ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
“అందరి సహకారంతో అందరి ప్రగతి (సబ్కా సాథ్.. సబ్కా వికాస్) మనందరి సమష్టి బాధ్యత”
“మా అభివృద్ధి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుని.. పరీక్షించి... మద్దతిస్తున్నారు”
“ఊరట నుంచి సంతృప్తి దాకా.. 2014 తర్వాత దేశం ఓ కొత్త విధానాన్ని చూసింది...
ఇది బుజ్జగింపులకు కాకుండా ప్రజానీకం సంతృప్తికి ప్రాధాన్యమిచ్చే నమూనా”
“సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. మా పాలనకు తారక మంత్రం”
“నారీశక్తి సారథ్యంలో భారత పురోగమనం”
“పేద.. అణగారిన వర్గాల సంక్షేమమే మా ప్రాథమ్యం”
“పిఎం-జన్మన్’ అమలుతో గిరిజన వర్గాలకు సాధికారత కల్పిస్తున్నాం”
“దేశ జనాభాలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులై నవ్య మధ్యతరగతిలో భాగమయ్యారు... వారి ఆకాంక్షలే దేశ ప్రగతికి నేడు బలమైన పునాది”
“ఆత్మవిశ్వాసం.. దృఢ సంకల్పంతో భారత ప్రగతి పయనానికి సారథ్యం వహించేందుకు మధ్య తరగతి ప్రజలు సిద్ధంగా ఉన్నారు”
“దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల బలోపేతంపై మేం దృష్టి సారించాం”
“భారత్ ఆర్థిక సామర్థ్యాన్ని నేడు యావత్ ప్రపంచం గుర్తిస్తోంది”
Posted On:
06 FEB 2025 8:41PM by PIB Hyderabad
పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
సభలో 70 మందికిపైగా గౌరవనీయ ఎంపీలు ఈ చర్చలో పాల్గొని, తమ విలువైన అభిప్రాయాలతో ధన్యవాద తీర్మానాన్ని అర్థవంతం చేశారని శ్రీ మోదీ పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండింటి వైపునుంచి మాట్లాడిన ప్రతి సభ్యుడూ తమ అవగాహన మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని విశ్లేషించారని చెప్పారు. ముఖ్యంగా ‘అందరి సహకారంతో.. అందరి ప్రగతి’ (సబ్కా సాథ్.. సబ్కా వికాస్)పై విస్తృతంగా ప్రసంగించినప్పటికీ అందులోని సంక్లిష్టతలను అవగతం చేసుకోవడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ అన్నది మనందరి సమష్టి బాధ్యతని, ప్రజలు దేశ సేవచేసే అవకాశం ఇచ్చింది అందుకేనని స్పష్టం చేశారు.
దేశ ప్రజానీకం 2014 నుంచి వరుసగా మూడోసారి తమకు సేవచేసే అవకాశం ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలు తమ అభివృద్ధి విధానాలను అర్థం చేసుకుని, పరీక్షించి, మద్దతిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని శ్రీ మోదీ విశ్లేషించారు. ‘దేశమే ప్రధానం’ అన్న పదబంధమే తమ అభివృద్ధి నమూనాను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యాచరణతో ఇది మరింత స్పష్టమవుతున్నదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 5-6 దశాబ్దాల సుదీర్ఘ విరామానంతరం ప్రత్యామ్నాయ ప్రభుత్వం, పాలన యంత్రాంగ నమూనా అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తదనుగుణంగా 2014 నుంచి బుజ్జగింపుల ప్రాతిపదికన కాకుండా సంతృప్తి లక్ష్యంగా సాగే పాలనలోని సరికొత్త అభివృద్ధి నమూనాను గమనించే అవకాశం ప్రజలకు కలిగిందని శ్రీ మోదీ అన్నారు.
“దేశంలో వనరుల గరిష్ఠ సద్వినియోగానికి భరోసా దిశగా మేం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే జాతి ప్రగతికి, ప్రజల సంక్షేమానికి దేశం తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అందుకే, “మేం సంతృప్త విధానాన్ని అనుసరిస్తున్నాం” అని వివరించారు. ప్రతి పథకం అమలులో అర్హులైన వాస్తవ లబ్ధిదారులకు 100 శాతం ప్రయోజనంపై భరోసా ఇవ్వడమే ఈ విధానం ధ్యేయమని తెలిపారు. తదనుగుణంగా గడచిన దశాబ్ద కాలంలో “సబ్ కా సాథ్.. సబ్ కా విశ్వాస్” వాస్తవ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో ఆచరించి చూపామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆ కృషి ఫలితం నేడు ప్రగతి, పురోగమనం రూపేణా మన కళ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు. కాబట్టే- “సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. మా పాలనకు తారక మంత్రం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పేదలు, గిరిజనుల ఆత్మగౌరవం, భద్రత ఇనుమడించేలా ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించడంలో ప్రభుత్వం తన నిబద్ధతను ప్రదర్శించిందని ప్రధాని స్పష్టం చేశారు.
