ఆయుష్
azadi ka amrit mahotsav

‘జాతీయ ఆయుష్ మిషన్ చర్చావేదిక 2025’: దేశవ్యాప్తంగా సాంప్రదాయక ఆరోగ్య సంరక్షణ సేవల అందజేత వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారం

* జాతీయ ఆయుష్ మిషన్ చర్చావేదిక రెండో సంచికకు లోనావాలా ఆతిథ్యం:
సమగ్ర, సులభతర, అన్ని వర్గాల్నీ కలుపుకొనిపోయే ఆరోగ్య సంరక్షణ సేవలకో మార్గసూచీ

* అందరికీ సమగ్ర ఆరోగ్యాన్ని అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను
ముందుకు తీసుకుపోవడం మా ధ్యేయం...
దీని కోసం బలమైన, ఏకీకృత ఆయుష్ ఫ్రేంవర్క్‌ను
అమల్లోకి తెస్తాం: కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్‌

Posted On: 29 APR 2025 6:02PM by PIB Hyderabad

జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎమ్) కాన్‌క్లేవ్ 2025ను ఈ ఏడాది మే 1, 2వ తేదీల్లో మహారాష్ట్రలోని లోనావాలాలో గల కైవల్యధామ్‌లో కేంద్ర ఆయష్ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. గొప్ప మార్పులకు కారణమయ్యే ఈ రెండు రోజుల కార్యక్రమం దేశంలో ఆయుష్ ఆధారిత ఆరోగ్య సేవల అందజేతకు సంబంధించిన భావి రూపురేఖలను తీర్చిదిద్దడానికి ఒక జాతీయ చర్చావేదికలాగా పనిచేస్తుంది. ఆయుష్ వైద్య పద్ధతి నిపుణులు, విధాన రూపకర్తలు, ఆరోగ్య రంగ వృత్తినిపుణులు, పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు.. వీరందరిని ఒక చోటుకు చేర్చే ఈ చర్చావేదిక ఉద్దేశం సాంప్రదాయక భారతీయ వైద్య వ్యవస్థలను ఆరోగ్య సంరక్షణ ప్రధాన స్రవంతిలో ఏకీకృతపరచడం. దీనివల్ల ఆరోగ్య సేవలు సాధారణ పౌరులకు మరింత సులభంగా, చౌకగా, నిదర్శన సహితంగా మారగలవన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.  

కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ ఈ చర్చావేదికను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.  ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆయుష్ విభాగాల అధికారులు, మిషన్ డైరెక్టర్లు, ప్రభుత్వంలో సీనియర్ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు కూడా ఈ కాన్‌క్లేవ్‌కు తరలిరానున్నారు. ఈ కార్యక్రమంలో సర్వసభ్య కార్యక్రమాలు, విధాన సంబంధిత రౌండ్‌టేబుల్ సమావేశాలు, సాంకేతికత ప్రధానంగా సాగే లోతైన చర్చలే కాకుండా, అత్యుత్తమ పద్ధతుల ప్రదర్శన, రాష్ట్రాల విజయ గాథలు, ఆయుష్ రంగంలో టెక్నాలజీ ప్రధానమైన నవకల్పనలను కూడా చాటిచెప్పాలన్న ఆలోచనలున్నాయి.  

కార్యక్రమాన్ని గురించి ఆయుష్ మంత్రి మాట్లాడుతూ, ‘‘జాతీయ ఆయుష్ మిషన్ చర్చావేదిక దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ-వెల్‌నెస్ మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడానికి ఒక సహకారపూర్వక అనుబంధ విస్తారిత వ్యవస్థను ప్రోత్సహించే దిశగా వేస్తున్న ఒక ముందడుగు. మా ఉద్దేశం ఒక బలమైన, ఏకీకృత ఆయుష్ ఫ్రేంవర్క్ దన్నుతో అందరికి సమగ్ర ఆరోగ్యాన్ని అందించాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడమే’’నన్నారు.

వివిధ రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయుర్వేద, యోగా-ప్రాకృతిక వైద్య చికిత్స, యునానీ, సిద్ధా,సోవా-రిగ్పా, హోమియోపతి...వీటిలో అతి నవీన పరిణామాలు, పరిశోధన లలో పురుడు పోసుకున్న నవకల్పనలు, రంగాలవారీ సహకారం అనే అంశాలపై చర్చించడానికి అవకాశాన్ని జాతీయ ఆయుష్ మిషన్ చర్చావేదిక అందించనుంది. ముఖ్య కార్యక్రమాల అమలును బలోపేతం చేయడం, నిదర్శన ఆధారిత అభ్యాసాలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ వ్యాప్తికి మరింత ఎక్కువగా దోహద పడడంపైన కూడా ఈ చర్చావేదిక దృష్టిని కేంద్రీకరించబోతోంది. ఎన్ఏఎమ్ పథకాన్ని ఇక ముందు ఇప్పటి కంటే విస్తరించడానికి కావలసిన రూపురేఖలను తీర్చిదిద్దాలంటే అందుకోసం మంత్రుల స్థాయి చర్చలు తోడ్పడతాయన్నది ఈ కాన్‌క్లేవ్ ఉద్దేశం.

ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, ‘‘ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ మిషన్ విజయాలను సమీక్షించడం, ఇటీవలి కాలంలో తలెత్తుతున్న సవాళ్లను పరిష్కరించడం, స్వయంసమృద్ధమైన, శక్తిమంతమైన ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మార్గాన్ని సుగమం చేయడానికి ‘ఎన్ఏఎమ్ కాన్‌క్లేవ్-2025’ను ఏర్పాటు చేస్తున్నామ’’న్నారు.
ఆయుష్ శాఖ సంయుక్త కార్యదర్శి కవితా గర్గ్ చర్చావేదికలో చేపట్టే ముఖ్య అంశాలను వివరిస్తూ, ‘‘ఈ కాన్‌క్లేవ్‌లో ఆర్థిక నిర్వహణ, పర్యవేక్షణ-మూల్యనిర్ధారణ, మానవ వనరులను బలోపేతం చేయడం, ఆధునిక వైద్యంతో ఏకీకరణ, నాణ్యత విషయంలో హామీ సహా అనేక వైవిధ్యభరిత విషయాలు చర్చకు వస్తాయి. ఇది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆవిష్కారమైన చక్కనైన అనుభవాలను పంచుకోవడంతో పాటు అత్యుత్తమ పద్ధతులు, ఐటీ నవకల్పనలు, నియంత్రణకు సంబంధించిన వ్యవస్థలు, పెట్టుబడులు సహా ఎగుమతి అవకాశాలను కూడా పరిశీలించేందుకు వెసులుబాటు కల్పిస్తుంద’’న్నారు.

చర్చావేదిక ముఖ్యాంశాలు:-

పత్రాల విడుదల: ఆయుష్ పాలసీ 2025కు సంబంధించిన నమూనాతో (బ్లూప్రింట్) పాటు, ఆయుష్ చికిత్స ప్రణాళికల్లో జీవక్రియ సంబంధిత అనారోగ్య స్థితులు తలెత్తినప్పుడు అనుసరించాల్సిన ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను కూడా విడుదల చేయనున్నారు.

మంత్రిత్వ శాఖ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం:  జాతీయ స్థాయి ఆయుష్ మిషన్‌ను బలోపేతం చేసే అంశాలపై కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్‌తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య, ఆయుష్ మంత్రులు చర్చించనున్నారు.

నిపుణులు నిర్వహించే కార్యక్రమాలు: నాణ్యత ప్రమాణాలు, గుర్తింపు, పెట్టుబడికి మార్గాన్ని సుగమం చేయడం వంటి అంశాలపై డీజీహెచ్ఎస్, ఎన్ఏబీహెచ్, ఇన్వెస్ట్ ఇండియా, ఆయుష్ ఎగుమతి ప్రోత్సాహక మండలి సహా ప్రధాన సంస్థలు తమ తమ ఆలోచనలను వెల్లడిస్తాయి.

విజయవంతమైన కేస్ స్టడీలు: దీనిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరించిన అత్యుత్తమ అభ్యాసాలు భాగంగా ఉంటాయి.

యోగా కార్యక్రమం: ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనే ప్రతినిధుల కోసం మార్గదర్శన పూర్వక యోగా-ధ్యాన కార్యక్రమాలను నిర్వహించాలని ఒక ప్రణాళికను సిద్ధం చేశారు.

జాతీయ ఆయుష్ మిషన్‌ నేపథ్యం:

2014లో ప్రారంభించిన జాతీయ ఆయుష్ మిషన్ ఒక ముఖ్య కార్యక్రమం. భారత సాంప్రదాయక వైద్యచికిత్స వ్యవస్థలను పరిరక్షిస్తూ, వాటిని మరింత విస్తరింపచేస్తూ ప్రధాన స్రవంతి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగంగా మలచడంలో ఈ మిషన్ ఒక కీలక పాత్ర పోషించింది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ (ఆయుష్) ద్వారా దేశవ్యాప్తంగా ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలు లభించేటట్లు చూడడం, ఆ సేవలను సులభతరమైన రీతిలో అందజేయడం, నాణ్యతను మెరుగుపరచడం.. ఇవీ ఈ మిషన్ ఉద్దేశాలు.

ఎన్ఏఎం చర్చావేదిక గత సంచికను 2023లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ హెల్త్-వెల్‌నెస్ సెంటర్ల (వీటిని ప్రస్తుతం ఏఏఎం-ఆయుష్ పేరుతో పిలుస్తున్నారు)ను విస్తరించడం, ఆయుష్ సేవలను జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో కలపడంతో పాటు ఆయుష్ వైద్య పద్ధతిని అనుసరిస్తున్న వైద్యుల సామర్థ్యాలను పెంచడం సహా అనేక ముఖ్య తీర్మానాలను ఆమోదించారు. నవకల్పన, ప్రామాణీకరణ, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణలపై సరికొత్తగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఇప్పటికే పొందిన విజయాలకు అదనంగా మరిన్ని విజయాలను సాధించాలన్నదే 2025 సంచిక ధ్యేయం.‌

 

**‌*


(Release ID: 2125511)