వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2025 విజేతను ప్రకటించిన డీపీఐఐటీ, స్ట్రైడ్ వెంచర్స్: గెలిచిన సంస్థలో రూ. 10 కోట్ల వరకు పెట్టుబడి
Posted On:
22 APR 2025 4:28PM by PIB Hyderabad
భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2025 పోటీల విజేతగా- బౌయాన్సీ ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ - అంకుర సంస్థను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ప్రకటించింది. స్టార్టప్ ఇండియా, స్ట్రైడ్ వెంచర్స్ భాగస్వామ్యంతో డీపీఐఐటీ ఈ పోటీలను నిర్వహించింది. ప్రభావవంతమైన దేశీయ అంకుర సంస్థలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం.
30 రోజుల పాటు 120 అంకుర సంస్థల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం విజేతను ఎంపిక చేశారు. సుస్థిరత, ఫిన్ టెక్, ఈ-మొబిలిటీ రంగంలో పనిచేస్తున్న దేశంలో 22 రాష్ట్రాలకు చెందిన అంకుర సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
ఈ పోటీల్లో విజేతగా నిలిచిన ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ 2015లో ప్రారంభమైంది. ఈ సంస్థ ఫెయిర్ ట్రేడ్ ధ్రువీకరించిన రీసైకిల్డ్ ప్లాస్టిక్ సరఫరా వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది. రీసైక్లింగ్ యూనిట్లకు అధిక నాణ్యత కలిగిన ఆర్పీఈటీ, ఆర్హెచ్డీపీఈ, ఆర్పీపీ సామగ్రిని సరఫరా చేసేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలను న్యాయబద్ధంగా సేకరించడంపై కూడా ఈ సంస్థ ప్రస్తుతం దృష్టి సారించింది. అసంఘటిత రంగంలో చెత్త, ప్లాస్టిక్ సేకరించే వారితో నేరుగా పనిచేస్తూ.. వారిని సంఘటిత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తోంది. ఈ సంస్థకు ప్రస్తుతం 20,000 టన్నుల సేకరణ సామర్థ్యం ఉంది. దాన్ని మరింత విస్తరించి భారతీయ ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగంలో తనదైన ముద్ర వేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
భారత్లో పెట్టుబడి రుణాలు అందించే అతి పెద్ద సంస్థ స్ట్రైడ్ వెంచర్స్ గడచిన ఐదేళ్లలో 170కి పైగా కొత్త తరం అంకుర సంస్థల్లో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థ ఇప్పుడు సింగపూర్, అబుదాబి, రియాద్, లండన్లకు తన కార్యకలాపాలను విస్తరించింది. ఈ ఏడాది ఆరంభంలో డీపీఐఐటీతో స్ట్రైడ్ వెంచర్స్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న కొత్త అంకుర సంస్థలకు పెట్టుబడి, నెట్వర్క్, మార్కెట్ అవకాశాలతో పాటు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అలాగే భారతీయ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయికి చేరుకొనేలా తోడ్పాటు అందిస్తుంది.
భారత్ స్టార్టప్ గ్రాండ్ పోటీలను స్ట్రైడ్ వెంచర్స్ నిర్వహించడం ఇదే తొలిసారి. విజేతగా నిలిచిన సంస్థలో రూ. 10 కోట్ల వరకు పెట్టుబడి పెడతానని స్ట్రైడ్ వెంచర్స్ ప్రకటించింది. దీనితో పాటుగా భారత్ సుస్థిర, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థలో అంకుర సంస్థలు చేస్తున్న కృషిని పెంపొందిస్తుంది. అలాగే వాటికి అవసరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం అందిస్తూ తనకు సంబధించిన వ్యవస్థలను ఉపయోగించుకొనేందుకు స్ట్రైడ్ అవకాశం కల్పిస్తుంది.
***
(Release ID: 2123632)
Visitor Counter : 4