దేశంలో కులతత్వ విషబీజాలు నాటేందుకు ఇటీవలి కాలంలో చాలా ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రధానమంత్రి ఆందోళన వెలిబుచ్చారు. ‘ఒబిసి’ కమిషన్కు రాజ్యాంగ హోదా కోసం వివిధ పార్టీల్లోని ఆ వర్గాల ఎంపీలు మూడు దశాబ్దాలుగా పార్లమెంటు ఉభయసభల్లో డిమాండ్ చేస్తూ వచ్చారని గుర్తుచేశారు. అయితే, వారి ఆకాంక్షను నెరవేర్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులను ఆరాధించే తమ ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల గౌరవప్రతిష్ఠలు కూడా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో రిజర్వేషన్ అంశం తలెత్తిన ఏ సందర్భంలోనూ ఆ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేసిన జాడ లేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినపుడల్లా దేశంలో విభజన తెచ్చి, ఉద్రిక్తతల సృష్టితో జనం పరస్పర శత్రువుల్లా వ్యవహరించేలా కుయుక్తులు పన్నారని వివరించారు. చివరకు స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇలాంటి విధానాలే అనుసరించారని పేర్కొన్నారు. అయితే, ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ మంత్రం స్ఫూర్తితో తమ ప్రభుత్వం తొలిసారి ఒక నమూనాను రూపొందించిందని, ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ఆర్థిక బలహీన వర్గాలకు దాదాపు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నిర్ణయంపై ఏ ఒక్క వర్గమూ అసంతృప్తి వెలిబుచ్చలేదని, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు హర్షం ప్రకటించాయని గుర్తు చేశారు. ఆ మేరకు ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ సూత్రం ప్రాతిపదికన ఆరోగ్యకర, శాంతియుత పద్ధతిలో పరిష్కారం చూపిన ఈ నిర్ణయాన్ని యావద్దేశం ఆమోదించిందని ప్రధాని తెలిపారు.
దేశంలోని దివ్యాంగులు లేదా విభిన్న వైకల్యాలున్న వ్యక్తులపై ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ తారక మంత్రంగా వారికి రిజర్వేషన్లను వర్తింపజేసిందని తెలిపారు. అంతేకాకుండా వారికి అనువైన సౌకర్యాల కల్పనకు ఉద్యమ స్థాయిలో కృషి చేసిందని పేర్కొన్నారు. విభిన్న వైకల్యాలుగల వారి ప్రయోజనం దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. మరోవైపు చట్టపరంగానూ బలమైన చర్యలతో వారి హక్కులకు భరోసా ఇవ్వడంలో నిబద్ధత చూపిందన్నారు. ముఖ్యంగా లింగమార్పిడి వ్యక్తుల సామాజిక హక్కుల రక్షణ దిశగా చిత్తశుద్ధి చూపిందని శ్రీ మోదీ వివరించారు. సమాజంలోని అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి కరుణార్ద్ర దృక్పథంలో చర్యలు తీసుకోవడం ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ విధానాన్ని స్పష్టం చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
“భారత పురోగమనానికి నారీశక్తి సారథ్యం వహిస్తోంది” అని శ్రీ మోదీ అభివర్ణించారు. మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా విధాన రూపకల్పనలో వారు భాగస్వాములైతే దేశ ప్రగతి వేగం పుంజుకోగలదని ఆయన స్పష్టం చేశారు. అందుకే నారీశక్తిని గౌరవిస్తూ కొత్త పార్లమెంటు భవనంలో ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాన్ని వారికి అంకితమిచ్చామని వ్యాఖ్యానించారు. భవనం రూపురేఖల రీత్యా మాత్రమేగాక నారీ శక్తికి నివాళిగా తొలి నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా కొత్త పార్లమెంటు సౌధం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేవలం ప్రశంసల కోసమే అయితే, కొత్త భవన ప్రారంభోత్సవం మరోవిధంగా నిర్వహించి ఉండవచ్చునని, అందుకు బదులుగా ఆ కార్యక్రమాన్ని మహిళల గౌరవానికి అంకితం చేశామని వివరించారు. ఆ మేరకు నారీశక్తి ఆశీర్వాదంతో కొత్త పార్లమెంటు తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
గత ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏనాడూ ‘భారత రత్న’ పురస్కారానికి అర్హుడుగా పరిగణించలేదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కానీ, దేశ ప్రజలు మాత్రం ఆయన స్ఫూర్తిని, ఆదర్శాలను సదా గౌరవిస్తూనే ఉన్నారని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఆయనకు లభిస్తున్న ఈ గౌరవమర్యాదల ఫలితంగా అన్ని పార్టీలలో ప్రతి ఒక్కరూ నేడు అయిష్టంగానే “జై భీమ్” అనక తప్పడంలేదన్నారు.
దేశంలోని ఎస్సీ/ఎస్టీ వర్గాల ప్రాథమిక సవాళ్లను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లోతుగా అర్థం చేసుకున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఆ బాధలు, వేదనలను ఆయన స్వయంగా అనుభవించడమే ఇందుకు కారణమన్నారు. కాబట్టే, ఆ వర్గాల ఆర్థిక అభ్యున్నతికి ఆయన సుస్పష్ట భవిష్యత్ ప్రణాళికను రూపొందించారని గుర్తుచేశారు. “భారత్ వ్యవసాయాధారిత దేశమే అయినా వ్యవసాయం ఒక్కటే దళితులకు ప్రధాన జీవనాధారం కాజాలదు” అన్న డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యను ప్రధాని ఉటంకించారు. ఇందుకు ఆయన రెండు కారణాలు చూపారని పేర్కొన్నారు. అందులో మొదటిది- భూమి కొనుగోలు చేయలేని ఆర్థిక దుస్థితి... రెండోది- ఒకవేళ డబ్బు ఉన్నా భూమి కొనుగోలుకు అవకాశాలు లేకపోవడమని ప్రధాని వివరించారు. ఈ నేపథ్యంలో దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న ఈ అన్యాయానికి పరిష్కారంగా పారిశ్రామికీకరణను డాక్టర్ అంబేద్కర్ సమర్థించారని ఆయన వెల్లడించారు. ఆర్థిక స్వావలంబన దిశగా నైపుణ్యాధారిత ఉద్యోగాలు, కుటీర పరిశ్రమల స్థాపన వంటి వాటిని ప్రోత్సహించడాన్ని అంబేద్కర్ సూచించేవారని చెప్పారు. కానీ, స్వాతంత్ర్యం తర్వాత అనేక దశాబ్దాలపాటు ఆయన దూరదృష్టిని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోగా, పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలిపారు. అయితే, ఎస్సీ/ఎస్టీ వర్గాల ఆర్థిక కష్టనష్టాల తొలగింపుపై డాక్టర్ అంబేద్కర్ లక్ష్యనిర్దేశం చేసుకున్నారని చెప్పారు.
