ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశా పర్వ లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 24 NOV 2024 8:20PM by PIB Hyderabad


జై జగన్నాథ్.

జై జగన్నాథ్.

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ, శ్రీ అశ్వనీ వైష్ణవ్ జీ, ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ సిద్ధార్థ్ ప్రధాన్ జీ, ఒడియా సమాజ్‌ కు చెందిన ఇతర అధికారులు, ఒడిశాకు చెందిన కళాకారులు, ఇతర విశిష్ట వ్యక్తులు, సోదర సోదరీమణులారా,

 

ఒడిశాలోని నా సోదరీమణులకు, సోదరులకు అందరికీ నా నమస్కారం, జుహార్.  ఒడిశా సంస్కృతికి సంబంధించిన గొప్ప ఉత్సవమైన ఒడిశా పర్వ 2024లో పాలుపంచుకొంటున్నందుకు నేను గర్వపడుతున్నాను.  మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఒడిశా పర్వ సందర్భంగా మీ అందరికి, ఒడిశా ప్రజలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.  ఈ సంవత్సరం స్వభావ కవి గంగాధర్ మెహెర్ వందో వర్థంతి కూడా.  ఈ సందర్భంగా, ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.  భక్త దాసియా బావురీ జీ ని, భక్త సాల్ బేగ జీ ని, ఒడియా భాగవత రచయిత శ్రీ జగన్నాథ్ దాస్ జీని కూడా నేను గౌరవ పూర్వకంగా స్మరించుకొంటున్నాను.  భారత్‌ను చైతన్య భరితంగా నిలపడంలో ఒడిశా సాంస్కృతిక వైవిధ్యం ముఖ్య పాత్రను పోషించింది.

మిత్రులారా,

ఒడిశా సాధువులు, మునులు, పండితుల నిలయంగా ఉంటూ వస్తోంది.  మహాభారతాన్ని, ఒడియా భాగవతాన్ని సరళ భాషలో ప్రతి ఒక్క కుటుంబం చెంతకూ చేర్చి, సాధువుల జ్ఞానాన్ని ప్రజలకు అందజేసిన ఒడిశా పండితుల తీరు మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతో  సంపన్నం చేసింది.  జగన్నాథ ప్రభువును గురించి సాహితీ సంపద ఒడియా భాషలో సమృద్ధంగా ఉంది.  జగన్నాథ ప్రభువు ఆయన ఆలయంలో నుంచి బయటకు వచ్చి, ఒక యుద్ధంలో స్వయంగా పాల్గొన్నారన్న గాథను నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాను.  ఆయన యుద్ధ భూమికి వెళ్ళే కన్నా ముందు ఆయన భక్తుడైన మాణికా గౌడుణీ సమర్పించిన పెరుగును సేవించారు.  ఈ కథ మనకు లోతైన అనేక పాఠాలను బోధిస్తుంది.  మనం పరిశుద్ధమైన మనసుతో పని చేశామంటే ప్రభువు తనంత తాను మనకు మార్గదర్శనం చేస్తారు అని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తున్నది.  ఏ స్థితిలో అయినా మనం ఏకాకి కాదన్న సంగతిని మనం తప్పక గుర్తు పెట్టుకోవాలి.  దైవం మన వెంట ఉంటుంది. మనం ఎన్నటికీ ‘‘ఒంటరి వారం కానే కాదు, మనం వన్ ప్లస్ వన్.’’

మిత్రులారా,

‘నా జీవనం కష్టాలలో మునిగిపోనివ్వండి, ఆ స్థితి ఈ జగతి నుంచి నా విమోచనకు దారి తీస్తుందీ అంటే కష్టాలను నేను ఆహ్వానిస్తాను’ (मो जीवन पछे नर्के पडिथाउ जगत उद्धार हेउ।) అని ఒడిశా సాధువు, కవి భీమ బోయి అన్నారు. ఈ భావన లో ఒడిశా సంస్కృతి సారం ఇమిడిపోయి ఉంది.  ఒడిశా ప్రతి శకంలోనూ దేశ ప్రజలకు, మానవ జాతికి సేవచేస్తూ వస్తోంది.  పవిత్రమైన పూరీ ధామం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనను సుదృఢపరిచింది.  ఒడిశా వీర పుత్రులు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో గొప్పగా పోరాడారు.  పైకా తిరుగుబాటులో అమరులైన వారి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం.  పైకా తిరుగుబాటును గుర్తుకు తీసుకు వస్తూ ఒక స్మారక తపాలా బిళ్ళను, ఒక స్మారక నాణేన్ని జారీ చేసే భాగ్యం మా ప్రభుత్వానికి దక్కింది.

