యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఒలింపియన్లు సాత్విక్ - చిరాగ్
ఈ భారత జోడీ సాధించిన విజయాలను ప్రశంసించిన కేంద్రమంత్రి
త్రివర్ణ పతాకంతో పోడియంపై నిలబడటం దేశానికే గర్వకారణం: కేంద్రమంత్రి
Posted On:
01 MAY 2025 6:01PM by PIB Hyderabad
ఒలింపియన్లు సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్నారు. 2023లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యుఎఫ్) ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలవడంతో పాటు, హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఈ ప్రముఖ బ్యాడ్మింటన్ జోడీ ఆ ఏడాది ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైనా, ఆ సమయంలో ఆడాల్సి ఉన్న టోర్నమెంట్స్ కారణంగా వారు దానిని అందుకోలేకపోయారు.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్లో 11వ స్థానంలో ఉన్న ఈ జోడీని ప్రశంసిస్తూ కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇలా అన్నారు: “మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం. సాత్విక్ - చిరాగ్, మీరిరువురూ అసాధారణ నైపుణ్యాలు, కృషి ద్వారా అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచి దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ప్రతిష్టాత్మక పతకాలను అందుకోవడానికి మీరు త్రివర్ణ పతాకంతో పోడియంపై నిలబడినప్పుడు, అది మీకు మాత్రమే కాదు, మొత్తం దేశానికే దక్కిన గౌరవం. దేశ గర్వాన్ని పెంపొందించి, త్రివర్ణ పతాక గౌరవాన్ని పెంచిన మీ ఇరువురినీ ఖేల్ రత్న పురస్కారం వరించింది.”
ఖేల్ రత్న పురస్కారం అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన చిరాగ్ శెట్టి, ఈ గౌరవం చాలా కాలం క్రితమే అందుకోవాల్సి ఉందన్నారు. “చివరకు, మేం ఈరోజు దీనిని అందుకున్నాం. 2023లోనే ప్రకటించినా, ఈ రోజు గౌరవ క్రీడా మంత్రి చేతుల మీదుగా ఖేల్ రత్న పురస్కారం అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను, సాత్విక్ జతగా ఆడినప్పటి నుంచీ ప్రతి సందర్భంలో భారత ప్రభుత్వం అందించిన మద్దతు మరువలేనిది. మేం సాధించిన పెద్ద విజయాలు.. ప్రపంచ నంబర్ 1 ర్యాంకు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, థామస్ కప్ టైటిల్ గెలుచుకోవడం వంటి ఘనత చాలా వరకు భారత ప్రభుత్వానికే చెందుతుంది.”
అదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సాత్విక్ ఇలా అన్నారు: “గత సంవత్సరం ఖేల్ రత్న అవార్డును అందుకోవడానికి మేం రాష్ట్రపతి భవన్కు వెళ్లలేకపోయాం. చివరగా, ఇప్పుడు దాన్ని పొందడం మా ఆత్మవిశ్వాసానికి ఎంతగానో పెంచింది ఎందుకంటే మేం ట్రాక్ నుంచి విరామం తీసుకోబోతున్నాం. రాబోయే కొన్ని నెలలు ఆడటం లేదు. మేం మరింత గొప్పగా తిరిగి రావడానికి, రాబోయే టోర్నమెంట్లలో మరింత బాగా రాణించడానికి ఈ పురస్కారం మాకు ప్రేరణనిస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్) మొదలైన అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా నేటి యువతకు మద్దతునిస్తూ ప్రభుత్వం చక్కని ప్రోత్సాహం అందిస్తోంది. నేను చిరాగ్తో కలిసి ఆడటం ప్రారంభించినప్పుడు మేం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి సమయంలో ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.”
ఈ భారత జోడీ ఈ జనవరిలో జరిగిన మలేషియా ఓపెన్, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ పోటీల్లో రెండుసార్లు పతకాలు సాధించి తమ సీజన్ను ఘనంగా ప్రారంభించారు. అయితే, చిన్నపాటి గాయాలు వారిని కొంత ఇబ్బందిపెట్టాయి. వారు పాల్గొననున్న తదుపరి పోటీలు సింగపూర్ ఓపెన్ (మే 27 - జూన్ 1), ఇండోనేషియా ఓపెన్ (జూన్ 3-8).
***
(Release ID: 2126005)
Visitor Counter : 27