2014లో తమ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళితం, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని ప్రస్తావించిన ప్రధానమంత్రి, సమాజ పునాదులుగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న సంప్రదాయ చేతివృత్తులవారు, కమ్మరి, కుమ్మరులు వంటి చేతివృత్తుల వారిని లక్ష్యంగా చేసుకుని పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజంలోని ఈ వర్గానికి తొలిసారిగా శిక్షణ, సాంకేతిక నవీకరణలు, కొత్త పరికరాలు, డిజైన్ల తయారీలో సాయం, ఆర్థిక సహాయం, మార్కెట్ లభ్యత వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. నిర్లక్ష్యానికి గురైన ఈ సమూహంపై దృష్టి పెట్టడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిందని, సమాజ నిర్మాణంలో వారి ముఖ్యమైన పాత్రను గుర్తించిందని ఆయన చెప్పారు.
“మొదటిసారిగా వ్యాపారం ప్రారంభించే ఉత్సాహవంతుల్ని ఆహ్వానించి, ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే, సమాజంలోని విస్తృత వర్గాలకు ఆత్మనిర్భరత (స్వావలంబన) కల్పించే లక్ష్యంతో పూచీకత్తు లేని రుణాలను అందించేందుకు చేపట్టిన విస్తృత ప్రచారం గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లతో పాటు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ గ్యారంటీ లేకుండా కోటి రూపాయల వరకు రుణాలు అందించేందుకు ఉద్దేశించిన స్టాండప్ ఇండియా పథకాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ఈ పథకానికి బడ్జెట్ ను రెట్టింపు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు చెందిన లక్షలాది మంది యువకులు, అనేక మంది మహిళలు ముద్రా పథకం కింద తమ వ్యాపారాలను ప్రారంభించారని, తద్వారా తమకు తాము ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముద్రా పథకం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలను సాకారం చేస్తూ ప్రతి కళాకారుడు, ప్రతి సామాజికవర్గం సాధికారత సాధించారన్నారు.
పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, నిర్లక్ష్యానికి గురైన వారికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రస్తుత బడ్జెట్ లో తోలు, పాదరక్షల పరిశ్రమలు వంటి వివిధ చిన్న రంగాలను స్పృశించారని, ఇది పేదలు, అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒక ఉదాహరణగా, ప్రధాన మంత్రి బొమ్మల పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ, అట్టడుగు వర్గాలకు చెందిన చాలా మంది బొమ్మల తయారీ చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఈ రంగంపై దృష్టి సారించి పేద కుటుంబాలకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తోంది. ఫలితంగా బొమ్మల ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. ఫలితంగా తమ జీవనోపాధి కోసం ఈ పరిశ్రమపై ఆధారపడిన పేద వర్గాలకు ప్రయోజనాలు అందుతున్నాయి.
భారతదేశంలో మత్స్యకార సమాజం కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, వారికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను విస్తరించిందని ప్రధానమంత్రి చెప్పారు. మత్స్యరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ ప్రయత్నాలు చేపల ఉత్పత్తి, ఎగుమతులను రెట్టింపు చేశాయని, మత్స్యకారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయనతెలిపారు. సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన వర్గాల సంక్షేమం కోసం పనిచేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
కులతత్వం అనే విషాన్ని వ్యాప్తి చేయడానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది మన గిరిజన వర్గాలను వివిధ స్థాయిల్లో ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి, కొన్ని సమూహాలు చాలా తక్కువ జనాభాను కలిగి ఉన్నాయని, దేశంలో 200-300 ప్రదేశాలలో విస్తరించి చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. ఈ వర్గాలపై అత్యంత అవగాహన ఉన్న రాష్ట్రపతి మార్గదర్శకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బలహీనంగా ఉన్న గిరిజన వర్గాలను నిర్దిష్ట పథకాల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేసినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ వర్గాలకు సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు రూ.24,000 కోట్లతో పీఎం జన్మన్ యోజనను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వారిని ఇతర గిరిజన వర్గాల స్థాయికి తీసుకెళ్లి మొత్తం సమాజ స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
"సరిహద్దు గ్రామాలు వంటి తీవ్రమైన వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్న దేశంలోని వివిధ ప్రాంతాలపై కూడా మా ప్రభుత్వం దృష్టి సారించింది" అని శ్రీ మోదీ అన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా మానసిక ధోరణిలో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పును ఆయన ప్రస్తావించారు. సూర్యుని తొలి, చివరి కిరణాలు తాకే ఈ గ్రామాలకు నిర్దిష్ట అభివృద్ధి ప్రణాళికలతో "మొదటి గ్రామాలు"గా ప్రత్యేక హోదా ఇచ్చినట్టు ఆయన చెప్పారు. మైనస్ 15 డిగ్రీల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ 24 గంటల పాటు ఉండి గ్రామస్తుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు మంత్రులను మారుమూల గ్రామాలకు పంపినట్లు ప్రధాని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకలకు ఈ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గ్రామ నాయకులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన ప్రతి సామాజిక వర్గాన్ని చేరుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. దేశ భద్రత కోసం శక్తిమంతమైన గ్రామాల కార్యక్రమం ప్రాముఖ్యత, ఉపయోగాన్ని శ్రీ మోదీ వివరించారు. దీనిపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించిందని చెప్పారు.