మిత్రులారా,

ఉత్కళ్ కేసరి హరే కృష్ణ మెహతాబ్ సేవలను యావత్తు దేశం స్మరించుకొంటోంది.  మనం ఆయన 125వ జయంతిని ఉత్సవాల రూపంలో పెద్ద ఎత్తున నిర్వహించుకొంటున్నాం.  చరిత్రను పరిశీలిస్తే, ఒడిశా మన దేశానికి అసాధారణ నాయకత్వాన్ని అందించిందని తెలుస్తుంది.  ప్రస్తుతం ఒడిశా పుత్రిక ద్రౌపది ముర్ము గారు ఆదివాసీ సముదాయాన్నుంచి వచ్చి, భారత్ కు రాష్ట్రపతి పదవిని అలంకరించడం మన అందరికీ అమిత గర్వకారణం సుమా.  భారత్ అంతటా ఆదివాసీ సముదాయాలకు వేల కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను అమలు చేయడానికి ఆమె నాయకత్వమే ప్రేరణను అందించింది.  దీనితో ఒక్క ఒడిశాకే కాకుండా భారత్ లో పూర్తి ఆదివాసీ సముదాయం సైతం లాభపడుతోంది.

మిత్రులారా,

ఒడిశా సుభద్ర మాత జన్మించిన భూమి. ఈ నేల ‘నారీశక్తి’కి, వారి యుక్తికి సంకేతం.  ఒడిశాలోని మహిళలు ముందంజ వేసినప్పుడు  ప్రగతి పథంలో పరుగు తీస్తుంది ఆ రాష్ట్రం.  ఈ కారణంగా నేను కొద్దిరోజుల క్రితం ఒడిశాలో తల్లులు, కుమార్తెల కోసం ‘సుభద్ర యోజన’ను ప్రారంభించాను.  ఈ పథకం రాష్ట్రంలో మహిళలకు ఎంతో మేలు చేయనుంది.  ఉత్కళ ముద్దు బిడ్డలను గురించి తెలుసుకొని, వారి జీవితాలు అందించే స్ఫూర్తిని దేశ ప్రజలు స్వీకరించనిద్దాం.  ఇందుకోసమే ఆ తరహా ఉత్సవ కార్యక్రమాలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఉంది.

మిత్రులారా,

ఉత్కళ్ భారత నౌకా వాణిజ్య పరిధిని చాలా కాలం నుంచీ విస్తరిస్తూ వచ్చింది.  నిన్ననే వైభవోపేతమైన బలి జాతర ఒడిశాలో ముగిసింది.  ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా కటక్ లోని మహానది తీరంలో ఈ నెల 15న కార్తిక పూర్ణిమ నాడు మొదలుపెట్టి గొప్పగా నిర్వహించారు.  ఈ కార్యక్రమం భారత, ఒడిశాల నౌకా వాణిజ్య సత్తాకు ఒక ప్రతీక.  వందల సంవత్సరాల కిందటే.. ఇప్పుడు మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ అప్పట్లో లేకపోయినప్పటికీ.. ఈ గడ్డకు చెందిన నావికులు ఎంతో తెగువను చాటుతూ సముద్రాలను దాటి ఆవలకు పోయారు.  మన వ్యాపారులు నౌకలలో ఇండొనేషియాలో బాలీ, సుమాత్రా, జావా వంటి ప్రాంతాలకు వెళ్లారు.  ఈ సముద్ర ప్రయాణాల ద్వారా ఒక్క వ్యాపారమే కాదు, సాంస్కృతిక ఆదాన ప్రదానాలు కూడా చోటుచేసుకొన్నాయి.  ప్రస్తుతం ఒడిశాకు ఉన్న నౌకా వాణిజ్య శక్తి ‘వికసిత్ భారత్’ (‘అభివృద్ధి చెందిన భారతదేశం’) దార్శనికతను సాకారం చేయడంలో ఒక కీలక పాత్రను పోషిస్తోంది.

