ప్రధాన మంత్రి కార్యాలయం

సెప్టెంబరు 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో పర్యటించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


జార్ఖండ్‌లోని టాటానగర్‌లో రూ.660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

జార్ఖండ్‌లో ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

అహ్మదాబాద్‌లో రూ.8,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానమంత్రి

గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సమావేశం, రీ-ఇన్వెస్ట్ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధాని

ఒంటరి మహిళల కోసం అతిపెద్ద పథకం- సుభద్రను ప్రారంభించనున్న ప్రధాని


దేశవ్యాప్తంగా 26 లక్షల పీఎంఏవై లబ్దిదారుల గృహ ప్రవేశ వేడుకలను

భువనేశ్వర్‌ లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

అదనపు కుటుంబాల సర్వే కోసం ఆవాస్ ప్లస్ 2024 యాప్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 14 SEP 2024 9:53AM by PIB Hyderabad

సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సెప్టెంబరు 15న ప్రధాన మంత్రి జార్ఖండ్ చేరుకుని ఉదయం 10 గంటలకు టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్-పాట్నా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. 10:30 గంటలకు రూ.660 కోట్లకు పైగా విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు. జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20 వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనా – గ్రామీణ్ (పీఎంఏవై – జీ) లబ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను ప్రధాని అందజేస్తారు.  

సెప్టెంబరు 16న ఉదయం 9:45 గంటలకు, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పీఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లబ్దిదారులతో ప్రధాని మాట్లాడతారు. ఆ తరువాత 10:30 గంటలకు స్థానిక మహాత్మా మందిర్‌లో నిర్వహించే 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సమావేశం, ఎక్స్ పో (రీ-ఇన్వెస్ట్)ను ఆయన ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించి, సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ (జీఐఎఫ్‌టీ) సిటీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు. అలాగే 3:30 గంటలకు అహ్మదాబాద్‌లో రూ. 8000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు.

సెప్టెంబరు 17న, ప్రధాని ఒడిశాకు వెళతారు. ఉదయం 11:15 గంటలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనా – పట్టణ ప్రాంత లబ్దిదారులతో మాట్లాడతారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు భువనేశ్వర్ లో రూ. 3800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు.

టాటానగర్ లో ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ 660 కోట్ల కంటే ఎక్కువ విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటిని జాతికి అంకితం చేయనున్నారు. జార్ఖండ్‌లోని దేవ్ గఢ్ జిల్లాలో మధుపూర్ బై పాస్ మార్గం, హజారీబాగ్ జిల్లాలో హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మధుపూర్ బై పాస్ మార్గం పూర్తయితే, హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి. అలాగే గిరిదీ, జసిదీ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఈ స్టేషన్‌ వద్ద ఉన్న హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపో వద్ద రైలు బోగీలకు మరమ్మతులు చేయడం సుళువుగా మారుతుంది.

 

బొండాముండా-రాంచీ సింగిల్ లైన్ సెక్షన్‌లో అలాగే రాంచీ, మురీ, చంద్రపురా స్టేషన్‌ల మీదుగా వెళ్లే రూర్కెలా-గోమో మార్గంలో భాగమైన కుర్కురా-కనరోన్ డబ్లింగ్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సరుకులు, ప్రయాణీకుల రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా, సాధారణ ప్రజల భద్రత కోసం 04 రోడ్ అండర్ బ్రిడ్జిలను (ఆర్‌యూబీలను) ప్రధాని జాతికి అంకితం చేస్తారు.

ఆరు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అత్యాధునికమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి:

1)  టాటానగర్ - పాట్నా

2) భగల్‌పూర్ – దుమ్కా - హౌరా

3) బ్రహ్మపూర్ - టాటానగర్

4) గయా - హౌరా

5) దేవ్ గఢ్ - వారణాసి

6) రూర్కెలా - హౌరా

ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రారంభంతో సాధారణ ప్రయాణికులు, వివిధ వృత్తులు, వ్యాపారాలు నిర్వహించుకునే వారికి, అలాగే విద్యార్థులకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రైళ్ల ద్వారా దేవ్ గఢ్ (జార్ఖండ్)లోని బైద్యనాథ్ థామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం (ఉత్తరప్రదేశ్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)లోని కాళీఘాట్, బేలూర్ మఠం మొదలైన పుణ్యక్షేత్రాలకు త్వరగా చేరుకోవవచ్చు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఆథ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా, ధన్‌బాద్‌లోని బొగ్గు గనుల పరిశ్రమలు, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమలు, దుర్గాపూర్‌లోని ఇనుము, ఉక్కు అనుబంధ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

 

అందరికీ ఇళ్లు అందించే విషయంలో తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధాన మంత్రి జార్ఖండ్‌కు చెందిన 20 వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (పీఎమ్ఏవై-జీ) లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను అందజేస్తారు. లబ్ధిదారులకు మొదటి విడత సహాయాన్ని ఈ సందర్భంగా ఆయన విడుదల చేయనున్నారు. 46 వేల మంది లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో కూడా ప్రధాన మంత్రి పాల్గొంటారు.

