జాతీయ మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్లోని రాయదుర్గంలో లైంగిక వేధింపుల కారణంగా మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మీడియా కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
మధ్యవర్తుల ద్వారా తన భర్తతో జరిగిన ఒప్పందం ప్రకారం బాధితురాలిని సరోగసీ నిమిత్తం నగరానికి తీసుకువచ్చారు
రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్కు నోటీసులు జారీ చేసిన కమిషన్
ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ స్టేటస్ తో సహా సరోగసీ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు సైతం నివేదికలో పొందుపరచాలి
प्रविष्टि तिथि:
29 NOV 2024 1:18PM by PIB Hyderabad
నవంబర్ 27, 2024న తెలంగాణలోని హైదరాబాద్ నగరం రాయదుర్గం ప్రాంతంలో ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్న మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. సరోగసీ విధానంలో బిడ్డను కనేందుకు మధ్యవర్తుల ద్వారా బాధితురాలి భర్తతో రూ.10 లక్షలకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆమెను ఒడిశా నుంచి నగరానికి తీసుకొచ్చారు. ఆమెను తన భర్తకు దూరంగా వేరే ఫ్లాట్లో ఉండేలా చేశారు.
మీడియాలో వచ్చిన కథనాన్ని గమనించిన కమిషన్, అదే నిజమని తేలితే బాధిత మహిళ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ అంశంపై నమోదైన ఎఫ్ఐఆర్ స్టేటస్తో సహా సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో సరోగసీ పేరుతో మహిళలు ఎదుర్కొన్న వేధింపులపై ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని సైతం పోలీసు అధికారుల నుంచి కమిషన్ తెలుసుకోనుంది.
నవంబర్ 28, 2024న పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఒడిశాకు చెందిన 25 ఏళ్ల బాధిత మహిళ ఓ వ్యక్తి చేతిలో లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త, నాలుగేళ్ల కుమారుడితో పాటు సమీపంలోనే మరో ఇంట్లో ఉన్నారు.
కథనం ప్రకారం నవంబర్ 26, 2024న బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి తాను అక్కడ ఉండదల్చుకోలేదని, సదరు వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నందున తన జీవితాన్ని ముగించుకుంటున్నానని చెప్పింది.
(रिलीज़ आईडी: 2079286)
आगंतुक पटल : 82