ప్రధాన మంత్రి కార్యాలయం
దుబాయ్ యువరాజు, యూఏఈ ఉప ప్రధాని- రక్షణ మంత్రికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
* గతేడాది యూఏఈ పర్యటనను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి... అప్పట్లో దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి
* యూఏఈ నాయకత్వానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
* తన పర్యటన భారత్, యూఏఈల మధ్య బలమైన, చారిత్రక సంబంధాలు మున్ముందూ కొనసాగుతాయని సూచిస్తోందన్న ప్రధాని
* వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, టెక్నాలజీ, విద్య, క్రీడలు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచే అంశాలపై నేతల చర్చ
* యూఏఈలో నివసిస్తున్న 43 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి పాటుపడుతున్న యూఏఈ నాయకత్వానికి ధన్యవాదాలు: ప్రధాని
प्रविष्टि तिथि:
08 APR 2025 4:51PM by PIB Hyderabad
దుబాయ్ యువరాజు, యూఏఈ ఉప ప్రధాని, యూఏఈ రక్షణ శాఖ మంత్రి గౌరవనీయ షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు.
ప్రధాని కిందటేడాది యూఏఈలో తాను పర్యటించిన సంగతిని గుర్తుచేసుకొన్నారు. ఆయన దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. యూఏఈ అధ్యక్షుడు గౌరవనీయ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్కు, యూఏఈ ఉపాధ్యక్షుడు- ప్రధాని- దుబాయ్ పాలకుడు గౌరవనీయ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తన పర్యటన భారత్, యూఏఈల మధ్య బలమైన, చారిత్రక సంబంధాలను ఇకమీదటా కొనసాగించే విషయంలో గొప్పగా దోహదపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసంతోపాటు రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి దార్శనికత పునాదులుగా చిరకాల భాగస్వామ్యం ఏర్పడాలని ఆయన స్పష్టం చేశారు.
భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రత్యేకించి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, టెక్నాలజీ, విద్య, క్రీడలు, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాలలో ఈ భాగస్వామ్యాన్ని మరింతగా ఎలా బలపరచవచ్చో వారు చర్చించారు.
యూఏఈలో నివసిస్తున్న దాదాపు 43 లక్షల మంది భారతీయుల సంక్షేమం దిశగా జాగ్రత్తచర్యలు తీసుకొంటున్నందుకు యూఏఈ నాయకత్వానికి ప్రధాని తన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య చైతన్యభరిత సంబంధాలు పురోగమిస్తుండడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2125318)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam