ప్రధాన మంత్రి కార్యాలయం
జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
09 JAN 2025 6:38PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్, దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శాస్త్రవేత్తలు... ఇతర విశిష్ట అతిథులు... సోదరసోదరీమణులారా!
పరిశోధన రంగంలో భారత్ ఈ రోజున చారిత్రక రీతిలో ముందంజ వేసింది. ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్టుకు ఐదేళ్ల కిందటే ఆమోదం ముద్ర వేశాం. అయితే, కోవిడ్ మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినా, మన శాస్త్రవేత్తలు అమిత శ్రద్ధాసక్తులతో దీన్ని పూర్తి చేశారు. ఈ పరిశోధనలో ‘ఐఐఎస్సీ, ఐఐటీ’, ‘సిఎస్ఐఆర్’, ‘డిబిటి-బ్రిక్’ వంటి 20కిపైగా విశిష్ట పరిశోధన సంస్థలు కీలక పాత్ర పోషించడం ఎంతో ఆనందదాయకం. దీని ఫలితంగా 10,000 మంది భారతీయుల జన్యు క్రమంతో కూడిన సమాచారం నేడు భారత బయోలాజికల్ డేటా సెంటర్లో అందుబాటులోకి వచ్చింది. జీవ సాంకేతిక పరిశోధన రంగంలో ఈ ప్రాజెక్ట్ ఓ కీలక మలుపుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకుగాను ఈ ప్రాజెక్టుతో ముడిపడిన భాగస్వామ్య సంస్థలన్నిటికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
భారత జీవ సాంకేతిక విప్లవంలో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఒక కీలక ఘట్టం. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో వైవిధ్యభరిత జన్యు వనరును విజయవంతంగా సృష్టించినట్లు నాకు సమాచారం అందింది. దీనికింద వివిధ జనజాతుల నుంచి 10,000 మంది వ్యక్తుల జన్యు క్రమం రూపకల్పన పూర్తయింది. ఈ సమాచార నిధి ఇకపై శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. భారత జన్యు నేపథ్యంపై మరింత మెరుగైన అవగాహన కల్పనలో ఇది నిపుణులకు ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా దేశంలో విధాన రూపకల్పన, ప్రణాళిక రచనలోనూ ఈ సమాచారం ఎంతగానో దోహదపడుతుంది.
మీ రంగాలపరంగా మీరందరూ నిపుణులు, విశిష్ట శాస్త్రవేత్తలు. మన దేశ వైశాల్యం, వైవిధ్యాలు ఆహారం, భాష, భౌగోళిక స్థితికి మాత్రమే పరిమితమనే వాస్తవం మీకు తెలిసిందే. కానీ, దేశ ప్రజల జన్యువులలోనూ గణనీయమైన వైవిధ్యం ఉంది. అందువల్ల వ్యాధుల స్వభావంలోనూ అదే వైవిధ్యం కనిపించడం సహజం. అందువల్ల ఏ జన్యువుగల వ్యక్తికి ఎలాంటి ఔషధం మేలు చేయగలదో అర్థం చేసుకోవడం అత్యంత ప్రధానం. ఈ నేపథ్యంలో దేశ పౌరుల జన్యుక్రమం గుర్తింపు ఎంతో కీలకం.
ఒక ఉదాహరణను పరిశీలిస్తే- గిరిజన తెగలలో ప్రబలుతున్న ‘కొడవలి కణ రక్తహీనత’ (సికిల్ సెల్ అనీమియా) ఓ పెను సంక్షోభం. ఈ సమస్య పరిష్కారం లక్ష్యంగా జాతీయ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. అయినప్పటికీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక గిరిజన సమాజంలో ఈ వ్యాధి స్వభావం మరొక గిరిజన ప్రాంతంలో కనిపించడం లేదు. అక్కడ సమస్యల మరొకలా ఉంటోంది. ఈ సమస్యకు సంబంధించిన వివరాలన్నీ పసిగట్టాలంటే జన్యుక్రమంపై అధ్యయనం అవసరం. తద్వారా భారత జనాభాలోని విశిష్ట జన్యు నమూనాలను అర్థం చేసుకోగలం. ఆ తర్వాత మాత్రమే నిర్దిష్ట జన సమూహాల విషయంలో నిర్దిష్ట పరిష్కారాలతోపాటు ప్రభావశీల ఔషధ రూపకల్పన సాధ్యం కాగలదు.
ప్రస్తుతం నేను సికిల్ సెల్ అనీమియా గురించి ప్రస్తావించినా ఇలాంటి సమస్య ఆ వ్యాధికి పరిమితం కాదు... దీన్ని నేనొక ఉదాహరణగా మాత్రమే పేర్కొన్నాను. ఒక తరం నుంచి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమించే అనేక వ్యాధులపై మన దేశంలో తగిన అవగాహన లేదు. ఈ నేపథ్యంలో అటువంటి వ్యాధులన్నింటికీ సమర్థ చికిత్స విధానాల రూపకల్పనలో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ దోహదం చేస్తుంది.
మిత్రులారా!
