మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ వేదికగా ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0ను నిర్వహిస్తున్న మత్స్య శాఖ
సదస్సులో భాగంగా కీలక కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, సహాయమంత్రి ఎస్.పి.ఎస్. బఘేల్
Posted On:
08 MAR 2025 4:54PM by PIB Hyderabad
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎఫ్ఎహెహెచ్&డీ) ఆధ్వర్యంలో మత్స్య శాఖ తెలంగాణాలోని హైదరాబాద్లో వేదికగా మత్స్య రంగ అంకురసంస్థల సదస్సు 2.0ను నిర్వహించింది.
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.ఎస్. బఘేల్, నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేశ్ చంద్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మత్స్య రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం మత్స్య శాఖ ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తయారీ, అనుబంధ రంగాల్లో అంకుర సంస్థలకు ఊతమిచ్చే లక్ష్యంతో ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0ను ప్రారంభించారు. మత్స్య, ఆక్వా రంగంలో వినూత్న అంకుర సంస్థలను గుర్తించి, వాటికి అవసరమైన మద్దతునిస్తూ వాటిని ప్రోత్సహించడం, అలాగే వ్యవస్థాపకతను, సాంకేతిక పురోగతిని పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0లో విజేతలుగా నిలిచే 10 అంకుర సంస్థలకు రూ. 1 కోటి నిధులను సమకూర్చడం ద్వారా మద్దతునందించనున్నారు. విజేతగా నిలిచే ప్రతి ప్రతిపాదన కోసం ఐసీఎఆర్, ఎన్ఎఫ్డీబీ లేదా మత్స్య శాఖ ఆధ్వర్యంలోని ఇతర అనుబంధ సంస్థల నుంచి నిర్మాణాత్మక ఇంక్యుబేషన్ మద్దతు అందించనున్నారు. అంకుర సంస్థలకు మార్గదర్శకం చేస్తూ, వాటి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అందించడం, వాటి ఉత్పత్తులు, సేవలను తగిన నాణ్యతో సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం వారికి తయారీ రంగంలో మౌలిక సదుపాయాలను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంలో ఈ ఇంక్యుబేటర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
మత్స్య రంగ అంకురసంస్థల సదస్సు 2.0లో భాగంగా పీఎమ్-ఎమ్కేఎస్ఎస్వై ప్రయోజనాలను విస్తరించే లక్ష్యంతో ఎన్ఎఫ్డీపీ మొబైల్ యాప్ను మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. ఆ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.ఎస్. బఘెల్, నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేశ్ చంద్. ఇతర ప్రతినిధులు, సదస్సులో పాల్గొంటున్న అంకుర సంస్థలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎన్ఎఫ్డీపీ మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు ముఖ్యంగా అంకుర సంస్థలు వివిధ విభాగాలను గురించి తెలుసుకోవడానికి, పథకం ప్రయోజనాలను పొందడానికి ఈ యాప్ సులభమైన ఇంటర్ఫేస్ను అందిస్తుంది.
ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహ-యోజన (పీఎం-ఎంకేఎస్ఎస్వై) పథకం కింద రూపొందించిన ఎన్ఎఫ్డీపీ యాప్ మత్స్యకారులు, ఆక్వా రైతులు, విక్రేతలు, ప్రాసెసర్ల కోసం డిజిటల్ వర్క్-ఐడెంటిటీస్ను రూపొందించే వేదికగా పనిచేస్తుంది. ఇది అధికారిక ఆర్థిక, సంక్షేమ రంగాల ఏకీకరణ సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుటను ఈ మొబైల్ అప్లికేషన్ సులభతరం చేస్తుంది, బహుళ విభాగాలను గురించి తెలుసుకోవడానికి, పథకం ప్రయోజనాలను పొందడానికి వినియోగదారుల హితమైన ఇంటర్ఫేస్ను ఇది అందిస్తుంది. ఎన్ఎఫ్డీపీ మొబైల్ డిజిటల్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించి, పీఎం-ఎంకేఎస్ఎస్వై, ఆర్థిక సాయం, బీమా, శిక్షణా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మత్స్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. స్వయంగా నమోదుచేసుకునే వారి కోసం రూ. 100 ప్రోత్సాహకాన్ని, సీఎస్సీ, వీఎల్ఈ ద్వారా నమోదు చేసుకునే వారికి రూ. 76 నగదును అందిస్తుంది. డిజిటల్ ఇంటిగ్రేషన్, మెరుగైన ట్రేసెబిలిటీ, మార్కెట్ అనుసంధానాల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయడం, సంబంధిత వ్యక్తులందరికీ అవకాశాలను విస్తరించడం దీని లక్ష్యం. 19 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లతో, ఈ ప్లాట్ఫామ్ మత్స్యకారుల సంఘాలను అధికారిక ఆర్థిక, ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానిస్తూ వాటికి సాధికారత కల్పిస్తోంది.
నేపథ్యం: భారత మత్స్య, ఆక్వా రంగం 3 కోట్ల మందికి జీవనోపాధినిస్తూ, ఉద్యోగావకాశాలను అందిస్తోంది. సుస్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ రంగంలో 2015 నుంచి వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ₹38,572 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ వేగవంతమైన విస్తరణ ద్వారా 300లకి పైగా మత్స్యసంబంధ అంకుర సంస్థల ఏర్పాటు సాధ్యమైంది. ఈ అంకుర సంస్థలు ఉత్పాదకతను పెంచే, ట్రేసబిలిటీ, వాల్యూ చెయిన్ సామర్థ్యాలను మెరుగుపరిచే వినూత్నమైన, వాణిజ్యపరంగా లాభదాయకమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి బ్లాక్చెయిన్, ఐవోటి, ఏఐ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. వినూత్న సాంకేతిక పరిష్కారాల ద్వారా మత్స్యరంగ వాల్యూ చెయిన్ సవాళ్లను పరిష్కరించడానికి, సుస్థిరమైన వనరుల నుంచి పోషకాలు గల, సరసమైన ధరలకు లభించే దాణాను రూపొందించడం, ఏఐ- ఆధారితమైన ఖచ్చితత్వం గల విధానాల ద్వారా ఆక్వా రంగ సుస్థిరతను మెరుగుపరచడం, ధృడమైన, సమగ్రమైన సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల రవాణా వ్యవస్థను నిర్మించడం, మత్స్య రంగ విలువను పెంచుతూనే వ్యర్థాలను తగ్గించడం, సుస్థిరమైన మత్స్యరంగ భవిష్యత్తు కోసం ఆధునిక సాంకేతికతతో సాంప్రదాయ జ్ఞానాన్ని ఏకీకృతం చేయడంపై దృష్టి సారిస్తూ ఈ రంగంలోని ప్రధాన సమస్యలను గుర్తించారు. మత్స్య రంగంలో డిజిటల్ పరివర్తన సాధన కోసం మత్స్య శాఖ (భారత ప్రభుత్వం) చేసిన మరో ప్రయత్నంగా, 2024 సెప్టెంబర్ నెలలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ (ఎన్ఎఫ్డీపీ)ని 2024 సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు.
***
MK/VG
(Release ID: 2109480)
Visitor Counter : 32