మిత్రులారా,

గత పదేళ్ళుగా పట్టు విడువక చేసిన కృషి ఫలితంగా ఒడిశా భవిష్యత్తు మార్గంలో ఒక కొత్త మలుపు ఆవిష్కారమైంది.  2024లో ఒడిశా ప్రజలు అందించిన అపూర్వ ఆశీర్వాదాలు ఈ దార్శనికతకు ఒక కొత్త జోరును జోడించాయి.  మేం గొప్ప కలలను కనడంతో పాటు మహత్తర లక్ష్యాలను నిర్దేశించుకొన్నాం.  2036కల్లా ఒడిశా రాష్ట్రంగా ఆవిర్భవించి వందేళ్ళు అయ్యేటప్పటికి, మేం ఒడిశాను దేశంలో అత్యంత శక్తిమంతమైన, సంపన్నమైన, అభివృద్ధిపథంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొన్నాం.

మిత్రులారా,

ఒడిశా సహా భారత్ లోని తూర్పు ప్రాంతాలన్నిటినీ వెనుకబడిన ప్రాంతాలుగా ముద్ర వేసిన కాలం అంటూ ఒకటి ఉండింది.  ఏమైనా, తూర్పు ప్రాంతం భారత అభివృద్ధికి చోదక శక్తి అని నేను తలుస్తున్నాను. అందువల్ల భారత్ లోని తూర్పు ప్రాంతాలను అభివృద్ధి చేయడం మా ప్రాధాన్యంగా ఉంటూ వచ్చింది.  కనెక్టివిటీ కావచ్చు, ఆరోగ్య సంరక్షణ రంగం కావచ్చు లేదా విద్యా రంగం కావచ్చు.. భారతదేశం తూర్పు ప్రాంతాల్లో ప్రతి ఒక్క రంగంలో పనుల వేగాన్ని మేం పెంచాం.  పది సంవత్సరాల కిందటి కాలంతో పోల్చి చూసినప్పుడు  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఒడిశా అభివృద్ధికి మూడింతల బడ్జెటును కేటాయిస్తున్నది.  కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో కేటాయింపు 30 శాతం ఎక్కువగా ఉంది.  ఒడిశా ప్రగతి కోసం ప్రతి ఒక్క రంగంలో పనులను త్వరిత గతిన పూర్తి చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.

మిత్రులారా,

ఒడిశాలో నౌకాశ్రయాలు అండదండలుగా పారిశ్రామికాభివృద్ధిని సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.  కాబట్టి ధామ్ రా, గోపాల్‌ పుర్, అస్తారంగా, పలూర్, ఇంకా సువర్ణ్ రేఖ  నౌకాశ్రయాలను అభివృద్ధి పరచడానికి, తద్వారా ఈ ప్రాంతంలో వ్యాపారానికి ఊతమివ్వడానికి మేం పెద్దపీట వేయనున్నాం.  భారత్ లో గనుల తవ్వకం, లోహ నిక్షేపాలకు కూడా ఒడిశా కీలకం.  ఉక్కు, అల్యూమినియం, ఇంధనం రంగాల్లో ఈ రాష్ట్రం స్థానాన్ని బల పరచవలసిన అవసరం ఉంది.  ఈ రంగాలపై శ్రద్ధ తీసుకొంటే, ఒడిశాలో సమృద్ధికి మనం కొత్త తలుపులను తెరవగలం.