భారత రిపబ్లిక్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాతల నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను గౌరవిస్తూ, వారి స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగడం సంతృప్తినిస్తోందని ఆయన అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యుసిసి) పై శ్రీ మోదీ ప్రసంగిస్తూ, రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలను చదివిన వారికి ఆ భావోద్వేగాల ఉద్దేశాలు అర్థమవుతాయని అన్నారు. కొందరికి రాజకీయ అభ్యంతరాలు ఉండవచ్చునని, అయితే ఈ దార్శనికతకు అనుగుణంగా ధైర్యంగా, అంకితభావంతో పని చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, వారి మాటలను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ, స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను విస్మరించారని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా మధ్యంతర ప్రభుత్వం రాజ్యాంగానికి సవరణలు చేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పుకుంటూ భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసి, పత్రికలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత తొలి ప్రభుత్వ హయాంలో భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ముంబయిలో కార్మికుల సమ్మె సందర్భంగా ప్రముఖ కవి శ్రీ మజ్రూహ్ సుల్తాన్ పురి కామన్వెల్త్ ను విమర్శిస్తూ ఒక కవితను పాడారని, అది ఆయనను జైలుకు పంపడానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకే ప్రముఖ నటుడు శ్రీ బలరాజ్ సాహ్నిని జైలుకు పంపారని ఆయన గుర్తు చేశారు. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఆలిండియా రేడియోలో వీర్ సావర్కర్ రాసిన కవితను ప్రసారం చేసేందుకు ప్రణాళిక వేసినందుకు పర్యవసానాలను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే హృదయనాథ్ మంగేష్కర్ ను ఆలిండియా రేడియో నుంచి శాశ్వతంగా తొలగించారని ఆయన అన్నారు.
ఎమర్జెన్సీ కాలంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని అణచివేసి, దాని స్ఫూర్తిని తుంగలో తొక్కారని, ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదని శ్రీ మోదీ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రముఖ సీనియర్ నటుడు శ్రీ దేవ్ ఆనంద్ ను ఎమర్జెన్సీకి మద్దతివ్వాలని బహిరంగంగా కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీ దేవ్ ఆనంద్ ధైర్యాన్ని ప్రదర్శించి, మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో దూరదర్శన్ లో ఆయన చిత్రాల ప్రసారాన్ని నిషేధించారని పేర్కొన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడి, దానిని ఏళ్ల తరబడి తమ జేబుల్లో పెట్టుకున్న వారిని, దాని పట్ల గౌరవం చూపని వారిని ప్రధానమంత్రి విమర్శించారు. శ్రీ కిషోర్ కుమార్ అప్పటి పాలక పార్టీ తరపున పాడటానికి నిరాకరించారని, ఫలితంగా ఆయన పాటలన్నింటినీ ఆలిండియా రేడియోలో నిషేధించారని గుర్తు చేశారు.
ఎమర్జెన్సీ రోజులను తాను మరచిపోలేనని ప్రజాస్వామ్యం, మనుషుల పట్ల గౌరవం గురించి మాట్లాడేవారు, ఎమర్జెన్సీ సమయంలో శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ సహా దేశంలోని గొప్ప వ్యక్తులను చేతులకు సంకెళ్లు వేసి బంధించారని ప్రధానమంత్రి విమర్శించారు. ఆ సమయంలో పార్లమెంటు సభ్యులు, జాతీయ నాయకులను కూడా గొలుసులు, సంకెళ్లతో బంధించారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం అనే పదాన్ని వారు జీర్ణించుకోలేక పోయారని దుయ్యబట్టారు.