గాంధీనగర్‌లో ప్రధానమంత్రి

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల మహాత్మా మందిర్‌లో నిర్వహించనున్న రీ-ఇన్వెస్ట్ 2024 ఎక్స్ పోని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. పునరుత్పాదక ఇంధన తయారీ, వినియోగంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని ఈ కార్యక్రమం చాటిచెబుతుంది. రెండున్నర రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షిస్తుంది. సదస్సుకు హాజరయ్యే వారు చీఫ్ మినిస్టీరియల్ ప్లీనరీ, సీఈఓ రౌండ్ టేబుల్, అలాగే వినూత్న ఫైనాన్సింగ్, గ్రీన్ హైడ్రోజన్ అలాగే భవిష్యత్తు ఇంధన పరిష్కారాలపై ప్రత్యేక చర్చలు, మరి ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. జర్మనీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్ అలాగే నార్వే భాగస్వామ్య దేశాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. గుజరాత్ రాష్ట్రం ఆతిథ్య హోదాలో అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి.

200 గిగా వాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడంలో విజయం సాధించడానికి కారకులైన వారిని సదస్సులో సన్మానిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు అలాగే ప్రముఖ పారిశ్రామిక వర్గాలకు చెందిన అత్యాధునిక ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన సుస్థిర భవిష్యత్తు పట్ల మన దేశ నిబద్ధతను చాటుతుంది.

 

అహ్మదాబాద్‌లో ప్రధాన మంత్రి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన మంత్రి రూ.8000 కోట్లకు పైగా విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపన చేస్తారు.

స‌మ‌ఖియాలీ – గాంధీథామ్, గాంధీథామ్ – ఆదిపూర్ రైల్వే లైన్లను నాలుగు లైన్లుగా విస్తరించడం, అహ్మదాబాద్‌లోని ఎఎమ్‌సిలో ఐకానిక్ రోడ్ల అభివృద్ధి, బ‌క్రోల్, హ‌తీజాన్, రామోల్‌, పంజర్పోల్ జంక్షన్‌లపై ఫ్లైఓవ‌ర్ వంతెనల నిర్మాణంతో పాటు పలు కీల‌క ప్రాజెక్టుల‌కు ప్రధానమంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

30 మెగావాట్ల సోలార్ సిస్టమ్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. కచ్‌లోని, కచ్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్‌లో 35 మెగావాట్ల బీఈఎస్ఎస్ సోలార్ పీవీ ప్రాజెక్టును, అలాగే మోర్బి, రాజ్‌కోట్‌లలో 220 కిలోవోల్ట్ సబ్‌స్టేషన్‌లను కూడా ఆయన ప్రారంభిస్తారు.

 

ఆర్థిక సేవల క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల సంస్థ సింగిల్ విండో ఐటి సిస్టమ్ (స్విట్స్)ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద 30,000లకు పైగా గృహాలను మంజూరు చేస్తారు. అలాగే ఈ గృహాల కోసం మొదటి విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేసి, పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని ఆయన ప్రారంభిస్తారు. పీఎమ్ఏవై పట్టణ, గ్రామీణ విభాగాల కింద పూర్తి చేసిన గృహాలను రాష్ట్రంలోని లబ్ధిదారులకు కూడా అందజేస్తారు.

ఇంకా, భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు భారతదేశపు మొదటి వందే మెట్రోను, అలాగే నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్, కొల్హాపూర్ నుంచి పూణే, ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బనారస్, దుర్గ్ నుంచి విశాఖపట్నం, పూణే నుంచి హుబ్బాల్లి వరకు గల మార్గాలలో పలు వందే భారత్ రైళ్లను, వారణాసి నుంచి ఢిల్లీకి మొదటి 20- కోచ్ వందే భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.

 

భువనేశ్వర్‌లో ప్రధాన మంత్రి

ఒడిశా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘సుభద్ర’ను భువనేశ్వర్‌లో ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది ఒంటరి మహిళల కోసం రూపొందించిన అతిపెద్ద కీలక పథకం- సుభద్ర. ఈ పథకం ద్వారా 1 కోటి కంటే ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం కింద, 21-60 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులైన లబ్ధిదారులందరికీ 2024-25 నుంచి 2028-29 మధ్య 5 సంవత్సరాల వ్యవధిలో రూ 50,000 ఆర్థిక సాయం అందిస్తారు. రెండు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 10,000 చొప్పున ఆధార్-అనుసంధానితమైన, డీబీటీ అనుసంధానితమైన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాకు నేరుగా నగదు జమ చేస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో, 10 లక్షల మందికి పైగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నిధుల బదిలీని ప్రధాని ప్రారంభిస్తారు.

భువనేశ్వర్‌లో ప్రధాన మంత్రి రూ.2800 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు. ఈ రైల్వే ప్రాజెక్టుల వల్ల ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగవడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, కనెక్టివిటీ మెరుగవుతుంది. అలాగే రూ. 1000 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

 

పీఎమ్ఏవై-జీ పథకం కింద 14 రాష్ట్రాలకు చెందిన సుమారు 13 లక్షల మంది లబ్ధిదారులకు తొలి విడత సహాయాన్ని ప్రధాన మంత్రి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎమ్ఏవై (గ్రామీన్, అర్బన్) పథకం కింద దేశవ్యాప్తంగా 26 లక్షల మంది లబ్ధిదారుల కోసం గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించనున్నారు. పీఎమ్ఏవై (గ్రామీన్, అర్బన్) లబ్ధిదారులకు వారి ఇంటి తాళాలను ప్రధాన మంత్రి అందజేస్తారు. పీఎమ్ఏవై-జీ పథకం కింద అదనపు కుటుంబాల సర్వే కోసం ఆవాస్ ప్లస్ 2024 యాప్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (పీఎమ్ఏవై-యూ) 2.0 కార్యాచరణ మార్గదర్శకాలను ప్రధాన మంత్రి విడుదల చేస్తారు.

 

 

***



(Release ID: 2055118) Visitor Counter : 4