మిత్రులారా,

జీడిపప్పు, జనుము, పత్తి, పసుపులతో పాటు, నూనెగింజల పంటలను ఒడిశాలో సారవంతమైన భూముల్లో సమృద్ధిగా పండించవచ్చు.  ఈ పంటల ఉత్పత్తులు పెద్ద పెద్ద విపణులకు చేరుకొని మన రైతు సోదరీమణులు, మన రైతు సోదరులు లాభపడాలన్నదే మా లక్ష్యం.  ఒడిశాలో సముద్ర సంబంధిత ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమ పరిధిని విస్తరించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.  ఒడిశా సముద్ర సంబంధిత ఆహారోత్పత్తులకు ఎక్కువ డిమాండు ఏర్పడేటట్లుగా ఒక ప్రపంచ శ్రేణి బ్రాండును సిద్ధం చేయాలన్నదే మా లక్ష్యం.    

మిత్రులారా,

పెట్టుబడిదారులు అత్యంత ఇష్టపడే ప్రాంతాలలో ఒకటిగా ఒడిశాను తీర్చిదిద్దడానికి మేం కృషి చేస్తున్నాం.  ఈ రాష్ట్రంలో వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని ఇప్పటి కన్నా మరింత పెంచాలని మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ‘ఉత్కర్ష్ ఉత్కళ్’ వంటి కార్యక్రమాలను అమలుచేస్తూ, పెట్టుబడికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం.  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి 100 రోజుల లోపల రూ. 45,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒడిశా ఆమోదం తెలిపింది.  ప్రస్తుతం ఒడిశాకంటూ ఒక విజన్, ఒక మార్గసూచీ ఉన్నాయి.  ఇది పెట్టుబడులను ఆకర్షించడం ఒక్కటే కాకుండా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుంది.  ఈ ప్రయత్నాలకుగాను ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝీ జీ ని, ఆయన జట్టు సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

ఒడిశా శక్తియుక్తులను సరి అయిన దిశలో ఉపయోగించుకొంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సరికొత్త మజిలీల వైపునకు మనం తీసుకుపో గలుగుతాం.  ఒడిశాకు ఉన్న వ్యూహాత్మక నైసర్గికతకు ఒక చెప్పుకోదగిన ప్రయోజనం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను.  ఇది ఇటు దేశీయ విపణులకు, అటు అంతర్జాతీయ విపణులకు సులభతరమైన అందుబాటును ఇస్తూ, ఆసియా ఖండంలో తూర్పు ప్రాంతాలే గాక ఆగ్నేయ ప్రాంతంలోనూ ఓ ముఖ్య వ్యాపార కూడలి గా దీనిని నిలబెడుతోంది.  ప్రపంచ విలువ శ్రేణుల (గ్లోబల్ వేల్యూ చైన్స్)లో ఒడిశాకు ఉన్న భూమిక రాబోయే కాలంలో గణనీయంగా వృద్ధి చెందనుంది.  ఈ రాష్ట్రం నుంచి ఎగుమతులను పెంచే దిశలో కూడా మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

మిత్రులారా,

ఒడిశాలో పట్టణీకరణను ప్రోత్సహించడానికి భారీ అవకాశాలు ఉన్నాయి.  ఈ మార్గంలో మా ప్రభుత్వం ముందుకు పోతోంది.  మేం మరింత చైతన్య భరితమైన నగరాలను, రవాణా సదుపాయాలు సమృద్ధిగా ఉన్న నగరాలను తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం.  ఒడిశాలో రెండో అంచె నగరాల అభివృద్ధికి ఉన్న అవకాశాలనూ అన్వేషిస్తున్నాం.  ముఖ్యంగా ఒడిశాలో పశ్చిమ ప్రాంత జిల్లాలు సరికొత్త మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకొని, ఆ క్రమంలో కొత్త అవకాశాలకు బాటను పరచనున్నాయి.

మిత్రులారా,

ఉన్నత విద్యా రంగంలో దేశవ్యాప్తంగా విద్యార్థిలోకానికి ఒడిశా ఒక దీప స్తంభంగా నిలుస్తోంది.  ఎన్నో జాతీయ సంస్థలతో, అంతర్జాతీయ సంస్థలతో విద్యా రంగంలో మంచి పేరును తెచ్చుకోవడానికి ఈ రాష్ట్రం సన్నద్ధం అవుతోంది.  ఈ ప్రయత్నాలు రాష్ట్రంలో అంకుర వ్యవస్థ (స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్) వృద్ధిని కూడా ప్రోత్సహిస్తున్నాయి.  