అధికార దాహం, రాజకుటుంబాల అహంకారం కారణంగా దేశంలో లక్షలాది కుటుంబాలు నాశనమయ్యాయని, వారు దేశాన్ని కారాగారంగా మార్చారని శ్రీ మోదీ విమర్శించారు. సుదీర్ఘ పోరాటం తరువాతే, తమను తాము అజేయులమని భావించిన వారు ప్రజల ఎదుట తలవంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రజల్లో నిండి ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి కారణంగానే నాడు అత్యవసర పరిస్థితిని ఎత్తేశారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. సీనియర్ నాయకులను తాను ఎంతో గౌరవిస్తానని, వారి సుదీర్ఘ ప్రజా సేవ పట్ల తనకు గౌరవం ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శ్రీ మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి నాయకుల విజయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
పేదల సాధికారత, అభ్యున్నతి తమ ప్రభుత్వ హాయాంలో ఉన్నతస్థాయిలో ఉందన్న ప్రధాని దీని కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించిందని తెలిపారు. దేశంలోని పేదల సామర్థ్యం పట్ల ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అవకాశం లభిస్తే వారు ఏ సవాలునైనా అధిగమించగలరని పేర్కొన్నారు. ఈ పథకాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పేదలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. “సాధికారత ద్వారా, 25 కోట్ల మంది ప్రజలు విజయవంతంగా పేదరికం నుంచి బయటపడ్డారు.. ఇది ప్రభుత్వానికి గర్వకారణం” అని ఆయన వ్యాఖ్యానించారు. వారు కష్టపడి పనిచేయడం, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే దీనిని సాధించారనీ, నేడు వారు దేశంలో ఒక నవ-మధ్యతరగతిని ఏర్పాటు చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
నవ-మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వ బలమైన నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, వారి ఆకాంక్షలు దేశ పురోగతికి చోదక శక్తిగా ఉన్నాయనీ, అవి దేశాభివృద్ధికి కొత్త శక్తిని, బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఇరు వర్గాల ప్రజల సామర్థ్యాలను పెంపొందించే ప్రయత్నాలను ఆయన ఉటంకించారు. ప్రస్తుత బడ్జెట్లో మధ్యతరగతిలో చాలామందికి పన్నుల నుంచి మినహాయింపునిచ్చామని ఆయన పేర్కొన్నారు. 2013లో, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 2 లక్షల వరకే ఉండగా, ఇప్పుడు దానిని ₹12 లక్షలకు పెంచామన్నారు. 70 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ది కలుగుతోందని తెలిపారు.
"మేం దేశ పౌరుల కోసం నాలుగు కోట్ల ఇళ్ళు నిర్మించాం, నగరాల్లోనే ఒక కోటికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం" అని శ్రీ మోదీ తెలిపారు. గృహ కొనుగోలుదారులను ప్రభావితం చేసే గణనీయమైన మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి- రెరా) చట్టం తెచ్చామన్నారు. ఇది స్వంతింటి కల సాకారం చేసుకోవడంలో మధ్యతరగతి వారికి గల అడ్డంకులను దూరంచేసే కీలక సాధనంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఎస్డబ్ల్యుఏఎమ్ఐహెచ్ కార్యక్రమాన్ని భాగం చేశామన్న ప్రధానమంత్రి, దీని ద్వారా నిలిచిపోయిన మధ్యతరగతి ప్రజల గృహ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 15వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. దీనిని మధ్యతరగతి ప్రజల కల నెరవేర్చే గొప్ప పథకంగా ప్రధానమంత్రి అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అంకురసంస్థల విప్లవాన్ని ప్రస్తావిస్తూ, ఈ అంకురసంస్థలను ప్రధానంగా మధ్యతరగతి యువతే నడిపిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 50-60 ప్రదేశాల్లో నిర్వహించిన జీ20 సమావేశాల వల్ల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ అంటే ఢిల్లీ, ముంబయి, బెంగళూరు మాత్రమే కాదనీ, అలాంటి ఎన్నో గొప్ప ప్రదేశాల సమాహారమని ఈ సమావేశాలు ప్రపంచానికి చాటాయని తెలిపారు. భారత పర్యటన పట్ల ప్రపంచ దేశాల ఆసక్తి అనేక వ్యాపార అవకాశాలను కల్పిస్తూ, వివిధ ఆదాయ వనరులను అందించడం ద్వారా మధ్యతరగతికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"నేటి మధ్యతరగతి ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఇది అపూర్వమైనది. దేశాన్ని ఎంతో బలోపేతం చేస్తుంది" అని శ్రీ మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి, బలంగా నిలబడి, కలిసి ముందుకు సాగడానికి కృతనిశ్చయంతో, పూర్తిగా సంసిద్ధతతో ఉందంటూ భారత మధ్యతరగతి పట్ల ఆయన ధృడ విశ్వాసం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమన్న ప్రధానమంత్రి, యువ జనాభా వల్ల సానుకూలతను వివరించారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అభివృద్ధి చెందిన దేశపు ప్రాథమిక లబ్ధిదారులు అవుతారని ఆయన అన్నారు. యువ భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తోందనీ, ఈ యువత అభివృద్ధి చెందిన భారత్ కోసం బలమైన పునాదిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంగా, పాఠశాలలు, కళాశాలల్లో యువశక్తిని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. అయితే గడిచిన 30 ఏళ్లలో, భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించలేదని, ఉన్నది ఉన్నట్లు కొనసాగించటమే గత పాలకుల వైఖరిగా ఉందని ఆయన విమర్శించారు. ఈ సమస్యలను పరిష్కరించడానికే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రవేశపెట్టామని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ విధానం కింద పీఎమ్ శ్రీ పాఠశాలల స్థాపన సహా, విద్యలో విప్లవాత్మక మార్పులు లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు 10 వేల నుంచి 12 వేల పీఎమ్ శ్రీ పాఠశాలలు ఇప్పటికే స్థాపించగా, భవిష్యత్తులో మరిన్నింటి ఏర్పాటు కోసం ప్రణాళిక చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. విద్యా విధానంలో మార్పులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నామనీ, మాతృభాషలోనే విద్య, పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలు దీనిలో ఉన్నాయన్నారు. దేశంలో భాషా సంబంధిత వలసవాద మనస్తత్వాన్ని ప్రస్తావిస్తూ, భాషావరోధాల కారణంగా పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల పిల్లలు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ఆయన ఉటంకించారు. మాతృభాషలో విద్య ఆవశ్యకతను వివరించిన ప్రధానమంత్రి, దీని ద్వారా విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యంతో సంబంధం లేకుండా వైద్యులు, ఇంజనీర్లుగా కెరీర్లను కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు. అన్ని నేపథ్యాల పిల్లలను వైద్యులు, ఇంజనీర్లను చేసే లక్ష్యంతో చేపట్టిన ముఖ్యమైన సంస్కరణలను ఆయన వివరించారు. ఇంకా, గిరిజన యువత కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణను ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు, దశాబ్దం క్రితం సుమారు వీటి సంఖ్య 150గా ఉండగా, నేడు 470 పాఠశాలలకు విస్తరించామనీ, మరో 200కి పైగా పాఠశాలు ప్రణాళిక దశలో ఉన్నాయని ఆయన తెలిపారు.