ఈ 21వ శతాబ్దంలో జీవ ఆర్థిక వ్యవస్థగా వికసిత భారత్కు పునాది వేయడంలో బయో-టెక్నాలజీ, బయోమాస్ సమ్మేళనం చాలా కీలకం. సహజ వనరుల సముచిత వినియోగం, జీవ ఆధారిత ఉత్పత్తులు-సేవలకు ప్రోత్సాహం, ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల సృష్టి తదితరాలు జీవ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. దేశ సుస్థిర ప్రగతి, ఆవిష్కరణలను జీవ ఆర్థిక వ్యవస్థ వేగవంతం చేస్తుంది. గడచిన దశాబ్దంలో భారత జీవ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే- 2014లో జీవ ఆర్థిక వ్యవస్థ విలువ 10 బిలియన్ డాలర్లు కాగా, నేడు 150 బిలియన్ డాలర్లకుపైగా నమోదైంది. అంతేకాదు... జీవ ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా భారత్ అవిరళ కృషి చేస్తోంది. ఇటీవల ‘బయో ఇ3’ పేరిట దార్శనిక విధానానికి శ్రీకారం చుట్టాం. ఐటీ విప్లవం తరహాలోనే అంతర్జాతీయ జీవ సాంకేతికరంగంలో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు ఇది తోడ్పుడుతుంది. ఈ దిశగా జరిగే కృషిలో శాస్త్రవేత్తలుగా కీలక పాత్ర పోషించబోతున్న మీకందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా!
ప్రపంచ ప్రధాన ఔషధ కూడలిగా గుర్తింపు తెచ్చుకున్న భారత్ ఇప్పుడు దానికి కొత్త కోణం జోడించింది. దేశ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థకు సంబంధించి గత దశాబ్దంగా విప్లవాత్మక చర్యలు చేపట్టాం. లక్షలాదిగా ప్రజానీకానికి ఉచిత చికిత్స సదుపాయం కల్పించింది. అలాగే జనౌషధి కేంద్రాల ద్వారా 80 శాతం తగ్గింపుతో మందులను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలను నిర్మించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత ఔషధావరణ వ్యవస్థ తన శక్తిసామర్థ్యాలను రుజువు చేసుకుంది. మన ఔషధ తయారీ రంగంలో బలమైన సరఫరా-విలువ శ్రేణుల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. ఈ కృషిని జీనోమ్ ఇండియా ప్రాజెక్టు మరింత శక్తిమంతం, వేగవంతం చేస్తుంది.
మిత్రులారా!
అనేక అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాల కోసం ప్రపంచం మన వైపే చూస్తోంది. భవిష్యత్తరాలు దీన్ని అవకాశంగానే కాకుండా బాధ్యతగానూ పరిగణించాలి. దేశవ్యాప్తంగా గత దశాబ్దంలో విద్యారంగంలోని అన్ని స్థాయులలోనూ పరిశోధన-ఆవిష్కరణలపై దేశం నిశితంగా దృష్టి సారించింది. తదనుగుణంగా ఒక విస్తృత పరిశోధనావరణ వ్యవస్థకు నేడు రూపమిస్తోంది. దేశంలోని 10,000కుపైగా అటల్ టింకరింగ్ పరిశోధనశాలల్లో విద్యార్థులు నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే యువ ఆవిష్కర్తలకు చేయూతనిస్తూ దేశవ్యాప్తంగా వందలాది ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు’ ఏర్పాటు చేశాం. విద్యార్థి పరిశోధకుల అధ్యయనం-పరిశోధనకు మద్దతుగా ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే బహుళ రంగాల్లోనే కాకుండా అంతర్జాతీయ పరిశోధనలను ప్రోత్సహించేలా ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పేరిట జాతీయ పరిశోధన నిధిని ఏర్పాటు చేశాం. శాస్త్రవిజ్ఞాన, ఇంజినీరింగ్, పర్యావరణం, ఆరోగ్యం తదితర రంగాల్లో పరిశోధనలకు ఇది మద్దతిస్తుంది. జీవ సాంకేతిక రంగం పురోగమనానికి, యువ శాస్త్రవేత్తలకు మద్దతిచ్చే భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాలలో పరిశోధనలు-పెట్టుబడులు పెంచడం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో మూలనిధి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. జీవసాంకేతిక రంగం అభివృద్ధికి, యువ పరిశోధకులకు ఇది ఎంతగానో చేయూతనిస్తుంది.
మిత్రులారా!
ప్రభుత్వం ఇటీవల ‘ఒన్ నేషన్-ఒన్ సబ్స్క్రిప్షన్’ పేరిట కీలక నిర్ణయం తీసుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనివల్ల భారత విద్యార్థులతోపాటు పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్స్ సులభంగా, ఖర్చు లేకుండా లభిస్తాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో మన దేశాన్ని విజ్ఞాన, ఆవిష్కరణల కూడలిగా మార్చడంలో ఈ కృషి ఎంతగానో తోడ్పడుతుంది.
మిత్రులారా!
భారత్లో ప్రజాహిత పరిపాలన, పౌర డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి కొత్త నమూనాను అందించాయి. అదేవిధంగా జన్యు పరిశోధన రంగంలోనూ భారత ప్రతిష్ఠను జీనోమ్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చివరగా ఈ ప్రాజెక్టు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీకందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు.
కృతజ్ఞతలు... నమస్కారం!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సమీప స్వేచ్ఛానువాదం.
(Release ID: 2096009)
|