శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ (సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ)
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సిఎస్ఐఆర్ టెక్నాలజీలు బదిలీ చేయడంపై శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ఐఆర్), లఘు ఉద్యోగ్ భారతి మధ్య అవగాహనా పత్రంపై (ఎంఓయు) సంతకాలు
నాడు పోస్టు చేయడమైనది:
21 AUG 2024 6:18PM by PIB Hyderabad
దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎంపిక చేసిన సిఎస్ఐఆర్ టెక్నాలజీలు బదిలీ చేయడంపై శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ఐఆర్), లఘు ఉద్యోగ్ భారతి (ఎల్ యుబి) మధ్య అవగాహనా పత్రంపై (ఎంఓయు) 2024 ఆగస్టు 21వ తేదీన సంతకాలు జరిగాయి. సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, ఎల్ యుబి అఖిల భారత కార్యదర్శి, ఎల్ యుబి అధ్యక్షుల సమక్షంలో ఎంఓయుపై సంతకాలు జరిగాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాతినిథ్యం వహించే అఖిల భారత స్థాయి సంస్థ లఘు ఉద్యోగ్ భారతి. కంపెనీల చట్టం సెక్షన్ 8 కింద ఏర్పాటై 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్ యుబి 27 రాష్ర్టాల్లో 575 జిల్లాలకు విస్తరించింది. 51000 పైగా సభ్యత్వం కలిగి ఉంది.
ఎల్ యుబి పరిధిలోని గుర్తింపు పొందిన ఎంఎస్ఎంఇలకు 100 రోజుల్లోగా సిఎస్ఐఆర్ కు చెందిన 100 సాంకేతిక ఆవిష్కరణలు/ టెక్నాలజీలు/ఉత్పత్తులు బదిలీ చేయడం ఈ ఎంఓయు లక్ష్యం. అలాగే ఎంఎస్ఎంఇలకు ప్రత్యేక ఆసక్తి కలిగిన సిఎస్ఐఆర్ పరిధిలోని విభాగాల్లో కొత్త టెక్నాలజీల అభివృద్ధిపై సలహాలు, సూచనలు అందించడంతో పాటు సమస్యలేవైనా ఉంటే వాటికి పరిష్కారాలు సూచించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ప్రధానంగా టెక్నాలజీల అభివృద్ధి, నియంత్రణాపరమైన నిబంధనలకు కట్టుబడడం, మార్కెట్ పరిధి విస్తరించుకోవడం, ఎగుమతి ప్రోత్సాహకాలు/దిగుమతి ప్రత్యామ్నాయాలపై సహాయం అందచేస్తారు.
డిఎస్ఐఆర్ కార్యదర్శి, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.కలైసెల్వి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఐఎండి అధిపతి డాక్టర్ ఆర్.పి.సింగ్, టిఎండి అధిపతి డాక్టర్ విభా మల్హోత్రా సాహ్ని, సిఎస్ఐఆర్ కు చెందిన ఇతర ప్రముఖులు డాక్టర్ దేబశిష్ బందోపాధ్యాయ, డాక్టర్ మహేశ్ కుమార్, శ్రీమతి దీప్తి శర్మ దుల్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ యుబి నుంచి శ్రీ ఘనశ్యామ్ ఓఝా, శ్రీ ఓం ప్రకాశ్ గుప్తా, శ్రీ దివాన్ చంద్, శ్రీమతి ఆర్తి సెహగల్, ఇతర సభ్యులు హాజరయ్యారు.
ఎంఓయు సంతకం కార్యక్రమం సందర్భంగా 6 సిఎస్ఐఆర్ లాబ్ లు... సిఎస్ఐఆర్-సిఎస్ఐఓ, సిఎస్ఐఆర్-ఐఎంఎంటి, సిఎస్ఐఆర్-ఎన్ఏఎల్, సిఎస్ఐఆర్-ఎన్ బిఆర్ఐ, సిఎస్ఐఆర్-సిఎస్ఎంసిఆర్ఐ, సిఎస్ఐఆర్-సిఎఫ్ టిఆర్ఐ నుంచి వివిధ కంపెనీలకు 15 టెక్నాలజీలను బదిలీ చేశారు.
బదిలీ చేసిన టెక్నాలజీల్లో విభిన్న రంగాలకు చెందిన పెస్టిసైడ్ డిటెక్షన్ కిట్ (క్రిమినాశనుల గుర్తింపు కిట్); మల్టీ-కాప్టర్ డ్రోన్లు, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ (వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ), బయోమాస్ నుంచి వెలికి తీసిన పొటాష్ అధికంగా గల బయోచార్, గ్లుటెన్ రహిత బిస్కట్లు ఉన్నాయి.
సిఎస్ఐఆర్ కు సంబంధించినంత వరకు ఈ టెక్నాలజీల బదిలీ వల్ల మార్కెట్ పరిధి పెరుగుతుంది. అన్ని రకాల నియంత్రణా నిబంధనలకు లోబడి ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. ఎల్ యుబి పరిధిలోని యూనిట్లు/ఎంఎస్ఎంఇలకు తక్కువ వ్యయాలతో కూడిన సిఎస్ఐఆర్ టెక్నాలజీలు అందుబాటులోకి రావడం వల్ల కార్యకలాపాల్లో సమర్థత పెరుగుతుంది. సమాజానికి సిఎస్ఐఆర్ అందిస్తున్న సేవలపై చైతన్యం కూడా ఏర్పడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2047520)
సందర్శకుల సూచీ సంఖ్య : : 173