మిత్రులారా,

ఒడిశా తనకున్న ఘన సాంస్కృతిక వారసత్వం కారణంగా ఎప్పటికీ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తోంది.  ఒడిశాలో కళారూపాలు అందరి మదిని ఆకట్టుకొనేవే, వారిలో స్ఫూర్తిని నింపేవే.  అది ఒడిశా నృత్యం కావచ్చు, లేదా చిత్రకళ కావచ్చు.. ఈ రాష్ట్రంలో కళాత్మక ప్రతిభ ఉట్టిపడుతోంది.  సౌర అనే ఆదివాసీ చిత్రలేఖన కళ, సంబల్‌పురీ, బోమ్‌కాయీ పనితనం, కోట్‌పాద్ నేత కార్మికుల ప్రతిభ.. ఇవి అన్నీ ప్రశంసనీయాలే.  ఈ కళారూపాలను, వృత్తి విద్యలను మనం ఎంతగా ప్రోత్సహిస్తూ, ఒడియా హస్త కళాకారులను ఎంతగా మనం ఆదరిస్తే, చేయి తిరిగిన ఆ చేతివృత్తి కళాకారులు ఈ వారసత్వాన్ని అంతగా పరిరక్షించి సుసంపన్నం చేస్తారు.

మిత్రులారా,

ఒడిశాకు అంతులేని వాస్తుకళ, నైపుణ్యంలతో పాటు విజ్ఞానశాస్త్ర సమృద్ధి కూడా ఉంది.  కోణార్క్‌లోని సూర్య దేవాలయంలో అడుగడుగునా కనిపించే శోభ, విజ్ఞానశాస్త్ర పాటవం, ఇదేగాక, లింగరాజ్, ముక్తేశ్వర్‌ల వంటి ప్రాచీన ఆలయాల వాస్తు వైభవాలు ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తాయి.  ప్రజలు ఈ అద్భుతాలను కనులారా గాంచిన తరువాత, వందల ఏళ్ళ క్రితమే ఒడిశాలో విజ్ఞానశాస్త్రం ఇంతగా ముందడుగు వేసిందా అని నోరువెళ్ళబెట్టక మానరు.

మిత్రులారా,

ఒడిశాలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలు అపారం.  ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు మనం అనేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  మీరు గమనిస్తే ఇటు ఒడిశాలో, అటు జాతీయ స్థాయిలో ఒడిశా వారసత్వాన్ని, ఒడిశా గుర్తింపును సమాదరించి, సంబరం జరిపే ప్రభుత్వాలు కొలువుదీరి ఉన్న విషయం అర్థమవుతుంది.  కిందటి ఏడాదిలో జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన కాలంలో మేం సూర్య దేవాలయ ప్రాముఖ్యాన్ని ప్రపంచ నేతలకు, దౌత్యవేత్తలకు ప్రముఖంగా చాటి చెప్పాం.  రత్నభండార్ సహా మహాప్రభు జగన్నాథ్ దేవాలయానికి ఉన్న నాలుగు ప్రవేశ ద్వారాలను ప్రస్తుతం తెరచి ఉంచినందుకు కూడా నేను సంతోషంగా ఉన్నాను.