విద్యా సంస్కరణల గురించి వివరిస్తూ, సైనిక్ పాఠశాలల్లో ప్రధాన సంస్కరణలు చేపట్టి, బాలికల ప్రవేశానికి నిబంధనలు ప్రవేశపెట్టామని శ్రీ మోదీ తెలిపారు. ఈ పాఠశాలల ప్రాముఖ్యతను, సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ, వందలాది మంది బాలికలు ప్రస్తుతం ఇక్కడ దేశభక్తితో నిండిన వాతావరణంలో చదువుతున్నారని ఆయన పేర్కొన్నారు.
యువతను తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సిసి) పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, యుక్త వయస్సులో సమగ్ర అభివృద్ధి, అవగాహనకు ఎన్సిసితో అనుబంధం ఒక సువర్ణావకాశమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్సిసి విస్తరణ అద్భుతంగా ఉందన్న శ్రీ మోదీ, 2014లో సుమారు 14 లక్షలుగా ఉన్న క్యాడెట్ల సంఖ్య నేడు 20 లక్షలకు పైగా ఉందని పేర్కొన్నారు.
దేశ యువత రోజువారీ పనులకు అతీతంగా ఏదైనా కొత్తగా సాధించాలనే ఉత్సాహం, ఆత్రుతను కలిగి ఉన్నారన్న శ్రీ మోదీ, స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ప్రస్తావించారు, అనేక నగరాల్లో యువజన సంఘాలు స్వచ్ఛందంగా పరిశుభ్రత ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయని తెలిపారు. కొంతమంది యువకులు మురికివాడల్లో విద్య, ఇతర కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. యువతకు వ్యవస్థీకృత అవకాశాలను అందించడం "మై భారత్", మేరా యువ భారత్ ఉద్యమానికి దారితీసిందన్నారు. నేడు, 1.5 కోట్లకు పైగా యువత ఈ కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకుని, సమకాలీన సమస్యలపై చర్చల్లో చురుకుగా పాల్గొంటున్నారనీ, సమాజంలో అవగాహన పెంచుతున్నారనీ అలాగే వారి స్వంత సామర్థ్యాలతో సానుకూల చర్యలు చేపడుతున్నారని ప్రధానమంత్రి వివరించారు.
క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడల ప్రాముఖ్యతను అలాగే క్రీడలు విస్తృతంగా ఉన్న చోట దేశ స్ఫూర్తి ఎలా వికసిస్తుందో వివరించిన ప్రధానమంత్రి, క్రీడారంగంలో ప్రతిభ గల వారికి మద్దతునిచ్చే అనేక కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా రంగంపై టార్గెట్ ఒలంపిక్ పోడియం పథకం (టాప్స్), ఖేలో ఇండియా కార్యక్రమాల గణనీయ ప్రభావాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గత దశాబ్దంలో, భారత అథ్లెట్లు వివిధ క్రీడా కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటారనీ, యువతులు సహా దేశ యువతరం ప్రపంచ వేదికపై మన దేశ సత్తాను ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత కీలకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు రెండూ దేశ వృద్ధికి కీలకమైనవిగా ఆయన అబివర్ణించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయవలసిన అవసరాన్ని వివరించారు. ఈ పనులను పూర్తి చేయడంలో జాప్యం వల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతుందన్నారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం, రాజకీయ జోక్యం గల గత పాలకుల సంస్కృతిని విమర్శించిన ప్రధానమంత్రి, డ్రోన్ల ద్వారా వీడియోలు, వాటాదారులతో ప్రత్యక్ష సంభాషణతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం తాను ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షించే వీలుండే ప్రగతి వేదిక ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ఈ ప్రగతి వేదికను ప్రశంసించిందన్న ప్రధానమంత్రి, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనితో ప్రయోజనం పొందవచ్చని సూచించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా సుమారు 19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల అసమర్థతలను ఉటంకిస్తూ, 1972 లో ఆమోదం పొందిన ఉత్తర్ ప్రదేశ్లోని సరయు కాలువ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది ఐదు దశాబ్దాలు సాగి 2021లో పూర్తయిందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ కోసం 1994లో ఆమోదం లభించినా, మూడు దశాబ్దాల తర్వాత 2025లో పూర్తయిందని ప్రధానమంత్రి తెలిపారు. ఒడిశాలో హరిదాస్పూర్-పారదీప్ రైల్వే లైన్ ప్రాజెక్టు 1996లో ఆమోదం పొందినా, ప్రస్తుత ప్రభుత్వ చొరవతో 2019లో పూర్తయిందన్నారు. అలాగే, అస్సాంలోని బోగిబీల్ వంతెన 1998లో ఆమోదం పొందగా, 2018లో తమ ప్రభుత్వం దానిని పూర్తి చేసిందని తెలిపారు. గత పాలకుల ఈ తీవ్రమైన జాప్యంతో కూడిన హానికరమైన సంస్కృతికి వందలాది ఉదాహరణలు తాను చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అలాంటి సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పారు. గత పాలకుల ఈ సంస్కృతి దేశ పురోగతికి ప్రధాన అవరోధంగా మారిందన్నారు. దీనిని పరిష్కరించడానికి ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియను క్రమబద్ధీకరించి, ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి 1,600 డేటా లేయర్స్ గల ప్రధానమంత్రి గతి శక్తి వేదికను ఉపయోగించుకోవాలని ఆయన రాష్ట్రాలను ప్రోత్సహించారు. దేశంలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికి ఈ వేదిక కీలక పునాదిగా మారిందని ప్రధానమంత్రి తెలిపారు.
