పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానయాన రంగం లక్ష్యాల పరిరక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్) బిల్లు- 2025 కు పార్లమెంట్ ఆమోదం
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో మరో ప్రధాన సంస్కరణ
Posted On:
04 APR 2025 4:03PM by PIB Hyderabad
విమానయాన రంగం ప్రయోజనాలను రక్షించే ప్రొటెక్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్లు - 2025 ను లోక్ సభ ఆమోదించింది. పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రాజ్యసభ ఇంతకుముందే ఆమోదించింది. ఉభయ సభల ఆమోదంతో ఇది పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో అమలైన రెండో ప్రధాన విమానయాన సంస్కరణగా నిలిచింది. ఈ బిల్లు భారతదేశ విమాన లీజింగ్, ఫైనాన్సింగ్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రామాణికాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, త్వరితంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన మార్కెట్పై పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలపరిచే కీలక అడుగును ఇది సూచిస్తుంది.
అంతర్జాతీయ లీజింగ్ ఒప్పందాలను సరళతరం చేయడానికి, ప్రామాణికీకరించడానికి ఉద్దేశించిన 2001 కేప్ టౌన్ ఒప్పందం ఆధారంగా ఈ బిల్లు ను రూపొందించారు. భారతదేశం 2008 లో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించింది, కానీ చట్టం అమలులో లోపాల వల్ల లీజు ఖర్చులు ఇతర దేశాల కంటే 8 నుండి 10 శాతం ఎక్కువయ్యాయి. ఈ బిల్లుతో, ఆ లోపాలను అధిగమించి, విమాన ఫైనాన్సియర్లకు చట్టపరమైన భద్రత కల్పించడంతో పాటు, భారతీయ విమానయాన సంస్థల లీజింగ్ ఖర్చులను తగ్గించాలని భారత్ భావిస్తోంది.
ఈ చట్టాన్ని తీసుకురావలసి వచ్చిన అవసరాన్ని శ్రీ రామ్మోహన్ నాయుడు వివరిస్తూ, "పౌర విమానయాన రంగంలో ఇది ముఖ్యమైన అడుగు. దానిని సాధ్యమయ్యేలా చేయడానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శనం ఉంది. నేడు మనం చూస్తున్న ఈ విప్లవాత్మక వృద్ధి ఆయన నేతృత్వంతోనే సాధ్యమైంది” అని అన్నారు.
ఈ అభివృద్ధిని ఆయన కచ్చితమైన గణాంకాలతో వివరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దాదాపు 65 ఏళ్ల పాటు భారత్ లో ఏటా 10 కోట్ల 38 లక్షల మంది ప్రయాణించారు. తరువాతి పదేళ్లలో ఆ సంఖ్య రెట్టింపై 2024 నాటికి 22 కోట్ల 81 లక్షలకు చేరుకుంది” ఆని తెలిపారు. “అదేవిధంగా, భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014 లో 74 నుంచి 2024 నాటికి 159 కు పెరిగింది. త్వరలో మరో రెండు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు.
2014లో 340గా ఉన్న విమానాల సంఖ్య 2024 నాటికి 840కి పెరిగిందని మంత్రి తెలిపారు. "దేశంలో పౌర విమానయాన రంగం వృద్ధి చెందడమే కాదు- విశేషమైన పురోగతి సాధిస్తోందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఇటువంటి వేగవంతమైన విస్తరణను ఇంత తక్కువ సమయంలో సాధించిన దేశం మరొకటి లేదు” అని ఆయన తెలిపారు.
ఈ బిల్లు లీజింగ్ ప్రక్రియలను మరింత సరళతరం చేయడంతో పాటు, భారతదేశాన్ని విమానయాన పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు సహాయపడుతుంది. కేప్ టౌన్ ఒప్పందం కింద భారతదేశ అనుసరణ రేటింగ్ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మార్పులు ఎయిర్లైన్స్ కోసం వ్యయాలను తగ్గించడమే కాకుండా, కొత్త సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి అనుకూలమైన పరిస్థితులను రూపొందించడానికి ఎంతో అవసరమైనవి.
విమాన నిర్వహణ వ్యయంలో 45 శాతం వరకు ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఇంధన (ఏటీఎఫ్) వ్యయ భారం వంటి పౌర విమానయాన రంగానికి సంబంధించిన విస్తృత సమస్యలను బిల్లుపై జరిగిన చర్చలో ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల్లో ఏటీఎఫ్ పన్ను రేట్లలో ఉన్న అసమానతపై మంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, పన్ను రేట్లు తగ్గించిన రాష్ట్రాల విధానాలను అనుసరించేందుకు మరిన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని కోరారు. “ఈ పన్నులను తగ్గించడం వల్ల ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రయాణికులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సుస్థిరత, సామర్థ్య పెంపు కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది” అని మంత్రి పేర్కొన్నారు
2025 నాటికి 2.5 కోట్ల లీటర్ల సుస్థిర విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) ఉత్పత్తి చేయడం, 100 విమానాశ్రయాలను పునరుత్పాదక ఇంధన వినియోగంగా మార్చే ప్రణాళికలతో, హరిత విమానయానం దిశగా భారత్ వేగంగా ముందుకెళ్తోంది. శిక్షణ పొందిన పైలట్ల కోసం కూడా ఈ రంగంలో డిమాండ్ పెరుగుతోంది. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలలో 30,000 నుండి 34,000 వరకు పైలట్ల అవసరం ఉంటుందని అంచనా. ఈ డిమాండ్ ను తీర్చడానికి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ టీఓ) సంఖ్యను పెంచడంతో పాటు ఏటా మరిన్ని కమర్షియల్ పైలట్ లైసెన్సులను జారీ చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
శ్రీ రామ్మోహన్ నాయుడు భారత ప్రభుత్వ దీర్ఘకాలిక దృష్టికోణాన్ని స్పష్టంగా తెలియజేస్తూ “భారత పౌర విమానయాన రంగం కేవలం విమానాలను నడపడం మాత్రమే కాదు. ఇది ప్రజలను అనుసంధానిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను పెంచుతుంది. కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. భారత్ను అంతర్జాతీయ విమానయాన రంగంలో నాయకత్వ స్థానంలో నిలబెట్టడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం” అని ఆయన అన్నారు.
***
(Release ID: 2119110)