మిత్రులారా,

ఒడిశాకు ఉన్న గుర్తింపునకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు చూడడానికి మనం అనేక నూతన చర్యలను తీసుకోవలసిన అవసరం ఉంది.  ఉదాహరణకు.. బాలీ జాతర దినోత్సవాన్ని ప్రకటించి, ఆ రోజుకు ఉన్న విశిష్టతను అంతర్జాతీయ వేదికలలో మనం ప్రచారం చేయాలి.  అదే విధంగా ఒడిశీ శాస్త్రీయ నృత్య రూపానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని పదుగురికీ చాటిచెప్పేటందుకు ఒడిసీ దినోత్సవాన్ని పాటించడాన్ని మనం మొదలుపెట్టాల్సి ఉంది.  ఆదివాసీ సంప్రదాయాలు ఎన్నింటినో ఘనంగా నిర్వహించడానికి కొత్త సంప్రదాయాలకు నాంది పలక వచ్చును.  ఆ కార్యక్రమాలను పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి ప్రచారం కల్పించ వచ్చు.  ఇది అవగాహన స్థాయిలను పెంచి, పర్యటన రంగంలో, చిన్న పరిశ్రమల రంగంలో అవకాశాల్ని సృష్టించ గలుగుతుంది.  త్వరలో భువనేశ్వర్‌లో ప్రవాస భారతీయ దివస్‌ను నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించనున్నాం.  ప్రవాసీ భారతీయ దివస్‌కు ఒడిశా మొట్టమొదటి సారిగా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.  ఇది రాష్ట్రానికి ఒక విశేష అవకాశాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

మారుతున్న కాలాలు చాలా ప్రాంతాల్లో ప్రజలను వారి మాతృభాషను, వారి సంస్కృతిని మరచిపోయేటట్లు చేశాయి.  ఏమైనా, నా పరిశీలనలో తేలింది ఏమిటంటే అది, ఒడియా సముదాయం వారు ఎక్కడ ఉంటున్నారనేది పక్కన పెడితే, వారు వారి భాషతోను, వారి సంస్కృతితోను, మరి వారి పండుగలతోను గాఢమైన అనుబంధాన్ని పెంచి పోషించుకొంటూనే వస్తున్నారనేదే.  మనను మన వారసత్వంతో ముడిపెట్టి ఉంచేది మన మాతృభాష, మన సాంస్కృతిక మూలాలే.  ఇటీవల నేను దక్షిణ అమెరికాలోని గయానాలో ఈ ఉత్సాహాన్నే ప్రత్యక్షంగా గమనించాను.  200 ఏళ్ళ క్రితమే వలసపోయిన వందల కొద్దీ పనివారు రాంచరిత్‌మానస్ ను వదలకుండా తమతో అట్టిపెట్టుకొని, భగవాన్ రాముని పేరును స్మరిస్తూ భారత్‌తో వారికి ఉన్న బంధాన్ని నిలబెట్టుకొంటూ వస్తున్నారు.  అలా మనం సంప్రదాయాన్నికాపాడుకొంటూ అభివృద్ధి పథంలో పురోగమిస్తూ ఉన్నామంటే గనక  ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయి.  ఒడిశాను కొత్త శిఖరాలకు చేర్చే పద్ధతి ఇదే.

మిత్రులారా,

ఈ ఆధునిక కాలంలో మనం మన మూలాలను బలపరచుకొంటూనే సమకాలిన మార్పులను కూడా తప్పక అక్కున చేర్చుకోవాలి.  ఒడిశా పర్వ వంటి కార్యక్రమాలు దీనికి ఒక మాధ్యమంలా తోడ్పడగలుగుతాయి.  రాబోయే కాలంలో ఈ కార్యక్రమం ఢిల్లీకి బయట సైతం విస్తరిస్తుందని నేను ఆశిస్తున్నాను.  పాఠశాలలు, కళాశాలలు, వివిధ రాష్ట్రాల ప్రజలు మరింత ఎక్కువ సంఖ్యలో దీనిలో పాల్గొనేటట్లు మనం చూడాలి.  ఒడిశా గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుసుకొని, ఒడిశా సంస్కృతిని ఎంతో దగ్గరగా పరిశీలించే అనుభూతిని సొంతం చేసుకోవడం ముఖ్యం.  ఒడిశా పర్వ ప్రభావం సమీప భవిష్యత్తులో దేశంలో మూల మూలకు ప్రసరిస్తుందన్న నమ్మకం నాలో ఉంది.  ఇది ఒక సామూహిక ప్రాతినిధ్య వేదికగా బలపడుతుందని నేననుకొంటున్నాను.  ఈ అభిప్రాయంతో, నేను మరో సారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.  

మీకు అనేకానేక ధన్యవాదాలు,

జై జగన్నాథ్.

 

 

***


(Release ID: 2106348)