నేటి యువత తమ తల్లిదండ్రులు ఎదుర్కొన్న కష్టాలు, గతంలో దేశ పరిస్థితులకు గల కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి గత దశాబ్దంలో చురుకైన నిర్ణయాలు, చర్యలు అనేవి లేకపోతే డిజిటల్ ఇండియా ప్రయోజనాలు కార్యరూపం దాల్చడానికి సంవత్సరాలు పట్టేవని అన్నారు. చురుకైన నిర్ణయాలు, చర్యల వల్ల భారత్ సమయానుకూలంగా, కొన్ని సందర్భాల్లో సమయానికంటే ముందుగానే ఉండగలిగిందని వ్యాఖ్యానించారు. 5జీ టెక్నాలజీ ఇప్పుడు భారత్తో విస్తృతంగా అందుబాటులో ఉందని.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన 5జీలలో ఇది ఒకటి పేర్కొన్నారు.
కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఏటీఎంలు వంటి సాంకేతిక పరిజ్ఞానం భారత్ కంటే ముందే అనేక దేశాలకు చేరిందని.. ఈ సాంకేతికతలు దేశానికి వచ్చేందుకు తరచూ దశాబ్దాలు పట్టేదని వ్యాఖ్యానిస్తూ నరేంద్ర మోదీ గత అనుభవాలపై దృష్టి సారించారు. ఆరోగ్య రంగంలో కూడా మశూచి, బీసీజీ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేవని, వ్యవస్థాగత అసమర్థత కారణంగా ఈ విషయంలో భారత్ వెనుకబడిందని వ్యాఖ్యానించారు. ఈ జాప్యానికి కారణం గతంలో ఉన్న పేలవమైన పరిపాలన అని, ఆ కాలంలో కీలకమైన పరిజ్ఞానం, వివిధ కార్యక్రమాల అమలును గట్టిగా నియంత్రించారని.. ఫలితంగా పురోగతిని అడ్డుకునే "లైసెన్స్ రాజ్" ఏర్పడిందని ప్రధాని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఈ వ్యవస్థ అణచివేత స్వభావాన్ని ఆయన యువతకు ప్రధానంగా చెప్పారు.
కంప్యూటర్ దిగుమతుల ప్రారంభ రోజుల గురించి ప్రస్తావిస్తూ.. కంప్యూటర్లను దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ పొందటం అనేది సంవత్సరాలు పట్టే చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అని, ఇది భారత్ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని గణనీయంగా ఆలస్యం చేసిందని అన్నారు.
గతంలోని పరిపాలన సవాళ్లను ప్రస్తావిస్తూ.. ఇంటి నిర్మాణానికి సిమెంట్ పొందాలంటే కూడా అనుమతి, పెళ్లిళ్ల సమయంలో టీ కోసం చక్కెర పొందడానికి కూడా లైసెన్స్ అవసరం ఉండేదని అన్నారు. స్వాతంత్య్రానంతరం భారత్తో ఈ సవాళ్లు ఎదురయ్యాయని, వీటి ప్రభావాన్ని నేటి యువత అర్థం చేసుకోగలరన్న ఆయన లంచాలకు బాధ్యులు, డబ్బు ఎక్కడికి వెళ్లింది అనే వాటిపై ప్రశ్నలను లేవనెత్తారు.
పరిపాలనలో సవాళ్లను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. స్కూటర్ కొనాలంటే బుకింగ్, పేమెంట్ అవసరం ఉండేదని ఆ తర్వాత 8-10 ఏళ్ల నిరీక్షణ అవసరమయ్యేదని అన్నారు. స్కూటర్ అమ్మడానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరమని వ్యాఖ్యానించారు. గ్యాస్ సిలిండర్ల లాంటి నిత్యావసర సరుకులను పొందటంలో అసమర్థతను ప్రధానంగా ప్రస్తావించారు. గ్యాస్ సిలిండర్లు ఎంపీలకు కూపన్ల ద్వారా పంపిణీ అయ్యేవని, గ్యాస్ కనెక్షన్ కోసం పొడవైన లైన్లు ఉండేవని అన్నారు. టెలిఫోన్ కనెక్షన్ పొందడానికి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియను ఆయన గుర్తు చేశారు. నేటి యువత ఈ సవాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలని, ఈ రోజు గొప్ప ప్రసంగాలు చేస్తున్న వాళ్లు తమ గత పాలనను, దేశంపై దాని ప్రభావాన్ని తెలుసుకోవాలని అన్నారు.
