రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాల్దీవుల రక్షణ మంత్రి మహ్మద్ ఘసన్ మౌమున్ ద్వైపాక్షిక చర్చలు
సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యం దిశగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు సంసిద్ధత
Posted On:
08 JAN 2025 4:15PM by PIB Hyderabad
మాల్దీవుల రక్షణ మంత్రి మహ్మద్ ఘసన్ మౌమున్తో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఈ రోజు (జనవరి 8, 2025) న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక అంశాలను సమగ్రంగా సమీక్షించారు. భారత్ - మాల్దీవుల మధ్య సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యానికి సంబంధించిన ఉమ్మడి అంశాలపై కలిసి పనిచేసే విషయంలో నిబద్ధతతో ఉన్నట్టు ఇరు దేశాలూ స్పష్టం చేశాయి.
మాల్దీవుల దేశ ప్రాధాన్యాలకు అనుగుణంగా రక్షణ వ్యవస్థలు, ఆస్తులను సమకూర్చుకోవడంతో సహా భద్రతా సామర్థ్యాలను మెరుగుపరచుకొనేలా ఆ దేశానికి సహకారాన్ని అందించేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే విధానం, సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్) లక్ష్యానికి అనుగుణంగా మాల్దీవులకు ఈ సహకారం లభిస్తుంది. మాల్దీవుల విషయంలో ‘మొదట స్పందించే దేశం’గా భారత్ పోషిస్తున్న చరిత్రాత్మక పాత్రను మంత్రి మౌమున్ ప్రశంసించారు. రక్షణ, భద్రతా సిబ్బందికి అత్యాధునిక సామర్థ్యాలు, శిక్షణ అందిస్తున్నందుకు న్యూఢిల్లీకి ధన్యవాదాలు తెలిపారు. మాల్దీవుల ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భారతదేశం భద్రతా పరికరాలు, వ్యవస్థలను ఆ దేశానికి అందించింది.
మంత్రి మౌమున్ భారత్లో మొదటిసారి అధికారికంగా పర్యటిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో ఈ పర్యటన ఓ భాగం. రెండు దేశాలతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ భేటీ అవకాశం కల్పించింది.
***
(Release ID: 2091316)