గనుల మంత్రిత్వ శాఖ
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 175వ స్థాపన దినోత్సవాలను ఈ ఏడాది మార్చి 4న కోల్కతాలో ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
* ఉత్సవాల ప్రారంభానికి సన్నాహకంగా జీఎస్ఐ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 2న దేశమంతటా మెగా వాకథాన్
Posted On:
28 FEB 2025 1:50PM by PIB Hyderabad
దేశంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వైజ్ఞానిక సంస్థల్లో ఒకటైన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తన భూవిజ్ఞాన శాస్త్ర సంబంధ అధ్యయనాల విధులలో 175వ సంవత్సరంలోకి అడుగుపెడుతుండడాన్ని పురస్కరించుకొని ఉత్సవాలను నిర్వహించనుంది. చరిత్ర సృష్టించిన ఈ ముఖ్య ఘట్టానికి సూచికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి స్థాపన దినోత్సవాలను ఈ ఏడాది మార్చి 4న కోల్కతాలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ అసిత్ సాహా, ఇతర ఉన్నతాధికారులు, భూగర్భశాస్త్రవేత్తలతోపాటు ఆసక్తిదారులు (స్టేక్హోల్డర్లు) పాల్గొననున్నారు.
జీఎస్ఐని 1851లో సర్ థామస్ ఓల్డ్హేమ్ నెలకొల్పారు. ఈ సంస్థ జియలాజికల్ మ్యాపింగ్, ఖనిజాల అన్వేషణ, విపత్తులకు సంబంధించిన అధ్యయనాలు, భూవైజ్ఞానిక పరిశోధనలలో మార్గదర్శి పాత్రను నిర్వహిస్తూ మన దేశం పారిశ్రామికంగానూ, ఆర్థికంగానూ వృద్ధి చెందడానికి ముఖ్యమైన తోడ్పాటును అందిస్తూ వస్తోంది.
ఈ భవ్య ఉత్సవానికన్నా ముందస్తు సన్నాహకంగా ఈ ఏడాది మార్చి నెల 2న అఖిల భారత స్థాయిలో ఒక వాకథాన్ (మహా నడక పోటీ)ని జీఎస్ఐ నిర్వహించనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జీఎస్ఐ కార్యాలయాలన్నింటా గల భూగర్భశాస్త్రవేత్తలు, విద్యార్థులు, విధాన రూపకర్తలతోపాటు సాధారణ ప్రజలు కూడా ఈ వాకథాన్లో పాలుపంచుకొంటారు. కోల్కతాలో ఉన్న సంస్థ కేంద్ర కార్యాలయం ముఖ్య స్థానంలో నిలవబోతోంది. జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ అసిత్ సాహా నాయకత్వంలో సీకే-సీఎల్ పార్క్, సాల్ట్ లేక్, సెక్టర్-IIలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ వాకథాన్ కార్యక్రమానికన్నా మించి, సముదాయాలతో జతపడడానికీ, భూవిజ్ఞాన శాస్త్రానికున్న ప్రాముఖ్యాన్ని మరింత మందికి తెలియజేయడానికీ, అన్వేషణ, నవకల్పనల దిశగా భావితరాల వారికి ప్రేరణను అందించడానికీ ఒక విశిష్ట వేదికను అందించనుంది. భూగర్భవిజ్ఞాన శాస్త్రంలో జీఎస్ఐ సంపాదించిన 175 సంవత్సరాల శ్రేష్ఠమైన అనుభవాన్ని పండుగ చేసుకొనేందుకు ఉద్దేశించిన ఈ ఉత్సవాల్లో విభిన్న నేపథ్యాలకు చెందిన వారు పాల్గొంటారు.
ఈ ఏడాది మార్చి 4న జీఎస్ఐ తన 175వ వ్యవస్థాపక దినోత్సవం వేళ, అనేక వినోదభరిత కార్యక్రమాలు, జ్ఞానాన్ని పెంచే పుస్తకాల ఆవిష్కరణలు, ప్రత్యేక తపాలా కవరు, మై స్టాంపులతోపాటు రెండు భూవైజ్ఞానిక మొబైల్ అప్లికేషన్లను ప్రవేశపెట్టడం వంటి వాటితో తన సంపన్న వారసత్వాన్ని, విజ్ఞాన శాస్త్ర రంగానికి తాను అందించిన తోడ్పాటును చాటిచెప్పనుంది.
విభిన్న అంశాలపై ఏర్పాటు చేసే ప్రదర్శనలు, చరిత్రాత్మక ఛాయాచిత్రాల గ్యాలరీ.. ఇవి జీఎస్ఐ 175 సంవత్సరాల వారసత్వాన్ని, సంస్థ సాధించిన విజయాలను కళ్లకు కట్టనున్నాయి. భూగర్భ విజ్ఞానశాస్త్రాల పట్ల ప్రజలకు అవగాహననూ, చైతన్యాన్నీ పెంచడానికి వేరు వేరు పోటీలను, వారు మమేకం కాగలిగిన రీతిన అనేక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రంగాలకు చెందిన వారు వీటిలో పాల్గొనేటట్లు వారిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దుతారు. అదే సమయంలో, సమాజం పట్ల జీఎస్ఐకున్న బాధ్యతను, సాముదాయిక సంక్షేమం పట్ల జీఎస్ఐకున్న నిబద్ధతను ఈ ఉత్సవాలు బలపరచనున్నాయి.
భారత్లో మార్గదర్శక పాత్రను పోషిస్తున్న వైజ్ఞానిక సంస్థలలో ఒకటైన జీఎస్ఐ రైల్వేల కోసం బొగ్గును కనుగొనే విధుల నుంచి మొదలుపెట్టి భూ సంబంధ విజ్ఞాన శాస్త్రంలో అత్యంత ఆధునిక నవకల్పనలకు ప్రేరణశక్తిగా ఎదుగుతూ వచ్చింది. ఈ సంస్థ 175వ వ్యవస్థాపక దినోత్సవాలు సంస్థకు చెందిన సంపన్న వారసత్వాన్ని గౌరవించుకోవడానికి మాత్రమే కాకుండా భూవైజ్ఞానిక సంబంధి అంశాలను ఆరా తీయడాన్ని వేగవంతం చేయడంలోనూ, ఖనిజాల అన్వేషణలోనూ, దేశ ప్రగతికి తోడ్పడే సాంకేతిక నవకల్పనలలోనూ సాయంచేయాలనే తన నిబద్ధతను సైతం పునరుద్ఘాటించబోతున్నాయి. అనేక వర్గాలు ఉప్పొంగిన ఉత్సాహంతో ఈ ఉత్సవాలలో పాల్గొనబోతున్నందువల్ల, జ్ఞానం, పటుత్వం, భూవైజ్ఞానిక చైతన్యం.. ఈ అంశాల్లో ప్రేరణదాయకమైన, ప్రభావశీలమైన ముద్రను వేయాలని జీఎస్ఐ ఆశిస్తోంది.
***
(Release ID: 2106939)
Visitor Counter : 35