గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో (ఈఎంఆర్) 75 అంతరిక్ష ప్రయోగశాలలు...
* ‘ఇస్రో’ సాంకేతిక మార్గదర్శకత్వం...
* భారత్ పెట్రోలియంతో కలసి ఏర్పాటు చేయనున్న గిరిజన వ్యవహారాల శాఖ
* దేశంలో 19 రాష్ట్రాలకు ప్రయోజనం
* సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.12 కోట్లు మంజూరు
* విద్యలో అంతరాలకు ఇక స్వస్తి...
* అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత (ఎస్టీఈఎమ్) రంగాల్లో
గిరిజన యువతకు కొత్త అవకాశాలు
Posted On:
30 APR 2025 4:00PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది... దేశంలో 19 రాష్ట్రాల్లోని 75 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (ఈఎంఆర్ఎస్) అంతరిక్ష ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఈ శాఖ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో చేతులు కలుపుతుంది.
షెడ్యూల్డు తెగలకు చెందిన బాలలకు నాణ్యమైన విద్య బోధించడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. వీటితో ఎస్టీ బాలలు ఉన్నత విద్య, వృత్తివిద్య కోర్సులలో అవకాశాలు పొందేందుకు వీలుంటుంది. అంతేకాక వారు వివిధ రంగాల్లో చక్కని ఉపాధి అవకాశాలను కూడా చేజిక్కించుకోవచ్చు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నత నాణ్యత కలిగిన విద్యాబోధనకు తోడు వారి పోషణ విషయంలోనూ, వారి సమగ్ర ఆరోగ్యంతోపాటు పురోగతి విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటాయి. ప్రస్తుతం దేశమంతటా కలిపి 470 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయి.
అంతరిక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి బీపీసీఎల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలలో భాగంగా గిరిజన వ్యవహారాల శాఖకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి దాదాపు రూ.12 కోట్లను ఈ సంస్థ మంజూరు చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా, విద్యాపరమైన అంతరాలను పూడ్చడంతో పాటు అంతరిక్ష విజ్ఞానం, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత (ఎస్టీఈఎమ్) అంశాల్లో గిరిజన యువతకు కొత్త అవకాశాలు అందివచ్చేటట్లు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. చిన్న వయస్సులోనే అంతరిక్ష విజ్ఞానంలో మక్కువను కలిగించి, ఆదివాసీ సముదాయాలకు చెందిన విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగాను, టెక్నాలజిస్టులుగాను, నూతన ఆవిష్కర్తలుగాను ఎదిగేటట్టు వారిని తీర్చిదిద్దాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. భారత్ వైజ్ఞానిక పురోగతి ప్రధాన స్రవంతిలోకి గిరిజన విద్యార్థులు వచ్చి చేరేలా వారికి తోడ్పాటునందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇది సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదికతోపాటు అందరికీ వివక్షంటూ ఉండని విధంగా విద్యావకాశాలను ఏర్పరచడానికి జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపీ 2020)లో భాగంగా ప్రభుత్వం చేస్తున్న విస్తృత కృషిని చాటిచెబుతోంది.
ఈ కార్యక్రమానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (‘ఇస్రో’) గుర్తింపు ఉన్న స్పేస్ ట్యూటర్ ఏజెన్సీలు సాంకేతిక మద్దతును అందించనున్నాయి. ఈ తరహా ప్రయోగశాలల్లో ప్రతి ఒక్క ప్రయోగశాలలోనూ ఆధునిక శాస్త్రీయ పరికరాలతో పాటు ఈ కింద పేర్కొన్న భాగాలు కూడా ఏర్పాటు చేయనున్నారు
:
i. ఎల్వీఎమ్3 వాహక నౌకతో పాటు ఈఓ శాటిలైట్ డెమో మోడల్ (అన్ని డబ్ వ్యవస్థ వివరాలు దీనిలో ఉంటాయి)
ii. పీఎస్ఎల్వీ, హెచ్ఆర్ఎల్వీ, ఐఆర్ఎన్ఎస్ఎస్, జీశాట్ వంటి వాహక నౌకల చిన్న నమూనాలు
iii. సౌర వ్యవస్థ, చంద్ర గ్రహణం, చంద్ర కళలు, పగలు-రాత్రుళ్లు, 4 రుతువులు, గ్లోబు, సమయ సూచికలకు సంబంధించిన టేబుల్ టాప్ డెమో మోడళ్లు.
iv. నక్షత్రాలను గమనించడానికి ఉపయోగపడే 150/750 ఎంఎం ‘స్టార్ ట్రాకర్’ టెలిస్కోపు- క్యాన్ శాట్ వర్కింగ్ మోడల్.
v. అంతరిక్షం, సైన్సు, గణిత శాస్త్రాలను నేర్పించే అభ్యసన సామగ్రి కిట్లు.
vi. ఇస్రో స్పేస్ బుక్- టైమ్లైన్ ఎగ్జిబిట్.
ఈ ప్రయోగశాలలను మన దేశంలో 19 రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్రాలలో... ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వీటికి అదనంగా జమ్మూ-కాశ్మీర్, దాద్రా-నాగర్ హవేలీలలో కూడా ఈఎంఆర్ స్కూళ్లు రానున్నాయి. ఈ కార్యక్రమంతో 50,000 మందికి పైగా గిరిజన విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
***
(Release ID: 2125586)