బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మంత్రిత్వ శాఖపెట్టుబడుల అవకాశాలు, వాణిజ్య బొగ్గు గనుల వేలంపై ముంబయిలో రోడ్ షో నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల భద్రత, సామాజిక సంక్షేమంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన బొగ్గు శాఖ మంత్రి
వాణిజ్య బొగ్గు గనుల 12వ దశ వేలంలో భూగర్బ గనులకు స్థానం
प्रविष्टि तिथि:
28 FEB 2025 2:49PM by PIB Hyderabad
బొగ్గు రంగంలో, వాణిజ్య బొగ్గు గనుల వేలంలో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే దిశగా చేపడుతున్న చర్యల్లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ముంబయిలో ఓ రోడ్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి హాజరయ్యారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, గనుల వేలం ప్రక్రియను నిర్వహించే అధికారి (నామినేటెడ్ అథారిటీ) శ్రీమతి రూపిందర్ బ్రార్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్లో బొగ్గు తవ్వకాల భవిష్యత్తుకు సంబంధించిన చర్చల్లో నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, విధాన నిపుణులు సైతం భాగం పంచుకున్నారు.
ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, సుస్థిర గనుల తవ్వక విధానాలను ప్రోత్సహించే వ్యూహాత్మక వేదికగా ఈ రోడ్ షో పని చేసింది. విధాన సంస్కరణలు, సులభతర వ్యాపార పద్ధతులు, సాంకేతిక పురోగతులపై ప్రధాన దృష్టి సారించింది. అలాగే పర్యావరణ సుస్థిరతకు, దీర్ఘకాల ఇంధన భద్రతకు భరోసా ఇస్తూనే భారత బొగ్గు రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడంలో ప్రభుత్వ నిబద్ధతను సైతం తెలియజేస్తుంది.
భారత్ ఆర్థిక వృద్ధిలో ముఖ్యంగా ఇంధన భద్రతను కల్పించడంలో, పెరుగుతున్న పారిశ్రామిక, విద్యుత్ రంగ డిమాండ్లను నెరవేర్చడంలో బొగ్గు పోషిస్తున్న కీలకపాత్రను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తన కీలకోపన్యాసంలో వివరించారు. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సుస్థిరమైన మైనింగ్ పద్ధతులను పాటించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు.
దేశంలో బొగ్గు ఉత్పత్తిలో సాధించిన గణనీయమైన వృద్ధి గురించి వివరిస్తూ, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఉన్న ఇంధన అవసరాలను సమర్థవంతంగా తీర్చగలిగిందని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిదారులు, వాణిజ్య వినియోగదారులకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం ద్వారా డిమాండ్ - సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దేశ ఇంధన రంగానికి బొగ్గు వెన్నెముక లాంటిదని, విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతానికి పైగా వాటా కలిగి ఉందని మంత్రి తెలిపారు. వాణిజ్య బొగ్గు తవ్వకాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికి, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు మైనింగ్ కార్యకలాపాల్లో ఆటోమేషన్, డిజిటల్ మానిటరింగ్ లాంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించడంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కూడా ఆయన వివరించారు. వీటికి అదనంగా, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న భూమిలో పెద్ద ఎత్తున అటవీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మంత్రి తెలియజేశారు. తద్వారా ఎకో-పార్కులు, గ్రీన్ బెల్టు, జీవవైవిధ్య జోన్లను అభివృద్ధి చేయవచ్చు. అలాగే గనుల మూసివేత ప్రణాళిక ప్రకారం, వ్యవసాయం, అటవీ, గనుల పర్యాటకంతో సహా స్థానికులకు ప్రయోజనం చేకూరేలా మైనింగ్ పూర్తయిన గనులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పయనిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం దేశం కృషి చేస్తోందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో గనుల భద్రత, పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సుస్థిరత గురించి ప్రధానంగా వివరిస్తూ, బొగ్గుపై ఆధారపడిన సమాజాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ఈ అంశంలో బొగ్గు సంస్థలు ఉత్తమమైన భద్రతా విధానాను పాటించాలని కోరారు. అంతేకాకుండా ప్రకృతిని పరిరక్షించేందుకు, ఈ రంగంలో సుస్థిరతను దీర్ఘకాలం కొనసాగించేందుకు పర్యావరణహిత మైనింగ్ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
బొగ్గు రంగంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు చురుకైన విధానాన్ని మంత్రిత్వశాఖ అమలు చేస్తోందని బొగ్గుమంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు. ప్రాజెక్టులు అనుమతి పొందడం నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ పెట్టుబడిదారులకు సహాయం అందించేందుకు మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని తెలిపారు. నియంత్రణ సంస్థలు, సహ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేయడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు అనుమతులు వేగవంతం చేస్తామని తెలిపారు.