"నిర్బంధ విధానాలు, లైసెన్స్ రాజ్ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెమ్మదిగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చాయి" అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ బలహీన వృద్ధిరేటును 'హిందూ వృద్ధిరేటు'గా పేర్కొన్నారని, ఇది ఒక పెద్ద సామాజిక వర్గాన్ని అవమానించడమేనని అన్నారు. అధికారంలో ఉన్న వారి అసమర్థత, అవగాహనా రాహిత్యం, అవినీతే ఈ వైఫల్యానికి కారణమని.. మందగమన వృద్ధికి మొత్తం సమాజమే కారణమని తప్పుదోవ పట్టించడానికి ఇది దారితీసిందని వివరించారు.
గతంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగం, లోపభూయిష్ట విధానాలను విమర్శిస్తూ.. ఇది మొత్తం సమాజాన్ని నిందించడానికి, మసకబరిచేందుకు దారితీసిందని, చారిత్రకంగా చూస్తే, భారతదేశ సంస్కృతి, విధానాల్లో ఎక్కడా నిర్బంధ అనుమతుల రాజ్య భావన లేదని, భారతీయులు బహిరంగ భావ ప్రకటనను విశ్వసిస్తారని, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యంలో నిమగ్నమైన మొదటివారిలో ఒకరు అని వ్యాఖ్యానించారు. భారతీయ వర్తకులు ఎటువంటి ఆంక్షలు లేకుండా వాణిజ్యం కోసం సుదూర దేశాలకు వెళ్లారని, ఇది భారత సహజ సంస్కృతిలో భాగమని వివరించారు. భారతదేశ ఆర్థిక సామర్ధ్యం, వేగవంతమైన వృద్ధికి ప్రస్తుతం లభిస్తోన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. “భారత్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా గుర్తింపు సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరిస్తోంది” అని ఆయన ప్రధానంగా చెప్పారు.
నిర్బంధమైన లైసెన్స్ రాజ్, లోపభూయిష్ట విధానాల బారి నుంచి విముక్తి పొందిన తర్వాత దేశం ఇప్పుడు సులువుగా ఊపిరిపీల్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతోందని అన్నారు. దేశంలో తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'మేకిన్ ఇండియా' గురించి మాట్లాడారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) సంబంధించిన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. మొబైల్ ఫోన్ల దిగుమతిదారు నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని ఆయన ప్రధానంగా మాట్లాడారు.
రక్షణ రంగ తయారీలో భారత్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. గత దశాబ్దంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పది రెట్లు పెరిగాయని, సౌర ఫలకాల తయారీలో కూడా పది రెట్లు పెరుగుదల నమోదైందని అన్నారు. గత దశాబ్ద కాలంలో యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయని.. “భారత్ ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది” అని తెలిపారు. బొమ్మల ఎగుమతులు మూడింతలకు పైగా పెరిగాయని.. వ్యవసాయ రసాయన ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వివరించారు. “కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్లో తయారీ కార్యక్రమం కింద 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను భారత్ సరఫరా చేసింది” అని ఆయన తెలిపారు. ఆయుష్, మూలికా ఉత్పత్తుల ఎగుమతులు కూడా శరవేగంగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఖాదీని ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం కృషి చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ..స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రారంభమైన ఉద్యమం కూడా ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఆదాయం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లు దాటిందని గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగిందని, ఇది ఎంఎస్ఎంఈ రంగానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తోందని.. దేశవ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
ప్రజాప్రతినిధులందరూ ప్రజా సేవకులేనన్న విషయాన్ని తెలియజేస్తూ.. ప్రజా ప్రతినిధులకు దేశం, సమాజమే ముఖ్యమని, సేవాభావంతో పనిచేయడం వారి కర్తవ్యమని ప్రధాని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ అనే దార్శనికత భారతీయులందరి సమిష్టి బాధ్యత అని ప్రధానంగా చెప్పిన మోదీ… ఇది కేవలం ఒక ప్రభుత్వం లేదా వ్యక్తి సంకల్పం మాత్రమే కాదని 140 కోట్ల మంది పౌరుల నిబద్ధత అని వ్యాఖ్యానించారు. ఈ మిషన్ను అనుకూలంగా లేని వారిని దేశం పట్టించుకోదని హెచ్చరించారు. దేశాన్ని ముందుకు నడిపించడానికి దేశంలోని మధ్యతరగతి, యువత అచంచల సంకల్పాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు.
దేశ పురోగతిలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో అవసరమన్న మోదీ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకత సహజమని, విధానాలపై వ్యతిరేకత కూడా అంతే అవసరమని వ్యాఖ్యానించారు. ఏదేమైనా మరీ ఎక్కువ వ్యతిరేకత, ఒకరి తోడ్పాటును పెంచడానికి బదులు ఇతరులను తగ్గించే ప్రయత్నాలు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రతికూలతల నుంచి మనల్ని మనం విముక్తం చేసుకోవాలని, నిరంతరం స్వీయ మదింపు, ఆత్మపరిశీలనలో నిమగ్నం కావాలన్నారు. సభలో జరిగే చర్చల వల్ల విలువైన విషయాలు వెలుగులోకి వస్తాయని, వాటిని ముందుకు తీసుకెళ్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం నుంచి లభించిన నిరంతర స్ఫూర్తిని గుర్తిస్తున్నట్లు తెలిపిన ప్రధాని… రాష్ట్రపతికి, గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
***
MJPS/SR
(Release ID: 2100507)
Visitor Counter : 40
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada