హోం మంత్రిత్వ శాఖ
రాయ్పూర్లో ఎన్సిబి జోనల్ యూనిట్ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర దేశీయ వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా, ఛత్తీస్గఢ్లో మాదకద్రవ్యాల పరిస్థితిపై సమీక్షా సమావేశం
మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం ఇప్పుడు దేశంలోని ప్రతి పౌరుడి సంకల్పంగా మారుతున్న సందర్భం
ప్రతి రాష్ట్రంలో ఎన్సిబి కార్యాలయాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అంతం చేస్తామన్న మంత్రి
సుసంపన్న, సురక్షిత, ఘనమైన భారతదేశాన్ని నిర్మించడానికి మాదకద్రవ్యాల రహిత భారతదేశం ముఖ్యం
అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఉగ్రవాదాన్నీ, నక్సలిజాన్నీ ప్రోత్సహిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందన్న అమిత్ షా
మాదకద్రవ్యాలు దేశ యువతరాన్ని నాశనం చేయడమే కాకుండా దేశ భద్రతను బలహీనపరుస్తాయని వెల్లడి
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై అందరూ ముందుకు సాగాలి, మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం మోదీ సంకల్పాన్ని నెరవేర్చాలని తెలిపిన మంత్రి
'మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో వీలైనంత వరకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలి'
మాదకద్రవ్యాలను గుర్తించడం, ఆ వ్యవస్థను ధ్వంసం చేయడం, నేరస్థుడిని నిర్బంధించడం, బాధితుడికి పునరావాసం అనే నాలుగు సూత్రాలను
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2024 3:33PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) జోనల్ యూనిట్ కార్యాలయాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వర్చువల్గా ప్రారంభించారు. చత్తీస్గఢ్లో మాదకద్రవ్యాల పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్సిబి డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి (2047 నాటికి) మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని చూడాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం నేడు దేశంలోని ప్రతి పౌరుడి సంకల్పంగా మారుతోందని కేంద్ర హోం మంత్రి అన్నారు. సుసంపన్నమైన, సురక్షితమైన, ఘనమైన భారతదేశాన్ని నిర్మించడానికి మాదకద్రవ్యాల రహిత భారతదేశం తీర్మానం ముఖ్యమైనదని ఆయన అన్నారు. మాదకద్రవ్యాలు కేవలం భారతదేశ సమస్య మాత్రమే కాదని, ప్రపంచానికి ముప్పు అని అమిత్ షా అన్నారు.
భారత్లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం ద్వారా, సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్తే ఈ యుద్ధంలో విజయం సాధించవచ్చని శ్రీ అమిత్ షా ఉద్ఘాటించారు. భారతదేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జాతీయ భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఉగ్రవాదాన్నీ, వామపక్ష తీవ్రవాదాన్నీ ప్రోత్సహిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాలు దేశ యువతరాన్ని నాశనం చేయడమే కాకుండా దేశ భద్రతను కూడా బలహీనపరుస్తాయని ఆయన అన్నారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై అందరూ కలిసి ముందుకు సాగాలని, మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చాలని కేంద్ర హోం, సహకార మంత్రి పిలుపునిచ్చారు.
శ్రీ అమిత్ షా నేడు రాయ్పూర్లో ఎన్సిబి జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాలను నియంత్రించడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎన్సిబి ఉనికి ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి రాష్ట్రంలో ఎన్సీబీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అంతం చేస్తుందని ఆయన అన్నారు.
ప్రస్తుత కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ధోరణి మారుతోందని... ఇది సహజమైన మాదకద్రవ్యాల నుండి సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతోందని కేంద్ర హోం మంత్రి అన్నారు. చత్తీస్గఢ్లో మత్తు మందుల వాడకం 1.45 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని, గంజాయి వాడకం కూడా 4.98 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని ఆయన అన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలని శ్రీ అమిత్ షా నొక్కి చెప్పారు. 'టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్' విధానంతో పనిచేసి మొత్తం నెట్ వర్క్ ను కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం వ్యవస్థపై దాడి చేస్తే తప్ప మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని శ్రీ అమిత్ షా అన్నారు.
మాదకద్రవ్యాలు వాడేవాడు బాధితుడని, అందులో వ్యాపారం చేసేవాడు నేరస్తుడని కేంద్ర హోం మంత్రి అన్నారు. మాదకద్రవ్యాలను గుర్తించడం, వ్యవస్థను నాశనం చేయడం, నేరస్థుడిని అరెస్టు చేయడం, వ్యసనపరులకు పునరావాసం కల్పించడం అనే నాలుగు సూత్రాలను పాటించడం ద్వారా మాత్రమే ఈ పోరాటంలో విజయం సాధించగలమని ఆయన అన్నారు. మాదకద్రవ్యాలపై పోరాటంలో ప్రభుత్వ విధానాన్ని అవలంబించడం ద్వారానే సంపూర్ణ విజయం సాధిస్తామని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో ఎన్సిబి సమర్థవంతంగా సేవలందించినట్లు శ్రీ అమిత్ షా ప్రసంసించారు. 2004 నుంచి 2014 వరకు మొత్తం 1250 కేసులు నమోదు కాగా, 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో 230 శాతం పెరుగుదలతో 4150 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు మొత్తం 1,360 మందిని అదుపులోకి తీసుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 6,300కు పెరిగింది. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు లక్షా 52 వేల కిలోల మాదకద్రవ్యాలు, 2014 నుంచి 2024 వరకు 5 లక్షల 43 వేల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2004 నుంచి 2014 వరకు పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.5,900 కోట్లు కాగా, 2014 నుంచి 2024 వరకు పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.22,000 కోట్లు. ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యవస్థీకృత విధానంతో పదేళ్లలో మాదకద్రవ్యాలపై పోరాటాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగామని అమిత్ షా అన్నారు. మాదకద్రవ్యాల రహిత భారత్ అనే ప్రధాని మోదీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువతలో, దేశ ప్రజల్లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం ద్వారా ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్సీఓఆర్డీ విధానం కింద మొత్తం 4 స్థాయుల్లో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని కేంద్ర హోంమంత్రి నొక్కి చెప్పారు. ఇటీవల ప్రారంభించిన మానస్ పోర్టల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్ ఫైనాన్సింగ్ పై దర్యాప్తు చేయడానికి అన్ని ప్రభుత్వ సంస్థల సహాయం తీసుకోవచ్చని అమిత్ షా అన్ని రాష్ట్రాలకు తెలిపారు. జాయింట్ కోఆర్డినేషన్ కమిటీని క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. మాదకద్రవ్యాల వ్యవస్థను మొత్తాన్ని అంతం చేయడానికి అంతర్రాష్ట్ర కేసులను ఎన్సిబి కి అప్పగించాలని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2048838)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145