బొగ్గు గనుల కేటాయింపు ప్రక్రియలో అడ్డంకులను తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి, మంత్రిత్వ శాఖ అనుమతులకు త్వరితగతిన ఆమోదం తెలుపుతోందని ఆయన పేర్కొన్నారు. గనుల తవ్వకం పూర్తయిన ప్రదేశాల్లో జీవవైవిద్యాన్ని పరిరక్షించేందుకు అటవీకరణను చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. అలాగే గనుల మూసివేత ప్రక్రియలో బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించడం, భారత సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని తెలిపారు. త్వరలో జరగనున్న 12వ దశ వేలం ప్రక్రియలో భూగర్భ గనులను కూడా చేరుస్తున్నామని, అదనపు ఆర్థిక ప్రోత్సహకాలు అందిస్తామని ఆయన ప్రకటించారు. త్వరలో జరిగే బొగ్గు గనుల వేలంలో పాల్గొనాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. నియంత్రణా సంస్థల మద్ధతు, ఆర్థిక ప్రోత్సహకాలు, వ్యాపారంలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వ్యవస్థీకృత విధానాలతో సహా ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు, ఆవిష్కరణలకు దేశీయ బొగ్గు రంగం అపారమైన అవకాశాలను అందిస్తుందని, స్వయం సమృద్ధి సాధించిన, స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
బొగ్గు మైనింగ్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అథారిటీ అయిన శ్రీమతి రూపిందర్ బ్రార్ తన స్వాగతోపన్యాసంలో వివరించారు. పారదర్శకమైన, పోటీతత్వం నిండిన, పెట్టుబడిదారులకు అనుకూలమైన బొగ్గు రంగాన్ని తీర్చిదిద్దడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఆమె తెలియజేశారు. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ సుదీర్ఘాభివృద్ధి దిశగా విధానాలు రూపొందించాలని నిపుణులను ఆమె కోరారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అవసరాలకు సైతం బొగ్గు వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దీనివల్ల బొగ్గును వినియోగ వస్తువుగా మార్కెట్ చేసుకోవడానికి మైనింగ్ సంస్థలకు మరింత సౌలభ్యం ఏర్పడిందని అన్నారు.
పెట్టుబడి సామర్థ్యం, నియంత్రణల్లో సంస్కరణలు, సుస్థిర చర్యలు, బొగ్గు గ్యాసిఫికేషన్ విధానాలపై రోడ్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరంగా చర్చించారు. విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తల మధ్య ప్రత్యక్ష సంభాషణకు ఒక వేదికను ఈ రోడ్ షో కల్పించింది. తద్వారా త్వరలో జరగబోయే బొగ్గు గనులు వేలం, సాంకేతిక పురోగతులు, సుస్థిరమైన బొగ్గు మైనింగ్లో ఉత్తమ పద్ధతులు, సులభతర వ్యాపార పద్ధతులకు విధానపరమైన తోడ్పాటు, ప్రాజెక్టు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడం తదితర అంశాలపై ఆలోచనాత్మక చర్చలు సాగాయి.
రోడ్ షోలో భాగంగా నిర్వహిచిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విధానాలు, వేలం ప్రక్రియ, బొగ్గు రంగంలో వృద్ధికి అవకాశాలపై తమ సందేహాలను అధికారులను అడిగి పెట్టుబడిదారులు నివృత్తి చేసుకున్నారు. సందేహాలకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో అనుసరిస్తున్న పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానంపై నమ్మకం ఏర్పడింది.
భారత్లో బొగ్గు తవ్వకాలల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, దేశీయంగా ఉత్పత్తిని పెంపొందించడం, సుస్థిర భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రయత్నాల్లో ముఖ్యమైనది ఈ ముంబై రోడ్ షో. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఆత్మ నిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ ఇందన భద్రతా లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2107281)
आगंतुक पटल : 41