూ తన పాత్రను పోషిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. అలాగే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే విధానాన్ని విశ్వసిస్తుందని ఆయన తెలిపారు. ఈ సహనాన్ని ఎవరైనా అలుసుగా తీసుకుంటే వారు  ‘తీవ్రమైన పర్యవసానాలు’ ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి  హెచ్చరించారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో ప్రభుత్వానికి ఏ పరిమితి ప్రతిబంధంకంగా మారదని హామీ ఇచ్చారు. ‘‘భవిష్యత్తులో కూడా ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రతిచర్యలు చేపట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

సదస్సు ఇతివృత్తమైన ‘ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ త్రూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ప్రాసెసెస్’’ గురించి తన ఆలోచనలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంలో కనిపిస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే వేగంగా నాణ్యతను అంచనా వేయడం ప్రస్తుతం చాలా అవసరమని పేర్కొన్నారు.

రక్షణ రంగంలో సార్వభౌమత్వం అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిద్ధాంతం ఆధారంగా 2014 నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ‘‘రక్షణ సార్వభౌమత్వం అంటే ఒక దేశం తన భద్రతా అవసరాలకు సంబంధించి తన సామర్థ్యాన్ని పెంచుకొని స్వయం సమృద్ధి సాధించే వరకు ఆ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని భావించలేం. విదేశాల నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేసుకుంటూ ఉంటే.. మన దేశ భద్రతను వారి దయకు వదిలేస్తున్నట్టే. అందుకే ఈ అంశంపై మా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి ఈ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నిర్ణయాత్మక అడుగు వేసింది. విస్తరిస్తున్న రక్షణ పారిశ్రామిక రంగం దేశాన్ని మునుపెన్నడూ లేని విధంగా శక్తిమంతం చేసింది’’ అని తెలిపారు. 

 

రక్షణ ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణాలకు సమాన ప్రాధాన్యమిస్తూ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ) కార్పొరేటీకరణ సహా అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నాణ్యతను ప్రభుత్వ ప్రాధాన్య సంస్కరణల ఎజెండాగా ఆయన అభివర్ణించారు. ఓఎఫ్‌బీ కార్పొరేటీకరణ తర్వాత, నాణ్యమైన ఉత్పత్తిని కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలతో అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యం పొందిన డీపీఎస్‌యూలు ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చెందినట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

ప్రైవేట్ రక్షణ రంగ వ్యవస్థలో ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం ప్రభుత్వ రంగ పురోగతికి కారణమైన లక్ష్యాల్లో ఒకటిగా పేర్కొన్న రక్షణ మంత్రి, ఇది నాణ్యత ద్వారా భారత భద్రతను బలోపేతం చేస్తుందన్నారు. “నేటి ప్రపంచంలో, కేవలం ఒక ఉత్పత్తి కంటే దాని బలమైన బ్రాండ్ విలువ ముఖ్యమైనది, సుస్థిర నాణ్యత, విశ్వసనీయతకు హామీ ఇచ్చే బ్రాండ్ మాత్రమే విజయవంతం అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి అయిన అత్యాధునిక బ్రాండ్‌గా నిలపాలని ఈ కార్యక్రమానికి హాజరైన సాయుధ దళాలు, ప్రభుత్వ క్యూఏ ఏజెన్సీలు, డీఎస్‌పీయూలు, ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు అలాగే ఎమ్ఎస్ఎమ్ఈల ప్రతినిధులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. “బ్రాండ్ ఇండియా అంటే ఒక భారత కంపెనీ చేసిన వాగ్ధానం ఏదైనా, అది కచ్చితంగా నెరవేరుతుంది. ‘ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే, భారత బ్రాండ్ ఎంచుకోండి’ అనేది మన యూఎస్‌పీగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పుల గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఆయుధ తయారీ దిశగా అడుగులు వేసినప్పుడు, ఆయుధాలు, పరికరాలకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదికను ఆయన ఉటంకిస్తూ, 2024లో ప్రపంచ సైనిక వ్యయం 2,718 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. సమష్టి ప్రయత్నాలతో, భారత రక్షణ తయారీ రంగం బ్రాండ్ ఇండియా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో దాదాపు రూ. 24 వేల కోట్లను మించిపోయాయి. 2029 నాటికి వీటి విలువ రూ.50 వేల కోట్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా భారత్‌ను నిలపాలనే లక్ష్యాన్ని సాధించడానికి, మన రక్షణ పరికరాల నాణ్యతతో ప్రపంచ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

నాణ్యతను మెరుగుపరిచేందుకు జరుగుతున్న కృషిని ప్రశంసించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్, నేటి సాంకేతికత ఆధారిత యుగంలో ఎప్పటికప్పుడు నాణ్యత పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సాంకేతికతలకు అనుగుణంగా ప్రమాణాలను నవీకరిస్తూ, ప్రోటోకాల్‌లను పరీక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అవాంఛిత జాప్యాలు లేకుండా కాలపరిమితితో కూడిన నాణ్యతకు హామీ గల అనుమతులపై మనం దృష్టి సారించాలని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

 

నాణ్యతను పరీక్షించే సంస్థలు నిరంతరం వాటి లోపాలను గమనిస్తూ ఉండాలనీ, ఆధునీకరణ, పరీక్షా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా వాటిని అధిగమించేందుకు కృషి చేయాలని రక్షణ మంత్రి సూచించారు. సముచిత సాంకేతిక రంగంలో అంతరాలను నిరంతరం విశ్లేషించుకోవడం ఒక ముఖ్యమైన దశగా ఆయన పేర్కొన్నారు.

రక్షణ పరికరాల ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (డీజీక్యూఏ) నిర్వహించిన ఈ సమావేశం, వారసత్వంగా వస్తున్న క్యూఏ నమూనాల నుంచి ప్రెడిక్టివ్, డేటా-ఆధారిత, ఆటోమేటెడ్ వ్యవస్థలకు మారాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. ధ్రువీకరణ సమయాన్ని వేగవంతం చేయడానికి, తనిఖీలను క్రమబద్ధీకరించడానికి, రక్షణ ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో సహకరించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావించారు.

రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతి కేంద్రంగా భారత్‌ను నిలిపేందుకు ఆవిష్కరణలు, పరిశ్రమ సహకారం అత్యంత కీలకమని కార్యదర్శి (రక్షణ ఉత్పత్తుల విభాగం) శ్రీ సంజీవ్ కుమార్ తెలిపారు. పారదర్శకమైన, ఇంటరాక్టివ్ ఓపెన్ హౌస్ సమావేశంలో, రక్షణ రంగ ప్రతినిధులు, యూజర్ ఏజెన్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన, క్యూఏ వ్యవస్థలను సరళీకృతం చేయడం, డిజిటలైజ్ చేయడం, ఆధునికీకరించాలనే మంత్రిత్వ శాఖ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

ముఖ్యాంశాలు & ప్రకటనలు

 ·         ఈ కీలక సమావేశం డీజీక్యూఏ, పరిశ్రమ భాగస్వాములు సంయుక్తంగా రూపొందించిన ఇండస్ట్రీ 4.0/క్యూఏ 4.0 రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్-ఎనేబుల్డ్ టెస్ట్ బెంచ్‌లు, ఆటోమేటెడ్ డేటా క్యాప్చర్, డిజిటల్ డాష్‌బోర్డ్‌లు, ఏఐ- పవర్డ్ అనలిటిక్స్ వంటి స్మార్ట్ టెక్నాలజీల విస్తరణ గురించి చర్చించారు - మానవ తప్పిదాలను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించుటను ప్రారంభించే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

·         తుది అభిప్రాయ సేకరణ కోసం సమావేశంలో భారత సైనిక ఎయిర్‌వర్తీనెస్ ముసాయిదా బిల్లును అధికారికంగా సమర్పించారు. ఎంవోడీ, డీఆర్‌డీవో, సేవలు, డీపీఎస్‌యూలు, పరిశ్రమ సహా బహుళ భాగస్వాముల ప్రమేయం గల సమగ్ర ప్రక్రియ ద్వారా రూపొందించిన ఈ బిల్లు, సైనిక విమానాలు, వాయుమార్గ వ్యవస్థల సర్టిఫికేషన్ కోసం ఒక చట్టబద్ధమైన విధానాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ ప్రత్యేక చర్చా సమావేశం బిల్లు గురించి వినియోగదారుల ప్రతినిధులు, పరిశ్రమ ఫోరమ్‌ల తుది అభిప్రాయాన్ని సేకరించింది.

 ·         పేలుడు పదార్థాలు-ఆయుధ సామాగ్రి (ఈ&వో) స్టోర్‌లను దేశీయంగా అభివృద్ధిని చేసే వ్యూహాలను రూపొందించుట గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. పేలుడు పదార్థాలు-ఆయుధ సామాగ్రి ఉత్పత్తి, భద్రతా ధ్రువీకరణ, సర్టిఫికేషన్ ప్రక్రియలను ఆధునీకరించడంలో ఏఐ/ఎంఎల్, బిగ్ డేటా, ఆడిటివ్ మానుఫాక్చరింగ్, సిలికాన్ ఫోటోనిక్స్, సెమీకండక్టర్లు, అధునాతన సామాగ్రి వంటి కొత్త సాంకేతికతల పాత్రను నిపుణులు పరిశీలించారు. కీలకమైన ఆయుధాలు, కచ్చితత్వ వ్యవస్థల్లో సాంకేతిక స్వావలంబన అవసరాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

రక్షణరంగ ఉత్పత్తుల క్యూఏ ప్రక్రియను కేవలం సమ్మతిగా మాత్రమే కాకుండా, జాతీయ భద్రత, ఎగుమతి సామర్థ్యం, స్వదేశీ ఆవిష్కరణలను వ్యూహాత్మకంగా సాధ్యం చేసే ప్రక్రియగా పునర్నిర్వచించాలనే సమష్టి నిబద్ధతను సంబంధిత ప్రతినిధులంతా సంయుక్తంగా ప్రకటించడంతో ఈ నేషనల్ క్వాలిటీ కాన్‌క్లేవ్ 2025 ముగిసింది. ఈ సమావేశ తీర్మానాలు రక్షణ రంగ ఉత్పత్తుల నాణ్యత హామీ విషయంలో భారత్ ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పుటకు ఊతమిస్తాయనే అంచనాను వ్యక్తం చేశాయి.

ఈ సమావేశం పరిశ్రమ, రక్షణరంగ ప్రతినిధుల మధ్య భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసిందని, నాణ్యత హామీలో నూతన ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు, ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లిందని డీజీక్యూఏ డీజీ ఎన్ మనోహరన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ రియర్ అడ్మిరల్ రూపక్ బారువా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ శ్రీ సంజయ్ చావ్లా, డీపీఎస్‌యూల సిఎండీలు, సీనియర్ ఎంఓడీ అధికారులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 2127832)